చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ బాదుడు
posted on Jul 28, 2025 1:04PM

తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ తన సేవల ధరలను అమాంతం పెంచేసింది. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ, కొత్త రేట్లను ప్రకటించింది. ఎటువంటి ముందస్తు ప్రకటనా లేకుండానే ఆదివారం ( జులై 28)ఉదయం నుంచీ ఈ కొత్త ధరలను అమలులోనికి తీసుకువచ్చింది. అధికారులు చడీచప్పుడు కాకుండా రవాణాశాఖ వెబ్సైట్లో కొత్త ధరలను అప్డేట్ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా.. కొన్నిటి భారం మాత్రం తడిసిమోపెడు అయ్యేలా ఈ పెంపు ఉన్నది.
ద్విచక్రవాహనం, లెర్నర్స్ లైసెన్స్కు గతంలో 335గా ఉన్న ఫీజు ఈ కొత్త పెంపుతో .440 రూపాయలు అయ్యింది. ఇది రెండు క్యాటగిరీలలో పెరిగింది. కారు లెర్నర్స్ లైసెన్స్ ఫీజు అయితే 450 నుంచి 585 రూపాయలకు పెరిగింది. ఇక పర్మినెంట్ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్ టెస్టుకు గతంలో 1,035 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 1,135 రూపాయలకు పెరిగింది.
వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో ఫీజు 935 రూపాయలు ఉండగా.. ఇప్పుడది 1,805 రూపాయలు అయ్యింది. ఫైనాన్స్పై వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం (హైపొథెకేషన్) ఫీజు గతంలో 2,135రూపాయలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా వెయ్యిరూపాయలు పెరిగి 3,135 రూపా యలకు చేరుకుంది. రుణ బదిలీకి ఫీజు 2,445 రూపాయల నుంచి నుంచి రూ.2,985 రూపాయలకు పెరిగింది. ఆటోరిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ.800 నుంచి రూ.900కు పెంచారు. గతంలో రవాణాశాఖ అధికారులు పంపిన పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పెంచేసిట్లు తెలిసింది.