రిజైన్ జగన్! ట్విట్టర్ లో ట్రెండింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా... వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్క కంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కేసులు, మరణాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. బెడ్లు దొరక్క, బెడ్లు ఉన్నా ఆక్సిజన్ లేక కరోనా రోగులు అంతా చూస్తుండగానే చనిపోతున్నారు. సోమవారం రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్య రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ పై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయిన ఘటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రుయా ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విటర్‌లో #ResignJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకే   #ResignJagan హ్యాష్‌ట్యాగ్ తో 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ ట్విటరాటీ ఆరోపించారు. తనకు కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయనగరం, అనంతపురం జిల్లా హిందుపురం హాస్పిటల్స్ లోనూ ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.