కేటీఆర్ ఓ బిల్డప్ బాబాయ్.. కొండా విశ్వేశ్వరరెడ్డి

అమృత్ పథకంలో కుంభకోణంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిందంతా ఒట్టుట్టి హడావుడేనా? ఆయనకు అసలు కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంటే దక్కలేదా? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఔననే అంటున్నారు. ఒక్క కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్ ది అంతా వట్టి బిల్డప్ మాత్రమేననీ, ఆయనకు అసలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని డంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఒక ఎంపీగా ఈ విషయంలో తాను వాస్తవాలను తెలుసుకుని మరీ చెబుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కేటీఆర్ ఒక బిల్డప్ బాబాయ్ లో అబద్ధాలు చెబుతూ, అతిశయోక్తులు మాట్లాడుతూ పార్టీ క్యాడర్ ను భ్రమల్లో ఉంచుతున్నారని విమర్శించారు. ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి కేటీఆర్ నిజంగా మనోహర్ కట్టార్ ను కలిసి అమృత్ పథకంలో కుంభకోణంపై ఫిర్యాదు చేశారా అన్న విషయంలో  అనుమానం వచ్చి తాను స్వయంగా కేంద్ర మంత్రి పీఏతో మాట్లాడానని అప్పుడు వాస్తవం తెలిసిందని వివరించారు.  అయినా కేటీఆర్ నిజంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తో భేటీ అయ్యి ఉంటే ఆ పొటో విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంట్ కోరిన సంగతి వాస్తవమేననీ, అయితే కేటీఆర్ ను మంత్రి కలవలేదనీ, ఆయనను బయట నుంచే పంపించేశారనీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టేశారు.  అసలు ఢిల్లీలో కేటీఆర్ ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదనీ, ఎవరూ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదనీ పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఢిల్లీలో కలిసింది ఎవరినయ్యా అంటే కాంగ్రెస్ నేతలను అని చెబుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ నేతలేనని ఆయన అంటున్నారు. రేవంత్ సర్కార్ కేటీఆర్ ను అరెస్టు చేయాలని భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదనీ, వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ అగ్రనాయకత్వమేననీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో  మరో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు జైపాల్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్‌ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.  నోటీసులు అందుకున్న ఆయన శనివారం (నవం బర్ 17)  జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.   ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నోటీసులు అందుకుని పోలీసుల విచారణకు హాజరు కావడం సంచలనం కలిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్టైన సంగతి విదితమే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకరరావు అమెరికాలో తలదాచుకున్నారు. ఆయనకు అక్కడ గ్రీన్ కార్డ్ లభించిన నేపథ్యంలో విచారణ కోసం ఆయనను భారత్ రప్పించడం పోలీసులకు కష్ట సాధ్యంగా పరిణమించింది. ఇంటర్ పోల్ నోటీసు ద్వారా ఆయనను భారత్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.   ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. మరింత మంది బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. 

చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూశారు.  దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు నారా రోహిత్ పీఆర్వో అధికారికంగా మీడియాకు తెలిపారు. కాగా సోదరుడి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. తన చిన్నాన్న తీవ్ర అస్వస్థతతో ఉన్నారన్న సమాచారంతో మంత్రి లోకేష్  తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు.  నారా, నందమూరి కుటుంబసభ్యులు  ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి వద్దకు వచ్చారు. మరి కొద్ది సేపటిలో  చంద్రబాబు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.   చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయిన రామ్మూర్తి నాయుడు అనారోగ్యం కారణం చాలా కాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  నారా రామ్మూర్తి నాయుడుకు ఇరువురు కుమారుడు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్  సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. చంద్రబాబునాయుడు దంపతులు దగ్గరుండి ఈ నిశ్చితార్థం నిర్వహించారు. రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం నిర్వహించనున్నట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏపై సెర్చ్ వారెంట్

కడన ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల విషయంలో యమా సీరియస్ గా ఉన్న పోలీసులు ఆ అసభ్య పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇండీసెంట్  పోస్టులతో చెలరేగిపోయిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ  రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. గత నాలుగు రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉండటంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు. అంతే కాకుండా రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రకటించి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడో ఇహనో ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనిని విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగానే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ కోసం పోలీసులు వేటాడుతున్నారు.  అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వర్రా  రవీందర్ రెడ్డి   విచారణలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్రా రాఘవరెడ్డిని అరెస్టు చేసి విచారిస్తే సోషల్ మీడియాలో ఇన్ డీసెంట్ల పోస్టుల వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోకేష్ లపైనే కాకుండా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై కూడా అసభ్య పోస్టులు పెట్టిన సంగతి విదితమే. 

కొనసాగుతున్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ పర్వం 

ఎపిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలే టార్గెట్ గా వైసీపీ సోషల్ మీడియా చెలరేగిపోయింది. చివరకు వారి కుటుంబ సభ్యులను వదల్లేదు. అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, వ్యక్తిగత దూషణలతో నానా అరాచకం సృష్టించింది.  ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన కూటమిప్రభుత్వం మరికొందరిని అరెస్ట్ చేయనుంది. ఈ మేరకు  కడప జిల్లాలో పలువురికి 41 ఎ నోటీసులు జారి చేసింది.  నోటీసులు అందిన వారిలో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు.  రాఘవరెడ్డి స్వంత గ్రామంలోని నివాసానికి నోటీసులు అంటించారు. రాఘవరెడ్డితో బాటు కడప వైకాపా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పలువురికి నోటీసులు సర్వ్ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల సారాంశం.   

గోదావరి పెన్నా ప్రాజెక్టుకు సహకారం.. కేంద్ర మంత్రులు సానుకూలం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో యమా బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అవసరాలు ఆకాంక్షలను తెలియజేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. శుక్రవారం (నవంబర్ 15) అసెంబ్లీ  సమావేశాల అనంతరం హస్తిన బయలుదేరి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ తెలుగుదేశం ఎంపీలు స్వాగతం పలికారు. వారితో భేటీ అనంతరం చంద్రబాబు విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఆ భేటీలో దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, పౌరులు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలపై జైశంకర్ తో చంద్రబాబు  చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.   అలాగే ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై చంద్రబాబు జైశంకర్ కు వివరించారు. విదేశాల నుంచి కంపెనీలను ఏపీకి పంపేందుకు సహకరించాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఎంతో కీలకమైన సింగపూర్ తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న చంద్రబాబు వినతి పట్ల జైశంకర్ సానుకూలంగా స్పందించి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.   ఇక కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నదుల అనుసంధానం ఎంతో కీలకమని చెబుతూ గోదావరి, పెన్నా ప్రాజెక్టుకు సహాయ సహకారాలందించాలని కోరారు. చంద్రబాబు వినతికి విత్త మంత్రి సానుకూలంగా స్పందించారు.   మొత్తం మీద చంద్రబాబు  రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, రాష్ట్ర పురోగతికి కేంద్రం సహకారం లక్ష్యంగా  హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. 

చంద్రబాబు  సోదరుడి పరిస్థితి విషమం 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.  ప్రస్తుతం ఆయన హైద్రాబాద్ లోని ఎఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  అమరావతిలో ఉన్న మంత్రి నారాలోకేశ్ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడ్నుంచి హైద్రాబాద్ చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.  నారా రామ్మూర్తి నాయుడు  1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.  సినీ హీరో నారా రోహిత్  ఆయన కుమారుడే.   ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మహరాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైద్రాబాద్ చేరుకున్నారు. 

చంద్రబాబు సవాల్.. జగన్ స్పందన ఎలా ఉంటుందో మరి!?

అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అవాస్తవాలు చెబుతోందనీ, తప్పుడు ప్రచారం చేస్తోందనీ జగన్ మీడియా సమావేశంలో  చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు అలాంటి అనుమానాలేమైనా ఉంటే అసెంబ్లీకి వస్తే రికార్డులతో సహా వివరిస్తామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో  విపక్ష హోదా మంకుపట్టు వదిలేసి జగన్ అసెంబ్లీకి రావడానికి దీనినో ఆహ్వానంగా భావించొచ్చు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల  రూపాయలు అప్పు చేసిందని లెక్కలతో సహా వివరించారు. తాను చెప్పింది అవాస్తవమని భావిస్తే జగన్ అసెంబ్లీకి వచచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. నిజంగానే జగన్ తన హయాంలో  అప్పుల లెక్కలను చంద్రబాబు తప్పుగా ప్రచారం చేస్తున్నారని భావిస్తే ఆ విషయం అసెంబ్లీకి వచ్చి చెప్పడానికి ఇది మంచి అవకాశం.  ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా సవాల్ చేశారు కనుక జగన్ వస్తే ఆయనకు తప్పని సరిగా మైక్ ఇస్తారు. అప్పుడు జగన్ తన వాదనను గట్టిగా అసెంబ్లీ వేదికగా వినిపించే అవకాశం ఉంటుంది.  అయితే జగన్ వాస్తవాలను చెప్పేందుకు కానీ, అంగీకరించేందుకు కానీ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ బయట అవాస్తవాలు మాట్లాడి, తన సొంత మీడియా, సొంత సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసుకున్నంత సులువు కాదు. అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పి తప్పించుకోవడం. ఎందుకంటే  చంద్రబాబైనా, జగన్ అయినా అప్పులపై తప్పుడు లెక్కలు చెబితే.. అప్పటికప్పుడు నిజాలను నిగ్గుతీసి వాస్తవాలను వెల్లడించడానికి వీలుగా రికార్డులు అందుబాటులో ఉంటాయి. అందుకే ఎంతటి వారైనా అసెంబ్లీ వేదికగా అడ్డదిడ్డంగా లెక్కలు ఇవీ అంటూ చెప్పడానికి వీలు ఉండదు. ఏ పద్దు కింద ఎంత అప్పు చేశారు. ఏ అవసరం కోసం చేసిన అప్పు ఏ అవసరం కోసం వాడారు. నిధుల మల్లింపు ఎలా చేశారు. అడ్డగోలుగా ఆస్తలను తాకట్టు పెట్టి మరీ ఎక్కడెక్కడ నుంచి అప్పులు తెచ్చారు అన్న అన్ని విషయాలూ రికార్డులను ముందు పెట్టి మరీ కడిగేయడానికి అధికార పక్షానికి ఎంత అవకాశం ఉందో.. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. విపక్ష వైసీపీకి కూడా అంతే అవకాశం ఉంటుంది. అందుకే  జగన్ అసెంబ్లీకి ముఖం చాటేసి తన సొంత మీడియాలో ప్రకటనలకే పరిమితమౌతున్నారు. నిజంగా జగన్ తన హయాంలో అప్పుల విషయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన విషయాలు  అవాస్తవాలు అయితే ఆ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ ఆయనకు మైక్ ఇవ్వకపోతే చంద్రబాబు చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని బయటకు వచ్చి జగన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తే జనంఆయన మాటల్లో నిజం ఉందని నమ్మే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు తోచింది నేను అసెంబ్లీ బయటే మాట్లాడతాను అని భీష్మించుకుంటే అంతంత మాత్రంగా ఉన్న విశ్వసనీయతను కూడా జగన్ కోల్పోక తప్పదు.  

మోడీ ఏపీ పర్యటన ఖరారైందా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నెల 29న  గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానిక మోడీ రానున్నట్లు చంద్రబాబు శుక్రవారం (నవంబర్ 15) అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అయితే పీఎంవో వర్గాల నుంచి మోడీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు.   ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్ట్‌ మాత్రమే కాకుండా విశాఖ రైల్వేజోన్‌, పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అంటున్నారు. అధికారికంగా మోడీ పర్యటన ఖరారు కాకపోయినప్పటికీ అధికార యంత్రాంగం మోడీ పర్యటన ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో నిమగన్నమైపోయింది. మోడీ పర్యటన సందర్భంగా విశాఖ ఆంధ్రావర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదిక కానుంది. ఆ మైదానా్ని నిన్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.  

రేవంత్ స‌ర్కార్ బిగ్‌ ప్లాన్‌.. కేటీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్ తప్పదా?

న‌న్ను అరెస్టు చేయండి.. మీకు ద‌మ్ముంటే అరెస్టు చేసి జైలుకు పంపించండి.. జైల్లో మంచిగా యోగా చేస్తా.. స్లిమ్‌గా త‌యార‌వుతా.. ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తా.. ఇవీ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మ‌ధ్య త‌ర‌చుగా చేస్తున్న వ్యాఖ్య‌లు. ఎంత వీలైతే అంత తొంద‌ర‌గా జైలు కెళ్లాల‌న్న ఉత్సాహం కేటీఆర్‌లో క‌నిపిస్తోంది. ఆయ‌న‌ తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ఎవ‌రైనా అరెస్టు అంటే ఎలా త‌ప్పించుకోవాలా అని చూస్తారు. కేటీఆర్ మాత్రం ప‌దేప‌దే న‌న్ను అరెస్టు చేయండి అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తుండ‌టం రాష్ట్ర రాజ‌కీయాల్లో  చ‌ర్చ‌నీయాంగా మారింది. గ‌త ద‌శాబ్ద‌ కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన వారు ముఖ్య‌మంత్రి పీఠాల‌ను అదిరోహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం ముఖ్య‌మంత్రి కాక‌ మునుపు జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన‌వారే. దీంతో కేటీఆర్ సైతం అదే ఫార్ములా  ఫాలో కావాల‌ని తొంద‌ర‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఎలాగూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తనను అరెస్టు చేస్తుంద‌ని భావించిన కేటీఆర్‌, అందుకు రెడీ అయిపోయారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీఆర్ఎస్ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌పై దృష్టిసారించింది.  ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిర్వ‌హ‌ణ‌లో కేటీఆర్‌పై అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లోనూ కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న విచారణలో  కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ల‌గ‌చ‌ర్ల‌లో అధికారుల‌పై దాడి జ‌రిగింద‌ని  స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో  మ‌రో వారం రోజుల్లో కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న సంకేతాల‌ను పోలీసులు ఇచ్చేశారు. దీనికితోడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వ‌హ‌ణ‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం నిర్ధారణకు వ‌చ్చింది. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను ఇటీవ‌ల  భేటీ సందర్భంగా సీఎం రేవంత్ గవర్నర్ కు అందజేసినట్లు  తెలిసింది. కేటీఆర్ అరెస్టుకు అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను రేవంత్‌, కాంగ్రెస్ నేత‌లు కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఈ క్ర‌మంలో రాత్రివేళ‌ల్లో కేటీఆర్ ఇంటివ‌ద్దకు బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకుంటున్నారు. రాత్రంతా అక్క‌డే ఉంటున్నారు. త‌న అరెస్టు ఖాయ‌మ‌ని భావిస్తున్న కేటీఆర్,  ముందుగానే త‌న‌ను జైలు పంపించేందుకు కుట్ర‌లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి సానుభూతి పొందాల‌ని   భావిస్తున్న‌ట్లు  రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించినా రెండుమూడు నెల‌ల్లో బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌చ్చున‌ని కేటీఆర్ భావిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేటీఆర్ ను జైలుకు పంపిస్తే మ‌హా అంటే ఐదు నెల‌లు జైల్లో ఉంటాడేమో, ఆ త‌రువాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌స్తారని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే  ఒక్క‌సారి జైలుకు వెళితే.. సంవ‌త్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు కేటీఆర్ బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ-ఫార్ములా కార్ రేసింగ్ కేసు, తాజాగా ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న కేసుల విష‌యంలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉంది. వీటిలో ఏ ఒక్క‌ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లినా.. ఆ త‌రువాత వ‌రుస‌గా మ‌రిన్ని కేసులు బ‌నాయించి సుదీర్ఘ‌కాలం కేటీఆర్ జైల్లోనే ఉండేలా కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పెద్ద అడ్డంకిగా మారుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కేటీఆర్ సుదీర్ఘ‌ కాలం జైల్లో ఉంటే.. కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చినా పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌కు స‌మ‌యం వెచ్చించే ప‌రిస్థితులు ఉండవన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఆనారోగ్య‌ కార‌ణాల దృష్ట్యా గ‌తంలోలా ఇప్పుడు ఆయ‌న‌ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండే ప‌రిస్థితి లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ క‌విత సైతం ఇప్ప‌ట్లో పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యే ప‌రిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ లో ఇక మిగిలింది. హారీష్ రావు. ఒక్క‌సారి హ‌రీష్ రావు చేతుల్లోకి పార్టీ ప‌గ్గాలు వెళితే.. కేటీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కు అది పెద్ద అవరోధంగా, అడ్డంకిగా  మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని  కేటీఆర్ వ‌ర్గీయులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్  సుదీర్ఘ‌కాలం జైలుకే ప‌రిమితం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 తెలంగాణ డిజిపిపై వేటు ?

ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో  వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరగడం పట్ల ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. డిజిపి జితేందర్ పై వేటు వేయడానికి రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండగా అక్కడికి వచ్చిన కలెక్టర్ పై ఒక్కసారిగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కుట్ర దాగి ఉందని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.  ఇంటెలిజెన్స్ చీఫ్ తో బాటు డిజిపిపై క్లాసు తీసుకున్నట్లు వార్తలు  అందుతున్నాయి. కలెక్టర్ పై హత్యాయత్నం చేసిన వారిపై ఉపేషించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిఆర్ఎస్ పథకం ప్రకారమే దాడి జరిగిందని వెల్లడి కావడంతో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు.

 మంత్రి శ్రీధర్ నోట కెటీఆర్ మాట

కెటీఆర్ అరెస్ట్ పై మంత్రి  శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నేతలే కెటీఆర్ అరెస్ట్ ఖాయం అంటున్నారని ఆయన గుర్తు చేశారు.  సింపతి కోసమే కెటీఆర్ అరెస్ట్ ను వాడుకుంటున్నారని అన్నారు. కెటీఆర్ ను అరెస్ట్ చేసే కుట్ర కాంగ్రెస్ చేయడం లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.  సీనియర్ అధి కారి పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి కెటీఆర్ అని ఆయన ఆరోపించారు. వికారాబాద్  లగచర్ల ఘటలో కూడా కెటీఆర్ ఉన్నట్లు  స్పష్టమైందన్నారు. కలెక్టర్ పై దాడి చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. 

వర్తమానంలో జీవించండి

 హైద్రాబాద్ శాలిబండ మండలంలోని గాజిబండలో ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరు విదేశాలకు వెళుతున్నారు. సిరాజ్ కు ఇది నచ్చలేదు. ఇండియాలో ఉండిపోవాలనుకున్న తనకు ఇది ఇబ్బందిగా పరిణమించింది. ఒక రోజు మౌలా దగ్గరికి వచ్చాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. మౌలానా లోకం పోకడలను కూలకషంగా చెప్పాడు.     మౌలానా తక్రీర్( ప్రవచనం)  ప్రారంభించాడు. అల్లా చెప్పేది ఒకటే . అల్లా తలచుకుంటే  ఒక్కసెకనులో అన్నీ గుంజేసుకుంటాడు. పులికి ఒక మంచి జీవితం ఉంది. బాగా ఆకలేస్తే మంచి జింకను వేటాడి తింటుంది.  మనుషులు జంతువులు ఒకేలా జీవించగలవు. నాణ్యమైన జీవితం కోసం  మనుషులు విదేశాలకు వెళుతుంటారు.  పులి లేదా సింహానికి  సమయానికి  బలవర్ధకమైన జింక మాంసాహారం అవసరం.  ఆయా సీజన్ బట్టీ గుహ అవసరం. ఎండాకాలం, వానా కాలం , వర్షా కాలం బట్టి గుహలు ఏర్పరచుకుంటాయి. పిల్లి తన పిల్లి కూనలు పుట్టిన తర్వాత వాటిని సాకడానికి  నానా హైరానా పడుతుంది.  ఇల్లు కూడా మార్చేస్తుంది. కుందేలు కూడా అదే విధంగా చేస్తుంది.తన శరీరం మీద ఉన్న వెంట్రుకలను తీసి  మెత్తటి కార్పెట్ మాదిరిగా తయారుచేస్తుంది. తన పిల్లలను వెచ్చగా పడుకోబెడుతుంది.  మనుషులు  చదువు వల్ల మంచి ఉద్యోగం ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుకోవడం కోసమే. జంతువులు కూడా శరీరాన్ని కాపాడుకుంటున్నాయి. ఒక రోజు అడవిలో  సింహం పెళ్లి జరిగింది.  సింహం మనుషుల మాదిరిగా ఆలోచిస్తే మరోలా ఉంటుంది. సింహం పెళ్లిలో ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటి, జిరాఫీ  వంటి జంతువులను  మాత్రమే ఆహ్వానిస్తుంది. నా బరాత్ లో అల్ప జీవులు రాకూడదని కోరుకుంది.   ఒక రోజు చిట్టెలుక సింహం పెళ్లిలో కనిపిస్తుంది. సింహానికి కోపం వస్తుంది. చిట్టెలుకను నిలదీస్తుంది. నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు చిట్టెలుక కూల్ గా జవాబిస్తుంది.  పెళ్లికి ముందు నీ లాగే (సింహం) ఉండే వాడిని. పెళ్లయిన తర్వాత ఎలుక అవతారమెత్తాను. మనుషులు ప్రకృతికి విరుద్దంగా ఆలోచిస్తున్నారు.  దంపతులు ఈ మధ్య కాలంలో ఇద్దరు పిల్లలు పుడితే ఎలా అని టెన్షన్ పడుతున్నారు. నాకు తెలిసిన ఈ జంటకు పదేళ్లుగా పిల్లలు కలగలేదు. అయినా టెన్షన్ పడుతున్నారు. పక్షులు, జంతువులు  కేవలం తమ ఆహార అన్వేషణ సాయంత్రం వరకే . చీకటి పడకముందే గూట్లో కి వచ్చి నిద్రపోతాయి. మళ్లీ తెల్లవారిన తర్వాత మళ్లీ వేట ప్రారంభిస్తాయి.ఆహార అన్వేషణ తప్పితే వేరే ఆలోచనలు ఆ జీవాలకు ఉండవు. కనుక వాటికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు దరి చేరవు. మనిషి గతం నెమరేసుకుని బాధపడతాడు. భవిషత్తు గూర్చి ఆందోళన చెందుతాడు. వర్త మానంలో జీవిస్తే ఉన్న సుఖం మరెక్కడా ఉండదు.                                                                                   బదనపల్లి శ్రీనివాసాచారి

అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల తనిఖీలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను అధికారులు పలుమార్లు  తనిఖీలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే  ఎన్నికల అధికారులు ఏకపక్షంగా  విమర్శలు చేశారు. ఆయన విమర్శల ఫలితమా లేక నిజంగానే అనుమానం వచ్చిందో తెలియదు కానీ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బ్యాగులను పరిశీలించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.  అమిత్ షా హెలికాప్టర్ లో ఎన్నికల అధికారుల తనిఖీ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

అవినాష్ రెడ్డిని జగన్ వదిలించేసుకుంటారా?

తన కోసం, తన బాగు కోసం పని చేసిన వారిని కూరలో కరివేపాకులా తీసి పారేయడం జగన్ కు అలవాటే. తన రాజకీయ ప్రస్థానంలో అలా జగన్ కోసం పని చేసి ఆ తరువాత ఆయన చేత అవమానాలు ఎదుర్కొని దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రధానంగా తన కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాలికి బలపం కట్టుకని మరీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సొంత చెల్లి షర్మిల, తాను అరెస్టైనప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన తల్లి విజయమ్మనూ అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఎలా పక్కన పెట్టేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. చివరాఖరికి ఆస్తుల విషయంలో కూడా వారిపై కేసులు పెట్టి మరీ సాధిస్తున్నారు జగన్. తన రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను వాడుకుని వదిలివేయడం జగన్ కు కొత్తేమీ కాదు.  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహా పార్టీలో  జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిచ్చెనలా వాడుకుని వదిలివేసిన వారెందరో కనిపిస్తారు. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎక్కడకు వెళ్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రిని చేస్తా అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నడూ భావించలేదు. మంగళగిరిలో 2019 ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆర్కే  ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడు కూడా చిన్నబోయేంత పెద్దదిగా ఉంటుంది.  ఇక ఇప్పుడు తాజాగా జగన్ వదిలేసే, కాదు కాదు వదిలించుకునే  వ్యక్తి ఎవరంటే వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్న పేరు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.  ఔను వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలించుకోవడం తప్ప జగన్ కు ఇప్పుడు మరో దారి కనిపించడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారు ఏ కలుగులో దాగున్నా వెతికి పట్టుకుని చట్టం ముందు నిలుపుతోంది. కోర్టులు సైతం బూతు పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తప్పు చేసి బెయిలు అడిగితే ఎలా అని నిలదీస్తోంది. దీంతో ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్య, అసహ్య, అశ్లీల పోస్టులతో ప్రత్యర్థి పార్టీ నాయకులు, వారి కుటుంబీకులను వేధించి, మనో వేదనకు గురి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. క్షమాపణలు చెప్పుకునో, కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకునే తప్పించుకునే వీలు లేదని అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో  తాను అసభ్య పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడరి వర్రారాఘవరెడ్డి కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడిక జగన్ కు ఆయనను వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలా కాకుండా ఇంకా అవినాష్ ను చిన్న పిల్లోడు, సాత్వికుడు అంటూ వెనకేసుకుని వస్తే.. స్వయంగా జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావడం వల్లే కంచుకోట లాంటి కడపలో వైసీపీ దెబ్బతింది.  వర్రా వాంగ్మూలంతో జగన్ తల్లిని, చెల్లిని అసభ్యంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ, అతని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని సందేహాలకు అతీతంగా తేలిపోయింది. అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఉన్నారని వర్రా  వాంగ్మూలంతో తేలిపోవడంతో ఇక జగన్ వారిని పట్టించుకునే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో జగన్ స్వయంగా తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే  సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని వైసీపీ వెనకేసుకు రాదని, వారిని సమర్ధించదనీ మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ విస్పష్టంగా చెప్పేశారు. జగన్ కూడా ముందు ముందు అదే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే తన ఐదేళ్ల అరాచక పాలనను ఛీ కొడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ఇచ్చిన జనం ఇక ముఖం మీదే ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు.  

ఆర్థిక ఉగ్రవాది జగన్.. పయ్యావుల కేశవ్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు.  శాసనసభలో బడ్జెట్‌పై  ప్రసంగించిన ఆయన ఆర్థిక ఉగ్రవాది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నారు.  రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నామన్న పయ్యావుల అసలు గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. దేనికీ లెక్కాపత్రం లేదన్నారు. అంకెల గారడీతో జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలనూ అస్తవ్యస్తం చేసేసిందని విమర్శించారు.  జగన్ హయాంలో రాష్ట్రంలో ఈ  ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ అరాచకం జరిగిందని పేర్కొన్నారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందని పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా  గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు.  ఆర్థిక ఉగ్రవాది జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అన్ని రంగాలలో కుదేలైందని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు. 

పవన్ కల్యాణ్ మహా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.  మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో  ఈనెల 16, 17 తేదీల్లో  ఆయన పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తెలుగువారు అధికంగా నివసించే మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేస్తారు. ఆయన మహా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది.  తన రెండు రోజుల ప్రచారంలో ఆయన ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోలలో  పాల్గొంటారు.  తొలి రోజు అంటే శనివారం (నవంబర్ 15)  మరట్వాడా ప్రాంతంలోని  నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో  బహిరంగ సభలోనూ,  అదే జిల్లాలో భోకర్ నియోజకవర్గాలో నిర్వహించే హిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం లాతూర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రాత్రి ఆరు గంటలకు షోలాపూర్‌ నగరంలో రోడ్‌ షోలో పాల్గొంటారు.  ఇక ఆదివారం (నవంబర్ 17)  విదర్భ ప్రాంతంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు.  ఆరోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో  బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం కస్భాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో   పవన్ కళ్యాణ్  ప్రసంగిస్తారు.  

ఏపీలో చంద్రోదయం.. దేశానికి వెలుగుల ప్రసారం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక  చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి సంచలనం రేపారు.  ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో  ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.  ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారుల,ఇటు ప్రజల మన్నలు పొదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వభాగస్వామిగా ఉన్నా రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకులకన్నా సీనియర్. ప్రధానిమోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచీ కూడా  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. ఏడుపదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు  ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో  ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ, ఆరెస్సెస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  ప్రపంచంలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి  విజయ తీరాలకు బీజేపీని చేర్చ లేకపోయినా ప్రపంచ కీలక నేతలతో  మోడీ నెరిసిన సంబంధాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా, రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకు వెళుతున్నది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ  విధానం కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల లో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో  నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు.   అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన  సమస్యల కారణంగా  ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు.  రాజధాని అమరావతిని  రూపుదిద్దేపనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేసారు. 2019లో ఊహించని పరాజయంతో  విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టినా అవిశ్రాంతంగా శ్రమించారు.  పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి,మళ్లీ అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టారు.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు  చేసి 52 రోజులు జైలులో పెట్టినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు.   చంద్రబాబు వ్యూహరచనలలో మేటి.  ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ ను దీటుగా ఎదుర్కొని నిలిచారు. 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేధించడం ద్వారా ఆయన వ్వూహాలు బెడిసి కొట్టినా, 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటం లాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీయేలో కీలకంగా మారారు.  అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్ల కుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం, అమరావతి,పోలవరం పూర్తి  లక్ష్యంగా ముందుకు పోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చిక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది.కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది.  తన కున్న 16 స్థానాలతో ఎన్డీఏ ను మూడోసారి అధికారంలో నిలబెట్టారు.  1996లో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ ను కాదని యూనైటేడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ లో బాబు కీలకంగా వ్వవహరించిన అనుభవం మరచిపోలేం.  ఏదిఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖరాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.