అవినాశ్కు టికెట్ ఇవ్వొద్దన్న వివేకా!.. అందుకే హత్య?.. సీబీఐ చార్జిషీట్
Publish Date:Feb 15, 2022
Advertisement
కడప మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హస్తం ఉండి ఉండొచ్చనే విషయం సీబీఐ చార్జిషీట్లలో పేర్కొనడం సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడే అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారని, రక్తపు మరకలు శుభ్రం చేయించారని సీబీఐ పేర్కొంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి మరణించారనే కథను ముందుగా శంకర్ రెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి అల్లారని, సాక్షి చానల్ కు వారి నుంచే తొలి సమాచారం వెళ్లిందని సీబీఐ వెల్లడించింది. ఈ కథనే చెప్పాలని సీఐని శంకర్ రెడ్డి బెదిరించినట్లు సీబీఐ పేర్కొది. తనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని వివేకా అనడం వల్లే ఆయనను అవినాశ్ రెడ్డి హత్యచేయించి ఉంటారనే అనుమానం వ్యక్తం చేసింది. వివేకాను హత్య చేసినట్లు ఒప్పుకోవాలని గంగాధర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు కూడా సీబీఐ చార్జిషీట్లలో పేర్కొంది. 2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. వివేకా హత్యపై 2020 అక్టోబర్ 10న మొదటి చార్జిషీటు, ఈ ఏడాది జనవరి 31న మరో నివేదికను కోర్టుకు సీబీఐ సమర్పించింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు జరిగిన తప్పుడు ప్రచారం వెనుక అవినాశ్రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ‘బాత్ రూమ్ లో వివేకానందరెడ్డి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. శంకర్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. గుండెపోటుతో వివేకా మరణించినట్లు అప్పటికప్పుడే కథ అల్లారు. ఈ లోగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. గుండెపోటుతో వివేకా మరణించినట్లు ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు. గంగిరెడ్డి, శంకర్ రెడ్డి మరికొందరితో కలిసి పనివారితో బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో రక్తపు మరకలు శుభ్రం చేయించారు. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా కట్లు కట్టించి, పులివెందుల ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు’ అని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది. ‘కడప ఎంపీ టికెట్ తనకైనా, వైఎస్ షర్మిలకైనా, లేదంటే వైఎస్ విజయమ్మకైనా దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుపట్టారు. వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని వివేకా గట్టిగా చెప్పేవారు. ఈ నేపథ్యంలో తన ముఖ్య అనుచరుడు డి.శంకర్ రెడ్డితో అవినాశ్ రెడ్డే ఈ హత్య చేయించినట్లు అనుమానం ఉంది.. ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరుగుతోంది’ అని సీబీఐ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే వివేకా మర్డర్ జరిగిందని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేకాకు అత్యంత సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ షేక్ దస్తగిరి ఈ హత్య కుట్ర పన్నినట్లు పేర్కొంది. ఇందు కోసం 40 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు బెంగళూరులోని భూవివాదంసెటిల్మెంట్ సహా 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కారణమని పేర్కొంది. అవినాశ్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడ్డు తగులుతున్న వివేకాను తొలగించాలనే వ్యూహంలో భాగంగా హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టంగా తెలిపింది. వివేకాను హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని గంగాధర్ రెడ్డికి శంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. వివేకా శరీరంపై 7 గాయాలు ఉన్నాయని,మెదడుకు బలమైన గాయం తగలడం వల్లే ఆయన మరణించారని సీబీఐ తెలిపింది. వివేకా మద్దతుదారులను కంట్రోల్ చేయాని సీఐ శంకరయ్యను శివశంకర్ రెడ్డి బెదిరించినట్లు పేర్కొంది. రక్తపు మరకలను వివేకా ఇంటి పనిమనిషి రాగిరి లక్ష్మి చేత తొలగించడంలో శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి కలిసి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపింది. తర్వాత కాంపౌండర్ గజ్జల జయప్రకాశ్ రెడ్డి సహాయంతో శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి గదికి గడియపెట్టి కట్టు కట్టారని, బాత్రూం, బెడ్రూంలో రక్తపు మరకలు శుభ్రం చేసి, సాక్ష్యాధారాలు నాశనం చేయడంలో పాల్గొన్నారని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు సంబంధించిన ఆనవాళ్లను శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి తొలగించాలని చూశారు తప్ప ఆయన కుమార్తె సునీతకు సమాచారం ఇవ్వలేని సీబీఐ తెలిపింది. కుమార్తె లేకుండానే వివేకా అంతిమ సంస్కారాలు చేయాలని కూడా వారు యత్నించినట్లు పేర్కొంది. వివేకా హత్యకు నెల రోజుల ముందే పథకం రచించినట్లు సీబీఐ విచారణలో ఏ4 దస్తగిరి వెల్లడించాడు. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు తనకు గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి తెలిపాడు.
http://www.teluguone.com/news/content/mp-avinash-reddy-behind-vivekananda-reddy-murder-25-131793.html





