political-news-img

సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య..!

ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది... ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు వేగంగా వస్తుండగా నలుగురూ పట్టాలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మృతుల వివరాలు, కుటుంబ నేపథ్యం, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Publish Date: Jul 14, 2026 4:00PM

political-news-img

కాక్రోచ్ జనతా పార్టీ.. ఆరంభ బుస్సు.. ప్రభావం తుస్సు?!

దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థుల హక్కుల కోసం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించిన కాక్రోచ్ జంతాపార్టీ ఆరంభం అద్భుతం అయినా ప్రభావం మాత్రం శూన్యంగా మారింది. ఆ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా క్షేత్రంలో ఎటువంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో దాదాపు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్రోచ్ జనతాపార్టీ.. వ్యూహ వైభల్యాలతో ఎంత వేగంగా జనాదరణ పొందిందో, అంతే వేగంగా ప్రజల నిరాసక్తతను చవి చూస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అభిజీత్ దీప్కే వర్చువల్ ప్రపంచంలో చూపిన ఉధృతి.. ఆయన ప్రసంగాలలో ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆరంభంలో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖుల మద్దతు లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా జన సమూహాలను నిలిపి ఉంచడంలో.. ఉద్యమ తీవ్రతను కాపాడటంలో నాయకత్వం విఫలమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jul 14, 2026 3:52PM

political-news-img

Jr NTR కార్యాలయం కీలక ప్రకటన..!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ 'RAW NTR (రా-ఎన్టీఆర్)' పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ, అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసి, ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగు తున్న 'ఊరు-వాడ' సేవా కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని, రా-ఎన్టీఆర్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా తమ ఆధ్వర్యంలో జరుగుతోందని, ఎన్టీఆర్ ప్రజాసేవ కోసం రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని చేపడుతున్నారని, రాజకీయ అరంగేట్రంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభమవుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై పలు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం, రా-ఎన్టీఆర్ అనే సంస్థకు, దాని కార్యకలాపాలకు, నిర్వాహకులకు తమతో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతి నిధ్యం వహించే అధికారం లేదని, ఆయన పేరుతో ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసే హక్కు కూడా లేదని వెల్లడించింది. అలాగే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక సమాచారం అయినా ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని, అనధికార వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కార్యాలయం ప్రజలకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ఇదే తమ చివరి ప్రకటన అని పేర్కొన్న ఎన్టీఆర్ కార్యాలయం, మీడియా, సోషల్ మీడియా వేదికలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, పుకార్లను విశ్వసించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఈ ప్రకటనతో 'రా-ఎన్టీఆర్' పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టత వచ్చినట్లైంది.

Publish Date: Jul 14, 2026 3:47PM

political-news-img

క్లీన్ స్వీప్ కూటమి లక్ష్యం.. స్థానిక సమరంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలక భేటీ.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమౌతోంది. 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు రానున్న స్థానక ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడిన నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయవేడి రగులుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం (జులై 15) జరగనుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించే ఎన్నికలు. అయితే.. ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే, కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ. ఒకే గ్రామంలో లేదా మండలంలో కూటమికి చెందిన వేర్వేరు పార్టీల నేతలు పట్టు కోసం ప్రయ త్నించడం వల్ల అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే అలాంటి పొరపచ్చాలు, టికెట్ల కేటాయింపు ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన చర్యలు ఏమిటన్నదే బుధవారం (జులై 15) భేటీలో ప్రధాన అజెండా అని అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, ఎలాంటి అసంతృప్తులు లేకుండా సీట్ల సర్దుబాటు చేయాలని కూటమి పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. ఎ స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ నాయకులను అలెర్ట్ చేశారు.ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ లతో పాటు కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు. అయితే.. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ లో భుజానికి సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే. పవన్ ఈ సమావేశానికి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినప్పటికీ, ఆయన సూచనల మేరకు జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని వ్యూహాలను ఖరారు చేయనున్నారు. Kutami Targets Clean Sweep Local Bodies Elections, AP Sarpanch Elections, Chandrababu Naidu, Pawan Kalyan Health Update, AP Local Body Polls, TDP Janasena BJP Coalition, AP Panchayat Elections 2026

Publish Date: Jul 14, 2026 3:47PM

political-news-img

తెలంగాణకు రెండు కొత్త ఎయిర్‌పోర్టులు..!

తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వరంగల్‌లోని చారిత్రాత్మక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో జరిపిన కీలక భేటీలో ఈ ప్రాజెక్టుపై అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఈ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2, 2028 నాటికి ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన గడువును నిర్దేశించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని కేటాయించింది. భూసేకరణ ప్రక్రియను ఇంత వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. విమానాశ్రయాల నిర్మాణంలో భూసేకరణ అనేది ఒక పెద్ద సవాల్‌గా మారుతున్న తరుణంలో, వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ఒక చరిత్రలా సాగిందని ఆయన కొనియాడారు. ఈ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 850 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనుంది. కాకతీయుల వైభవం, వారి శిల్పకళా వారసత్వం ఉట్టిపడేలా ఈ విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మామునూరు విమానాశ్రయంలో రన్‌వేను ప్రస్తుతమున్న 1860 మీటర్ల నుంచి 2500 మీటర్ల పొడవుకు విస్తరించనున్నారు. దీనివల్ల ఎయిర్‌బస్ ఏ320 వంటి పెద్ద వాణిజ్య విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం కలుగుతుంది. దీనితో పాటు, 6800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక డొమెస్టిక్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మిస్తారు. ఇది పీక్ అవర్స్‌లో ఒకేసారి 850 మంది ప్రయాణికులకు (425 మంది వచ్చే వారు, 425 మంది వెళ్లే వారు) సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, ఏకకాలంలో మూడు కోడ్-సి విమానాలను పార్క్ చేసేలా అత్యాధునిక ఏప్రాన్, ఐసోలేషన్ బే, మరియు కేటగిరీ-3 ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ చుట్టుపక్కల పరిశ్రమలు, ముఖ్యంగా టెక్స్‌టైల్ పార్క్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ కార్గో సర్వీసులు మరియు ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) సదుపాయాలను కూడా కల్పించనున్నారు. ఈ విమానాశ్రయం కేవలం వరంగల్ వాసులకే కాకుండా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ప్రజల రవాణా అవసరాలను తీర్చనుంది. అలాగే ఏటా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సైతం ఈ విమాన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. మామునూరుతో పాటు ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి సైతం కేంద్రం పూర్తి సహకారం ప్రకటించింది. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ (రక్షణ శాఖ) అవసరాలతో పాటు పౌర విమానయాన సేవల కోసం ఏకంగా 1500 ఎకరాల భూసేకరణ జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా మరో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణకు ఈ రెండు భారీ ప్రాజెక్టులు దక్కడం రాష్ట్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమివ్వనుంది. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటాను అందిస్తున్న తెలంగాణ, ఈ కొత్త ఎయిర్‌పోర్టుల రాకతో వికసిత్ భారత్ లక్ష్యంలో మరింత కీలక భాగస్వామిగా మారబోతోంది.

Publish Date: Jul 14, 2026 3:13PM

political-news-img

హరీష్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మిల్చి మిల్క్ వివాదం.!

బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇప్పుడు తానే ఒక ట్రబుల్ లో చిక్కుకున్నారు. సాధారణంగా రాజకీయ వ్యూహాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటాలతో నిత్యం ప్రజలతో మమేకమై వార్తల్లో ఉండే హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్ విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. మిల్చి మిల్క్ బ్రాండ్, ఆర్ఎన్ఎస్ నేచర్స్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ హాట్ చర్చ జోరందుకుంది. 2020 ఆగస్టులో.. అంటే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తామంటూ హరీశ్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ మిల్చి మిల్క్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రారంభంలో పూర్తిగా హైజెనిక్ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ఇంటికే స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ఆ తర్వాత కాలంలో విస్తరించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేట్ డెయిరీ సంస్థకు అనుకూలంగా కొన్ని అధికారిక నిర్ణయాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేసే క్రమంల.. , ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయా డెయిరీని కాదని, హరీశ్ రావుకు చెందిన ఈ ప్రైవేట్ డెయిరీల నుండి టెండర్లు లేకుండానే సరఫరా చేయడానికి మార్గం సుగమం చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనివల్ల విజయా డెయిరీ కోట్లాది రూపాయల మేర నష్టపోయిందని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనీ పేర్కొంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. మరోవైపు సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేశాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు దూరమై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీశ్ రావుకు చెందిన దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలోని భారీ ఫామ్‌హౌస్‌, డెయిరీ ఫామ్ పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 400 ఎకరాల ఫామ్‌హౌస్ వెనుక ఉన్న పెట్టుబడులు, నిధుల మూలాలు ఏమిటనే దానిపై కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ విభాగాల నుండి నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విజయా డెయిరీ నష్టాలు, గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన కాంట్రాక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ అండదండలతోనే మిల్చి మిల్క్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే బలపడిందనే వాదనలకు, కల్వకుంట్ల కవిత విమర్శలు, రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు బలం చేకూర్చాయి. రాజకీయంగా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీశ్ రావుకు ఇప్పుడు ఈ డెయిరీ వివాదం మచ్చ తెచ్చి పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి.. తెలంగాణ అవసరాలు తీరిన తరువాతే ఆంధ్రప్రదేశ్ కు జలాల విడుదల అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న హరీష్ రావు.. మిల్చీ మిల్క్ ఏపీలోని పలు బడా సంస్థలకు ముఖ్యంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నిలదీయడంతో డిఫెన్స్ లో పడ్డారు. ఏపీకి జలాల విషయంలో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీష్.. తన డైరీ ప్రోడక్ట్స్ ను మాత్రం ఏపీలోని ‘చైనా ’ చైతన్య, నారాయణ)సంస్థలు సహా బడా సంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తున్నది. దీంతో పొలిటికల్ గా హరీష్ రావు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు చెబుతున్నారు. Harish Rao, Milchy Milk, RNS Natures Products, Kavitha on Harish Rao, Vijaya Dairy Probe, Telangana Politics

Publish Date: Jul 14, 2026 3:08PM

MOVIE NEWS