సోనియా, రాహుల్ కు ఢిల్లీ కోర్టులో ఊరట
posted on Dec 16, 2025 11:16AM
.webp)
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో వారిరువురితో పాటు మరో ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం (డిసెంబర్ 16) నిరాకరించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.
కాగా ఎఫ్ ఐఈర్ లేకుండా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి దాఖలు చేసిన ఫిర్యాదును సమర్థించలేమని ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. అంతే కాకుండా ఇదే కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని పేర్కొన్న కోర్టు, ఇప్పుడు ఈడి చార్జిషీటుపై ముందస్తుగా స్పందించలేమని పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ మాతృసంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ శామ్ పిట్రోడా సహా ఐదుగురిపై ఆర్థిక నేరాల విభాగం గత నెలలో నివేదికను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈడి అందించిన సమాచారం ఆధారంగా ఇఒడబ్ల్యు ఈ నివేదికను సమర్పించింది.