అప్పుడు ఓడి గెలిచింది.. ఇప్పుడు గెలిచి ఓడింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. పుష్కర సంవత్సరంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం స్వతస్సిద్దంగా ఏర్పడిన రాష్ట్రం  కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అందుకే తెలంగాణ గడ్డ  పోరాటాల పురిటి గడ్డ అంటారు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన..  తెలంగాణ రాష్ట్ర సమితి సారధ్యంలో 2001 నుంచి 2014 వరకు సాగిన మలి దశ ఉద్యమం ద్వారానే సాధ్యమైనా..  తెలంగాణ ఉద్యమం  ఆరు పదులకు పైగా సాగిన ఒక దీర్ఘకాలిక, రాజకీయ ప్రజా ఉద్యమం. 

నిజానికి..  1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది. ఇక అక్కడినుంచి 60 ఏళ్ల పాటు  ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే వుంది.  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎందరో నాయకుల సారధ్యంలో పార్టీలు పుట్టుకొచ్చాయి. కారణాలు ఏవైనా..  మధ్యలోనే లక్ష్యం పక్కదారి పట్టి పోయింది. అయితే నాయకుల స్వార్ధంతో ఉద్యమం పక్కదారి పట్టినా..  ఉద్యమ స్పూర్తి మాత్రం సజీంగానే నిలిచింది. 

అందుకే.. జాతీయ, రాష్ట్ర నాయకులు మోసాలు చేసినా..  పడిలేచిన కెరటంలా  తెలంగాణ ఉద్యమం అంతిమ గమ్యాన్ని చేరుకుంది. 1969లో విద్యార్ధుల సారథ్యంలో మహోదృతంగా ఎగసి పడిన జై తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగ ప్రవేశంతో పది నెలలకే చల్లబడింది. సర్కార్ తూటాలకు వందల మంది విద్యార్ధుల నేలకొరిగారు. అయినా..  విద్యార్ధుల బలిదాన స్పూర్తి నిలిచింది. 2001లో మలిదశ ఉద్యమం పురుడు పోసుకునే వరకు  ప్రత్యేక తెలంగాణ స్పూర్తి సజీవంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం  సబ్బండ వర్గాల ప్రజలే నడుం బిగించారు.  ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్య స్పూర్తిని  కొనసాగించారు. 

ఇక ఆ తర్వాత ఏమి జరిగిందీ అన్నది మన ముందున్న నడుస్తున్న చరిత్ర.  ఇప్పడు 2001లో కల్వకుట్ల చంద్రశేఖర రావు  సారథ్యంలో గులాబీ జెండా నీడలో..  2001లో మలిదశ ఉద్యమం మొదలైంది. తొలితరం ఉద్యమ నేత  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్, 27న జలదృశ్యంలో మలిదశ ఉద్యమం తొలి అడుగు వేసింది. అయితే..  గమ్యం చేరుతుందని.. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యంవుతుందన్న  ఆశ అప్పటికి అంతగా లేక పోయినా.. 2014  జూన్ 2 న ఆరు పదుల కల నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 

అయితే..  అంతవరకు ఏమి జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది, ఇప్పడు ఏమి జరుగుతోంది..  అనే విషయంలోకి వస్తే, ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సకల జనుల సమ్మె(2008) వంటి మహోన్నత ఆందోళనలు,1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల బలిదానంతో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆకాంక్ష అయితే నెరవేరింది  కానీ.. కొండాలక్ష్మణ్ బాపూజీ ,  కాళోజీ నారాయణ రావు,  ప్రొఫెసర్ జయశంకర్ సార్,  కేశవ రావు జాదవ్ వంటి  తెలంగాణ సిద్దాంత కర్తలు, స్పూర్తి ప్రదాతలు, ప్రాతః స్మరణీయుల కన్న కలలు ఫలించాయా..  ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఆకాంక్షను ఉపిరిగా జీవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా.. అందుకోసమే ఉపిరి వదిలిన వందల మంది అమర వీరుల ఆకాంక్షలు నేరవేరాయా? అంటే మాత్రం తెలంగాణ ప్రజనీకం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడింది  కానీ, ఆకాంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి. అన్నదే  తెలంగాణ ప్రజలు ఇచ్చే సమాధానం అవుతుందని  అంటున్నారు. 

నిజానికి..  ఈరోజున్న వాస్తవ పరిస్థితులను, రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వికృత విన్యాసాలను  గమనిస్తే..  ముఖ్యంగా.. తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని   బీఆర్ఎస్ గా  పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లో, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రి, ప్రస్తు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  1969 నాటి, తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓడి గెలిస్తే.. 2001 మొదలైన మలి దశ ఉద్యమం గెలిచి ఓడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవంక  రాష్ట్ర గీతం.. రాష్ట్ర మాత(తెలంగాణ తల్లి) విగ్రహం కూడా రాజకీయ రంగులు పులుముకున్న పరిస్థితిలో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే మూగ బాధ జనంలో వ్యక్తమవుతోంది. చివరకు, మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నతెలంగాణ నడుస్తున్న చరిత్రను గమనిస్తే.. ‘తన చరిత్రను తనే పఠించి ఫక్కున  నవ్వింది ధరిత్రి’  అన్న కవి వాక్కును  తెలంగాణ రాజకీయ నాయకత్వం నిజం చేస్తోందని, అంటున్నారు.

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక వ్యాసం