గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులకు అండగా ఏపీ సర్కార్!
Publish Date:Mar 2, 2026
Advertisement
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సోమవారం (మార్చి 2) సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలనీ, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, అందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎయిర్ పోర్టులు మూసివేయడం, విమాన సర్వీసుల రద్దుతో వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చే పరిస్థితులు లేనందున, పరిస్థితులు చక్కబడేవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఏపీ ఎన్ఆర్టీ అందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందనీ చెప్పారు. గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రజల కోసం 0863-2340678 హెల్ప్ లైన్ నెంబర్, 85000 27678 వాట్సప్ నెంబర్ను 24 గంటలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ఎన్ఆర్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే ఏపీ ఎన్నార్టీ వారికి తక్షణం సహాయ, సహకారాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు helpline@apnrts.com, support@apnrts.com, info@apnrts.com ఈ మెయిళ్లు, https://apnrts.ap.gov.in వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు. ఈ సమీక్షలో ఆర్టీజీఎస్ అధికారులు, ఎన్ఆర్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/ap-government-stands-by-andhras-stranded-in-gulf-countries-36-214893.html





