కూతురి హంగామాపై నోరు మెదపని కేసీఆర్ .. బీఆర్ఎస్‌లో గుబులు

కవిత ఎపిసోడ్‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంత రియాక్ట్ కాకపోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. తన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించినా, ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడటం లేదు. దాంతో కూతురు  విషయంలో  డాడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొత్తగా ప్రకటించిన సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, సొంత యాక్షన్ ప్లాన్‌తో నిర్ణయాలు ప్రకటిస్తూ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నారంట.  బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా..  ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ ఎప్పటిలాగే ఫాంహౌస్‌లో గడిపేస్తున్నారు. దాంతో ఆయన వైఖరిపై గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ..  కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా.. హరీష్‌రావుని పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్‌‌లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె, పాత ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్​ మౌనం.. పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారు.

పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడుపడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా, దూతలతో రాయబారం నడుపుతుండటంపై ఆమె అసహనంతో ఉన్నారంట. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి కూడా తన తండ్రి ఇష్టపడటం లేదా?.. అని కవిత తన సన్నిహితుల వద్ద అంటున్నారంట. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ కేసీఆర్​ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ  క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్​ విలీనానికి కుట్ర జరుగుతున్నదని కవిత మరోసారి ఆరోపించారు. మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె.. మార్గమధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్‌ను కవిత కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తున్నది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులను కాకుండా యూనియన్‌‌‌‌‌‌‌‌లో యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న యువ కార్మికులను పిలిపించుకోవడం ఇందుకు ఊతమిస్తున్నది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు, నేతలతో ముందుకు వెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ సీనియర్ లీడర్లకు అసలేం జరుగుతోందో అంతుపట్టడం లేదంట.

కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వాళ్లను కాదని ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్లు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే, అది మళ్లీ నెగెటివ్​ అయ్యి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారంట. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ పెట్టిన పార్టీ సీనియర్​ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలామంది సీనియర్ లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేటీఆర్.. తర్వాత అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే కవిత ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే ముందు కవిత లేఖపై స్పందించిన ఆయన అది అసలు పెద్ద విషయమే కాదని కొట్టిపారేశారు. దాంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.  ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు. 
ఇక కేసీఆర్‌‌తో హరీష్‌రావు ఫామ్‌హౌస్‌లో భేటీ అయి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ ​విచారణ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెబుతున్నప్పటికీ, కవిత ఎపిసోడ్‌పైనా చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత అసలు  ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా? లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం.

అదలా ఉంటే కవిత చేస్తున్న కార్యక్రమాలు, పర్యటనల్లో తెలంగాణ జాగృతి బ్యానర్‌లు కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌తో సంబంధం లేకుండానే జాగృతి ఆధ్వర్యంలోనే కవిత సమావేశాలు, పర్యటనలు కానిచ్చేస్తున్నారు . కవిత లేఖ వివాదంపై బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా స్పందించవద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి కవిత పర్యటనల్లో బీఆర్ఎస్ నాయకులు, జెండాలు లేకపోవడం, ఆమె లేఖ లీక్, నాయకుల నిశ్శబ్దంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గత మయ్యాయంటున్నారు. అయితే కవిత మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. హైదరాబాద్‌లో సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె, కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకంగా జూన్ 4 ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తానంటున్నారు. కమిషన్ నోటీసులపై పార్టీ నేతలెవరూ స్పందించని పరిస్థితుల్లో కవిత రియాక్ట్ అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో జాగృతి అధ్యక్షురాలి ఆంతర్యం అంటుపట్టక గులాబీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.