కమ్యూనిస్ట్ కాషాయంలో ఇమడగలరా! ఈటలది చరిత్రాత్మక తప్పిదమా?
Publish Date:Jun 5, 2021
Advertisement
కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. రాజకీయ గమనంపై క్లారిటీ వచ్చేసింది. కారు దిగిన కమలాపుర్ నేత కమలం గూటికి చేరుతున్నారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాజేందర్.. రేపోమాపో అధికారికంగా బీజేపీ జెండా ఎత్తనున్నారు. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల తొలగించగానే.. ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారమే ఎక్కువగా జరిగింది. ఎక్కువగా ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. బడుగు,బలహీన వర్గాల వాయిస్ గా కొత్త పార్టీ పెడతారనే అంతా భావించారు. కొత్త పార్టీ లేదంటే కాంగ్రెస్ లో ఈటల చేరతారనే రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కాని అనూహ్యంగా ఈటల కమలం పార్టీకి జై కొట్టారు. ఆయన నిర్ణయం కొన్ని వర్గాలను ఆశ్చర్యపరిచింది కూడా. కమ్యూనిస్ట్ భావజాలంతో రాజకీయంగా ఎదిగిన రాజేందర్.. కాషాయ పార్టీలో ఇమడగలరా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈటల విషయంలో ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకం నుంచి కూడా వస్తోంది. ఈటల రాజేందర్ కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని తెలుస్తోంది. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఈటల.. తాను లెఫ్టిస్ట్ అయిన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వస్తుందని చెప్పారట. అంటే ఆయన కూడా అయిష్టంగానే నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల రాజకీయ రాజకీయ జీవితం అతివాద వామపక్ష భావజాలంలో మొదలైంది. కొంత కాలం నక్సల్ ఉద్యమంలోనూ ఈటల పని చేశారని అంటారు. ప్రాంతీయ ఉద్యమాలలో కీలక పాత్రను పోషించారు. సుమారు 18 సంవత్సరాల పాటు కేసీఆర్ శిష్యరికం చేశారు. అలాంటి ఈటల బీజేపీ జాతీయ భావజాలం, హిందుత్వ నినాదం, విధానం చట్రంలో ఇమడగలరా? అనేది ఒక కీలక ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.. ఆయనలోని కమ్యూనిస్ట్ భావజాలాన్ని బయటికి తెచ్చాయి. విరసం నేత వరవరరావు అరెస్టును ప్రస్తావించారు రాజేందర్. వరవరరావు విషయంలో ప్రజా సంఘాలు కోరినా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. ఇక్కడే రాజేందర్ లోపలి మనిషి బయటికి వచ్చారంటున్నారు. వరవరరావును కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఆయనపై నమోదైన కేసులు కేంద్ర సర్కార్ పరిధిలోనివే. అలాంటప్పుడు వరవరరావు విషయంలో కేసీఆర్ ను తప్పుపడుతున్న రాజేందర్.. ఆయనపై కేసు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీలో ఎలా చేరుతున్నారన్నదే ప్రజా సంఘాల ప్రశ్న. కమ్యూనిస్టుల నిలదీత. దీనిపై క్లారిటీ ఇచ్చే ధైర్యం ఉందా అంటే రాజేందర్ కు లేదని చెప్పాల్సిందే.. ఇక రైతుల గురించి, ఐకేపీ సంఘాల గురించి మాట్లాడారు రాజేందర్. నిజానికి కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు అని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తొమ్మిది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర చట్టాల ప్రకారం వ్యవసాయ మార్కెట్లు ఎత్తివేయాల్సిందే. కాని తెలంగాణ సర్కార్ మాత్రం వాటిని కొనసాగిస్తోంది. అంతేకాదు దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంట కొనుగోలు చేయడం లేదని, ఒక్క తెలంగాణలోనే కొంటున్నామని టీఆర్ఎస్ చెబుతోంది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఈటల కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐకేపీ సెంటర్ల అంశంలో కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయడం... ఆయనకే రివర్స్ అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ పార్టీలో చేరుతూ.. కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు, పంట కొనుగోళ్లపై మాట్లాడటం వల్ల ఆయనకే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మరోవైపు ఎంత చెడ్డా గులాబీ పార్టీలో ఈటలకు ఒక స్థానం గుర్తింపు ఉన్నాయి. బీజేపీలో ఆయనకు అంత గుర్తింపు ఉండక పోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గర్భగుడి ప్రవేశం, అంత ఈజీ కాదు. ఇతర పార్టీలలో కీలక పదవులు, బాధ్యతలు పోషించిన వారు.. బీజేపీలో ఎక్కువ కాలం ఉన్న సందర్భాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోనూ అదే జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు.. అక్కడ ఇమడలేక సొంత గూటికి తిరిగివెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు నుంచి నాగం జనార్ధన రెడ్డి వరకు అనేక మంది సీనియర్ నాయకులు బీజేపీ చేరినంత వేగంగా తిరిగి వెళ్ళి పోయారు. దీంతో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ పార్టీలో ఇమడగలరా.. బీజేపీలో ఎంతవరకు ఆయన నెట్టుకురాగలరు.. తన లక్ష్యాన్ని ఆయన సాధించుకుంటారా.. అంటే కొంత కాలం వేచి చూడక తప్పదు..
http://www.teluguone.com/news/content/leftist-etela-rajender-will-success-in-rightist-party-bjp-25-116956.html





