ఓ వాణి బూతు పురాణం..!
posted on Aug 5, 2023 2:41PM
అధికార ఫ్యాన్ పార్టీలో మరో ఆణిముత్యం మెరిసింది. సదరు ఆణిముత్యం ఓ మహిళ కావడం.. అందునా ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతోండడంతో.. ఆమె గారి బూతుల పంచాంగం తాలుకు ఆడియో టేప్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీలోని ఓ వర్గం ఆమె గారి బూత పురాణం విని తల పట్టుకొంటున్నది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణిని ఇటీవల నియోకవర్గ అధ్యక్షురాలిగా సీఎం జగన్ నియమించారు. అయితే ఆమె కారు మాజీ డ్రైవర్ నాగేంద్ర... వాణిపై తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి.. అతడిపై ఫోన్లో ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డింది. అందుకు సంబంధించిన ఆడియో.. సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
అయితే సదరు ఆడియో టేప్ వైరల్ కావడంతో.. ఉత్తరాంధ్ర వైసీపీలోని ఓ వర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జగన్ తొలి కేబినెట్లోనే కాదు... మలి కేబినెట్లో బూతుల పలికే అణిముత్యాలు చాలానే ఉండగా, వారి జాబితాలో తాజాగా దువ్వాడ వాణి కూడా చక్కగా చేరిపోయారన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్బాడీని ఆతడి ఇంటికే స్వయంగా డోర్ డెలివరి చేసిన కేసులో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించి ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యారు. అలాంటి వేళ అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య వాణీ మళ్లీ కారు మాజీ డ్రైవర్ నాగేంద్రపై బండ బూతులతో తిట్ల దండకం అందుకోవడం ఏమిటని వైసీపీ శ్రేణులు తలలుపట్టుకుంటున్నాయి.
ఇంకోవైపు టెక్కలి తెలుగుదేశం అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఢీకొట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడితోపాటు ఆయన అన్న కుమారుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ న్ నాయుడుకు మంచి ప్రాబల్యం ఉందని.. అలాంటి అచ్చెన్నాయుడిపై రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న దువ్వాడ వాణి ఇలా బూతు పురాణం విప్పడం ఏంత మాత్రం బాగో లేదని ఓ అభిప్రాయం కూడా వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. అచ్చెన్నాయుడుపై పోటీ చేసే క్రమంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులనే కాదు.. ప్రజల్లోకి సైతం ఏక తాటిపైకి తీసుకు రావాల్సి ఉంటుందని.. అటువంటి కార్యక్రమాలు ఏవీ.. ఇప్పటి వరకు ఈ వాణి చేపట్టినట్లు లేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే దువ్వాడ ఫ్యామిలీలో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనును కాదని.. ఆయన భార్య దువ్వాడ వాణి పేరును సీఎం జగన్ స్వయంగా ఖరారు చేశారని వారు వివరిస్తున్నారు. అయినా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి వ్యవహారాలు, వ్యాఖ్యల వల్ల తమ పార్టీకే నష్టమని వారు పేర్కొంటున్నారు.
ఇంకోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల నేతలు, అధినేతలు.. తమ రాజకీయానికి పదును పెడుతూ.. రానున్న ఎన్నికలకు వెళ్తుంటే... తమ పార్టీలోని పార్టీ అధినేత దగ్గర నుంచి అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు.. ఇలా తమ బూతుల పంచాంగంతో మీడియా ముందుకు వచ్చి విరుచుకు పడిపోతున్నారని... ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఉత్తరాంధ్రలోని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం తీవ్ర ఆందోళనతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తోంది.