‘జొన్నగిరి’ మన బంగారు గని...కేజీఎఫ్ స్థానాన్ని భర్తీ చేయనున్న జేజీఎఫ్
Publish Date:May 15, 2026
Advertisement
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్).. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేసి బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. దేశంలో గోల్డ్ మైన్స్ అంటే గుర్తొచ్చే పేరు. ప్రైవేటు రంగంలో స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటుచేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. 2000 తర్వాత కేజీఎ్ఫలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లైమ్లైట్లోకి వచ్చింది. దేశంలోనే రెండో అతి పెద్ద గోల్డ్ మైన్స్గా ‘జొన్నగిరి’ నిలవనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నొలకొల్పిన తొలి ప్రైవేట్ మైన్స్ ఇదే. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడి...వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి సామర్థ్యంతో జొన్న గిరి బంగారు శుద్ధి పరిశ్రమ సిద్ధమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం జొన్నగిరిలో ఉంది ఈ ప్రైవేట్ బంగారు గని. వాస్తవానికి మే నెలలోనే దీనిని ప్రారంభిస్తారని భావించినా, కాస్త ఆలస్యమైంది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో సుమారుగా.. 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భారీగా పెట్టుబడి పెడుతోంది. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల ద్వారా గుర్తించారు. మన దేశం ప్రతి సంవత్సరం సుమారు 700 నుండి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ వంటి ప్రైవేట్ గనులు అందుబాటులోకి వచ్చి.. బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే , దిగుమతుల భారం తగ్గుతుంది. అలాగే గోల్డ్ మైనింగ్ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే వీలుంది. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఎడ్వాన్స్డ్ మీడియయం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మట్లాడుతూ.. చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రస్తావన తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నూలు జిల్లాలో బంగారాన్ని ఉత్పత్తి చేసే గని సిద్ధమైందన్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 50 నుంచి 60 శాతం వాటా మన రాష్ట్రానిదే కాబోతోందన్నారు. వచ్చే నెలలోనే దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బంగారం దిగుమతులు విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతాయన్న చంద్రబాబు.. మన దగ్గరే బంగారం ఉత్పత్తి చేస్తే సమస్యలు ఉండవన్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో జొన్నగిరి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.
http://www.teluguone.com/news/content/jonnagiri-gold-mine-36-219881.html





