Top Stories

political-news-img

ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐటీ కొలువు వస్తే జీవితం స్థిరపడినట్లేనని చాలా మంది భావిస్తారు. అయితే, అదే ఐటీ రంగానికి చెందిన ఒక మహిళ తన తొమ్మిదేళ్ల వైట్ కాలర్ ఉద్యోగానికి ఊహించని విధంగా గుడ్ బై చెప్పేసింది. సమాజం ఏమనుకుంటుందో అనే సంకోచాలు పెట్టుకోకుండా, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకుని ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఆసక్తికరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక ప్రముఖ కంపెనీకి చెందిన సీఈఓ నెజ్రీన్‌ మిధ్లాజ్‌ తన ప్రయాణంలో భాగంగా ఈ మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశారు. అమె కట్టుబొట్టు, మాట్లాడే విధానంలో కనిపించిన అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడిన సదరు సీఈఓ, ఆమె విజయగాథను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఐటీ కంపెనీల్లో పని గంటలు, డెడ్‌లైన్లు, నిరంతర ఆన్‌లైన్ మీటింగ్‌ల వల్ల ఉద్యోగులపై మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఈ మహిళ కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూ అదే రకమైన కార్పొరేట్ ప్రెజర్‌ను ఎదుర్కొంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతినడంతో, ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కరువైందని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు ఏకంగా రూ.60,000 వరకు సులభంగా సంపాదిస్తోంది. గతంలో కంటే ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, తన ఇష్టానుసారంగా పని వేళలను కేటాయించుకునే స్వేచ్ఛ దొరికిందని ఆమె సంతోషంగా చెప్తోంది. సమాజంలో లభించే హోదా కంటే మానసిక ప్రశాంతత, సంతోషకరమైన జీవితమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలోని యాంత్రిక జీవన విధానంపై విసిగిపోయిన ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ పోస్టుకు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రాసుకొస్తున్నారు. "తాము కూడా గత కొన్నేళ్లుగా రాత్రి వేళల్లో క్లయింట్ కాల్స్, ప్రొడక్షన్ సమస్యలతో సతమతమవుతున్నామని, అయితే ఈమె లాగా ధైర్యం చేసి బయటకు రాలేకపోతున్నామని" కొందరు నెటిజన్లు వాపోతున్నారు. మరికొందరు మాత్రం, ఎలాంటి సంకోచం లేకుండా సమాజం ఏమనుకుంటుందో అనే భయాలను వీడి, గౌరవప్రదమైన రీతిలో స్వయం ఉపాధిని ఎంచుకున్న ఈ మహిళ నిజమైన రోల్ మోడల్ అని కొనిడుతున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు కేవలం సాఫ్ట్‌వేర్ లేదా డెస్క్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తమకు నచ్చిన రంగాల్లో స్వతంత్రంగా రాణించేందుకు ఇలాంటి విజయగాథలు గొప్ప స్ఫూర్తినిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: May 30, 2026 1:36PM

political-news-img

భూమి అమ్మి భార్యను చదివిస్తే.. ఉద్యోగం రాగానే ప్రియుడితో జంప్.. భర్త కన్నీటి గాథ!

కట్టుకున్న భార్య ఉన్నత చదువులు చదవాలని, సమాజంలో ఒక మంచి హోదాలో నిలబడాలని ఆ భర్త కలలు కన్నాడు. ఆమె ఆశయానికి తన పేదరికం అడ్డుకాకూడదని భావించాడు. అందుకే, తనకున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేసి మరి ఆమెను చదివించాడు. కానీ, చివరకు ఆ భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించాక, కన్న కొడుకును, కట్టుకున్న భర్తను నడిరోడ్డున వదిలేసి మరొకరితో వెళ్ళిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కథలోని పూర్తి వివరాల్లోకి వెళితే, బిదుపూర్‌కు చెందిన అమన్ కుమార్‌కు, గుంజన్ కుమారికి 2013 లో వివాహం జరిగింది. పెళ్లయ్యే నాటికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేసింది. అయితే, తాను ఉన్నత చదువులు చదువుకుని ఎలాగైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఆమె కోరిక. అమన్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, భార్య కలను నిజం చేయడానికి వెనకాడలేదు. ఆమె డిగ్రీ, ఆపై బీఎడ్ చదవడానికి అయ్యే ఖర్చుల కోసం తనకున్న సొంత భూమిని అమ్మేశాడు. భర్త చూపిన చొరవతో గుంజన్ తీవ్రంగా శ్రమించి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC TRE-02) ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం వచ్చాక ఆమె సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్‌లో శిక్షణ పొందింది. ఆ తర్వాత వైశాలి జిల్లా, బిదుపూర్ బ్లాక్‌లోని యుఎంఎస్ మోహన్‌పూర్ ధరంపూర్ పాఠశాలకు బదిలీ అయింది. అయితే, ఈ శిక్షణ కాలంలోనే గుంజన్‌కు తన పాత కాలేజీ స్నేహితుడైన ప్రేమ్ ప్రకాష్ జైస్వాల్‌తో మళ్లీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త అమన్ కుమార్‌కు తెలియడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు గుంజన్ తన భర్తను, వారి 10 ఏళ్ల కొడుకును పూర్తిగా వదిలేసి, ప్రేమ్ ప్రకాష్‌తో కలిసి ఒక అద్దె ఇంట్లో రహస్యంగా జీవించడం ప్రారంభించింది. మే 25వ తేదీన గుంజన్ తన ప్రియుడితో కలిసి అద్దె ఇంట్లో ఏకాంతంగా ఉన్నట్లు భర్త అమన్ కుమార్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అమన్, నేరుగా ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ చనువుగా ఉన్న దృశ్యాన్ని చూసి అతడి గుండె బద్దలైంది. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన అమన్, వారికి తెలియకుండా బయట నుంచి తలుపులకు తాళం వేసి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి విచారణ జరుపుతుండగా, భార్య గుంజన్ తప్పు చేసి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా భర్త అమన్‌పై విరుచుకుపడింది. నడిరోడ్డుపై భర్తతో తీవ్రంగా గొడవ పెట్టుకుంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు ఆ భార్య ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. భర్త త్యాగాన్ని కాలరాసి, 10 ఏళ్ల కన్న కొడుకును వదిలేసిన ఆమెకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

Publish Date: May 30, 2026 1:16PM

political-news-img

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసుల యత్నం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయనను విచారణ కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. టాస్క్‌ఫోర్స్, నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకుని బాల్క సుమన్‌ను విచారణ నిమిత్తం తమ వెంట రావాలని కోరారు. అయితే పోలీసులు భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "పోలీసులు గో బ్యాక్", "ప్రభుత్వం కక్షసాధింపు ఆపాలి" అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ చుట్టూ పోలీసులు మోహరించి కార్యకర్తలను చెదరగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బాల్క సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని చెప్పారు. సింగరేణి సంస్థతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. "విచారణలో భాగంగా బాల్క సుమన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చాం. గత మూడు రోజులుగా ఆయన ఆచూకీ స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో నోటీసులు అందించి విచారణకు హాజరు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం" అని ఏసీపీ తెలిపారు.మరోవైపు, ఈ చర్యలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి పోలీసులు రావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా, బాల్క సుమన్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Publish Date: May 30, 2026 1:09PM

political-news-img

తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సీఐడీ కేసు

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మైనింగ్ తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం నిర్వహించిన విచారణలో ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఖనిజ తవ్వకాల అనుమతులు, లీజుల మంజూరు, తవ్వకాల పరిమితులు, ఖనిజాల రవాణా, రాయల్టీ చెల్లింపులు తదితర అంశాలపై దర్యాప్తు జరపనున్నారు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఇంత భారీ ఎత్తున అక్రమాలు బయట పడడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి రికార్డులు, అనుమతి పత్రాలు, లీజు ఒప్పందాలు, తనిఖీ నివేదికలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అప్పటి అధికారులు, మైనింగ్ కంపెనీల ప్రతినిధులు, ఇతర బాధ్యులను విచారించే అవకాశముంది. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మైనింగ్ అక్రమాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముండటంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.

Publish Date: May 30, 2026 12:42PM

political-news-img

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత నాలుగు నెలలుగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి ఇప్పటివరకు సుమారు 20 పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా పోలవరం జిల్లాలోని గంగవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్‌ వాటర్ ప్రాంతం, ఆర్.డి. పురం పరిసరాల్లో పులి సంచరించిన ఆనవాళ్లు లభించాయి. పులి కదలి కలతో గంగవరం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పశువులపై వరుస దాడులు జరగడంతో రైతులు, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సాయంత్రం తర్వాత బయటకు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వేములోవ, పిడతమామిడి తదితర గ్రామాల్లో పర్య టించి పరిస్థితిని సమీక్షిం చారు. గ్రామస్తులతో సమావేశమై తగు జాగ్రత్తలు సూచించారు. ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, పులి ఆనవాళ్లు కనిపించిన వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దపులి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, దాని సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తు న్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు... గత నాలుగు నెలలుగా అడవి ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలలో సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ జీవించసాగారు.

Publish Date: May 30, 2026 12:28PM

political-news-img

చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలతో అన్నకు బెదిరింపులు...యువకుడి అరెస్ట్

చెల్లెలి మార్ఫింగ్ నగ్నచిత్రాలతో అన్నకు బ్లాక్‌మెయిల్.. యువకుడి గుట్టురట్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. భాగ్యనగరంలో సాంకేతికతను అడ్డుపెట్టుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న నయా సైబర్ నేరగాళ్ల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తనతో మాట్లాడటం లేదనే కక్షతో ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా.. వాటిని ఏకంగా ఆమె సోదరుడికే పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన కిలాడీ యువకుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. బాధిత యువతి, నిందితుడు ఒకే కాలేజీలో చదువుకుంటూ కొంతకాలం పాటు స్నేహితులుగా మెలిగారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని సాధారణ ఫోటోలు, వీడియోలు సదరు యువకుడి మొబైల్‌లో ఉన్నాయి. అయితే, కాలక్రమేణా అతడి నడవడిక, ప్రవర్తనలో తేడా రావడంతో సదరు యువతి అప్రమత్తమైంది. అతడితో స్నేహాన్ని తెంచుకుని పూర్తిగా మాట్లాడటం మానేసింది. తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. మళ్లీ మాట్లాడాలంటూ పలుమార్లు వేధించినా యువతి లొంగకపోవడంతో దారుణమైన ప్లాన్ వేశాడు. తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను అధునాతన టెక్నాలజీ సాయంతో నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ వికృత ఫోటోలను నేరుగా యువతి అన్న మొబైల్‌కు పంపించి బ్లాక్‌మెయిల్ కల్చర్‌కు తెరలేపాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే ఈ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానంటూ సదరు సోదరుడిని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో సదరు కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. చివరకు ధైర్యం చేసి, ఇలాంటి సైకోలకు బుద్ధి చెప్పాలని భావించి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత బాధితులు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, సాంకేతిక పరిధి కారణాల వల్ల వారు జవహర్‌నగర్ పీఎస్‌కు రిఫర్ చేశారు. అక్కడ జవహర్‌నగర్ పోలీసులు తక్షణం స్పందించి 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసి, తదుపరి వేగవంతమైన చర్యల కోసం కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్, మొబైల్ డేటా సాయంతో నిందితుడి గుట్టురట్టు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిజిటల్ యుగంలో మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడినా చట్టం దృష్టిలో తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Publish Date: May 30, 2026 11:46AM

MOVIE NEWS