మండపంలోనే..చనిపోయిన వధువు.. ఆ తర్వాత ఇలా..
posted on May 29, 2021 1:49PM
ఓపెన్ చేస్తే.. శుక్రవారం పెళ్లి.. ఒక వైపు వరుడి ఇంట్లో మరోవైపు వధువు ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. మరో ఐదు నిమిషాల్లో పెళ్లి. మంగళ వాయిద్యాలు మోగాల్సి ఉంది. అతిథులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. అంతలోనే ఆ పెళ్లి వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంకో ఐదు నిముషాల్లో వరుడు తాళి కడుతాడు అనగా.. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే వధువు తనువు చాలించింది. దీంతో పెళ్లి మండపంలోనే పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి ఆమె చెల్లెలిని వరుడికిచ్చి పెళ్లి చేశారు.
అది ఉత్తర్ప్రదేశ్. ఎటావా జిల్లా. అతని పేరు మంజేష్, ఆమె పేరు సురభి. వారి ఇద్దరికీ వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వారి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా వధువు పెళ్లి పీటలమీదే కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన అన్ని పరీక్షలు చేసి సురభి గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో పెద్దలు సురభి మృతదేహాన్ని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె చెల్లెలు నిషాను వరుడికిచ్చి వివాహం జరిపించారు. అనంతరం సురభి మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ‘పెళ్లి పీటల మీదే వధువు చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, అనంతరం ఇరు కుటుంబాల వారం చర్చించుకుని సురభి చెల్లెలు నిషాను మంజేష్కిచ్చి వివాహం జరిపించాం’ అని సురభి సోదరుడు తెలిపాడు.