మెడికల్ పీజీ సీట్ల స్కాం.. గవర్నర్ సీరియస్- ప్రభుత్వం పరేషాన్
Publish Date:Apr 25, 2022
Advertisement
తెలంగాణ ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు రోజురోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారవుతున్నాయి. ఎప్పుడైతే తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్ కు తిలోదకాలిచ్చి తనను అవమానించిందంటూ గవర్నర్ తమిళిసై కుండ బద్దలు కొట్టారో అప్పటి నుంచి విభేదాలు బహిర్గతమయ్యాయి. తలుపు చెక్కతో మీరొకటంటే...తమలపాకుతో నేనొకటంటా అన్నట్లుగా గవర్నర్, తెరాస నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ గా తమిళిసైను మారుస్తున్నరంటూ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తల స్పీడు అయితే చల్లారింది కానీ...సర్కార్- గవర్నర్ ల మధ్య విభేదాలు మాత్రం రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళోజీ హెల్త్ వర్సిటీలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం వెలుగులోనికి వచ్చంది. ఈ కుంభకోణం గవర్నర్ తమిళిసై చేతికి ఆయాచితంగా దొరికిన ఆయుధంగా మారింది. పైగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ గవర్నర్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న అవకాశం దొరికుతుందా అన్నట్లుగా కాచుకుని ఉన్న తమిళసైకి పీజీ సీట్ల కుంభకోణం అందివచ్చింది. రేవంత్ లేఖకు ముందే గవర్నర్ ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలను తనకు అందజేయాలంటూ కాళోజీ వర్సిటీ యాజమాన్యానికి తాఖీదు పంపారు. ఇంతకీ కాళోజీ వర్సిటీలో కుంభకోణం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎందుకు పని కొస్తుందనుకుంటున్నారా? ఈ వర్సిటీపరిధిలోని పలు మెడికల్ కాలేజీలు తెరాస కు చెందిన వారివే. వీరిలో మంత్రి పువ్వాడ, మంత్రి మల్లారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు వంటి వారు ఉన్నారు. అసలు పీజీ సీట్లకుంభకోణం ఏమిటంటే మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన సీట్లను బ్లాక్ చేసి అస్మదీయులకు కట్టబెట్టడం ద్వారా కోట్లు దండుకోవడమే ఈ కుంభకోణం. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ కు రాష్ట్రంలోని యూనివర్సిటీలపై విస్పష్ట అధికారాలు ఉంటాయి. అందుకే గవర్నర్ ఈ కుంభకోణాన్ని ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకున పెట్టడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.
అయితే తమిళనాడులో వర్సిటీలపై గవర్నర్ అధికారాలలో కోత విధించేందుకు అక్కడి ప్రభుత్వం సమాయత్తమౌతున్నది, ఈ మేరకు వర్సిటీలో చట్టంలో మార్పులు తీసుకువస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టింది. ఆయన అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టే సమయానికి చెన్నైలో కేంద్ర, రాష్ట్ర, ప్రవేటు వర్సిటీల వీసీల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు. తెలంగాణలో లాగే తమిళనాడులో కూడా గవర్నర్, ప్రభుత్వం మధ్య దూరం ఉంది. దీంతో తమిళనాడు గవర్నర్ వర్సిటీలపై గవర్నర్ ల అధికారంలో కోత విధించేందుకు వీసీల నియామకం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు వీలుగా వర్సిటీల చట్టంలో మార్పులు ప్రతిపాదిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ వర్సిటీల చాన్సలర్ పదవుల నుంచి గవర్నర్లను తొలగించాలన్న మదన మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ సిఫారసును ప్రస్తావించారు. ఇప్పుడు తమిళనాడులో పీజీ స్కాం విషయంలో గవర్నర్ దూకుడును అడ్డుకునేందుకు తెరాస సర్కార్ కూడా ఆ కమిషన్ నివేదికను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా మెడికల్ పీజీ సీట్ల స్కాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/medical-seat-scam-governer-serious-government-pareshan-39-134940.html





