మహరాష్ట్ర సిఎం ప్రమాణ స్వీకారోత్సవంలో  చంద్రబాబు 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మహరాష్ట్రకు చేరుకున్నారు.  సాయంత్రం ముంబైలో మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబుతో సహా ఎన్ డి ఎ భాగస్వామ్య పక్షాలు హాజరుకానున్నాయి. మహారాష్ట్ర సిఎంగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మధ్యాహ్నం గుంటూరు జిల్లా ఉండ వల్లి నుంచి చంద్రబాబు ప్రత్యేక హెలిపాడ్ లో విజయవాడ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి మహరాష్ట్రలోని ఛత్రపతి  ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్  నుంచి నేరుగా  ముంబయిలోని ప్రమాణ  స్వీకారస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు వైజాగ్ చేరుకుంటారు. 

వాజేడు ఎస్ ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్ట్ 

ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ  హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  సూర్యపేటకు చెందిన యువతి ఇన్ స్టాగ్రామ్ లో ఎస్ ఐతో  పరిచయమైంది. వీకెండ్స్ లో వీరిద్దరూ ఓ రిసార్ట్ లో గడిపేవారు. ఈ యువతి మరో ముగ్గురుతో రిలేషన్ లో ఉందని ఎస్ ఐ హరీశ్ కి తెలిసింది. ఈ యువతి హరీష్ ను పెళ్లి చేసుకోవాలని వేధించింది. పలుమార్లు గొడవపడింది. ఆత్మహత్య చేసుకున్న రోజు యువతి వాజేడుకు చేరుకుంది. ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరించడంతో ఎస్ ఐ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు యువతితో ప్రేమాయణం వెలుగులోకి రావడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

అరకు కిడ్నాప్ వెనక గంజాయి ముఠా

తీగ లాగితే డొంక కదిలింది. అరకుకు చెందిన బాలుడి కిడ్నాప్ వెనక గంజాయి ముఠా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరకుకు చెందిన ప్రకాశ్, సుశీల్ కుమార్ పల్నాడుకు చెందిన   యాసిన్ , సంతోష్ మద్య గంజాయి డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం ప్రకాశ్ సుశీల్ కుమార్ లు గంజాయి సప్లయ్ చేయాలి 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా యాసిన్, సంతోష్ చెల్లించారు. అయినప్పటికీ ప్రకాశ్ , సుశీల్ కుమార్ లు  ఎంతకూ గంజాయి సప్లయ్ చేయకపోవడంతో  ప్రకాశ్ బంధువుల అబ్బాయిని యాసిన్, సంతోష్ కిడ్నాప్  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని కిడ్నాప్ నుంచి విముక్తి కల్పించి ప్రకాశ్, సుశీల్ కుమార్ లను అరెస్ట్ చేశారు.

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. జీజీహెచ్ వైద్యులను విచారించిన పోలీసులు

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.  రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఏ5గా ఉన్న సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కు గురి కాలేందంటూ ఆమె వైద్యులపై ఒత్తిడి తెచ్చి మరీ నివేదిక ఇచ్చారంటూ ఆమెపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆమెను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను విచారించడం కంటే ముందుగా నాడు రఘురామకృష్ణం రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ అధికారి డాక్టర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్, ఈసీజీ టెక్నీషియన్ లను విచారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.  

స‌భా స‌మ‌రం.. ఈసారి కేసీఆర్ హాజరా? గైర్హాజరా?!

తెలంగాణ‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని గ‌వ‌ర్న‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ సమావేశాలలో ప‌లు అంశాలు చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హిస్తార‌నేది ఈ నెల 9న జ‌రిగే బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా నిధులు వేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.  అందుకు సంబంధించిన విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌పై ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇప్ప‌టికే ప‌లు అంశాల‌తో కూడిన నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ అంశాల‌ను అసెంబ్లీలో చ‌ర్చించి అర్హులైన రైతుల‌కే రైతు భ‌రోసా ద‌క్కేవిధంగా ముందుకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు కొత్త‌గా తీసుకురానున్న ఆర్వోఆర్ చ‌ట్టంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతున్న కుల‌గ‌ణ‌న స‌ర్వే   గ‌ణాంకాల‌ను అసెంబ్లీలో పెట్టి చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై సంవ‌త్స‌రం పూర్తయ్యింది. ఈ సంవ‌త్స‌రకాలంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లుచేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఈ క్ర‌మంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో  ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు   బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తరఫున నేతలు సభలో ఎంత గట్టిగా గళమెత్తినా, కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం సభలో కాంగ్రెస్ దే పై చేయి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ రెండు సందర్భాలలోనూ  కాంగ్రెస్‌, బీఆర్ఎస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌ స్థాయిలో వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌భ‌లో లేక‌పోవ‌టంతో   కాంగ్రెస్‌  ఆధిప‌త్యం  స్పష్టంగా కనిపించింది.  బీఆర్ఎస్ త‌ర‌పున కేటీఆర్‌, హ‌రీశ్ రావు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా కాంగ్రెస్ స‌భ్యులు దీటుగా స‌మాధానం ఇచ్చారు.   కేసీఆర్ స‌భ‌లో ఉండిఉంటే పరిస్థితి వేరేలా ఉండేద‌న్న భావ‌న‌ గత రెండు సందర్భాలలోనూ బీఆర్ఎస్ శ్రేణులలో వ్య‌క్తం అయ్యింది.  కేసీఆర్ మాత్రం ఒక్క‌రోజు మిన‌హా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఒక్క‌రోజు మాత్ర‌మే అసెంబ్లీకి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌జ‌ల బ‌డ్జెట్ కాద‌ని, అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌కు, ప్రాజెక్టుల‌కు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక నుంచి అసెంబ్లీకి వ‌స్తా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంతుచూస్తానంటూ కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల‌కు కేసీఆర్ చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని.. రేవంత్ ఇక కాస్కో అంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అప్పట్లో పోస్టులు పెట్టాయి. అయితే, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ ఎస్ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో నిరాశ‌కు గుర‌య్యాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై అనేక అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ , కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి , విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో అవినీతికి జరిగిందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అంశాల‌పై విచార‌ణ‌కు సైతం  ఆదేశించారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు.  అధికారం కోల్పోయిన నాటినుంచి ఆయ‌న కేవ‌లం ఫాంహౌస్‌కే ప‌రిమితం అవుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ రావాల‌ని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే  గ‌తంలో కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాల‌ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావించగా.. ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇద్దామ‌ని, సంవ‌త్స‌ర కాలం స‌మ‌యం ఇచ్చిన త‌రువాత ప్ర‌భుత్వం ప‌నితీరు, విధానాల‌పై ప్ర‌శ్నిద్దామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి సంవ‌త్స‌ర కాలం పూర్తయ్యింది. అంటే కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. దీంతో  ఈనెల 9నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. బీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ సభకు హాజరౌతారనీ, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతారనీ ఆశాభావంతో ఉన్నాయి.  అన్నిటికీ మించి ఈనెల 9 నుంచి జ‌రిగే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ఎంతో ముఖ్య‌మైన‌వి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయ్యింది. ఈ నేప‌థ్యంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీని నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్షానికి మంచి అవ‌కాశ‌మ‌ని రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు. రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, పెన్ష‌న్ల తొల‌గింపు, మూసీ ప్ర‌క్షాళ‌న పేరుతో పేదల ఇళ్ల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై రేవంత్ సర్కార్ ను నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి ఇదో మంచి అవకాశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి పై చేయి సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ సభకు వచ్చి గళం విప్పాల్సి ఉంటుందనీ, ఆయన గైర్హాజరైతే మాత్రం విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే అవుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రేవంత్ రెడ్డి డిమాండ్ మేర‌కు, బీఆర్ఎస్ శ్రేణుల విజ్ఞ‌ప్తుల మేర‌కు కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తారా.. లేకుంటే ఈసారికూడా డుమ్మా కొడ‌తారా అనే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతున్నది.

పుష్ప సినీమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట..మహిళ మృతి

సినీమా పిచ్చి ఓ మహిళ ఉసురు తీసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం దిల్ షుక్ నగర్ నుంచి తన పిల్లలతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కుమారుడు   తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  వివరాలిలా ఉన్నాయి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి  ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  పుష్ప2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ప్రేక్షకులకు అభివాదం చేయడానికీ అల్లు అర్జున్ కూడా ఆ సమయంలో ఆ థియోటర్ వద్దకు వచ్చారు. దీంతో అల్లు అర్జున్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మరణించగా ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

రోశ‌య్యకు జగన్ నివాళులు.. తెర‌వెనుక పెద్ద క‌థే ఉంది!?

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొండితనానికీ, తనమాటే నెగ్గాలన్న మంకుపట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు.. కాదుకాదు.. కుందేలుకు నాలుగు కాళ్లు అని ఆయ‌న‌కు వివ‌రంగా చెప్పేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నించినా  వారి అంతుచూసే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రు. దీంతో జ‌గ‌న్   గురించి తెలిసిన వైసీపీ నేత‌లు ఏ విష‌యంలోనూ ఆయ‌న‌కు స‌ల‌హా ఇచ్చేందుకు, త‌ప్పుచేస్తున్నారని చెప్పేందుకు సాహ‌సం చేయ‌రు. అధికారంలోకి రాక‌ ముందు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న అలానే ఉంటూ వ‌చ్చింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విచిత్ర నిర్ణ‌యాల‌తో వైసీపీ నేత‌ల‌కు చాలా సార్లు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టారు. అధికారంలో ఉన్నాం క‌దా అని చాలా మంది వైసీపీ నేత‌లు స‌ర్దుకుపోతూ వ‌చ్చారు. జ‌గ‌న్ తన మొండితనంతో తీసుకున్న నిర్ణ‌యాల‌తో చివ‌రికి వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ర‌దాలు క‌ట్టుకొని స‌భ‌ల‌కు వెళ్ల‌డం, రైతుల పాస్ పుస్త‌కాల‌పై తన బొమ్మలు ముద్రించుకోవడం, స‌చివాల‌యాన్నికూడా తాక‌ట్టు పెట్టి అప్పులు తేవ‌డం, ఓ కులంపై క‌క్ష‌ పూరితంగా వ్య‌వ‌హ‌రించడం, అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఇలా త‌న అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ ఓటమికి, ఆయననే నమ్ముకున్న నేతల పరాజయానికీ జగన్ కార‌ణ‌మ‌య్యారు. అయితే ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తరువాత  కూడా జగన్ తన అసంబద్ధ నిర్ణయాలతో    పార్టీని మరింత పతనం దిశగా నడిపిస్తున్నారు. ఈ మాట పలు సందర్భాలలో వైసీపీయులే బాహాటంగా చెప్పారు. అయితే ఇప్పుడు అంటే పూర్తిగా చేతులు కాలిపోయిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ లో కొంత మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలో సెలెక్టివ్ గా కొందరి మాటలకు ఇప్పుడు జగన్ ఎంతో కొంత విలువ ఇస్తున్నారని అంటున్నారు. వారి సలహా మేరకు అప్పుడప్పుడు నడుచుకుంటున్నారని ఉదాహరణలు చూపుతున్నారు.     మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ జ‌గ‌న్ ట్వీట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ జగన్ లో మార్పునకు ఇదే తార్కానం అని అంటున్నారు. జ‌గ‌న్ స్వ‌భావం ప్ర‌కారం ఆయన ఇలా రోశయ్యకు నివాళులర్పించడం మామూలు పరిస్థితుల్లో అయితే జరగదు. తనకు ఇస్టం లేని నేతల మరణం సందర్భంగా ఆయన ఇలా నివాళులర్పించిన సందర్భాలు గతంలో లేవు.    జగన్ ఏ మాత్రం దాపరికం లేకుండా అయిష్టతను బాహాటంగా ప్రదర్శించే నేతలలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఒకరు.  జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి రోశ‌య్య సన్నిహితులు. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అనేక సంద‌ర్భాల్లో రోశ‌య్య చెప్పిన సూచ‌న‌లు వైఎస్ తు.చ. త‌ప్ప‌కుండా పాటించేవారు. ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే జగన్ మాత్రం రోశయ్యకు దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం తనను కాదని రోశయ్యను సీఎం చేయడంతో జగన్ రోశయ్యపై కోపం, అయిష్టతా పెంచుకున్నారని వైసీపీ వర్గీయులే చెబుతుంటారు. అందులో భాగంగానే  రోశయ్య మరణించిన సమయంలో జగన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కూడా వెళ్లలేదు.    ఆ త‌రువాత కాలంలో రోశ‌య్య జ‌యంతి, వ‌ర్ధంతిల‌కు  నివాళుల‌ర్పించిన దాఖ‌లాలు లేవు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి చెందిన వారినికూడా జ‌గ‌న్‌ పెద్ద‌గా ద‌గ్గ‌ర‌కు రాణిచ్చేవారు కాద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అధికారం కోల్పోయిన త‌రువాత ఇప్పుడు జ‌గ‌న్ కు రోశ‌య్య గుర్తుకు రావ‌డం, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్ చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.   జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేత‌లు రోశ‌య్య విగ్రహం పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలకూ జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో రోశ‌య్య‌పై జ‌గ‌న్‌కు ఉన్న కోపాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌త్య‌క్ష్యంగా చూశార‌ని చెబుతారు. దీనికి కారణం వైఎస్ చనిపోయిన తర్వాత హైకమాండ్ రోశయ్యను సీఎంగా చేయడమే. తనను కాదని రోశయ్య సీఎం పదవి తీసుకున్నారన్న కోపం ఉంది. రోశ‌య్య సీఎం అయిన త‌రువాత ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేందుకు జ‌గ‌న్ అనేక ప్ర‌య‌త్నాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ఆయ‌న కోవ‌ర్టుల ద్వారా రోశ‌య్య‌ను అనేక ర‌కాలుగా జ‌గ‌న్ ఇబ్బందుల‌కు గురిచేశార‌ని అప్ప‌ట్లో కొంద‌రు కాంగ్రెస్‌ నేత‌లు మీడియా ముఖ్యంగానూ ప్ర‌స్తావించారు. జగన్ పెట్టిన ఇబ్బందుల కారణంగానే రోశ‌య్య సీఎం పదవి వదిలేసుకున్నార‌ని అప్పట్లో రాజకీయవర్గాలలో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ హైక‌మాండ్ సీఎంగా చేసింది. అయితే, రోశ‌య్య మ‌ర‌ణించిన స‌మ‌యంలోనూ ఆయ‌న పార్దివ దేహానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించేందుకు వెళ్ల‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ, అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ రోశ‌య్య మాట ఎత్తితే జ‌గ‌న్‌ కోప‌గించుకునేవాడ‌ట‌.  ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత జ‌గ‌న్ రెడ్డి తొలిసారి రోశయ్యను గుర్తుచేసుకోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల‌నూ, వైసీపీ శ్రేణుల‌నూ కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.   మా కుటుంబానికి ఆప్తుడు అయిన రోశయ్యకు వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని జ‌గ‌న్  ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన రోశయ్యకు నివాళులర్పించడంపై నెటిజనులు మండిపడుతున్నారు.  సీఎం పదవిలో ఉన్నప్పుడు రోశయ్యకు ఒక్కసారికూడా ఎందుకు నివాళులు అర్పించలేదని  నిలదీస్తున్నారు.  అది పక్కన పెడితే ఇప్పుడు హఠాత్తుగా జగన్ కు రోశయ్యపై అభిమానం, ప్రేమ పొంగుకు రావడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి దగ్గర కావడానికీ, వారి సానుభూతి పొందడానికే జగన్ ఇప్పుడు రోశయ్యను గుర్తు చేసుకుంటున్నారనీ, ఆయన తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడని చెప్పుకుంటున్నారనీ అంటున్నారు.   

వైఎస్ వివేకా హత్య కేసు.. జగన్ బంధువులకు నోటీసులు

జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. అలా నోటీసులు అందుకున్న వారిలో జగన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి మావ మనోహర్ రెడ్డి, సోదరుడు అభిషేక్ రెడ్డి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా మరో ఐదుగురు సాక్షులకు నోటీసులు అందాయి. ఈ పది మందినీ కూడా గురువారం (డిసెంబర్ 5) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.   అయితే ఈ నోటీసులు వివేకా హత్య కేస దర్యాప్తులో భాగంగా కాకుండా వివేకానందరెడ్డి మాజీ పీఎ  కృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్ 15న చేసిన ఫిర్యాదు మేరకు జారీ చేశారు. వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి అలాగే సీబీఐ అధికారి రామ్ సింగ్ లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు తాజాగా జగన్ బంధువులు సహా పది మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వాస్తవానికి వివేకా హత్య కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు విధించిన గడువు ముగిసిపోయింది. దీంతో సీబీఐ విచారణ ఆపివేసింది. గడువు పెంచాలన్న సీబీఐ వినతిపై సుప్రీం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగానే వివేకా హత్య కేసు విషయంలో ఇటు దర్యాప్తు కానీ, అటు కోర్టుల్లో విచారణ కానీ జరగడం లేదు. అయితే ఇప్పుడు పోలీసులు వివేకా హత్య కేసులో తనను వేధిస్తున్నారంటే ఆయన మాజీ పీఏ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.  దీంతో ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆ విచారణలో ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగానే ఇప్పుడు జగన్ బంధువులు సహా పది మందిని పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.  

జగన్ చేతులు కాలిన తరువాత ఆకులు వెతుక్కుంటున్నారా?

రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.  అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెదరాయుడి తీరు నడిచిందేమో కానీ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే భరించలేకపోతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు.  అధికారంలో ఉన్నంత వరకూ జగన్ చూసి రమ్మంటే కాల్చేసి వచ్చినట్లుగా తెగరెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయనో కలిసి నడిచిన నేతలు కూడా ఇప్పుడు వేరు దారి చూసుకుంటున్నారు.   మరో  వైపు జగన్ హయాంలో యథేచ్ఛగా అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఒక్కొక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్ హయాంలో జరిగిన అవకతవలక మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లోనే ఉన్నాయన్నది దర్యాప్తులో వెల్లడౌతుండటంతో.. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టుల నుంచి, అవినీతి, కుంభకోణాలు, హత్యల తీగ లాగే వరకూ అక్కర్లేకుండా ముట్టుకుంటేనే తాడెపల్లి డొంక కదిలిపోతున్నది. దీంతో జగన్ తో ఇంకా అంటకాగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు, కొందరైతే పార్టీకీ దూరమౌతున్నారు.   జగన్ కు సన్నిహితులుగా ఉన్న వారైతే ఉన్న పదవులకు సైతం రాజీనామాలు చేసేసి పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెడుతుంటే.. జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం నటిస్తూ..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే గతంలోలా ఆయన మాటలకు వంత పాడే వారు పార్టీలో కరవయ్యారు. అంబటి, పేర్ని వంటి ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పట్టించుకునే వారే కరవైన పరిస్థితి. ఇక పార్టీ క్యాడర్ ఇప్పటికే కకావికలైపోయింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు.   ఈ నేపథ్యంలోనే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో  జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.     ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో  పార్టీ అభివృద్దితో పాటు భవిష్యత్ కార్యాచరణ  అజెండాగా  చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి జగన్ ప్రజలలోకి వస్తారని చెబుతున్నారు.   ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పార్టీ క్యాడర్ తో భేటీ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పార్టీ క్యాడర్ నూ, ప్రజలనూ పట్టించుకోని జగన్ ఇప్పుడు వారితో మమేకమౌతానంటూ ముందుకు రావడాన్ని వారు స్వాగతించే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.  వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాజీలుగా మారిన నేతల్లో అత్యధికులు జగన్ తీరు కారణంగానే ఓటమి పాలయ్యామని బాహాటంగానే చాటారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలనూ, కార్యకర్తలనూ పూర్తిగా విస్మరించిన జగన్ క్షేత్ర స్థాయి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించారు. చెబుదామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ గళమెత్తారు.   ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు  జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల డొంక కూడా కదులుతున్నట్లు భావిస్తున్నారు. ఆ కేసు విచారణ, దర్యాప్తు నత్తనడకన నడవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వివరాలన్నీ సమర్పించాల్సిందిగా సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ తరుణంలో పూర్తిగా చేతులు కాలిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ  నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కీలకభేటీ కావడం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ, బీజేపీ బంధం కొనసాగుతోందా?.. కూటమి ధర్మం నుంచి బీజేపీకి మినహాయింపు ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసిందంటే అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కారణమనడంలో సందేహం లేదు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పటికి అధికారంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మోడీ సర్కార్ విపక్షంగా వైసీపీ ఏపీలో బలపడటానికి తన వంతు సహకారం అందించారు.  అయిదేళ్ల జగన్ పాలన కారణంగా బీజేపీకి ఇంకా ఆ పార్టీకి వంత పాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో వైసీపీకి తెగదెంపులు తెచ్చి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు వల్ల ఏపీలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. అంతే కాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం రూపంలో బలమైన అండ కూడా లభించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ ఇప్పుడు తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. అయినా కూడా బీజేపీకి వైసీపీతో అనుబంధం వదులుకోవడానికి మనసు రావడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ ఎంపీతో అమిత్ షా భేటీని, ఆ భేటీ జరిగిన సమయాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.   తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విజయసాయి అమిత్ షా భేటీ అయిన సమయాన్ని బట్టి చూస్తుంటే... వైసీపీ అధినేతను ఆదుకోవడానికి, ఆయనను ఆపదలలోంచి బయటపడేయడానికి బీజేపీ ఇంకా తహతహలాడుతోందని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఇటీవలే అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. ఆ కేసులో జగన్ పేరు, ప్రస్తావన ఉంది.  సరిగ్గా ఈ తరుణంలో విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది.  జగన్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఆయన దూతగా విజయసాయి అమిత్ షాను కలిశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పైగా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హస్తిన పర్యటన జరిగిన వెంటనే ఉండటంతో తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అదానీ, జనగ్ అమెరికా కేసు విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడంతో బీజేపీ ఈ విషయంలో జగన్ కు సహకారం అందిస్తున్నదా? అందుకే పవన్ కల్యాణ్ ను అమెరికా కేసు గురించి మాట్లాడవద్దని సూచించిందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.  

భోపాల్ గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు.. నేర్చుకున్న పాఠాలేంటి?

భోపాల్  గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది. ఆ విషాదం నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తు.. పర్యావరణం, ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలకు తిలోదకాలిచ్చేస్తున్నాయి.  ముఖ్యంగా ఏమైనా విపత్తులు సంభవిస్తే సదరు కంపెనీలే పూర్తి బాధ్యత వహించాలన్న దిశగా ఇప్పటికీ చట్టాలు లేకపోవడం దారుణం.  1884 డిసెంబర్ 3వ  భోపాల్లో  యూనియన్ కార్బైడ్  ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసనియేట్ వాయువు లీకైంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న  చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిద్రలోనే ఈ విషవాయువు ను పీల్చడంతో కళ్లు విపరీతంగా మండడంతో ఇళ్లు నుంచి బయటకు వచ్చారు.ఊపిరి తిత్తులలోకి ఈ వాయువు వెళ్ళడంతో ఆస్పత్రులకు పరిగెత్తారు. మధ్యలోనే రోడ్లపై ప్రాణాలు వదిలారు. తెల్లవారేసరికి నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. విషవాయువు పీల్చి మరణించిన వారి సంఖ్య  పాతిక వేలకు పైనే ఉంటుదన్నది ఒక అంచనా, మృతులే కాకుండా మరో ఆరు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఇప్పటికీ వారిని ఆ పీడ వదలలేదు. అప్పుడు గర్భవతులు గా ఉన్న తల్లులు కన్న పిల్లలు ఇప్పటికీ అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. వారి తరువాత తరాల వారు కూడా అనేక రోగాలతో బాధపడుతునే ఉన్నారు. అత్యంత దారుణమేమంటే ప్రమాదం జరిగిన వెంటనే 6వతేదీ అమెరికా నుంచి ఆ కంపెనీ చైర్మన్ వారెన్ అండర్సన్ భోపాల్ వచ్చారు.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిధి గృహంలో బంధించారు. కేవలం మూడు వేల మంది చనిపోయారని,1.2లక్షల మంది అస్వస్థతకు గురైనారని అంచనా వేసి1989లో నష్టం పరిహారం 47కోట్ల డాలర్లతో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ ఈ  గ్యాస్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కంపెనీ సరిగా వెల్లడించలేదు. అ  అండర్సన్ వెంటనే  స్వదేశానికి తిరిగి వెళ్లేలా  అమెరికా ప్రభుత్వం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ఒత్తిడి తీసుకువచింది. దీంతో   కేవలం నామమాత్రపు పూచికత్తుపై బెయిల్ తీసుకుని అండర్సన్  విమానంలో అమెరికా వెళ్లిపోయాడు.పరిహారం నామమాత్రమే పుట్టడంతో బాధితులు కోర్టులు,అంతర్జాతీయ సంస్థలు చుట్టూ తిరిగినా ప్రయోజనం కలగలేదు. అండర్సన్ భారత్ వైపు తిరిగి చూడలేదు. కంపెనీ నష్టపరిహారం ఒప్పందం మించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి.  ఆ కర్మాగారం మూతపడినా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. నిజానికి మిథైల్ ఐసోసనియేట్ వాయువు సైనేడ్ అంత ప్రమాదమని అనంతర పరిశోధనలలో తేలింది.ఈ ప్రమాదం అనంతరం జన్మించిన అనేక మంది పిల్లలు వికలాంగులుగా పుట్టారు.శిశు మరణాల రేటు భోపాల్ లో ఇప్పటికీ అధికంగానే ఉంది. మూడు తరాలు మారినా అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.నేటికీ న్యాయంకోసం ప్రధాని మోడీకి కన్నీళ్లతో విజ్ఞాపనలు పంపేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క కంపెనీ నిర్లక్షమే ఇంతటి వినాశనం సృష్టిస్తే భారత్ కు కుప్పలుతెప్పలుగా వస్తున్న కంపెనీలు ఎంతవరకూ క్షేమదాయకమో ఊహించలేం.ఉన్న స్వదేశీ కంపెనీలే విషాన్ని కక్కుతుంటే కాలుష్య నియంత్రణ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ మందుల తయారీ కంపెనీలు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిషిద్ధ వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. అయినా అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.అదే విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా ఉంటారా అనేది అనుమానమే. అలాంటి పరిస్థితి రాకుండా కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు చేపట్టేలా అధికారులు,ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకునేలా చట్టాలు రావలసిన అవసరం ఉంది.  

అమరావతే చంద్రబాబు ఆవాసం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో  అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెళ్లడించారు. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది.  అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే విధంగా శాశ్వత నివాసాన్ని నిర్మించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇందు కోసం ఇటీవల వెలగపూడి లో పాతికవేల  చదరపు గజాల స్థలాన్ని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. రాష్ట్ర ల్యాండ్ పూలింగ్ పథకం కింద ముగ్గురు రైతుల నుండి కొనుగోలు చేసిన ఈ భూమి   గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలకు సమీపంలోనే ఉంది.  ఈ ప్లాట్‌కు నాలుగు వైపులా రహదారి సౌకర్యం ఉంది.  అలాగే  సీడ్ యాక్సెస్ మార్గానికి అనుసంధానమై ఉంది. దాదాపు 5.5 ఎకరాల్లో నిర్మించనున్న ఈ నివాసంలో పార్కింగ్ సౌకర్యాలు, సిబ్బందికి వసతి కల్పించనున్నారు. సన్నాహక భూ పరీక్షలు  జరుగుతున్నాయి మరియు త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.  

పాపాల పుట్ట పగులుతోంది!

అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వారందరికీ ఇప్పుడు కర్మ ఫలం అనుభవించకతప్పని పరిస్థితి ఎదురౌతోంది.  జగన్ హయాంలో  దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదరింపులకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడపోర్టు, కాకినాడ సెజ్ లలో బలవంతంగా షేర్లు లాక్కొని చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అలాగే అరబిందో కంపెనీపై కేసు నమోదైంది. కాకినాడ పోర్టు, సెజ్ లలో తన నుంచి బలవంతంగా  షేర్లు లాక్కొన్నారంటూ కేవీరావు సీఐడీకి చేసిన ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదైంది. కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయి, విక్రాంత్ రెడ్డి, అరబిందో కంపెనీలు కేవీరావును బెదరించి దౌర్జన్యంగా కాకినాడ పోర్టు, సెజ్ లలో షేర్లు లాక్కొన్నారు. కాకినాడ పోర్టులో పాతిక వందల కోట్ల రూపాయల విలువైన షేర్లు తీసుకుని కేవలం 494 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారనీ, అలాగే కాకినాడ సెజ్ లో 1104 కోట్ల వివువైన షేర్లకు కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారనీ కేవీరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు విజయసాయి, విక్రాంత్, అరబిందో కంపెనీపై పోలీసులు క ేసు నమోదు చేశారు.  కాగా తాను ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వీరి దుర్మార్గంపై ఫిర్యాదు చేశాననీ, అయినా ఆయన పట్టించుకోలేదనీ కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.    కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు  పోర్టులో రూ.2500 కోట్ల విలువైన తన వాటాను రూ.494 కోట్లకు, సెజ్‌లో ఉన్న రూ.1109 కోట్ల విలువైన వాటాను కేవలం రూ.12 కోట్లకే లాక్కున్నారని సీఐడీ అడిషనల్ డీజీకి ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు మేరకు  మంగళగిరి సీఐడీ అధికారులు  ఐపీసీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో తమ కంపెనీని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని కేవీరావు ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు.  చెన్నైకి చెందిన శ్రీధర్‌ అండ్‌ సంతానం కంపెనీ, ముంబైకి చెందిన మరో సంస్థ తోనూ ఆడిట్‌ చేయించామని చెప్పి ఎలాంటి అవకతవకలకూ పాల్పడకుండా నిజాయితీగా నడుపుతున్న తమ సంస్థ .. ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆడిట్ నివేదిక ఉందని చెప్పారనీ, అదే సమయంలో విజయసాయి రెడ్డి తమకు ఫోన్ చేసి జగన్‌ మోహన్ రెడ్డి బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డిని కలవాలని చెప్పారని తెలిపారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. ‘మీ కుటుంబం జైలుకు వెళ్లకూడదనుకుంటే కంపెనీ షేర్లన్నీ అమ్మేయండి’ అంటూ బెదిరించానని కేవీ రావు వాపోయారు. ఇది తన మాట కాదని, సీఎం జగన్‌ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి బెదరించారని కూడా కేవీరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.    ఇక కాకినాడ సెజ్‌ విషయానికి వస్తే  1999 నుంచి జీఎంఆర్‌తో  కలిపి తాము అభివృద్ధి చేశామని కేవీ రావు పేర్కొన్నారు. సెజ్‌లో 48.74శాతం తమ కుటుంబ వాటా కాగా, మిగిలింది జీఎంఆర్‌ వాటా అని వివరించారు. తమ వాటాగా 8 వేల ఎకరాల భూమి, పోర్టులో షేర్లు ఉన్నాయని, వైసీపీ సర్కారు బాధలు పడలేక సెజ్‌లో తమ భూమి, వాటాను రూ.400 కోట్లకు భాగస్వామి జీఎంఆర్‌కు అప్పగించాల నుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఆ ఆస్తి విలువ రూ.1104 కోట్లే అయినప్పటికీ భాగస్వామి కావడంతో జీఎంఆర్‌‌కు వదిలేయాలనుకున్నామని, ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని పేర్కొన్నారు. అయితే ఈ డీల్‌ను రద్దు చేసుకొని భూమి మొత్తం తమకే అప్పగించాలంటూ అరబిందో యాజమాన్యం తమను బెదిరించిందని కేవీ రావు వివరించారు. భూమిని తమకు ఇవ్వకుంటే జైలుకు పోవాల్సి ఉంటుందని బెదిరించిందని పేర్కొన్నారు. రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి కాకినాడ సెజ్‌లో ఉన్న 48.74 శాతం తమ వాటాను లాక్కున్నారని కేవీరావు పేర్కొన్నారు.  

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా సంజయ్ జగన్ సర్కార్ మెప్పు కోసం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యవహరించారు. జగన్ కనుసన్నలలో ఆయన ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లల్లా పాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంజయ్ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ వైసీపీ ప్రైవేటు సైన్యంలా పని చేసింది. అయితే ఇప్పుడు పాపం పండింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంజయ్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇఫ్పుడు ఆయననై సస్పెన్షన్ వేటు వేసింది.   అలాగే సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. ఈ వ్యవహారంలోనే ఆయన ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. పనులు జరగకుండానే పెద్ద ఎత్తున నిధులను దిర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్...నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.  

ఇక కోరినన్ని లడ్డూలు!

తిరుమల ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో నియంత్రణ ఎత్తివేసింది. భక్తులకు కోరినన్ని లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరించడమే కాకుండా, తిరుమల వెళ్లి వచ్చిన తరువాత ఆ లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు, ఇరుగుపొరుగులకు పంచుతుంటారు. అందుకే తిరుమల దర్శనం చేసుకున్న వారంతా ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే ఇంత కాలం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విక్రయించే లడ్డూలపై నియంత్రణ విధించడంతో అవసరమైనన్ని లడ్డూలు కొనుగోలు చేయలేక భక్తులు నిరాశ చెందే పరిస్థితి ఉంది. అయితే ఇక నుంచి భక్తులను నిరాశ పరచకుండా వారు కోరినన్ని లడ్డూలను సరఫరా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం అదనపు లడ్డూల   తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది.  భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా లడ్డూల తయారీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది. కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70 వేల మంది ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70 వేల ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు.