దర్యాప్తు సంస్థలా.. కేంద్రం చేతిలో కీలుబొమ్మలా!
Publish Date:Jun 14, 2022
Advertisement
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వివాదాస్పదంగా మారింది. ఏలిన వారి జేబు సంస్థల్లా వాటి పని తీరు ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల పని తీరుపై ఆరోపణలు ఉన్నప్పటికీ మోడీ హయంలో మాత్రం వాటి ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా రాజకీయ ప్రత్యర్థులను ఈ విధంగా వేధించిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, వారిని రాజకీయంగా క్రియాశీలంగా ఉండకుండా చేయడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని రాజకీయ విమర్శలని కొట్టి పారేయడానికి వీలులేని విధంగా అవి వ్యవహరిస్తున్న తీరు ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ విమర్శలకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కొందరు ఇస్తున్న సమాధానాలు కూడా ఉద్దేశ పూర్వకంగానే మోడీ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. యూపీఏ హయాంలో కూడా ప్రత్యర్ధులను వేధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని బీజేపీ నాయకులు, కొందరు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు..అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నామన్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మోడీ సర్కార్ రాజకీయ లెక్కలు సరి చేయడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటున్నదని.. అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారని వారి మాటలే రుజువుచేస్తున్నాయి. అయితే బీజేపీకి ప్రజలు పట్టం కట్టింది రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే అవకాశం ఇవ్వడానికి కాదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవకతవకలు, తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ప్రజా రంజక పాలన అందిస్తామన్న విశ్వాసంతో. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం అధికార పార్టీ.. వారు అప్పుడు చేశారు కనుక ఇప్పుడు మేం చేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ల నియామకం దగ్గర నుంచి ప్రత్యర్ధులపై కేసుల బనాయింపు వరకూ అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విధానాలనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తోంది. యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థలు అప్పటి అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతలనూ విచారించాయి. ఆరోపణలపై ఆధారాలున్నాయని తమ విచారణలో బయట పడితే వారిని అరెస్టు చేయడానికీ వెనుకాడ లేదు. యూపీఏ హయాంలో షాని గుజరాత్లో బూటకపు ఎన్ కౌంటర్ల కేసుల విచారణ సమయంలో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షాను అరెస్టు చేసిన సంగతి విదితమే. అదే యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్, బొగ్గుగనుల కుంభ కోణాలపైనా సీబీఐ దర్యాప్తు చేసింది. ఆ సందర్భంగా యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలనూ విచారించింది. మధుకోడా వంటి వారిని అరెస్టు చేసింది. యూపీఏలో కీలక భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకె సీనియర్ నాయకుడు ఎ రాజా, పార్టీ ఎంపీ కనిమొళి సైతం అరెస్టయ్యారు. అయితే మోడీ హయాంలో దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవి కేవలం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై మాత్రమే దాడులు చేస్తున్నాయి, వేధిస్తున్నాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ , ఆమె కుమారుడు రాహుల్ గాంధీకీ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు పంపడం, రాహుల్ గాంధీని గత రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారించడం రాజకీయ కక్షగానే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరిశీలకులు సైతం అదే అంటున్నారు. ఇక రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న తీరు.. గతానికి భిన్నంగా విచారణ సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చి ఆయన బయటకు వెళ్లి వచ్చేందుకు అవకాశం ఇవ్వడం, భారీ బందోబస్తు మధ్య ఈడీ వాహనంలోనే విచారణకు తీసుకు వెళ్లడం గమనిస్తుంటే ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానంతోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా హస్తిన సహా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగానే ఆ సంస్థల తీరు ఉంటున్నదన్నది మాత్రం వాస్తవం.
http://www.teluguone.com/news/content/investigative-agencies--acting-as-per-center-directions-25-137680.html





