కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు
Publish Date:May 14, 2026
Advertisement
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బి ఎల్ ఎన్ రెడ్డి లకు కూడా ఏసీబీ కోర్టు జూలై 31న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారం పై హైకోర్టు కూడా విచారణను స్వీకరించింది. 2023లో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఈ ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ చార్జ్షీట్లో పేర్కొంది. ఈ నిధుల బదిలీపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు , ఏ5గా ఎఫ్ఈఓ సంస్థను కూడా అభియోగుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించింది.
http://www.teluguone.com/news/content/formula-ecar-race-36-219823.html





