కేసీఆర్కి తిట్లు... సోనియాకి దీవెనలు!
posted on Apr 12, 2014 4:05PM
.jpg)
ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న దాసోజు శ్రవణ్ ఇకముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకోబోతున్నాడు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ తనకు ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇస్తుందని ఆశగా ఎదురుచూసిన శ్రవణ్ తనకు అంత సీన్ లేకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.
ఢిల్లీ నుంచి వచ్చిన జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు కాబట్టి శ్రవణ్కి అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చింది. టీవీలో, పేపర్లో కనిపించీ కనిపించీ బాగా అలవాటైపోయిన మనిషి కాబట్టి ఆ హోదా లేకపోతే బతకలేడని ఇచ్చినట్టున్నారు. సరే, సదరు శ్రవణ్ అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఇలా మనిషి మారిపోయాడు.
ఇంతకాలం తాను ఏ నోటితో అయితే కేసీఆర్ని తెగ పొగిడాడో అదే నోటితో కేసీఆర్ని తిట్టడం ప్రారంభించాడు. సినిమాల్లో ముఖం మీద వున్న మాస్క్ ఎలా ఈజీగా తీసేస్తారో అంత ఈజీగా కేరెక్టర్ని మార్చేసుకుని కేసీఆర్ మీద తిట్ల వర్షం కురిపించాడు. టీఆర్ఎస్లో కుటుంబ పాలన కొనసాగుతోందట. తెలంగాణ ప్రజలకు తెరాస బారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం చాలా వుందట.
అలాగే పనిగా సోనియా భజన చేశాడు. సోనియా ఎన్ని ఇబ్బందులొచ్చినా తెలంగాణ ఇచ్చిన యోధురాలంట. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేసి ఆమె రుణం తీర్చుకోవాలంట. ఈ శ్రవణ్ని కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బయటకి తరిమేయాలి. ఇది సీమాంధ్రుల శాపం.