గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత : సీఎం చంద్రబాబు
Publish Date:Jul 13, 2026
Advertisement
గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని అధికారులు వివరించారు. అలాగే కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని ముఖ్యమంత్రి అడిగారు. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికే అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు. అయితే 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో వాటి ఆధునీకరణ అత్యవసరమైందని ముఖ్యమంత్రి చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.32 కోట్లతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను తొమ్మిది నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని... కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధులను కూడా గత పాలకులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత రెండేళ్లలోనే సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం నిర్వాసితులను ఆనందంగా ఉంచుతాం ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని సీఎం విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-225892.html





