సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు ముమ్మరం..!
Publish Date:Jul 5, 2026
Advertisement
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..! విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు 7గురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్ కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ బోటు ఇప్పటికీ తిరిగి రాలేదని వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలిచ్చారు.
http://www.teluguone.com/news/content/-fishermens-search-intensifies-36-225096.html





