ప్రధాని మోదీపై ఇరాన్ అధ్యక్షుడి ప్రశంసల వర్షం!
Publish Date:Jun 30, 2026
Advertisement
అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా దేదీప్యమానమైంది. శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిం చడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారంటూ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కి యన్ ప్రశంసల వర్షం కురిపించారు. మసూద్ పెజెష్కియన్ మంగళవారం (జూన్ 30) ప్రధాని మోడీతో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సంభాషణ సారాంశాన్ని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మసూద్, మోడీ టెలిఫోన్ టాక్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఇరు నేతలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురూ భావించారు. ఇటీవల భారతదేశం అత్యంత విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల ముసూద్ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల ద్వారా రాబోయే రోజుల్లో భారత్, ఇరాన్ దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై అనేక కీలక అంశాల్లో ఇరు దేశాల అభిప్రాయాలు ఏకీభవించడం ఈ వ్యూహాత్మక బంధానికి మరింత ఉతం ఇస్తోందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, తాజా పరిణామాలపై కూడా మోడీ, మసూద్ లు ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలకు ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చెప్పారు. కేవలం ఒక వైపు నుంచే కాకుండా, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, భద్రతల స్థాపన కోసం ఇతర పక్షాలు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం అనుసరిస్తున్న తటస్థ, శాంతియుత విదేశాంగ విధానమే నేడు ఇరాన్ వంటి దేశాల నుంచి ఈ స్థాయి ప్రశంసలు దక్కేలా చేసింది.
http://www.teluguone.com/news/content/iranian-president-showers-praise-on-pm-modi-36-224704.html





