సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ కు బీహార్ కోర్టు నో
Publish Date:Feb 24, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేసి ఏపీకి తరలించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుక్కెదురైంది. బీహార్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ నాయక్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ఫైర్ సర్వీస్ ఐజీగా ఉన్నారు. జగన్ హయాంలో డిప్యూటేషన్ పై ఏపీ సీఐడీలో పని చేసిన సునీల్ నాయక్ పై అప్పట్లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇక్కడ నుంచి రిలీవ్ అయి బీహార్ కువెళ్లారు. ఆయనను ఇప్పుడు బీహార్ లో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరుతూ బీహార్ కోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ నాయక్ కు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు బీహార్ కోర్టు నిరాకరించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పాట్నాలోని శాస్త్రి నగర్లో ఉన్న సునీల్ నాయక్ నివాసానికి నిన్న చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాట్నా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో హాజరుపరిచి, ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోరారు. అయితే, ఏపీ పోలీసుల బృందం సరైన అరెస్ట్ వారెంట్ గానీ, అప్డేట్ చేసిన కేస్ డైరీ గానీ సమర్పించలేదని పేర్కొంటూ స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా విధానపరమైన లోపంగా పరిగణిస్తూ ట్రాన్సిట్ రిమాండ్ను తిరస్కరిస్తూ సునీల్ నాయక్ను విడుదల చేయాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/bihar-court-rejects-sunil-naiks-transit-remand-36-214575.html





