కూలిస్తేనే... నగరం నిలబడేది!
Publish Date:Sep 28, 2016
Advertisement
వాన వెలిసింది. వరదలు వెనక్కి తగ్గాయి. అయితే, ఇప్పుడు హైద్రాబాద్ లో దుమ్మూ, ధూళీ పైకి లేస్తున్నాయి! అయితే, ఇదేదో ఆందోళన పడవల్సిన ప్రకృతి విపత్తు కాదు. అక్రమ కట్టడాలు కట్టుకున్న వారికి ఏర్పడ్డ పాలక విపత్తు! సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే భాగ్యనగరంలో కూల్చివేతలు మొదలయ్యాయి..
గత కొన్ని రోజుల పాటూ కురిసిన భీభత్సమైన వర్షాల కారణంగా ఏమైందో అందరికీ తెలిసిందే. హైద్రాబాద్ అతలాకుతలం అయిపోయింది. విశ్వనగరం అనిపించుకునే మన హైటెక్ సిటీ విశ్వ ప్రయత్నం చేసినా వాన దెబ్బ తట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా నాలాలు, చెరువుల్ని ఆక్రమించి కట్టిన కాలనీలు, ఇళ్లలోకి నీరు ఉప్పొంగి వచ్చేసింది. దీనిపై మీడియా రాత్రింబవళ్లు కవరేజ్ చేస్తూ హడావిడి చేసింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడలేని ఒత్తిడి వచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు సిటీలో జరుగుతోన్న కూల్చివేతలు...
అసలు అక్రమ నిర్మాణాలు కూల్చటం అనేది మున్సిపాలిటి వారి బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వహించకే పరిస్థితి ఇంత విషమించింది. ప్రపంచంలోని ఏ టాప్ సిటీని తీసుకన్నా టౌన్ ప్లానింగ్ పక్కగా వుంటుంది. ఏ నిర్మాణం జరగాలన్నా, కూల్చాలన్నా సంబంధిత అధికారుల పర్మిషన్ తప్సనిసరి. కాని, మన దేశంలో రాత్రికి రాత్రి కట్టడాలు ఒళ్లు విరుచుకుని లేచి నిలబడతాయి. తరువాత వాట్ని కూల్చే ప్రయత్నం మున్నిపల్ అధికారులు చేసినా జనం మొదలు ఎమ్మేల్యేలు, ఎంపీల దాకా అందరూ కలిసి తిరగబడతారు. వారు చేసేది లేక ఊరకుండిపోతారు. మరీ తెలివైన గవర్నమెంట్ బాబులైతే దొరికినంత నొక్కేసి కట్టడాల్ని చూసి చూడకుండా వదిలేస్తారు!
హైద్రాబాద్ లో అక్రమ కట్టడాల వల్ల వాటిల్లో వుంటోన్న సామాన్య జనం, వాళ్ల ఓట్లను ఆశించే ప్రజా ప్రతినిధులు, లంచాలు తీసుకుంటోన్న కొందరు మున్సిపల్ అధికారలు... ఇలా అందరూ లాభపడుతున్నారు. అందుకే, దశాబ్దాలుగా నాలాలు, చెరువులు, మూసి లాంటి నది కూడా కనిపించకుండా పోతూ వచ్చింది! కాని, వర్షం పడ్డప్పుడు, వరద పొటెత్తినప్పుడు మాత్రం నగరం నరకం అయిపోతోంది. 3వేల చెరువులు ఒకప్పుడు వుండేవని చెప్పే హైద్రాబాద్ లో ఇప్పుడు కేవలం 4వందలున్నాయంటే దుస్థితి అర్థం చేసుకోవచ్చు...
మొన్న వచ్చిన వరదలకి స్పందనగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలు తొలిగించే ప్రయత్నం చేశారు. కాని, విచిత్రంగా బాధితుల తరుఫున మున్సిపల్ అధికారులకి వ్యతిరేకంగా నిలిచింది ఆ పార్టీ కార్పోరేటరే! మూసాపేట నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ కార్పోరేటర్ అక్రమ కట్టడాల తొలగింపును అడ్డుకున్నారు. అయితే, ఇలాగయితే ఎలా అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారట. జనం మనల్ని నమ్మి గ్రేటర్ హైద్రాబాద్ మేయర్ పీఠం కట్టబెడితే సిటీని వరదల్లో వదిలేస్తామా అన్నారట!పైగా జనం నీళ్లలో మునిగి ఇబ్బందులు పడుతుంటే నేతలు ఇళ్లలో హాయిగా కూర్చున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట!
కేటీఆర్ తమ స్వంత పార్టీ నేతల్ని కూడా పట్టించుకునే ప్రసక్తే లేదని చెప్పటం నిజంగా సంతోషకరమైన విషయమే. ఎవ్వరి కోసం అక్రమ కట్టడాలు కూలకపోయినా అది నగర భద్రతకే ప్రమాదం. కాబట్టి అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే! కాకపోతే, గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటి నిర్మాణాల విషయంలో ఇలాగే హడావుడి జరిగింది. తరువాత అంతా సద్దుమణిగిపోయింది. మరి అదే తంతు హైద్రాబాద్ వ్యాప్తంగా వున్న వేలాది నిర్మాణాల విషయంలో జరిగితే, లాభం శూన్యమే! మరో సారి వర్షం వస్తే కథ మళ్లీ మొదటికొస్తుంది!
http://www.teluguone.com/news/content/ktr-45-67062.html





