జగన్ కు లోకేష్ బంపరాఫర్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కు ఇది బంపరాఫరే.. ఎందుకంటే లోకేష్ సవాల్ ను స్వీకరించి.. ఆధారాలు చూపకపోతే జగన్ ఏం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సారీ చెబితే చాలు.  

 కేవలం తాను ప్రభుత్వంపై చేస్తున్న ఓ ఆరోపణకు సంబంధించి చిన్న ఆధారం బయట పెట్టడమే. అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఇప్పుడు జగన్ కు తాను చెప్పింది అబద్దం కాదని.. తాను ఫేక్ చేయడం లేదని నిరూపించుకోవడానికైనా స్పందించి.. ఆధారాలు సమర్పించాల్సి ఉంది. లేకపోతే జగన్ రెడ్డి ఫేక్ పాలిటిక్స్ మరోసారి ఎక్స్ పోజ్ అవుతుంది.

 ఇటీవలి కాలంలో జగన్ ఎప్పుడు మాట్లాడినా ఉర్సా క్లస్టర్ కంపెనీకి తెలుగుదేశం కూటమి సర్కార్ అతి ఉదారంగా నామమాత్రపు ధరకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రూపాయికి ఇడ్లీలు కూడా రావనీ, అలాంటిది ఆ నామమాత్రపు ధరకు కూటమి సర్కార్ ఉదారంగా ఉర్సా కు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేసిందనీ చేస్తున్న ఆరోపణలపైనే  ఎక్స్ వేదికగా లోకేష్  స్పందించారు.  ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపితే తాను రాజీనామా చేస్తాననీ, అలా చూపలేకపోతే జగన్ క్షమాపణ చెబితే చాలనీ సవాల్ విసిరారు.  

ఉర్సా కంపెనీకి  ఎకరా కోటి రూపాయలు చొప్పున 3.5 ఎకరాలు.. ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 56.5 ఎకరాల భూమిని ఉర్సా కు కేటాయించారు. ఈ మేరకు  జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం వాస్తవాలతో సంబంధం లేకుండా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పిస్తున్నరు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫేక్ రాజకీయానికి చెక్ పెట్టేలా లోకేష్ బహిరంగ సవాల్ విసిరి ఉర్సాకు ఉదారంగా భూములు కట్టబెట్టినట్లు ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ చేశారు. మరి లోకేష్ సవాల్ కు జగన్  ఎలా స్పందిస్తారో చూడాలి.