ఒక్కరోజులో రూ.15 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద
posted on Dec 16, 2025 1:16PM

ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఆయన నికర సంపద ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 600 బిలియన్ డాలర్లు దాటేసింది. ఐపీఓకు రాబోతున్న స్పేస్ ఎక్స్ విలువ అమాంతం పెరగడంతో దాంట్లో మెజార్టీ వాటా ఉన్న మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 15 లక్షల కోట్లకుపైగా సంపద పెరగడంతో ప్రస్తుతం మస్క్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (x) సంస్థల యజమాని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ నికర సంపద సోమవారం (డిసెంబర్ 16) రికార్డు స్థాయిలో 600 బిలియన్ డాలర్లు దాటేసింది. మస్క్కు మెజార్టీ వాటా ఉన్న స్పేస్ ఎక్స్.. ఐపీఓకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో దాని విలువ భారీగా పెరగడంతో మస్క్ సంపద కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. స్పేస్ ఎక్స్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లు అంటూ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 72 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. దీంతో ఇందులో సుమారు 42 శాతం వాటా ఉన్న మస్క్ సంపద ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది.
ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం చూస్తే మస్క్ సంపద డిసెంబర్ 15-16 మధ్య ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 168 బిలియన్ డాలర్లు (రూ. 15.26 లక్షల కోట్లు) పెరిగి.. 677 బిలియన్ డాలర్లకు (రూ. 61 లక్షల కోట్లకు) చేరిందని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తిగా మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఈవీ కార్ మేకర్ టెస్లా షేర్లు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో మస్క్ సంపద విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఇందులో కూడా మస్క్కు 12 శాతం వాటా ఉంది. టెస్లా షేరు సోమవారం (డిసెంబర్ 15)సెషన్లోనూ 4 శాతం పెరిగి 475.31 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఈ స్టాక్ ధర ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 25 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో 44 శాతం పుంజుకుంది. మరోవైపు.. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్స్ లేకుండానే ఉండే రోబోటాక్సీల్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు మస్క్ ప్రకటించడం కూడా టెస్లా షేరు పెరిగేందుకు కారణమైంది.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ఒక్కరోజులో 167 బిలియన్ డాలర్లు (రూ. 15.16 లక్షల కోట్లు) పెరగ్గా.. 638 బి. డాలర్లుగా ఉందని తెలిసింది. ఇది భారత కరెన్సీలో రూ. 58 లక్షల కోట్లకు సమానం. ఏదేమైనా మొత్తంగా 600 బిలియన్ డాలర్ల సంపద దాటేశారు. స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. సుమారు 30 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమకూర్చాలని చూస్తోంది. ఇది భారత కరెన్సీలో రూ. 2.75 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందు ఈ ఏడాది నవంబరులో మస్క్కు 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ. 90 లక్షల కోట్లు) పే ప్యాకేజీకి టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పే ప్యాకేజీ కావడం విశేషం. ఇక్కడ టెస్లా నిర్దేశించిన లక్ష్యాల్ని మస్క్ చేరుకుంటే.. దశల వారీగా ఇది మస్క్కు అందుతుంది. దీంతో మస్క్ ట్రిలియనీర్గా అవతరిస్తారు.