కేజ్రీవాల్ పై రెండువైపులా దాడి
posted on Oct 31, 2012 5:02PM
అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ అటు కాంగ్రెస్ నీ ఇటు బిజెపినీ ముప్పుతిప్పలు పెడుతున్న కేజ్రీవాల్ మీద రెండు పక్షాలనుంచీ అటాక్ మొదలైంది. రాబర్ట్ వాద్రాపై డిఎల్ ఎఫ్ స్కామ్ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే కేజ్రీవాల్.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఆరోపణలు గుప్పించారు. అటు తిరిగీ ఇటు తిరిగీ మొత్తం బరువంతా తిరిగి కేజ్రీవాల్ మీదే పడుతోంది.
కాంగ్రెస్, బిజెపి నేతలు .. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తమపై బురదజల్లుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇదేదో స్పాన్సర్ షిప్ వ్యవహారంలా ఉంది తప్ప.. వాస్తవాలు కనిపించడంలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థకి భారీగా విదేశీనిధులు అందాయని, తెరవెనకఉండి చక్రం తిప్పుతున్న గురువులెవరో కేజ్రీవాల్ ని నడిపిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
భారతీయ జనతాపార్టీ పత్రిక కమల్ సందేశ్ లో ఈ వెర్షన్ ని ముద్రించారుకూడా.. కేజ్రీవాల్ సుపారీ తీసుకుని పనిచేస్తున్నారని, దీనిపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం డబ్బుకోసమే కేజ్రీవాల్ ఇలాంటి పనులు చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అన్నాహజారేకి నమ్మకంగా ఉండలేని వ్యక్తి దేశానికి ఎలా నమ్మకంగా సేవలందిచాలనుకుంటున్నాడో తేల్చి చెప్పాలంటూ కేజ్రీవాల్ మీద తారా స్థాయిలో భాజపా నేతలు మండిపడుతున్నారు.