పీవోకే భారత్ లో కలిసిపోతుందా? ప్రజా ఉద్యమాలకు పాక్ తలొగ్గక తప్పదా?
Publish Date:Jan 15, 2023
Advertisement
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. తమ ప్రాంత వనరులను దోపిడీ చేస్తూ పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లను అభివృద్ధి చేస్తున్నారంటూ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు. లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఆ ప్రజాందోళనకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంటే గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందన్న అనుమానం పాకిస్థాన్ లో ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. గిల్గిట్ – బాల్టిస్తాన్లకు స్వాధీనం చేసుకుంటామని గత అక్టోబర్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి విదితమే.అందుకు అనుగుణంగా భారత సైన్యాధికారులు కూడా అటువంటి వ్యాఖ్యలే చేయడంతో పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దాదాపుగా ఏడుదశాబ్దాల తరువాత గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రజలు భారత్ లో కలుస్తామని నినదిస్తుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనల వెనుక భారత్ ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలో భారత్ లో చేరబోమంటూ ఉద్యమాలు చేసిన వారే ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉద్యమిస్తుండటం గమనార్హం. భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ మళ్లీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. సరిహద్దుల్లో ఉన్న అనేక దేశాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, కాబూల్ లలో భారత్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఆ దేశాలన్నిటిలోనూ ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచున ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలో అక్కడి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే అక్కడి జనం ఇండియాలో విలీనం కోరుకుంటున్నారు. పీవోకేలో అయితే ఏకంగా ఇండియాలో కలుస్తామంటూ ఉద్యామాలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/agitations-inpok-demanding-merger-in-india-39-150018.html





