పాలనలో పెదబాబు... పార్టీకి చినబాబు!
Publish Date:Oct 21, 2016
Advertisement
నాయకత్వం అంటే వారసత్వం కాదు. అది ఎవరికి వారు పుణికిపుచ్చుకోవాలి. ఉబికి తెచ్చుకోవాలి! అయితే, కొన్నిసార్లు వారసత్వం నాయకత్వాన్ని కాస్త తేలిక చేసి పెడుతుంది. అంతే తప్ప పూర్తిగా వారసత్వమే నాయకత్వం అయిపోదు. ఈ విషయం దేశాన్ని ఏలాలని ప్రయత్నిస్తోన్న రాహుల్ గాంధీ మొదలు మన చాలా మంది రాజకీయ నేతల వారసుల వరకూ పదే పదే ఋజువు అవుతోంది. వారసత్వం వుంటే చేతికి మైక్ తేలిగ్గా దొరుకుతుందేమోగాని... ఏం మాట్లాడాలో తెలివిగా నేర్చుకోవాలి. అనుభవంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు తన వారసుడు లోకేష్ విషయంలో అదే నిరూపించే పనిలో వున్నట్టు కనిపిస్తోంది... ఎన్టీఆర్ ప్రభంజనంలా ప్రారంభించిన పార్టీ టీడీపీ. దాన్ని ఆయన అద్భుతంగా నడిపించారు. అటు తరువాత చంద్రబాబు ఎన్నేళ్లు ప్రతిపక్షంలో వున్నా పార్టీని భద్రంగా కాపాడుతూ వచ్చారు. టీడీపి కంటే ముందు నుంచే రంగంలో వున్న కాంగ్రెస్ ని ఢీకొంటూనే ... తరువాత వచ్చిన టీఆర్ఎస్, పీఆర్పీ, వైఎస్ఆర్సీపీ.... ఇలా ఎన్నో పార్టీల్ని టీడీపీ తట్టుకుని నిలబడింది. నిలబడుతోంది. నవ్యాంధ్రని ఏలుతోంది. ఈ మొత్తం ప్రస్థానంలో చంద్రబాబు పాత్ర ఎంతో కీలకం. ఆయన ఒక సామాన్య విద్యార్థి నేత స్థాయి నుంచీ తెలుగు నేలని అత్యధిక కాలం ఏలిన సీఎం స్థాయి వరకూ ఎదిగారు! ఇది నిస్సందేహంగా రాజకీయ అద్భుతమే... చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని సహజంగానే అందుకోవాల్సిన వ్యక్తి లోకేష్. ఇటు నారా కుటుంబానికి, అటు నందమూరి కుటుంబానికి ... రెండిటికి ఆయన ఎంతో కీలకం. అందుకు తగ్గట్టే లోకేష్ గత కొన్నేళ్లుగా తండ్రి నాయకత్వంలో రాటుదేలుతున్నారు. ప్రభుత్వంలో పదవి చేపట్టకపోయినా పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాబోయే సీఎంగా కార్యకర్తల నుంచి నేతల వరకూ అందరితో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. అయితే, ఇంత చేస్తున్నా చంద్రబాబు పూర్తి స్థాయిలో లోకేష్ పై సంతృప్తిగా లేనట్లు వార్తలొస్తున్నాయి. అవ్వి ఎంత వరకూ నిజమో తెలియదుగాని పార్టీకి మాత్రం మరింత దగ్గరవ్వాలని సీఎం చినబాబుని ఆదేశించారట! ముందు ముందు పూర్తిగా గుంటూరులోని పార్టీ ఆఫీస్ లోనే మకాం వేసి నేతలు, కార్యకర్తలతో లోకేష్ చర్చలు జరపనున్నారు. వాళ్ల సాధకబాధకాలు విననున్నారు. ప్రస్తుతం లోకేష్ వారంలో కొన్నాళ్లు హైద్రాబాద్ లో , కొన్నాళ్లు గుంటూరు, విజయవాడల్లో వుంటున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆయన ఆంధ్రకు మకాం మార్చేస్తారంటున్నారు. అప్పుడు పార్టీలోని వివిధ స్థాయుల్లోని నేతలు, కార్యకర్తలు అందరూ యువనేతతో మాట్లాడవచ్చు. తమ గోడు చెప్పవచ్చు అంటున్నారు. ఇదంతా నిజమే అయితే అది మంచి పరిణామమే. కాబోయే నాయకుడిగా లోకేష్ కు పార్టీపై, నేతలు, కార్యకర్తలపై పట్టు వుండటం చాలా అవసరం...
http://www.teluguone.com/news/content/-chandra-babu-45-68119.html





