రేవంత్ చొరవ.. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఐక్యతారాగం.. షర్మిలకూ ఆహ్వానం
Publish Date:Jun 14, 2022
Advertisement
రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు.. అనూహ్యం అన్ప మాటకే తావుండదు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు అవుతారు.. నేటి శత్రువులు రేపు ఆప్త మిత్రులు అవుతారు. నిన్నటి దాకా తిట్టి పోసుకున్న పార్టీలు నేడు పరస్పరం ప్రశంసలు, పొగడ్తలతో ఆలింగనం చేసుకుంటాయి. తెలంగాణలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తున్నది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై గతంలో విమర్శలతో విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు షర్మిల పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకూ తెలంగాణలో షర్మిల పార్టీని కానీ, ఆమె పాదయాత్రను కానీ పట్టించుకున్న పార్టీ కానీ నేత కానీ లేరు. ఆమె మానాన ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ నిరశనలు, పాదయాత్రతో రాష్ట్రంలో ఒంటరి పయనం చేస్తున్నారు. షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిలను కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖిల పక్ష భేటీకి ఆహ్వానించారు. రాజకీయ వర్గాలలో ఈ పరిణామం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన సమయంలో రేవంత్ ఆ పార్టీని కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీగా అభివర్ణించారు. ఆ తరువాత కూడా షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా పేర్కొంటూ సెటైర్లు వేశారు. ఆమె పాదయాత్రలను, టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలను పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ టీపీని రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక కోసం టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ చేత, టీఆర్ఎస్ వలన ఆవిర్భవించిన పార్టీగానే పరిగణించారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా షర్మిల పార్టీని గుర్తించడమే కాదు, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో బుధవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘బచావో హైదరాబాద్’ పేర బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం, టీజేఎస్, వామపక్ష పార్టీలు, బీఎస్పీ, జనసేన, ఆప్, లోక్ సత్తా ప్రతినిథులు, మహిళా సంఘాల ప్రతినిథులు, మేధావులు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ షర్మిలను ఆహ్వానించారు. మంగళవారం నిరుద్యోగ దీక్షలో ఉండగా రేవంత్ ఆహ్వానం ఆమెకు చేరింది. దీంతో రెండో ఆలోచన లేకుండా ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించారు. ఖమ్మం జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చి మరీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలలో తొలి సారిగా షర్మిలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన తొలి పిలుపు ఇది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ సర్కార్ పై ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు ఈ సమావేశాం ఆరంభం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నగరంలో పెచ్చరిల్లుతున్న డ్రగ్స్, జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ గ్యాంగ్ రేప్, క్షీణిస్తున్న శాంతి భద్రతలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-invites-sharmila-to-all-party-meet-she-accepts-25-137684.html





