కాకాణి అరెస్టుపై అనిల్ కుమార్ ఖంగారెందుకో తెలుసా?
posted on May 26, 2025 10:47AM
.webp)
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆదివారం (మే 25) కేరళలో అరెస్టు చేసి ఏపీకి తరలించిన సంగతి తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో గుంటూరు రేంజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రోడ్డు మార్గంలో నెల్లూరులోని డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం)కి తరలించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (మే 26) ఉదయం కాకాణిని వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తరలించారు. తరువాత ఆయనను వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇలా ఉండగా కాకాణి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు వార్త తెలియగానే ఆదివారం (మే 25) అర్ధరాత్రి నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టలేరనీ, త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ చూడని అరెస్టులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులని విమర్శించారు. అక్రమ కేసు పెట్టారు కనుకే మాజీ మంత్రి కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించార్న ఆయన న్యాయపోరాటం చేస్తామన్నారు. అయినా ఇన్నాళ్లూ పార్టీకీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చి ప్రభుత్వంపై నిప్పులు చెరగడం వెనుక తన అరెస్టు భయం ఉండటమే కారణం అంటున్నారు.
ఎందుకంటే ఇదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మంత్రిగా ఉండగా మీసం తిప్పి, తొడ చరిచి, ప్రభుత్వంపైనా, తెలుగుదేశం నేతలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్.. అప్పట్లో జగన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని పీకేసి.. నెల్లూరు జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్నసమయంలో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు కారణంగానే అప్పట్లో ఆయనను పార్టీ సమన్వయకర్త పదవి నుంచి జగన్ తప్పించారన్న ప్రచారం కూడా ఉంది. ఇక 2024 ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తం అయ్యాయి.
వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఓటమి తరువాత సైలెంటైపోయారు. వాస్తవానికి ఫలితాలకు ముందే, అంటే పోలింగ్ జరిగిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించార ఆరోపణలు చేయడం ద్వారా ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు. పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని హేళన చేశారు. రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు.
అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఆయన రాజకీయ భవిష్యత్ లో సందిగ్ధంలో పడింది. ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మళ్లీ సవాళ్లతో చెలరేగిపోతున్నారు. అయితే.. అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలకు నేడో రేపో తన అరెస్టూ తప్పదని భావిస్తున్న అనిల్... అప్పుడు తనకు పార్టీ నుంచి మద్దతు కోసమే ఇప్పుడు కాకాణి అరెస్టును ఖండిస్తూ.. న్యాయపోరాటం, అక్రమ అరెస్టులకు భయపడం అంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.