బ్రాహ్మణి.. తెలుగుదేశం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం!

నారా బ్రాహ్మణి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె. ఇప్పటి వరకూ ఆమె  రాజకీయ యవనికపై కనిపించలేదు. వినిపించలేదు. కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే  తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు. సంక్షోభం నుంచి నేతలు పుట్టుకొస్తారు అన్న నానుడికి నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పుడు నారా బ్రాహ్మణి తెలుగుదేశం నాయకురాలిగా ఆవిష్కృతమయ్యారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేర నిబంధనలను తుంగలో తొక్కి అరెస్టు చేసిన సమయంలో అప్పటి వరకూ ప్రణాళికా బద్ధంగా ఎన్నికలకు సమాయత్తమౌతున్న తెలుగుదేశం పార్టీలో ఒక కుదుపు ఏర్పడింది. జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి.. తండ్రి అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో హస్తినలో ఉన్నారు. మిగిలిన నేతలంతా.. చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్త  ఢిల్లీలో ఉంటే.. తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి అట్రాక్షన్ ను తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో  జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె  ప్రశ్నించిన తీరు మహామహా  రాజకీయ నాయకులనే అబ్బురపరిచింది. భర్త అరెస్టుతో దిగాలు పడిన అత్తగారు భువనేశ్వరికి  ఒక పక్క ధైర్యం చెబుతూనే..  మొత్తం పార్టీ శ్రేణులకు కూడా ఆందోళన వద్దు నేనున్నానన్న భరోసా ఇచ్చారు. 

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.హస్తిన నుంచి రాజమహేంద్రవరం చేరుకోగానే లోకేష్‌ను కూడా అరెస్టు చేసి.. తెలుగుదేశం ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నిర్వీర్యం చేసే లక్ష్యంతో జగన్ సర్కార్ పావులు కదుపుతోందన్న వార్తల నేపథ్యంలో  నారా బ్రాహ్మణి ముందుకు వచ్చారు. తన భర్తనూ అరెస్టు చేయవచ్చు.. ఇంకా ఇతర నాయకులను కూడా అరెస్టు చేసినా చేస్తారు. అయినా తెలుగుదేశం బెదరదు, అదరదు అంటూ నినదించారు.

ఒక వైపు  లోకేష్ ఢిల్లీలో న్యాయకోవిదులతోపాటు, జాతీయ మీడియా ప్రతినిధులుతో వరస భేటీలు అవుతున్నారు.  జాతీయ మీడియాలో లోకేష్ లైవ్ టాక్ షోలు, ఇంటర్వ్యూలు  అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, జాతీయ మీడియాలో జగన్ సర్కార్ అడ్డగోలు, అరాచక విధానాలను లోకేష్ ఎండగడుతున్న తీరు కేంద్రంపై కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించక తప్పని ఒత్తిడిని రోజురోజుకూ పెంచుతోంది. 

ఇక మరో వైపు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే  చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దేశం మొత్తం నిరసన గళం వినిపిస్తున్నది. ఇదంతా ఒకెత్తు అయితే.. నారా బ్రాహ్మణి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ శ్రేణులకు ధైర్యాన్నిస్తూ రాజకీయ యవనికపై అడుగుపెట్టడం తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. 

తెలుగుదేశం పార్టీకి గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వార్తలు.. ఎంత కాదనుకున్నా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా పరిణమించాయి. జూనియర్ ఎన్టీఆర్ వినా మొత్తం నందమూరి కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నప్పటికీ.. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు అది వేరే సంగతి. కానీ జూనియర్ ఎన్టీఆర్ దూరం మాత్రం ఎలా చూసినా తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పుకోవలసిన అంశంగా ఇంత కాలం.. అంటే నారా బ్రాహ్మణి  మీడియా ముందుకు వచ్చే వరకూ ఉంటూ వచ్చింది. ఆమె రాజకీయ అరంగేట్రం.. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంతో ఘనంగా చేశారు. ఎన్టీఆర్ వారసత్వం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆమె వైఫ్ ఆఫ్ లోకేష్ మాత్రమే కాదు.. డాటరాఫ్ నందమూరి బాలకృష్ణ.   

ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. తన మీడియా సమావేశంలో ఆమె ఎక్కడా ఏపీ సీఎం జగన్ పేరెత్తలేదు. పూర్తిగా చంద్రబాబుపై బనాయించిన కేసులు, వాటి డొల్ల తనం, అరెస్టు వెనుక ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వంటి అంశాలకే పరిమితమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకురాలిని ప్రపంచానికి చాటింది. ఉన్నత విద్యావంతురాలైన బ్రహ్మణి  విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీషు మీడియం అయినా ఆమె తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది. మీడియా ప్రశ్నలకు బదులీయడంలో ఎక్కడా తడబాటు కనిపించలేదు. తొట్రుపాటు కనిపించలేదు.  తన భర్త లోకేష్‌ను కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయనీ, అయినా తామేమీ భయపడేది లేదనీ చాటిన బ్రహ్మణి.. ఒక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి తెలుగుప్రజలంతా  అండగా ఉండాలంటూ ఇచ్చిన పిలుపు నేరుగా ప్రజల మనస్సులలో నాటుకుంది.

ఆమె ఒక్క పిలుపుతో రా ష్ట్రంలో మహిళాలోకం ఒక ప్రభంజనంలా కదిలారనడానికి రాజమహేంద్రవరంలో బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్న కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలే సారథులుగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.  అన్ని వర్గాల ప్రజలూ భయం వీడి రోడ్లెక్కి బాబుకు మద్దతుగా ఆందోళన బాట పట్టారు.   ఇక  నెటిజన్లు అయితే   నందమూరి తారకరామారావు నిజమైన వారసురాలు బ్రాహ్మణియే అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.  మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.