తుని రైలు దగ్ధం కేసు.. మళ్లీ తెరపైకి!
posted on Jun 3, 2025 10:26AM

తుని రైలు దగ్ధం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమ నేలతపై వైసీపీ సర్కార్ ఎత్తివేసిన కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనుంది. ఈ కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హెంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో 2016లో తునిలో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును దగ్ధం చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. రైలు దగ్ధం సంఘటనను సీరియస్ గా తీసుకున్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా, ముద్రగడ సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. అలాగే రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది.
అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది. విజయవాడలోని 7 వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021 లో కొట్టివేశారు. అయితే రైల్వే శాఖ తర్వాత ముద్రగడ సహా కొందరికి సమన్లు జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరగతోడాలని నిర్ణయించింది. ఈ కేసు కొట్టి వేత పై హైకోర్టుకు అప్పిలుకు వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది.
