ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ...గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానం
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తోన్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025” సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. మేరకు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా .. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
రాహుల్, ఖర్గేకు ఆహ్వానం..
ప్రధానితో భేటీకి ముందు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను సీఎం రేవంత్ కలిసి గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి ఆయనకు వివరించారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మాలా సీతారామన్తో ముఖ్యమంత్రి భేటీ అయి సమ్మిట్కు రావాలని కోరారు.
అలాగే ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సీఎం రేవంత్రెడ్డి కలిశారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, రఘువీర్రెడ్డి, సురేశ్ షెట్కార్, చామల కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు.