సొంత పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు...బీఆర్‌ఎస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు

 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఆమె అన్నారు. 

కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
నేను ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా... ఇంకా నా సహనాన్ని పరీక్షించవద్దని కవిత అన్నారు. ఇటీవల మేడే రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  కామెంట్స్  రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణం అయ్యాయి. ఈ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. 

దీంతో కవిత తీరు సొంత బీఆర్‌ఎస్ పార్టీ పరిపాలన, అందులోను తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చెప్పేలా ఉందని కవిత వైఖరి చూస్తే త్వరలో కవిత నూతన పార్టీ పెట్టే ఆలోచన ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె ప్రత్యేకంగా బీసీ వాదం ఎత్తుకుంది. దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. కేసీఆర్ తర్వాత నెక్ట్స్ కవిత అని ప్రజల్లో బలంగా వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా కవిత వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్త  కుంపటి పెడుతున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఏ సభకు వెళ్లిన సీఎం సీఎం అని అనుచరులు పదే పదే అంటున్నారు. దీంతో బీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది