బనకచర్లపై జగన్ విషం!

వైసీపీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత ప్రాంతమైన రాయలసీమపై విషం చిమ్ముతున్నారు. సీమ సాగు, తాగు నీటి కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గోదావరిపై నిర్మింత తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఇసుమంతైనా మేలు, ప్రయోజనం కలగకూడదన్న ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు తాను ఇసుమంతైనా వెనుకాడనని బనకచర్లపై చేసిన వ్యాఖ్యల ద్వారా జగన్ మరో సారి రుజువు చేశారు. 

సరిగ్గా హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్  అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో  జగన్ తన కపటత్వాన్ని బయటపెట్టుకుంటూ బనకచర్లకు వ్యతిరేకంగా విష వ్యాఖ్యలు చేశారు. బుధవారం జులై (16) జాతీయ మీడియాతో  మాట్లాడిన జగన్  బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టు కాదన్నారు. మిగులు జలాలు లేకుండా లింక్ ప్రాజెక్టును నిర్మించడం తగదని చెప్పారు. తెలంగాణ వాదనను బలపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమ ప్రయోజనాలకు పోలవరం - బనకచర్ల అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. జగన్ సీమ ప్రయోజనాలు కాదు.. తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బనకచర్చకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా మరో సారి రుజువు చేసుకున్నారు.

 గతంలో  కూడా హంద్రీ - నీవాను నిర్లక్ష్యం చేసి జగన్ సీమకు తీరని అన్యాయం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. జగన కు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, సీమ అభివృద్ధి ముఖ్యం కాదని తేలిపోయిందని అంటున్నారు.   ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కడం కూడా అందుకేనని అంటున్నారు.   మిగుల జలాలే లేనప్పుడు బనకచర్ల నిర్మాణం వృధా అని ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేయడమే అవుతుందన్న జగన్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.