వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగుస్ కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది. ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది. *నిశ్శబ్ద.

కథలు చెప్పడం వల్ల పిల్లలకు నేర్పే దేమిటి??

ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు. ఉదాహరణకు… ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి.  "సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట. అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా? పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా? బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి. అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.                                            ◆నిశ్శబ్ద.  

చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ సమస్యలు చుట్టుముడతాయట..!

చాణక్యుడు చంద్రగుప్త చక్రవర్తికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు. ఈయన రాజనీతిలో మాత్రమే కాకుండా తాత్విక విషయాలను కూడా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా తన చాణక్య నీతి గ్రంథాలలో వివరించాడు.  ముఖ్యంగా మనిషి అలవాట్లను, మనిషి ప్రవర్తనను చాణక్యుడు చెప్పిన విధానం తెలుసుకుంటే మనుషుల జీవితాలు చాలా మారిపోతాయి.  జీవితంలో ఎప్పుడూ  సమస్యలతో చుట్టు ముట్టే వ్యక్తుల గురించి,  వ్యక్తి ప్రవర్తన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.. చాణక్యుడు చెప్పిన కొన్ని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుంటే ఆయన చెప్పిన విషయాలు బాగా అర్థమవుతాయి. వ్యవయనర్గతమాకారః శుచయతి| ఒక వ్యక్తి మనసులో ఏముందో అది ఆ వ్యక్తి ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుందట. అబద్దాలు చెప్పే వ్యక్తుల ముఖంలో కూడా అలాగే ఆ ఉద్దేశాలు వ్యక్తమవుతాయి.  అలాంటి వ్యక్తులు ఏదైనా దాచి పెట్టాలని చూసినా అందులో అర్థం లేదు.. అందరికీ అవి అలా అర్థమైపోతూ ఉంటాయి.  అబద్దం చెప్పే వ్యక్తులు తమ జీవితంలో ఇతరులను మోసం చేస్తున్నామని, ఇతరుల నుండి లాభపడుతున్నామని, కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటున్నామని అనుకుంటారు. కానీ అందులో అర్థం లేదు.. ఇలాంటివి చేయడం వల్ల వారికి సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. దాచిన పాపానాం సాక్షిణో మహాభూతాని| రహస్యంగా చేసిన పాపాలకు ఇతరులు ఎవరూ సాక్షులు లేరని చాలామంది సంతోషపడుతుంటారు.  తమకు ఎలాంటి నష్టం జరగదని తమను ప్రశ్నించేవారు ఎవరూ ఉండరని అనుకుంటూ ఉంటారు.  కానీ అలా రహస్యంగా చేసిన పాపాలకు పంచభూతాలే సాక్ష్యాలు.. పంచభూతాలైన భూమి, నీరు,  కాంతి,  వాయువు,  ఆకాశం ఇవన్నీ ప్రతి వ్యక్తి కదలికకు, చేసే తప్పులకు, చేసే మంచి పనులకు కూడా సాక్ష్యులుగా ఉంటాయి. ఆత్మః పాపాత్మైవ ప్రకాశయతి పాపం చేసే వ్యక్తి మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుందట. తను చేసిన తప్పు ఎవరూ చూడకపోయినా, ఎవరికీ తెలియక పోయినా తప్పు చేశాను కదా అనే భావన మనసులో ఉంటుంది.  ఈ భావన అనేది ఎప్పుడూ మనసులో గుర్తుకువస్తూ మనశాంతి లేకుండా చేస్తుంది.  దీని వల్ల మనసు కూడా నిలకడగా ఉండదు. ఎవరైనా తప్పుగా సాక్ష్యం చెబితే.. తప్పుగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు కొందరు. దానివల్ల వారికి కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని అలా చేస్తారు. లేదా కొన్ని సార్లు తప్పు సాక్ష్యం చెప్పడం వల్ల తనకు కావలసిన వారు సమస్యల నుండి బయటపడతారని అనుకుంటారు.  కానీ ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు నరకానికి వెళతారని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.  అలాంటి వ్యక్తులు అశాంతితో రగిలి పోవడమే కాకుండా.. వారిని ఎప్పుడూ సమస్యలు చుట్టు ముడతాయట. కాబట్టి అబద్దాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం జీవితంలో వ్యక్తిని పతనానికి తీసుకెళుతుందని.                                               *రూపశ్రీ.  

టీనేజ్ అబ్బాయిలు ఒంటరితనం ఫీలవుతారా? అసలు నిజాలు చెప్పిన మాజీ ఐఏఎస్...! 

  సాంకేతికతతో బాగా అనుసంధానమయ్యి, చుట్టూరా స్నేహితులు ఉండే తరం అయినప్పటికీ, ఇప్పటి యువత ఎక్కువగా ఒంటరితనం ఫీలవుతున్నారు. వినోద కార్యక్రమాల్లో  పాల్గొనటంలోనూ, సరదా సందళ్లలోనూ ముందున్నప్పటికీ  టీనేజ్ అబ్బాయిలకి   ఒంటరిననే భావన   ఎందుకు వస్తుంది? అని మీరు   అనుకుంటున్నారా..!   అయితే దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ మాజీ ఐఏఎస్ అధికారయిన వికాస్ దివ్యకీర్తి  వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను ప్రస్తావించారు.  అందులో ఒకటి ‘కుటుంబ ఒత్తిడి’.. మీరు ఓ టీనేజ్ కొడుకు తల్లిదండ్రులైతే, అతను  ఒంటరితనం ఫీలవ్వటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు ఈ టీనేజ్ అబ్బాయిల్లో ఒంటరితనం ఎందుకు పెరుగుతోందో తెలుసుకుందాం.. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఒత్తిడి: వికాస్ దివ్యకీర్తి  చెప్పినట్లు,  ‘కుటుంబానికి  మద్దతుగా నిలబడాల్సింది అబ్బాయిలే అన్న మాటని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బయటవాళ్లు అందరూ కలిసి,  ప్రతీ మగపిల్లాడికి  చిన్న వయస్సు నుంచే నూరిపోస్తారు.  తల్లిదండ్రులు వారికి ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుంటారు కూడా.  తల్లిదండ్రుల రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా కుటుంబాన్ని నిర్వహించాలనే బాధ్యత అబ్బాయిలకే ఉంటుంది. ఈ ఆలోచనలతో వచ్చే  తీవ్రమైన ఒత్తిడి వల్ల చదువులో వెనకబడితే వారి  జీవితం ఏమైపోతుందోనన్న మానసిక ఆందోళన ముందునుంచే  పట్టుకుంటుంది. తాము చదవలేకపోతున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు బయటకి చెప్పుకోలేరు.  దీనివల్ల వారికి మానసిక ఒత్తిడి, ఒంటరిననే భావన  పెరిగిపోతాయి.' 13-19 వయస్సులో పిల్లలు ఎందుకు ఒత్తిడిని అనుభవిస్తారు? వికాస్ దివ్యకీర్తి ప్రకారం, 13-19 వయస్సు గల పిల్లలు ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే ఈ వయసులోనే వాళ్ళు  భవిష్యత్తు కోసం పెద్ద చదువుల వైపు వెళ్ళటమో లేదా  పనిచేయడం ప్రారంభించటమో చేస్తూ ఉంటారు.  కుటుంబ బాధ్యతల ఒత్తిడి కూడా వారికి ఉంటుంది.  తాము పడుతున్న ఈ ఆందోళనలన్నీ తరచుగా ఎవరికీ చెప్పుకోలేరు.  అందువల్ల వారు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. టీనేజ్ పిల్లలలో తిరుగుబాటు స్వభావం: 13-19 వయస్సు గల టీనేజ్ అబ్బాయిలు సహజంగా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. మానసికంగా ఎదిగీ ఎదగని వయసు కావటంతో ఈ సమయంలో వారి మనస్సులో అనేక ప్రశ్నలు ఉంటాయి.  కానీ వాటికి సమాధానాలు ఏవీ దొరకవు. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఈ దశలో తమ పిల్లల భావాలను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. అక్కచెల్లెలు ఉన్న వారే అదృష్టవంతులు: వికాస్ దివ్యకీర్తి ప్రకారం, తమ వయస్సుకి ఇంచుమించు  సమాన వయస్సున్న  అక్క లేదా చెల్లెలు ఉన్న అబ్బాయిలు అదృష్టవంతులు. అలా సమవయస్కులైన అక్కచెల్లెళ్లు అత్యంత సన్నిహితమైన స్నేహితుల్లా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అబ్బాయి నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా  తమ భావాలను, భయాలని వాళ్ళతో చెప్పుకోవచ్చు.  అక్కచెల్లెలు శ్రద్ధగా వినడమే కాకుండా నిజాయితీగల సలహా కూడా ఇస్తారు. ఇలా అక్కచెల్లెలుతో మాట్లాడటం అబ్బాయి మనసు భారాన్ని తగ్గించి, ఒంటరితనాన్ని తగ్గించగలదు.  టీనేజ్ పిల్లల ఒంటరితనాన్ని ఎలా తగ్గించాలి? అనే విషయంలో నిపుణులు తెలియచేసిన కొన్ని సూచనలు:  1.మీ పిల్లలు ఎటువంటి  భయం లేకుండా తమ భావాలను చెప్పుకునేలా తల్లిదండ్రులు ఒక స్నేహపూర్వక వాతావరణం కల్పించి, పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవాలి.  2.మీ పిల్లలు మీ దగ్గరకు ఏదైనా చెప్పుకోవటానికి రాకముందే, వారి సామాజిక జీవితాన్ని  గమనించండి. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.  3.సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగిస్తున్న విధానం మీద ఒక కన్ను వేసి ఉంచి, ఆరోగ్యకరమైన సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించండి.  స్క్రీన్ టైమ్‌ను తగినట్టు సర్దుబాటు చేసి,  వారి ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా  చూడడి.  4.పిల్లలకు చెడు సావాసాలకి దూరంగా ఉంటూ, మంచి సంబంధాలను ఏర్పర్చుకోవటం నేర్పించండి. అలాగే  ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పరిస్థితులకి క్రుంగిపోకుండా  ఎలా నిలబడాలో నేర్పించండి.                                                *రూపశ్రీ.

ఈ  పనులు చేస్తే చాలా తొందరగా విజయం మీ సొంతం అవుతుంది..!

విజయం ఒక మనిషిని మరొక మెట్టు పైకి తీసుకెళుతుంది.  ప్రతి వ్యక్తి తాము ఎంచుకున్న రంగంలో, చేసే పనిలో  విజేత కావాలనే కలలు కంటారు.  అయితే కలలు కన్నంత సులువుగా అవి నిజం కావు.. వాటిని సాకారం చేసుకోవడం అనేది కొందరికే సాధ్యం అవుతుంది.  అయితే కేవలం 5 పనులు చేస్తే చాలు.. ప్రతి వ్యక్తి తను అనుకున్న పనులలో విజయాన్ని చాలా తొందరగా అందుకుంటాడని అంటున్నారు. ఇంతకీ ఆ పనులు ఏమిటంటే.. కష్టం.. విజయం సాధించాలన్నా, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా కష్టపడి పని చేయాలని అందరూ అంటారు.  చాలామంది విజయం కోసం కష్టపడతారు.  అయినా సరే  వారికి కూడా విజయం దక్కదు. ఎందుకని వారికి వారే ప్రశ్నించుకుని సతమతం అవుతారు. కాన ఈ 5 పనులు చేస్తే  విజయం సులువుగా తథ్యం అవుతుంది. లక్ష్యాలు.. విజయం సాధించాలంటే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.  ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఏ పని చేసినా అది స్పష్టత లేకుండా ఉంటుంది.  అందుకే లక్ష్యాన్ని నిర్థేశించుకున్న తరువాత చేసే పని తొందరగా పూర్తీ చేయవచ్చు. ప్లానింగ్.. పనిలో విజయం సాధించాలంటే లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తరువాత దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం.  ప్రణాళిక ఉంటే పనిని ఒక క్రమ పద్దతిలో  పూర్తీ చేయవచ్చు. దీని వల్ల సమస్యలు కూడా పెద్దగా అడ్డు రావు. యాక్షన్.. పనిని మొదలు పెట్టాలి అనుకున్న తరువాత ప్రణాళిక తయారు చేసుకున్న తరువాత  దాన్ని వెంటనే మొదలు పెట్టాలి.  రేపు,  ఎల్లుండి అని దాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేయకూడదు. దీని వల్ల పని భారం పెరగదు. సమయం.. విజయం సాధించడంలో సమయం కీలక పాత్ర పోషిస్తుంది.  సమయానికి విలువ ఇచ్చే వ్యక్తి  విజయం సాధిస్తారు.  పనిని ప్రణాళిక పరంగా పూర్తీ చేయగలరు. యాక్టివిటీ.. చురుగ్గా ఉండటం వల్ల పనులు సులువుగా చేయగలుగుతారు. పనులలో విజయాన్ని సాధించడానికి వ్యక్తులు చురుగ్గా ఉండటం చాలా అవసరం.   ఇందుకోసం మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాలి. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు. వీటిని చేసే పనిలో అమలు చేస్తే విజయం సాధించడం సులభం.                                       *రూపశ్రీ.

పేరెంట్స్ జాగ్రత్త.. తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవీ.. !

పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు.  తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా  అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు.  కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి.  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు.  చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి.  అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు.  ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. గౌరవం.. ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు.  ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు.  బయటి వారి నుండి పెద్దలు,  కుటుంబ సభ్యులు,  చివరకు భార్య,  పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు.  కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా,   అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం.. కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి.  తన భాద్యతగా భార్య, పిల్లలు,  తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది.  పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు. ఇతరుల మాట వినడం.. తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట,  తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి.  ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు. శారీరక శ్రద్ద.. ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి.  ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ,  మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక,  ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి. ఇంటి పనులు.. కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి..  ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ  ఇంటి పనులు చక్కబెడుతుంటారు.  మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.                                                  *రూపశ్రీ.

వ్యసనాలకు విడాకులిచ్చేద్దాం!

ప్రస్తుత కాలంలో మనుషులకు ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా కొత్త ఆహారపదార్థం లేదా కొత్త స్టైల్ ను అనుసరించడం ఇంకా ఇంకా కొత్తదనం అనుకుంటూ వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ ఉండటం అలవాటు. అలాంటి కొత్తదనం వెంట పరుగులుతీసే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో లేదా అంతకు మించి విషయాల్లో ఎక్కువగా మునిగిపోతుంటారు. ఆ విషయాల గురించే తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళు అవుతుంటారు. అలాంటి పిచ్చిని వ్యసనం అని కూడా అనొచ్చు. ఈ వ్యసనం చాలామందిలో, చాలా విషయాల్లో ఉన్నట్టు, చాలా రకాలుగా కూడా ఉంటుంది. అయితే ఆ వ్యసనం జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అంతలా జీవితాన్ని తికమకలోకి నెడుతున్నా ఒత్తిడికి లోనవుతూ కూడా ఆ వ్యసనాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వ్యసనం మరి.  ఈకాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు, ఫుడ్ విషయంలో, తాత్కాలిక సంతోషాన్నిచ్చే విషయాలకు, ఇంకా మనుషులకు, కొన్ని విచిత్రమైన అలవాట్లకు, మగవాళ్ళు అయితే ధూమపానం, మద్యపానం, అమ్మాయిలు అయితే షాపింగ్, మేకప్ ఇలా చాలా విషయాలను అతిగా ఇష్టపడుతూ వాటికి వ్యసనపరులుగా  మారిపోతున్నారు. అలా మారినవాళ్ళు కూడా చాలామంది ఉంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో.  దేన్నైనా జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవడం మంచిదే కానీ జీవితమే ఆ విషయానికి అంకితం చేసేయ్యకూడదు. అలా చేస్తే జీవితమంతా కల్లోలమే కదా!!  అలాంటి కల్లోలాన్ని తప్పించుకోవాలంటే వ్యసనానికి  విడాకులు ఇచ్చేయ్యాలి.  పరిధులు, పరిమితులు! మనిషి ఆలోచనలకు ఒక పరిధి ఉన్నట్టే అలవాట్లకు కూడా ఒక పరిధి  ఉంటుంది. ఆ పరిది దాటిపోతే మనిషి పరిమితులు కూడా అస్తవ్యస్తం అవుతాయి.  నిజానికి మనిషి స్థాయిని బట్టి పరిమితులు కూడా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తం అయితే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటన్నిటినీ ఒకటికీ రెండు సార్లు విశ్లేషించుకుంటూ ఉంటే వ్యసనం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ప్రతి విషయానికి ఒక పరిధి నిర్దేశించుకుంటూ ఉంటే అది అతిగా మారదు. భోజనం చేసేటప్పుడు కళ్లెదురుగా నచ్చిన పదార్థం ఎంతున్నా అది కడుపు నిండేవరకు మాత్రమే తినగలం, అలా కాదని ఎక్కువ తింటే రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా ఒక పదార్థాన్ని మితంగా తింటే హాయిగా ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం తినేస్తే అజీర్తి, దాని వెంట మళ్లీ అనుబంధంగా బోలెడు సమస్యలు కూడా వస్తాయి. తీపి పదార్థాలు ఇష్టమని అతిగా తింటే చెక్కర వ్యాధి శరీరాన్ని కబళించి ఇక మళ్లీ తీపిని కన్నెత్తి చూడనివ్వని పరిస్థితికి నెట్టేస్తుంది. మార్పు కోసం మంత్రం! వ్యాసనాల బారినపడ్డవారికి వాటి నుండి బయటకు వచ్చేయ్యాలి అని ఉన్నా గట్టిగా దాన్నుండి దూరం కాలేరు. మనసు నిలకడ లేనితనం దానికో పెద్ద కారణం.  నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దానిమీద గట్టిగా నిలబడటమే కొంచం కాదు చాలా కష్టం. అయితే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లవాడి వేలుకు వేపనూనె పూస్తే వాడు నోట్లో వేలు పెట్టుకోవడానికి ఎలా భయపడి ఆ అలవాటు నుండి దూరమవుతాడో అలాగే వ్యసనం అనుకున్న  విషయం నుండి దూరమవ్వడానికి ఏదో ఒక పరిస్థితిని అడ్డు కల్పించుకుంటూ ఉండాలి.  "పిల్లాడంటే తెలియని అమాయకుడు, పెరిగి పెద్దయిన ఈ ఉద్దండుల సంగతేంటి??" అనే ప్రశ్న గనుక వస్తే ఈ పిచ్చి మనసును బుజ్జగించడం అంతే సులువేమీ కాదు. కాబట్టి ఒకపని తప్పించుకోవాలి అంటే మరొకపనిని తప్పనిసరిగా, తప్పకుండా చెయ్యాల్సిన పనిగా ఒక లక్ష్యంగా ముందేసుకోవాలి. అప్పుడే అనుకున్నది సాదించగలం. ఊగిసలాట వద్దు! ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మళ్లీ ముందుకూ వెనక్కు మనసును ఊగించకూడదు. మొదట్లో అలా వ్యసనంగా మారిన పని నుండి, విషయం నుండి దూరంగా ఉంటున్నందుకు అసహనంగానూ, బాధగానూ ఉన్నా అది మెల్లిగా తగ్గుతూ మరొకవిషయంలో మనసును లీనం చేస్తుంది. కాబట్టి ఊగిసలాట ఇక్కడ అసలు ఉండకూడదు. చాలామంది నిర్ణయాలు తీసుకుని, దారులు మార్చుకుని, పట్టుమని నిమిషాలు గంటలు కూడా కాకముందే చేతులెత్తేస్తారు. అలా కాకుండా మెల్లి మెల్లిగా ఆ పనికి తక్కువ సమస్య కేటాయిస్తూ వెళ్తే ఆ వ్యాసనమనే భూతం నుండి తప్పించుకోవడం పెద్ద సమస్యేమీ కాదు! కాబట్టి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ఏ సమస్యనూ, వ్యసనంగా మార్చుకోవద్దు, వ్యసనంగా మారిన దేన్నీ భరించద్దు దానికి వెంటనే మార్పు అనే మంత్రంతో విడాకులు ఇచ్చేయండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

రాజస్థాన్ కు చెందిన ఈ రాణి గారి కోపం గురించి వెంటే షాకవుతారు..!

రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే.. ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు. మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.   రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.                                            *రూపశ్రీ.

బాధ్యతల బండిని నడిపే మగమహారాజులకు ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు..!

మగవాడు... ఈ పదం ఏమీ పెద్ద బిరుదు కాదు కానీ, పుట్టిన తర్వాత  బాధ్యతగా పెరిగి, తన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమార్గంలో నడిపించటానికి పాటుపడుతున్న ప్రతివాడూ మగాడే.. మొనగాడే... అటువంటి వారిని గుర్తించి,  వాళ్ళని అలా మార్చే విషయాల గురించి, అలా మారకుండా చేసే విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మగాడు సరిగా లేకపోతే.. అంటే బాధ్యతగా లేకపోతే అతని కుటుంబం, కుటుంబ సభ్యులు మానసికంగానూ, ఆర్థికంగాను, సామాజికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయపరంగా  వారు  చేస్తున్న సేవలను  జ్ఞాపకం చేసుకోవడమే లక్ష్యం.  పురుషులు సమాజంలో తీసుకొచ్చే మంచి మార్పులని గుర్తు చేసి, వారిని ఆదర్శంగా చూపించే వీలు కల్పించే రోజు ఇది.   పురుషుల భావోద్వేగ స్వేచ్ఛ, పెరుగుతున్న  పురుషుల ఆత్మహత్యలు  వంటి అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి వేదికగా నిలుస్తుంది.  పురుషులు కూడా ఇతరుల మాదిరిగా మామూలు మనుషులేనని, వారికీ బాధ, నిరాశ కలిగినప్పుడు భావోద్వేగ మద్దతు అవసరమే అని  సమాజం గుర్తించేలా ప్రేరేపిస్తుంది.  సమాజంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన కొన్ని భావనలు, పురుషులు తమ  భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటపెట్టనివ్వకుండా చేస్తున్నాయి.  ‘మగ పిల్లాడు ఏడవటం ఏంటిరా? చూస్తే నవ్వుతారు’ అంటారు చాలా మంది. దాంతో వాళ్ళు తమ బాధ బయటపెట్టరు.   ఇది వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకే మగాళ్ళు చాలా కరుకు స్వభావం కలిగి ఉంటారు అంటారు. ఈ సమస్యలను గుర్తించటం ద్వారా  ఇంటర్నేషనల్ మెన్స్ డే మగావారి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది. కుటుంబంలో, వివిధ రంగాల్లో,   సమాజంలో పురుషులు అనేక పాత్రలను పోషిస్తారు. కంటికి రెప్పలా కాపాడే  తండ్రిలా, మద్దతు ఇచ్చే అన్నగా, నమ్మకమైన స్నేహితుడునిగా, ప్రేమించే భాగస్వామిగా, సమాజంపట్ల బాధ్యత ఉన్న మనిషిగా పురుషులు చుట్టూ ఉన్నవారి కోసమే జీవితాన్ని   వెచ్చిస్తారు. ఇంత చేసినా వారి కృషి, త్యాగానికి అంతగా   గుర్తించబడవు. మెన్స్ డే ఈ విషయాలను గుర్తించేలా చేస్తుంది. పురుష దినోత్సవం సందర్భంగా కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని  ప్రధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.. నైతిక విలువలు, బాధ్యతలు కలిగిన మగవారిని గుర్తించి, వారిని ఆదర్శంగా చూపించడం. ఇలా చేయడం వల్ల మగవారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుంది.     స్త్రీ, పురుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రోత్సహించటం. ఇలా చేస్తే ప్రతి మగవాడి నుండి స్త్రీ కి సంరక్షణ, సహాయ సహకారాలు అందుతాయి. పురుషులు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేయడం  ప్రధానం. కుటుంబ జీవితంలో, పనిచేసే చోట, బయట సమాజంలో   పురుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర అనేక సమస్యల గురించి అవగాహన కల్పించటం. ఇది మగవారిలో నిగూఢంగా దాగున్న శక్తిని, వారి మానసిక స్వభావాన్ని బయటపెడుతుంది. మన సమాజం పురుషాదిక్యంలా కనపడుతున్నప్పటికీ బాధపడుతున్న, అణచివేయబడుతున్న అమాయకపు పురుషులు కూడా ఉంటారు, చాలాసార్లు తప్పుడు ఆరోపణల వల్ల  వాళ్ల జీవితాలనే కోల్పోతుంటారు. అటువంటివారిని కాపాడేందుకు  న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రధానంగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. గణాంకాల ప్రకారం, పురుషులు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.  వైద్య సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. అందుకే మెయిన్స్ డే రోజు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టటం వంటి విషయాలపై చర్చలను ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ మెన్స్ డే కేవలం పురుషులకే సంబంధించినది కాదు,  ఇది లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.  అప్పుడే  పురుషులు, స్త్రీలు కలిసి శాంతి కోసం, ప్రగతి కోసం  పనిచేస్తారు. ప్రతిమగవాడు తనకు  ఒక కుటుంబం ఏర్పడ్డాక తన జీవితాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తాడు. కుటుంబ సంతోషమే తన సంతోషం అని అనుకుంటాడు. తల్లి పడే కష్టం పిల్లల కాళ్ళ ముందు కనబడితే తండ్రి కష్టం కనిపించదు. అలా మగవాడి కష్టం బయటకు కనిపించదు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా తనను తాను కోల్పోయే మగాళ్ళు ఎప్పుడూ గౌరవించబడాలి. అలాంటి మగ మహారాజులకు అందరికీ హ్యాపీ మెన్స్ డే..!                                 *రూపశ్రీ 

సమస్యలొచ్చినప్పుడు మీరూ ఇలాగే చేస్తారా?

మనం ఎప్పుడూ సమస్యల నుండి పారిపోవాలని చూస్తాం. ఆ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాం. కొన్నిసార్లు కారణాలు సృష్టించుకుంటాం. ఇలా మన మనస్సు ఏర్పరచుకునే మరొక రక్షణ పద్ధతి అసలెటు వంటి సమస్యా మనకు లేదని అనుకోవడం! ఉదాహరణకు సమస్యతో సతమతమవుతున్న ఒక వ్యక్తిని చూడండి. అతడు చాలా అశాంతిగా, బాధతో ఉంటాడు. అతని కళ్ళల్లో అలజడి కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా స్థిరంగా కూర్చోలేడు. చేతివేళ్ళను మాటిమాటికీ లాగుకుంటాడు. కాళ్ళను ఊపుతుంటాడు. అప్పుడప్పుడు నిట్టూర్పులు విడుస్తుంటాడు. ఇవన్నీ చేస్తున్నా బయటికి అందరితో తనకేమీ సమస్య లేదని అంటాడు. సమస్యను తిరస్కరించడమంటే ఇదే! తనను తానే మోసగించుకుంటున్నానన్న విషయం అతనికర్థం కాదు. అభద్రతా భావాలతోనూ, సందేహాలతోనూ కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇలాంటి పద్ధతి అవలంబిస్తాం. 'సమస్యలు లేవు' అని అనుకుంటే వాటిని ఎప్పుడూ  పరిష్కరించలేమన్న విషయం మరచిపోతాం. మొట్టమొదట సమస్య ఉన్నదన్న విషయాన్ని అంగీకరించాలి. మనం పిరికివాళ్ళం, బలహీనులం అయినందు వల్ల సమస్యలను తిరస్కరించడానికి 'వంద' మార్గాల్లో ప్రయత్నిస్తాం. లోలోపల అభద్రతాభావం ఉన్నా, పైకి అదేమీ లేనట్లుగా ఉంటాం. దాన్ని అంగీకరించం. దానికి బదులుగా అది లేదని బుకాయిస్తాం. అంతేకాదు, మనం చాలా శక్తిమంతులమైనట్లూ, పూర్తి భద్రతతో ఉన్నట్లు నటిస్తాం. సమస్య లేదని అనుకోవడం ఒక 'నిప్పుకోడి' ప్రవర్తించే విధంగా ఉంటుంది. తనను తినడానికి ఏదైనా జంతువు వస్తున్నదని చూడగానే, 'నిప్పుకోడి' తన తలను ఇసుకలో దూరుస్తుంది. అదేవిధంగా మనకు ఎవరిపైనైనా కోపం వస్తే, వారి నుంచి దూరంగా ఉందామని అనుకుంటాం. కానీ లోలోపల వారంటే అసలు ఇష్టమే ఉండదు. ఉడుక్కు పోతుంటాం. మనకు ఎవరిపై కోపం వచ్చిందో, ఆ వ్యక్తిని అసలు లెక్కచేయమని పైకి అన్నా, వ్యక్తపరచని కోపం మనల్ని నియంత్రిస్తుంది. లోపల మండిపోతూ, పైకి మాత్రం ప్రశాంతంగా, మంచివాడిగా ఉండడమన్నది కపటానికి గొప్ప నిదర్శనం. ఈ విధంగా హృదయంలో వంచన ప్రారంభమై, మన నైతిక జీవనాన్ని నాశనం చేస్తుంది. మానసిక తత్త్వశాస్త్రంలో దీనికొక ఉదాహరణ తరచూ చెబుతారు. ఒక త్రాగుబోతు వాని కొడుకు, తన తండ్రి త్రాగుబోతు అని అంగీకరించకపోవచ్చు. తండ్రి మద్యం త్రాగి క్రింద పడిపోతే, అనారోగ్యం వల్ల ఆయన ఆ విధంగా పడిపోయాడని ఇతరులు నమ్మాలని అతని కొడుకు అనుకుంటాడు. అంతే కాదు, తన తండ్రి అనారోగ్యానికి మందులు వేసుకున్నాడని కూడా అనవచ్చు. వాస్తవాన్ని అంగీకరించలేక దానిని పెడదోవ పట్టిస్తాడు. ఇదే విధంగా మన మనస్సు కూడా జీవిత సమస్యల నుండి తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులను, మార్గాలను అవలంబిస్తుంది. పైన చెప్పిన దానికి వ్యతిరేకమైనది నిష్కాపట్యం. మనస్సులో ఉన్నదే చెప్పగలగడం, చెప్పిందే చేయగలగడం మనస్సు యొక్క మంచి లక్షణం. దృఢమైన మనస్సే ఇలా చేయగలదు. ఆ విధంగా సమన్వయమైన మనస్సు ఎలాంటి సందిగ్ధాలకూ లోనుగాక ప్రశాంతంగా ఉంటుంది.  కాబట్టి మనిషి ఎప్పుడూ నిష్కపటంగా తన సమస్యలను అంగీకరిస్తూ వాటిని అధిగమించాలి. అంతేకానీ తనకు సమస్య లేదని బయటకు చెబుతూ సమస్య నుండి పారిపోకూడదు.                                     ◆నిశ్శబ్ద.

మీ ఆర్థిక సంవత్సరం ఎలా ఉంది??

ఏముంది  జీవితంలో నెలనెలా సంపాదన, ఖర్చులు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ ఫాస్ట్ కొడుతూ ఉంటాయి. ఇది ప్రతి నెలా ఉండేదే అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అనిపించవచ్చు. అయితే  ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సంవత్సర ముగింపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉంటుంది. ఈ మార్చ్ నెలలోనే బడ్జెట్ లు నిర్ణయించబడతాయి.  పన్నులు, ఖర్చులు, మిగులు, ఆదాయం, నిధుల కేటాయింపు ఇలా అన్నిటికీ ఈ మార్చ్ నెల మూల కేంద్రకంలా ఉంటుంది.   ప్రభుత్వాలు ఆర్థికపరంగా సాగడానికి ఈ ప్రణాళికలు ఎంత మేలు చేస్తాయో దీని వల్ల అర్థమవుతూనే ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఇలాంటి ఆర్థిక ప్రణాళిక ఒకటి ఎందుకు ఏర్పాటు చేశాకోకూడదు అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది?? కుటుంబానికో అర్గిక ప్రణాళిక!! ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా వరకు అందరి విషయంలో జరుగుతూ ఉండేవి అయినా అవన్నీ అనుకోవడంతోనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నోటి లెక్కల్లో ఆర్థిక సంస్కరణలు లాగే కుటుంబాలే బోలెడు. అలాంటి కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఒక స్లోగన్ పట్టుకోవాలి, ఆ స్లోగన్ ప్రకారం దారి మార్చుకోవాలి.  కొత్తకొత్తగా ఉన్నదీ!!  నిజంగానే కొత్తగా ఉండాలి, అప్పుడు అలాగే పాడుకోవచ్చు, ఆర్థిక ఖంగారులు లేకుండా ఆస్ట్రేలియాలో గంతులేసే కంగారుల్లా ఉల్లాసంగా ఉండచ్చు.  ప్రతి ఒంట్లో సంవత్సరం వారీ పెద్ద పెద్ద ఖర్చుల సందర్భాలు మామూలుగానే వస్తుంటాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత పిల్లల చదువు"కొనడానికి" అదే అదే చదువు కోసం పెట్టె ఖర్చు అన్నమాట. ఏడాదికో మారు పిల్లల ఫీజు, పుస్తకాల ఖర్చు మొదలైనది. ఆ తరువాత ఇన్సూరెన్స్ ల కహానీ. ఏడాదికోసారి ఇంట్లో ఇన్సూరెన్స్ కట్టే సమవమ్ వచ్చినప్పుడు మధ్యతరగతి జీవులు పడే తంటాలు అంతా ఇంతా కావు. ఈ ఇన్సూరెన్స్  ల కోసం నెలవారీ సంపాదనలో కొద్దిగా ముందుజాగ్రత్తగా తీసిపెడుతుంటే సంవత్సరానికోసారికి పడే టెన్షన్ హుష్ కాకి. పండుగలు, పుట్టినరోజులు అన్ని ఇళ్లలో తీసుకొచ్చే సందడి ఎంతో గొప్పది. అయితే చాలామంది అలాంటి సందడిని కాస్త అసంతృప్తితోనే గడిపేస్తూ ఉంటారనేది నిజం. బాగా డబ్బున్న వాళ్లే ఇలాంటి సంతోషాల్ని ఆర్థికంగా కూడా ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు ఉన్నదాంతో తృప్తిపడటమనే మాటను పెద్దలు చెప్పి, పాటించేవాళ్ళు, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. కానీ ఇప్పట్లో ఉన్నదాంట్లో తృతీ పడాలి అనే మాట వింటే కాంప్రమైజ్ అవుతున్నట్టు, తమని తాము మోసం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు కాబట్టి ఇప్పట్లో తృప్తి లభించాలి అంటే ఆర్థిక స్థాయిలు ఎక్కువగానే ఉండాలి. పొరపాట్లు తలపోట్లు!! చాలామంది ఆర్థిక పరంగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన ప్లానింగ్ లేకుండా చాలా ఖరీదైన వస్తువులు ఇన్స్టల్మెంట్ లలో  కొనడం, వడ్డీ శాతం గురించి సీరియస్ నెస్ లేకుండా బంగారు నగలు తాకట్టు పెట్టడం, కారణం లేకుండా షాపింగ్ చేయడం, సరదాకు, మోహమాటాలకు వేల రూపాయల ఖర్చులు చేసేయ్యడం. సాధ్యాసాద్యల ఆలోచన లేకుండా అప్పులు చేయడం. ఇలాంటి వాటి వల్ల ఉన్న కాసింతలో సర్దుకుపోవడం అనే తృప్తి కూడా ఉండకుండా దూరమైపోతుంది. అలాంటి ఇబ్బందుల అసంతృప్తులు ఇంట్లో ఒకరిమీద మరొకరు చూపించుకుంటూ తలపోటు తెచ్చుకుంటారు. ఆర్యోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాని అందరూ దాన్ని కొంటున్నారు. రెండింటికి తేడా ఏంటి అంటే?? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, శారీరక వ్యాయాయం ఉంటే ఆరోగ్యమదే మెరుగుపడుతుంది. కానీ అవేమీ లేకుండా లైఫ్ స్టైల్ ను మార్చుకోకుండా కృత్రిమ మందులు వాడితే ఆరోగ్యం బాగైపోతుందని ప్రోయిన్లు, వితమిన్లతో సహా అన్నిటినీ టాబ్లెట్స్ రూపంలో కొని వాడితే ఆయుష్షు తగ్గుతుంది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లలో ఒకో శాఖకు ఇంత అని నిధులు కేటాయించినట్టు. మనము కూడా మన సంపాదనను అనుసరించి విద్య, ఆరోగ్యం, వైద్యం, సంతోషాలు, ప్రత్యేకతలు వంటి వాటికి ప్రధాన్యతలు ఇచ్చుకుంటూ ఉంటే మన సంవత్సరం కూడా ఆర్థిక భరోసాతో నడిచేస్తుంది.  ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తమ సంపాదనతో తృప్తి పడేవాళ్ళు అన్నిటినీ హ్యాండిల్ చేసుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.  

హనీమూన్ వెళ్తే ఈ 5 తప్పులు చేయకండి.. మీ లైఫ్ ఖతం..!

పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు  అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం,  బంధువులకు దూరంగా.. కొత్త జంట  ఒకరినొకరు తెలుసుకోవటానికి,  అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన  సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే  వేరే విషయం. కానీ పెద్దలు  కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు  ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా  లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం  సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది.  హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే.. పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు.. పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.  రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి  ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి  అస్సలు మాట్లాడొద్దు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు. గతాలు వద్దూ.. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు.  ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి. వాదన వద్దూ.. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు  ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం.  హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది. గదికే పరిమితం కావద్దు.. హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు.  అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.                                           *నిశ్శబ్ద.

దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని అందించిన గురునానక్ జయంతి నేడు..!

  దారి తప్పినప్పుడల్లా మనల్ని సన్మార్గంలో నడిపించటానికి గురువు అవసరం. అలాంటి గొప్ప గురువులలో ఒకరైన గురునానక్ జయంతి నేడు. గురునానక్ జయంతి సిక్కులకి అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి.  సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతినీ  ఒక పండుగలా జరుపుకుంటారు.  సిక్కులకే కాకుండా గురునానక్ బోధనలు  ప్రజలందరికీ, మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విలువలు నేర్పిస్థాయి. ఈ రోజును గురు పురబ్, గురునానక్ ప్రకాశ్ ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగుతుంది. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతి జరుపుకుంటున్నారు. గురునానక్ 1469 లో తల్వండిలో జన్మించి, చిన్న వయస్సులోనే  ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి కనబర్చారు. ఇతరులకి సాయం చేయాలనీ ఆయనకు ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఆధిపత్యం వహించిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతం ముందడుగు వేసింది. గురునానక్ స్థాపించిన సిక్కిజం, వినయాన్ని, సేవను, దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించే దిశగా సాగింది.  గురునానక్ జయంతి ప్రాముఖ్యత .. గురునానక్ జయంతి అంటే కేవలం గురునానక్ కు నివాళి కాదు, అది ఆయన బోధనలకు ఇచ్చే గౌరవం. ఇది విశ్వ సోదరభావం, కరుణ,  సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. సిక్కులకు, గురునానక్ ప్రతిపాదించిన ఏకమతం, భక్తి సూత్రాలను గుర్తు చేస్తుంది. "ఇక్ ఓంకార్" అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఆయన సందేశం.  సిక్కిజానికి ఈ సందేశం కేంద్ర బిందువుగా ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఏకదైవవాద దేవుని ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు.  గురునానక్ జయంతి ఎలా జరుపుకుంటారు? గురునానక్ జయంతిని భారతదేశంలోనే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  సిక్కు ప్రజలందరూ గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ‘అఖండ్ పాఠ్’, అంటే గురు గ్రంథ్ సాహిబ్  నిరంతర 48గంటల పఠనం గురుద్వారలో ప్రారంభమవుతుంది. భక్తులు తెల్లవారుజామున ప్రార్థనలు, ‘నగర కీర్తన’  అని పిలువబడే ఊరేగింపులో పాల్గొంటారు, ఇందులో గురుగ్రంథ్ సాహిబ్‌ని ఒక పల్లకిలో ఉంచి వీధుల్లో తీసుకువెళతారు. ఊరేగింపు సమయంలో కీర్తనలు, సిక్కు యోధులు నిర్వహించే ‘గత్కా’  అనే యోధకళా ప్రదర్శనలు ఉంటాయి. ‘లంగర్’, అంటే ఉచిత సామూహిక భోజనం.  ఈ వేడుకలో ఇదే ప్రధాన భాగం. మతం, కులం లేదా లింగం ఇలా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే లంగర్, గురునానక్ విలువలైన  సమానత్వం, సేవా గుణాలను  ప్రతిబింబిస్తుంది.  గురు నానక్ బోధనలు.. గురునానక్ బోధనలు సులభంగ ఉంటూనే లోతైన అర్థం కలిసి ఉంటాయి.  అన్ని విశ్వాసాల ప్రజలకు సంబంధించినవి. ఆయన బోధనలలో ప్రధానంగా మూడు సూత్రాలు ఉన్నాయి:   దేవుని పేరును జపించడం  ‘నిజాయితీగా సంపాదించడం ఉన్నది ఇతరులకు కొంత పంచడం.  ఇలా..  వినయము, నిజాయితీ,  దయతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. ప్రజలంతా  దేవుని దృష్టిలో సమానమని, కులం వ్యవస్థ, లింగ వివక్ష వంటివాటిని తిరస్కరించారు.  గురునానక్ బోధనలు  ప్రుజలలో  దయ, సేవాభావం కలిగి ఉండాలని, దేవుని పట్ల భక్తితో జీవితం గడపాలని మార్గనిర్దేశం చేస్తాయి. గురునానక్ జయంతి మనకు సహనం, దానం, గౌరవించటం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతుంది.                                      *రూపశ్రీ   

ఇతరుల సొమ్ముపై అత్యాశ పడితే ఏమౌతుందో తెలుసా?

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో పురోగతి కోసం అనేక ఆలోచనలను అందించాడు. వాటిలో ఒకటి మరొకరి సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో ఉండకూడదు. ఒక వ్యక్తి దురాశతో ఇతరుల డబ్బుపై చెడు కన్ను వేయకూడదు. అది ఇతరుల సంపదపైనా లేదా డబ్బుపైనా, మనం దానిపై చెడు దృష్టి పెడతాము. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇతరుల సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము...? ఇప్పుడు తెలుసుకుందాం. ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది: చాణక్యుడు ప్రకారం, మితిమీరిన అత్యాశతో ఉన్న వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను లేదా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. జీవితంలో చాలా నష్టాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇతరుల సంపదపై: ఆచార్య చాణక్య మనం ఎప్పుడూ ఇతరుల సంపదపై అత్యాశకు గురికాకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దానితో మనం సంతృప్తి చెందాలి. మరి వారిలాగా ప్రగతి సాధించేందుకు కృషి చేయాలి. ప్రాణాపాయం: ఇతరుల సంపదపై అత్యాశతో ఉండటం ప్రమాదానికి దారి తీస్తుంది. మితిమీరిన కోరికతో ఇతరుల సంపదను అపహరించడానికి చెడు మార్గాలను ఆశ్రయించవలసి ఉంటుంది. దీని వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోవచ్చు. మనిషి జీవితంలో ఏది లభించినా దానితో సంతృప్తి చెందాలని చాణక్యుడు చెప్పాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే మనం సంతృప్తి చెందగలం, ఇతరుల డబ్బును దోచుకోవడం లేదా వారి డబ్బు కోసం అత్యాశతో కాదు.                                                 

బాలల వికాసమే మంచి సమాజ నిర్మాణానికి మూలం..!   

  సమాజమైనా, దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే  పూలమొక్కల్లాంటి పిల్లల్ని మనం చక్కగా కాపాడుతూ, వారిని విలువలవైపు నడిపిస్తూ, వారిలో అవకాశాలన్నీ అందిపుచ్చుకునే సామర్ధ్యం పెంచాలి. అప్పుడే ఈ లోకం అందమైన పూలతోటలా విస్తరిస్తుంది.  ఇదే నిజాన్ని పండిట్ జవహార్లాల్ నెహ్రూ నమ్మి, వారిని దేశ భవిష్యత్తుగా భావించి, వారి వికాసం కోసం కృషి చేశారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్14 తేదీన, సమాజానికి బాలల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వారి మౌలిక హక్కుల రక్షణకు ప్రతిజ్ఞ చేస్తూ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.  ఈ రోజు పిల్లల అభిరుచులు, అభివృద్ధి, వారి హక్కులు, అవసరాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో పిల్లలు దేశ భవిష్యత్తు. అందుకే వారి విద్య, సురక్ష, ఆనందంపై మనం కృషి చేయాలి. ప్రతి చిన్నారి భయపడి కాకుండా తన కలల్ని నిజం చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఆయన ఆశించారు. చిన్నారుల జీవితాలు ఆనందమయం కావడం మనందరి బాధ్యత. ఈ రోజు మన చిన్నారులకు ప్రేమ, అవగాహన, స్నేహం చూపించి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి. అలాగే సమాజంలో పిల్లలు ఎదుర్కునే సమస్యల గురించి కూడా అర్థం చేసుకోవాలి.  చిన్నారులు ఎదుర్కొనే సవాళ్ళు.. బాలల దినోత్సవం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే సవాళ్లను కూడా ముందుకు తీసుకువస్తుంది, వీటిలో పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ కొరత, శిశు కార్మికత్వం వంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా  తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలు, పాఠశాలకు వెళ్లాల్సింది పోయి చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాలల దినోత్సవం  ఈ సవాళ్లను పరిష్కరించేందుకు అవగాహన పెంపొందించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడం కోసం అందరూ కలసి చేపట్టవలసిన చర్యలను ప్రోత్సహిస్తాయి. బాలల ప్రాథమిక హక్కులు.. బాలల  దినోత్సవంలో  ప్రధానంగా  ఉన్నది  విద్యకున్న  ప్రాముఖ్యత  తెలియచేయటం.  పేదరికం  నుంచి బయటపడేందుకు, పిల్లలకు మంచి విద్య అందించడమే కీలకమైన మార్గం. పిల్లల నేపథ్యమేదైనా సరే, వారికి విద్య అనేది మౌలిక హక్కుగా పరిగణించబడుతోంది. పాఠశాలలు, చాలా సంస్థలు విద్యను సరదాగా నేర్చుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తాయి. విద్యతో పాటు, ఆట కూడా పిల్లల అభివృద్ధిలో విలువైన పాత్ర పోషిస్తుంది. వినోదాత్మక కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు పిల్లల సృజనాత్మకతను, సామాజిక నైపుణ్యాలను వెలుగులోకి తెస్తాయి. ఈ సంఘటనలు పిల్లలకు  అభివృద్ధి అనుభవాన్ని కలిగిస్తాయి. పిల్లల ప్రతిభ.. బాలల   దినోత్సవం   పిల్లల  ప్రతిభను గుర్తించి  ప్రశంసించే గొప్ప అవకాశం. పాఠశాలలు, వివిధ సంస్థలు తరచుగా టాలెంట్ షో,  కళా ప్రదర్శనలు  వంటి   కార్యక్రమాలను   నిర్వహిస్తాయి. ఈ   గుర్తింపు   పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి, తమ అభిరుచులు, ఆసక్తులను  అనుసరించేలా  ప్రోత్సహిస్తుంది. డిజిటల్ భూతంతోజాగ్రత్త.. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు ఆన్‌లైన్ భద్రత కలిగి ఉండాలని నేటి బాలల దినోత్సవం నొక్కి వక్కాణిస్తోంది.  పిల్లలు ఎక్కువగా డిజిటల్  ప్లాట్‌ఫారమ్‌లతో  గడుపుతున్నారు.  స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, సిస్టమ్ వంటివి పిల్లలకు ఆటవస్తువులు అయిపోయాయి. అయితే వీటి వల్ల  కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం.  చివరిగా పెద్దలుగా మనం చేయాల్సిన పనేంటంటే, పిల్లల అభిరుచులు, ఆసక్తులు,  వారి భవిష్యత్తు నిర్మాణం మన కర్తవ్యంగా భావించి, ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడే దేశం ప్రగతిపథంవైపు వెళ్తుంది.                              *రూపశ్రీ   

మన కష్టమే పిల్లలకు ఆదర్శం!

  పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి! ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు. ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు. ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. - నిర్జర.

భవిష్యత్తును శాసించే బాలలు...

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన పుట్టిన రోజును బాలల దినోత్సవం పేరిట జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. కానీ భారతీయులు మాత్రం నవంబర్ 14న జవహార్ లాల్ నెహ్రూ జయంతి రోజునే జరుపుకుంటున్నాం. దీనికి కారణం జవహార్ లాల్ నెహ్రూ బాలబాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు.  తమ విద్యకు ఆయన అందించిన ప్రోత్సాహానికి పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పిల్లలకూ కొన్ని హక్కులున్నాయని, ఆ హక్కులకు అనుగుణంగా  వారు జీవించాలని బాలల దినోత్సవం నొక్కి చెబుతుంది. అంతే కాదు.. సమాజంలో పిల్లలకు విద్య అందడం నుండి వారి సంక్షేమం వరకు చాలా విషయాల గురించి ప్రభుత్వాలు చర్చిస్తాయి. పసిడి నవ్వుల చాచాజీ.. పుట్టినరోజు ఈ రోజు పిల్లల పండుగ ఈ నాడు ఈ గేయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. జవహార్ లాల్ నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. దీనివెనుక కారణం.. భారత్  బ్రిటీషర్ల చేతుల్లో నలిగి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ దేశాన్ని సరైన మా్ర్గంలో నడిపించే ఉద్దేశ్యంతో నెహ్రూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల అనుగుణంగా ఆయన నిరంతరం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వచ్చేది. ఆయనకు స్వతహాగా పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎనలేని మక్కువ. ఈ కారణంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవాడు, వారిని దగ్గరకు తీసుకునేవాడు. దీంతో పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూకు గులాబీలంటే మక్కువ అని తెలిసి గులాబీ పువ్వులతో ఆయన్ను చుట్టుముట్టేవారు. అలా పిల్లలకు ఆయన పట్ల ప్రేమాభిమానాలకు గుర్తుగానూ, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానూ ఆయన జయంతిని  బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజున ఏం చెయ్యచ్చు.. పిల్లలకు కూడా రాజ్యంగంలో కొన్ని హక్కులున్నాయని చదువుకుంటూనే ఉన్నాం. కానీ నిజానికి పిల్లలకున్న హక్కుల గురించి  తెలిసిన వారు చాలా తక్కువ.  బాలల దినోత్సవం రోజున ఈ హక్కుల గురించి చర్చించి పిల్లలు వాటిని ఉపయోగించుకునేలా చేయాలి. చాలామంది పిల్లలకు విద్య, ఆహారం, స్వేచ్చ లభించడం లేదు. ఇటువంటి పిల్లలను గుర్తించి వారిని వారికి న్యాయం జరిగేలా చేయాలి. పిల్లలలో లింగ సమానత్వం పాటించాలి. మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనే చాదస్తపు ఆలోచనలు వదిలి పిల్లలను సమానంగా పెంచాలి. ఉరుకులు పరుగుల ఉద్యోగాల కాలంలో పిల్లలను పట్టించుకోవడం గురించి ఆలోచించాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి, ఆలోచనలు పంచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో స్నేహితుల మాదిరిగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా అభివృద్ది పెంచుతారు. తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు. బడి వయసు పిల్లలను బడికి వెళ్లేలా చేయడం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట గుర్తుంచుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలి.                                                     *నిశ్శబ్ద.

జీవితం బాగుండాలంటే..  ఈ 8 రకాల వ్యక్తులను అస్సలు నమ్మకండి.. !

  “నమ్మకం”  మూడక్షరాల ఈ మాట మన జీవితంలో చాలా విలువైనది. మన జీవితంలో ఏ బంధమైనా నిలబడాలంటే దానికి పునాది నమ్మకమే. మన ఇంట్లోవారయినా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరితోనయినా మన ప్రయాణం సాఫీగా సాగాలంటే వారికీ, మనకీ మధ్య నమ్మకమనే గట్టి దారం కలపబడి ఉండాలి.  నమ్మకమనేది  సంపాదించుకోవాలి తప్ప బలవంతం మీద పొందలేము.  మనం జీవితంలో  ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలిసుండటం చాలా ముఖ్యం. అలా సైకాలజీ ప్రకారం మనం నమ్మకూడని 8 రకాల వ్యక్తులున్నారట.  వీరిని అసలు నమ్మకూడదని మానసిక విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ వీళ్ళేవరంటే.. స్వార్థపరులు: ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ‘నేను, నేను మాత్రమే’ అనే మనస్తత్వం  కలిగి ఉంటారు. వీళ్ళను నార్సిస్టులు అని అంటారు.  ఇతరుల భావాలు, అవసరాలు గురించి వీళ్లకు పట్టదు. వాళ్ళ అహాన్ని సంతృప్తిపరుచుకోవటం కోసం అవతలి వాళ్ళ మీద నింద వేయటానికి కూడా వెనుకాడరు.   అబద్ధాలు చెప్పేవారు: అబద్ధాలు చెప్పడం  కొందరికి అలవాటుగా ఉంటుంది. ప్రతివిషయనికి అబద్దం చెప్పి సింపుల్ గా విషయాన్ని దాటవేయడం, తప్పించుకోవడం చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు  బంధానికి అవసరమైన నిజాయితీ, సమగ్రతలు ఉండవు.  తమ వ్యక్తిగత లాభాల కోసం ఇతరులని తరచూ తప్పుదోవ పట్టించటానికి అబద్ధాలు చెప్తుంటారు.  వీళ్లకు దూరం ఉంటే మేలు..   అధికార ధోరణి: తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులు చేసే పనులని, నిర్ణయాలని నియంత్రించి వారికి అనుకూలంగా మార్చుకునే  నైపుణ్యం కలిగి ఉంటారు. వీరిని మానిప్యులేటర్లు అని చెప్పవచ్చు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులని ఎలాగైనా తప్పించుకోవాలి. బాధితుల్లా ప్రవర్తించేవారు: ఎల్లప్పుడూ తమని తాము బాధితులుగా చూపించుకోవాలనుకునే వ్యక్తులు వారివల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా  వారు చేసిన పనులకి, వారన్న మాటలకి జవాబుదారీతనం తీసుకోరు. ఎప్పుడు సింపతీ పొందడానికి కథలు అల్లేస్తారు..  వీరి స్వార్ధం వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు. అసూయపడేవారు: ప్రతిదానికీ ఇతరుల్ని చూసి అసూయపడే వ్యక్తులు నమ్మదగినవారు కాదు. వారు ఇతరుల విజయాలకి,  సంతోషానికి మనస్ఫూర్తిగా మద్ధతునివ్వరు, అభినందనలు చెప్పరు. వారిలో ఉన్న అసూయ వల్ల ఇతరులకి హాని కలిగించవచ్చు. నిబద్ధత లేని వ్యక్తులు: జీవితంలో ఎలాంటి కట్టుబాట్లు, పద్ధతులు లేకుండా ఉండే వ్యక్తులకి   బంధాల పరంగానైనా, పని విషయంలోనైనా  నిబద్ధత ఉండదు. వీరికి స్థిరత్వం, జవాబుదారీతనం ఉండదు. ఇలాంటి వాళ్ళను నమ్మితే నట్టేట మునిగినట్టే.. సానుభూతి లేని వ్యక్తులు: సానుభూతి చూపించడం  ఇతరుల కష్టాన్ని, బాధను తగ్గించడంలో సహాయపడుతుంది.  మనం మనుషులమనే సమైక్య భావాన్ని కలిగిస్తుంది. కష్టాలను, బాధలను, ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మనుషులను చూసి కూడా సానుభూతి  చూపలేని వ్యక్తులు చాలా స్వార్ధపరులని అర్థం.  వీరు తమ,పర భేధాలు చూపిస్తారు. ఆకర్షణ చూపించే వ్యక్తులు: అధికంగా ఆకర్షించాలని ప్రయత్నించే వ్యక్తులు తరచూ వాస్తవం బయటపడకుండా,  అసలు ఉద్దేశాన్ని లోపల కప్పి ఉంచుతారు. అలాంటి వ్యక్తులు తాము  కోరుకున్నది అవ్వటం కోసం ఇతరులతో మృదువుగా మాట్లాడటం, వారిని మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కూడా నమ్మకూడదు.                          *రూపశ్రీ.

మానవత్వం నిలబడాలంటే.. దయ చూపించడానికి మించిన గొప్ప మార్గం ఉందా?

   ఈ సమాజం ప్రశాతంగా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని గుణాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో ప్రేమ, క్షమ, దయ, జాలి అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కలిగి ఉన్నవారినే మానవత్వం కలిగిన మనుషులు అని కూడా అంటారు.  సమాజంలోని ప్రతి వ్యక్తిలో  దయ, మంచితనాన్ని ప్రోత్సహించడానికి, ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించడానికి, తద్వారా సమాజంలో మంచి  మార్పును తీసుకురావటానికి ఒక ప్రత్యేక రోజును కేటాయించారు.  నవంబర్ 13వ తేదీన వరల్డ్ కైండ్నెస్ డే గా జరుపుకుంటారు. దయ అనే గుణం ప్రతి మనిషిలో ఉన్న ప్రత్యేకమైన  లక్షణం. ఈ గుణం మనలో అభివృద్ధి చెందినంతగా  ఏ జీవిలోనూ వృద్ధి చెందకపోవచ్చు.  అందుకే ఇది మనల్ని  భూమి మీద ఉన్న ఇతర జీవులలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆ సమాజంలో అనుకరణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  పిల్లలు తల్లిదండ్రులను చూసి కొన్ని ఎలాగైతే అనుకరిస్తారో.. సమాజంలో కొందరి ప్రవర్తన చూసి మరికొందరు కూడా అనుకరిస్తారు.  ఈ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే గుణాలలో దయ గుణం కూడా ఉండాలన్నది వరల్ట్ కైండ్నెస్ డే ముఖ్య ఉద్దేశం.   దీని ఫలితంగా ప్రజల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి.  ఇతరుల పట్ల దయతో ఉండమని పిల్లలకి చిన్నప్పటినుంచే చెప్తూ ఉంటే, వారిలో ఇది బలంగా మారి మంచి సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది. ఒక వైద్యుడు తన రోగుల పట్ల, ఒక అధికారి తన సిబ్బంది పట్ల, ఒక కుటుంబ పెద్ద తనపై ఆధారపడి ఉన్నవారి పట్ల  దయ చూపకపోతే పరిస్థితులు ఎలా  ఉంటాయో ఒక సారి ఊహిస్తే జీవితంలో ఇలాంటి పరిస్థితులు వద్దే వద్దు అనే భావన కలుగుతుంది. మనిషికి మరొక మనిషి మీద ఈ జీవకోటి మీద  దయ లేకపోవడం వల్ల కుటుంబం, వ్యవస్థ, సమాజం మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. అదే మన చుట్టూ ఉన్నవారిపై దయతో ఉండటం, ఇతరుల పట్ల నిస్వార్థంగా దయను చూపించడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది. చిన్న సాయం కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక చిన్న  చిరునవ్వు కూడా ఎదుటి  వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి కాస్త ధైర్యం పోగవుతుంది.  ఒకరు సహాయం చేసినప్పుడు, ఇతరులు సైతం దానిని ప్రేరణగా తీసుకుని మరిన్ని మంచిపనులు చేయాలని కోరుకుంటారు. ఈ దయాగుణం పెరగటం వల్ల మనుషులు కుల, మత, ప్రాంత, లింగ భేధాలతో ఒకరికొకరు వేరుపడకుండా..   వారిలో ‘నేను’, ‘మేము’ అనే భావాలు తొలగి, ‘మనం’ అనే విశాల భావం కలుగుతుంది. అప్పుడు ఈ  సమాజంలో అందరూ ఒకరికొకరు సాయంగా ఉంటూ  కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఈ భూమి మీద మనకెంత హక్కు ఉందో, మిగతా ప్రాణులకీ అంతే ఉందని గుర్తించి గౌరవిస్తారు. దాంతో  ఈ    ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా దయ చూపించడానికి మించిన  గొప్ప మార్గం మరొకటి లేదని మర్చిపోకూడదు. చేసే సాయం  చిన్నదైనా , పెద్దదైనా దాని ప్రభావం కచ్చితంగా సమాజం మీద పడుతుంది. ప్రేమ, సహనం, సోదరభావం, పరస్పర గౌరవం, సహకారంతో కూడిన సౌమ్య వాతావరణాన్ని కల్పించడానికి మన రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల, ఇబ్బందులలో ఉన్నవారి పట్ల,  జీవకోటి పట్ల దయ చూపించడాన్ని భాగం చేసుకోవాలి.  ఈ ప్రపంచంలో కూడా  బ్రతకడానికి పోరాటం చేస్తూ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు.  ఇలాంటి వారికి ఎల్లప్పుడూ ఓ అపన్న హస్తం కావాలి.  కేవలం దయా గుణం ఉన్నప్పుడే అపన్న హస్తం అందివ్వడం సాధ్యం అవుతుంది.  అందుకే  తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు,  ఇరుగు పొరుగు,   ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము దయా గుణాన్ని పలు సందర్భాలలో వ్యక్తం చేస్తూ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం మానవత్వం కలిగిన మనుషులతో బలపడుతుంది.                            *రూపశ్రీ.