ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ట్విస్ట్
Publish Date:Feb 14, 2026
Advertisement
హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్పై ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక, పరిపాలనా లోపాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా పలువురు అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అరవింద్కు మార్పై ప్రాసిక్యూషన్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం కేసుకు కీలకంగా మారింది. మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుడు, ఉన్నతాధికారి ఇద్దరిపై కూడా ప్రాసిక్యూషన్కు అనుమతి లభించడం కేసు తీవ్రతను మరింత పెంచింది. ప్రాసిక్యూషన్ అనుమతులు లభించడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కోర్టులో పూర్తి స్థాయి అభియోగ పత్రం సమర్పించే అవకాశముంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయంగా కూడా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతుండగా, దర్యాప్తు పురోగతి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/formula-e-car-race-case-36-214108.html





