ఒక విమాన ప్రమాదం...ఎన్నో ముఖ్యాంశాలు
posted on Jun 12, 2025 9:11PM

పాపం ఆ మెడికోలు.. వారి హాస్టల్ పక్కనే.. అహ్మదాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటే అదో ల్యాడ్ మార్క్ అనుకున్నారు. మా హాస్టల్ ఎయిర్ పోర్టు పక్కనే ఉందని చెప్పుకుంటే అదో గర్వకారణంగా భావించారు. కానీ, జూన్ 12న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో.. బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు. వచ్చే రోజుల్లో ఇదే హాస్టల్లో కూర్చుని ఈ మెడికోలు భోం చేస్తుంటే.. ఏదైనా ఫ్లైట్ ఎగురుతున్న శబ్ధం రాగానే వారి గుండె గతుక్కుమనడం ఖాయం. అయినా ఇది ఎంత అన్యాయమైన అనుభవం?
ఇక ఇదే ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్. ఇదే ఫ్లైట్ లో తాను సీపీ- 11 ఏ సీటు రిజర్వ్ చేసుకుంటున్నపుడు బహుశా అనుకుని ఉండడేమో. తానీ సీటు ద్వారా బతికి బట్టకట్టబోతున్నానని. వచ్చే రోజుల్లో ఈ సీటు నెంబర్ కి డిమాండ్ ఏర్పడినా ఏర్పడుతుంది కాబోలని అంటారు కొందరు. ఇంతటి విషాదంలోనూ కాస్తంత ఊరటనిచ్చే అంశం ఇదే. అన్నింటికన్నా అత్యంత విచారకరం.. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం. ఇది గుజరాత్ ప్రజలను చాలా చాలా దారుణంగా బాధిస్తోంది. లండన్ లో ఉన్న తన భార్యను చూడ్డానికి వెళ్తున్న ఆయన ఈ విధంగా విమాన ప్రమాదంలో పడి కాలి బూడిదవుతారని మాత్రం ఎవరు ఊహించగలరు?
ఇక ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులుండగా, బ్రిటీషర్లు- 53, పోర్చుగీసు- ఏడుగురు ఒక కెనడియన్ ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, పది మంది ఫ్లైట్ క్రూ సైతం ఉండటం.. ఈ ప్రమాద తీవ్రత ఎలాంటిదో చెప్పే గణాంకం. ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూపు. అయితే ఈ ప్రమాదానికి కారణం పక్షులు వచ్చి గుద్దుకోవడంగా భావిస్తున్నారు. ప్రమాద స్థలిలో చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, వాటిపై పక్షులు వాలే అవకాశాలెక్కువ కావడం వల్ల.. ఇదే జరిగి ఉంటుందని ఇప్పటికైతే ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
సరిగ్గా ఇదే ప్రమాదం ద్వారా కొందరికి తెలియని విషయం ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో మేడే కాల్ అంటూ ఒకటి చేస్తారని. ఈ కాల్ వచ్చిందంటే ఆ ఫ్లైట్ డెత్- డేంజర్లో పడి ఉంటుందని ఏటీసీ భావించాల్సి ఉంటుంది. అంతే కాదు బోయింగ్ 787 - 8 మోడల్లోని ఈ డ్రీమ్ లైనర్ 2011 లో ప్రపంచ విమానరంగానికి పరిచయం కాగా.. ఇప్పటి వరకూ 100 కోట్లకు పైగా ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చిందట. సరిగ్గా అదే సమయంలో ప్రమాదం జరిగిన ఈ ఏ1 171 అనే ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ 787-8 విమానం ఆరు నెలల క్రితం అంటే, గత డిసెంబర్లో ఒకసారి సాంకేతిక సమస్యతో ఇలాగే ఆగిపోయిందట. అప్పట్లో ఇదే విమానంలో 300 మంది ఉండగా.. వారందరి లండన్ ప్రయాణం నిలిచిపోయిందట.
ఇక ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదం ఎప్పుడని చూస్తే 2020 సంవత్సరం- కేరళలో. అప్పట్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ద్వారా ఇద్దరు సిబ్బందితో పాటు 21 మంది మరణించారు.అయితే డ్రీమ్ లైనర్ సీరీస్ అయిన ఈ భారీ విమానాన్ని బోయింగ్ తెచ్చిన ఉద్దేశమేంటంటే.. లైట్ వెయిట్ తో తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణ సదుపాయం కల్పించాలని. ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే కాక.. అమెరికన్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్లు సైతం ఈ మోడల్ విమానాలను కలిగి ఉన్నాయి.
ఎందుకంటే ఇది ఏక్ దమ్ 13 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీంతో దూరభారాలకు సంబంధించి దీన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తాయి విమానయాన సంస్థలు.అయితే ఇప్పటి వరకూ ఈ డ్రీమ్ లైనర్ ని వాడిన పైలెట్లు ఇంజిన్ మీద, బ్యాటరీ మీద, ఇతరత్రా సాంకేతిక సమస్యలపై ఎన్నో సార్లు కంప్లయింట్ చేశారు. 2013లో రెండు వేర్వేరు ఘటనల ద్వారా.. జపాన్ విమాన యాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని ద్వారా ప్రయాణాలను నిలిపివేశారు. డ్రీమ్ లైనర్ సీరీస్ పై 2024లో యూఎస్ సెనెట్ కి కూడా కంప్లయింట్లు వెళ్లాయి. దీంతో FAA దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే ఈ భారీ ప్రమాదం జరగటం.. ఇటు టాటా వారి ఎయిర్ ఇండియాకి మాత్రమే కాదు బోయింగ్ డ్రీమ్ లైనర్ సీరీస్ మనుగడకే ప్రమాదం వచ్చిపడేలా తెలుస్తోంది.