sakshi media anty kcr

అంతా కేసీఆర్ ఆత్రమే తప్ప, అటు నుంచి ఏమీ లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవాలని, ఏపీ ఇంకా సర్వనాశనం అయిపోవాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ ఆయన కుటుంబం కోరుకుంటూ వుంటారు. ఆ దిక్కుమాలిన కోరికేదో తమ మనసులోనే ఉంచుకోకుండా, ఎవరు అడిగినా ఏపీలో జగన్ గెలుస్తాడు అని సంబరపడిపోతూ చెబుతూ వుంటారు. జగన్ గెలవాలని వీళ్ళు మురిసిపోతూ కోరుకోవడమే తప్ప జగన్ గానీ, ఆయన పార్టీ వర్గీయులు గానీ, జగన్ మీడియా గానీ కేసీఆర్ విషయంలో ఎలాంటి ప్రేమాభిమానాలూ ప్రదర్శించడంలేదు. సాధారణంగా ఎక్కడైనా జరిగేది ఏమిటంటే... నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అనే స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఏపీలో జగన్ గెలుస్తాడు అని కేసీఆర్ కుటుంబం పదేపదే చెబుతున్నప్పడు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని వైసీపీ వాళ్ళు ఒక్కరైనా చెప్పి చెల్లుకు చెల్లు చేసుకోవాలి కదా. అలాంటిదేమీ వైసీపీ వాళ్ళవైపు నుంచి లేదు. నువ్వు మా చెక్క భజన చేసుకుంటే చేసుకో.. మేం నీ ముఖం కూడా చూడం నువ్వు ఎలా చస్తే మాకేంటి అన్నట్టుగానే వాళ్ళ ధోరణి వుంది. మొన్నామధ్య ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వన్ టైమ్ బెన్‌ఫిట్ లాగా జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసులను పంపి, తెలంగాణ ప్రజలను కేసీఆర్‌కి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అదరగొట్టేస్తాడు అని వైపీపీ వాళ్ళెవరూ చెప్పిన పాపన పోలేదు. అలా చెప్పకపోతే పోయారు.. కనీసం నెగటివ్‌గా అయినా చెప్పకుండా వుండొచ్చు కదా.. కానీ, ఆ దారుణం జరిగిపోయింది. వైసీపీ ఆస్థాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో కొంతసేపు తన సుత్తి కొడుతూ వుంటారు. ‘జగన్ సాక్షాత్తూ దేవుడు’ అనే మాట అనరు తప్ప, ఆయన చేసే జగన్ భజన ఆ రేంజ్‌లోనే వుంటుంది. అలాంటి ఆయన శనివారం నాడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మీద సుదీర్ఘ సుత్తి కొట్టారు. అటు తిప్పీ ఇటు తిప్పీ ఆయన తేల్చింది ఏమిటంటే, పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్‌కి అంత సీన్ లేదు. అసలు పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యలో వుంది. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఆటలో అరటిపండ్ల మాదిరిగా మిగిలిపోయారు. ఈ ఐదేళ్ళూ కేసీఆర్ జనంలో వుండి, జనం నమ్మకాన్ని గెలుచుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు మిగులతారు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. సర్వనాశనం అయిపోతారు... అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఖర్మరా బాబూ.... పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!

palnadu result decided

ఫలితాల వరకూ ఆగక్కర్లేదు.. పల్నాడు గెలుపు ఎవరిదో తెలిసిపోయింది!

పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది. ఆ ఎన్నికలలో కోడెల శివప్రసాదరావు వంటి సీనియర్ మోస్ట్ నేతలు సైతం పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీ వేధింపులు తట్టుకోలేక కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పల్నాడు పూర్తిగా వైసీపీ కోటగా మారిపోయింది. అక్కడ వైసీపీ ఆడిందే ఆట, పాడిందే పాట చందంగా తయారైంది. 2019 లగాయతు.. ఇప్పటి వరకూ పల్నాడులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు వైసీపీ మూకలు నరకం అంటే ఏమిటో చూపాయి. నిత్యం వేధింపులు, దాడులతో చెలరేగిపోయాయి. పల్నాడులో స్థానిక ఎన్నికలన్నీ ఏకపక్షంగానే మారిపోయాయి. దౌర్జన్యాలు, దాడులు, గృహదహనాలే కాకుండా హత్యలతో కూడా వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. అయితే తలుపులు మూసి ఉంచితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నట్లుగా ఈ ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ ధైర్యంగా నిలబడింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటించింది. ఎన్నికలలో బూత్ ఆక్రమణలు, రిగ్గింగును గట్టిగా నిలువరించింది. తెలుగుదేశం ప్రతిఘటనతో వైసీపీ మూకలు వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఐదేళ్ల దారుణ అణచివేత తరువాత కూడా వైసీపీ శ్రేణులు పుంజుకుని ధైర్యంగా నిలబడగలగడం విస్మయపరిచింది. చావో రేవో అన్నట్లుగా వారు తెగించి పార్టీ కోసం నిలబడ్డారు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. దీంతో వైసీపీ మూకలు ఎంతగా దౌర్జన్యాలకు పాల్పడినా పోలింగ్ మాత్రం భారీగా జరిగింది. పోలింగ్ తరువాత పల్నాడు వైసీపీ నేతలు మీడియా మైకుల ముందుకు వచ్చి ఎన్నికలలో అక్రమాలు జరిగాయి. అధికారులు, పోలీసులు తెలుగుదేశం కూటమికి పూర్తిగా సహకరించారు అంటూ ఏడుపు ముఖాలతో ఆరోపణలు గుప్పించడంతోనే ఇక్కడ పోలింగ్ సరళి, ప్రజల మద్దతు ఎవరివైపు ఉందో అందరికీ అర్ధమైపోయింది. దీంతో కనీసం కౌంటింగ్ అయినా సజావుగా జరగకుండా చేయాలన్న వ్యూహంతో వైసీపీ మూకలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండను కొనసాగించారు. తెలుగుదేశం శ్రేణులు దానినీ ధైర్యంగా ఎదుర్కొన్నాయి. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి,  ఆయన సోదరుడు పరారై అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారంటే పల్నాడులో వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అవగతం చేసుకోవచ్చు. సర్వేలతో,  జూన్ 4న వెలువడే ఫలితాలతో సంబంధం లేకుండానే పల్నాడులో ఫలితమేమిటన్నది వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ రాష్ట్రం మొత్తానికీ అర్ధమయ్యేలా చేసింది.  

Windstorm in Bay of Bengal..Rain forecast for Coastal Andhra

బంగాళాఖాతంలో వాయుగుండం..కోస్తాంధ్రకు వర్ష సూచన 

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది.  ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.  ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  మరోవైపు, నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. కాగా, ఈ వాయుగుండం ప్రభావం కారణంగా కోస్తా జిల్లాలతో పాటు.. తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే, చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాల్లో ఆకాశం దట్టమైన మేఘాలు ఉన్నాయి. 

sit on poll roits

వైసీపీకి పోయేకాలం ఆలోచనలు!

ఏపీలో అల్లర్లపై ఈసీ ఆదేశాలతో 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా 13 మంది సీనియర్ పోలీస్ అధికారులను నియమించారు. అయితే, వైసీపీ నాయకులకు మాత్రం ‘సిట్’ ఏర్పాటు కంటగింపుగా మారింది. ఈ సన్నాసులు చేసిన చెత్త పనులన్నీ సిట్ బయటపెడుతుందని భయపడుతున్నారు. ఎన్నికల కోడ్ లేకుండా వుంటే తాము ‘సిట్’ అటే కూర్చుని, ‘స్టాండ్’ అంటే నిల్చునే వాళ్ళతో ‘చాలా పద్ధతి’గా విచారణ జరిపించి వుండేవారు. ఈ ‘సిట్’ ఈసీ ఆదేశాలతో ఏర్పడింది కాబట్టి ఇక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకే వంక దొరకనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టు ‘సిట్’ ఏర్పాటులో రంధ్రాన్వేషణ్ మొదలుపెట్టారు. సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట. ఇద్దరూ కలసి పెళ్ళికి వెళ్ళికపోయినా, ఇద్దరూ ఒకేసారి పెళ్ళికి వెళ్ళారు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య స్నేహసంబంధాలు ఉండే అవకాశం వుందట. అందువల్ల ఆయన్ని సిట్ బాధ్యత నుంచి తప్పించాలట. పోయేకాలం వచ్చినవాళ్ళకి పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయంటారు చూశారా.. ఇదీ అలాంటిదే!

full stop to nagababu and allu dispute

నాగబాబు.. అల్లు అర్జున్ వివాదానికి తెరపడినట్లేనా?

రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ  సీనియర్ నాయకుడు  నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.  ఇంతకే నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేసిందని అంతా భావించడానికి కారణమేమిటంటే.. ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఇది  రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది. ఎంత మిత్రుడైనా నంద్యాల వెళ్లి మరీ మద్దతు తెలపడానికి ఇదా సమయం అంటూ విస్తృత చర్చ జరిగింది. సరే దానికి అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేదు.. ఫ్రెండ్ అయితే చాలు ఎంత దూరం వెళ్లైనా మద్దతు తెలుపుతా అని చెప్పాడనుకోండి అది వేరే సంగతి.  అంతకు ముందు పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ తీరు మెగా ఫ్యామిలీతో ఆయనకు విభేదాలున్నాయన్న భావన కలిగించింది.   సరిగ్గా ఈ నేపథ్యంలో నాగబాబు  మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు మావాడైనా పరాయివాడేనంటూ  ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన ట్వీటేనంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. నాగబాబు టార్గెట్ గా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు నాగబాబు తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తాజాగా ఆయన మళ్లీ తన ఎక్స్ ఖాతాను యాక్టివేట్ చేసి అల్లు అభిమానుల మనోభావాలను గాయపరిచిన ఆ ట్వీట్ ను తొలగించేశానని పేర్కొన్నారు. సొంత వాళ్లయినా పరాయివాళ్లే అన్న ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు అంతటి  ఆగ్రహం కలిగిస్తుందని నాగబాబు ఊహించి ఉండరు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఆయన ఆ ట్వీట్ ను తొలగించాను అని పేర్కొన్నారు. మొత్తం మీద నాగబాబు వెనక్కు తగ్గడంతో ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

jagan house for sale

జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఫర్ సేల్!?

ఆంధ్రప్రదేశ్ ఊడిపోయిన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో కొంత తన సొమ్ముతో, చాలా జనం సొమ్ముతో కట్టించుకున్న ‘తాడేపల్లి ప్యాలెస్’ని అమ్మకానికి పెట్టే ఆలోచనలు జరుగుతున్నాయని అభిజ్ఞవర్గాల భోగట్టా. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అమరావతి రాజధానిగా అద్భుతంగా పరిపాలించేస్తాను అని చెప్పి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు జగన్. ఆ ఇంటి గృహప్రవేశం సందర్భంగా వైసీపీ వాగుడుకాయలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని మార్చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. రాజధాని మార్చేపనయితే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? అని పిచ్చి లాజిక్ ఒకటి చెప్పి జనాన్ని నమ్మించారు. చివరికి ఏమైంది. జగన్‌ ఇల్లయితే కట్టుకున్నారుగానీ, అమరావతిని ధ్వంసం చేసిపారేశారు. తాడేపల్లిలో తన ఇల్లు కళకళలాడుతూ వుందిగానీ, అమరావతే ఘోస్ట్ సిటీగా మారిపోయింది. అందరికీ ఓ టైమ్ వస్తుంది. ఇప్పుడు జగన్‌కీ ఓడిపోయే టైమ్ వచ్చింది. ఈ ఎన్నికలలో వైసీపీ ఓటమి కన్ఫమ్ అయిపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్‌కి తాడేపల్లిలో పనేం లేదు.  ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన ఒక్కడి రాజధాని వైజాగ్‌లోనే వుండొచ్చు. లేదా హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోనే, బెంగళూరు ప్యాలెస్‌లోనే వుండొచ్చు. అంతే తప్ప తాడేపల్లిలో వుండటానికి ముఖం చెల్లదు కదా.. తాడేపల్లి ప్యాలెస్ కట్టే సమయంలో జగన్ నిబంధనలు సక్రమంగా పాటించలేదు. తవ్వి తీయాలేగానీ, ఎన్నో లొసుగులు బయటపడే అవకాశం వుంది. జగన్ అధికారం చేపట్టిన వెంటనే నిక్షేపం లాంటి ప్రజావేదికని కూల్చి విధ్వంసానికి అంకురార్పణ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వంలాగా ఆలోచించి జగన్ తరహా విధ్వంసాన్ని జగన్ ప్యాలెస్ నుంచే ప్రారంభిస్తే పరిస్థితి ఎలా వుంటుందోన్న భయం వైసీపీ వర్గాల్లో వున్నట్టు సమాచారం. చంద్రబాబు మనలాంటి విధ్వంసకారి కాదు అనే ధైర్యం వున్నప్పటికీ, ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.

sharmila america tour

అమెరికా పర్యటన.. షర్మిల కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అయితే పోలింగ్ ముగిసిన తరువాత కనీసం మీడియా ముందుకు రాలేదు. ఎక్స్ వేదికగా ప్రజలకు కృతజ్ణతలు తెలిపి, గెలపుపై ధీమా వ్యక్తం చేసి చేతులు దులిపేసుకున్నారు. ఐప్యాక్ కు వీడ్కోలు లాంటి సమావేశంలో ఒక సారి కనిపించారు అంతే. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస రావణకాష్టంలా రగులుతుంటే.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా హింసాకాండకు స్వస్తి చెప్పాలన్న పిలుపు కానీ, హింసను ఖండిస్తూ ప్రకటన కానీ చేయలేదు. కోర్టు అనుమతి తీసుకుని కుటుంబంతో విదేశాలకు చెక్కేశారు.  మరో వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలంగ్ ముగిసిన తరువాత ఎన్నికల సరళిని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత జరిగిన జరుగుతున్న హింసాకాండను ఖండించారు. హింసను అదుపు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. చంద్రబాబు కూడా హైదరాబాద్ చేరుకున్నప్పటికీ ఆయన పార్టీ శ్రేణులతో, నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని గమనిస్తూ అవసరమైన దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఇక కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల మాత్రం పోలింగ్ ముగిసిన తరువాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎక్స్ వేదికగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు. అంతే ఆమె హుటాహుటిన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో షర్మిల అమెరికా యానానికి కారణాలపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే  అపుపెరుగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పోలింగ్ పూర్తియిన తరువాత తన కుమారుడు, తల్లితో గడిపేందుకు అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో  మాత్రం ఆమె ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారనీ, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించారనీ పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమౌతున్నాయి. అయితే కాంగ్రెస్ వాటిని ఖండించింది. అలాగే షర్మిల  సన్నిహితులు కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతో కానీ, జగన్ రెడ్డితో కానీ రాజీపడరనీ, ప్రచారంలో ఉన్న వదంతులన్నీ అవాస్తవాలనీ కరాఖండీగా చెబుతున్నారు.  

TSP set results release

  టీఎస్-ఎప్సెట్ ఫలితాలు విడుదల ...బాలికలదే పై చేయి

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదయింది. ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అదే ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి మే 7, 8వ తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌రిగాయి. అలాగే  9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించ‌డం జ‌రిగింది.

bettings on tdp alliance candidates majorities in konaseema

కోనసీమలో బెట్టింగుల జోరు.. గెలుపు ఓటములపై కాదు.. మెజారిటీలపైనే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం. అయితే పోలింగ్ సరళి, పార్టీల మూడ్ ను బట్టి ఫలితం ఊహించేయవచ్చు. అన్నిటికీ మించి ఎన్నికల ఫలితంపై జరుగుతున్న బెట్టింగ్ లు కూడా ఫలితంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడతాయి.  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఇక కోనసీమలో అయితే ఈ బెట్టింగుల జోరు మరో లెవెల్ కు చేరింది. సాధారణంగా బెట్టింగులు అంటే ఫలానా పార్టీ విజయం సాధిస్తుంది. ఫలానా అభ్యర్థి గెలుపొందుతాడు అంటూ సాగుతాయి. కానీ కోనసీమలో మాత్రం బెట్టింగులు గెలపు ఓటములపై జరగడం లేదు. తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మెజారిటీలపై సాగుతున్నాయి. ఈ బెట్టింగులు లక్షల రూపాయలు దాటి కోట్లలోకి చేరుతున్నాయి. కోనసీమ మూడ్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేసేసినట్లు కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు సాధించబోయే మెజారిటీలపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారంటూ లక్షలలో బెట్టింగులు నడుస్తున్నాయి. అలాగే  ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో  తెలుగుదేశం కూటమి అభ్యర్థి పది వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారనీ పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. అదే విధంగా తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల మెజారిటీలపై ఐపీఎల్ బెట్టింగులను మించి బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుల తీరు చూస్తుంటే ఫలితానికి ముందే కూటమి అభ్యర్థుల విజయం ఖారరైపోయినట్లు కనిపిస్తోంది. బెట్టింగులన్నీ మెజారిటీలపైనే జరగడాన్ని చూస్తుంటే తూర్పుగోదావరిలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

mallareddy land kabza

ప్రపంచ వింత: మల్లారెడ్డి భూమి కబ్జా!

మాజీ ఎంపీ, మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా..’ మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చని గిట్టనివారు అంటూ వుంటారు. మల్లారెడ్డికి వున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలాశాతం కబ్జాల పుణ్యమేనని కూడా అంటూ వుంటారు. అలా కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత.  కుత్బుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలోని మల్లారెడ్డికి, అతని అల్లుడు రాజశేఖరరెడ్డికి చెందిన స్థలంలో కొంతమంది బారికేడ్లు పెట్టి కబ్జా చేశారట. దాంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, వాళ్ళ అనుచరులు  సదరు స్థలం దగ్గరకి వచ్చి హడావిడి చేశారు. అక్కడకి పోలీసులు కూడా రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి స్థలాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారా.. వేరేవాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారా అనేది నిలకడ మీద తెలుస్తుంది. 

sakuni sajjala

శకుని సజ్జల!?

మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులు అందరూ చూశారు. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిలుపైనే ఉన్నారు. సకుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవలసిన పరిస్థితి జగన్ ది. అది పక్కన పెడితే..   2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. , వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య కూడా సానుభూతిని ప్రోది చేసి జగన్ విజయానికి దోహదపడింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన విజయం కోసం ఇల్లూ వాకిలీ వదిలి మరీ తిరిగిన సొంత చెల్లి షర్మిలను,  దూరం పెట్టారు.  షర్మిల తెలంగాణలో  సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం,  తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్లిపోవడం ఇదంతా జనానికి తెలిసిందే.  అయితే జనానికి తెలియనిది  వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది.  వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ వైఎస్ కుటుంబానికి తెలుసు. ఈ హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేయించారో కూడా  తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కని పెంచిన తల్లి కూడా జగన్ కు ఎందుకు దూరంగా జరిగారో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.   ఆ ఇంటిగుట్లన్నీ, ప్రజలకు తెలియని ఆ కుటుంబ రహస్యాలన్నీ బయటకు వచ్చేలా చేసింది సజ్జలే. ఔను.. షర్మిల తెలంగాణలో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కూడా జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలకు దిగలేదు. అలాగే జగన్ కూడా చెల్లి షర్మిలపై నేరుగా విమర్శలు గుప్పించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై కొన్ని అనుచిత పోస్టులు కనిపించినా జనం కానీ షర్మిల కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీతోనే  విజయవాడలో పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలు పెట్టారా సీఎం జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల సున్నితంగా రిటార్డ్ ఇచ్చారు.   జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగిపోయి ఉండేది. కానీ సజ్జల ఎంటరై  చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారనీ నిందలేశారు. అక్కడితో ఆగకుండా అసలు జగన్ షర్మిలకు చేసిన అన్యాయమేంటో చెప్పాలని రెచ్చగొట్టారు. దాంతో షర్మిల ఓపెన్ అయిపోయారు.  జగన్ తనకు చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తండ్రి ఆస్తిలో వాటాను ఎలా ఎగ్గొట్టారో, ఏదో కొంత ఇచ్చి దానిని అప్పుకింద ఎలా రాయించుకున్నారో జనం కళ్లకు కట్టారు. సొంత బాబాయ్ వివేకా హత్య నిందితులను వెనకేసుకువస్తున్న సంగతీ చెప్పారు. జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ బహిరంగ వేదికలపైనే ఎండగట్టారు. కడపలో ఆమె జగన్ ప్రతిష్టను పాతాళానికి పాతేశారు. దీంతో మొత్తం వైసీపీయే డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ సజ్జలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ఇక పోలింగ్ పూర్తయిన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఏమూలో ఉన్న గెలుపు విశ్వాసాన్ని కూడా సజ్జల ఊదేశారు. మీడియా ముందకు వచ్చి గెలుస్తామంటూ ఓ పక్క చెబుతూనే ఎన్నికల సంఘం చంద్రబాబు ఆదేశాలను పాటించిందంటూ విమర్శలు చేయడం ద్వారా  ఎన్నిలక ఫలితం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే శకుని కౌరవులకు చేసిన మేలే సజ్జల వైసీపీకి చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. శకుని కౌరవ పతనానికి కారకుడైతే.. సజ్జల వైసీపీ ఓటమికి కారకుడౌతున్నారని అంటున్నారు. 

Revanth shelter RGV for political asylum

రాజకీయ ఆశ్రయం కోసం రేవంత్ పంచన ఆర్జీవీ

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత  తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలపై చిత్రం నిర్మించారు. పూర్తి అవాస్తవాలతో తెరకెక్కిన చిత్రం ఇది. .  జగన్ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. తాజాగా ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. త్రికూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న వార్తలు వస్తున్నాయి.  ఎలాంటి నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ  డైరక్టర్ల అసోసియేషన్ అంటూ  ఈ కొత్త డ్రామాకు తెరతీశాడు.  కొంత మందితో కల్సి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. పబ్లిసిటీ  పిచ్చిబాగా ఉన్న రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా  చూసుకున్నారు. గతంలో  డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించని వర్మ సడెన్ గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.  డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి వచ్చి  ఎవరైనా కలిస్తే కించ పరిచేవారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ?   ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది. 

pinnelli brothers escape to hyderabad

పి(న్నె)ల్లి వారి పల్నాటి ‘పిరికితనం’!

పల్నాటి పౌరుషం గురించి మనం కథలు కథలుగా విని వుంటాం. పలనాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుడి పౌరుషం గురించి తెలుసుకుని పులకరించిపోయి వుంటాం. ‘పల్నాటి యుద్ధం’, ‘పల్నాటి పౌరుషం’ సినిమాలు చూసి మన తెలుగువారికి ఇంత గొప్ప చరిత్ర వుందని హ్యాపీగా ఫీలై వుంటాం. తెలుగువారందరి మనసులలో ‘పల్నాడు’ అనే మాట వింటేనే పౌరుషంతో పిడికిళ్ళు బిగుసుకునే ఒక ఫీల్....! ఆ ఫీల్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది.. అంతటి పౌరుషం గడ్డ మీద పుట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టు అయిపోతామనే భయంతో పిల్లిలాగా గోడ దూకి హైదరాబాద్ పారిపోయారన్న విషయం తెలుసుకుని, వీళ్ళిద్దరి విషయంలో ‘పల్నాటి పౌరుషం’ అనే మాటని పక్కన పెట్టి... ‘పల్నాటి పిరికితనం’ అనే మాటని ఉపయోగించాలని అనిపించడం న్యాయమే. ఈ బ్రదర్స్ ఇద్దరూ పోలింగ్ సందర్భంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలూ చేశారు. రౌడీ మూకల సహకారంతో రక్తాన్ని పారించారు. ఎదుటి వారి మీద దాడి చేయడం పౌరుషం అవదు.. పిరికితనం అవుతుంది. పోలింగ్ సందర్భంగా వీరిద్దరూ భారీ స్థాయిలో పిరికితనం ప్రదర్శించారు. వీరి నేరాలు, ఘోరాలు బయటపడి హౌస్ అరెస్ట్ అయ్యారు. చివరికి అరెస్టు అయి జైల్లో పడే అవకాశం వుందని తెలుసుకుని, ఇంటి వెనుక గోడదూకి హైదరాబాద్‌కి పారిపోయారు. వీళ్ళిద్దరూ పిరికివాళ్ళని తెలుస్తుందిగానీ, మరీ ఇంత పిరికివాళ్ళని ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి ఇంటి పేరు ‘పిన్నెల్లి’ అని కాకుండా ‘పిల్లి’ అని మార్చుకోవడం మంచిది. ఇలాంటి పిరికి పిల్లులు పల్నాటి గడ్డ మీద భవిష్యత్తులో పుడతారని తెలిసుంటే బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు ఈ ప్రాంతం వదిలి పారిపోయి వుండేవారు.. వీళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతానని భయపడిపోయి లండన్ పారిపోయారు. వీళ్ళిద్దరూ అరెస్టు అవుతామని భయపడి హైదరాబాద్ పారిపోయారు. వీళ్ళిద్దరూ తిరిగి పల్నాడులో అడుగు పెట్టకుండా వుంటే ఆ ప్రాంతానికి గౌరవం. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.

tadepally palace direction behind palnadu violence

తాడేపల్లి డైరెక్షన్ లోనే పల్నాడు హింసాకాండ?

ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో  ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కూడా బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా  ఏపీలో అల్లర్లపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం 13 మంది సభ్యులతో   స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్) ఏర్పాటు చేసింది.  నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పోలీసులు తమ పై అధికారుల సూచనలు, ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా అల్లర్లను ప్రేరేపించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిట్ నివేదిక పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులు వైసీపీ మూకలు చెలరేగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారన్న అనుమానాలూ ఉన్నాయి.  పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక  జగన్ అనుకూల పోలీసు అధికారుల పాత్ర ఉందన్న చర్చ పోలీసు అధికారుల్లోనే జోరుగా సాగుతోంది. ఆ అధికారులు ఎన్నికల విధుల్లో లేరనీ, కానీ తమ పలుకుబడిని ఉపయోగించి కింది స్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారని అంటున్నారు.     ఇక సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రాష్ట్రానికి కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా పూర్తి క్రియారహితంగా వ్యవహరించారనీ, ఆయన సీఎస్ ఆదేశాల మేరకే పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి తన వైసీపీ అనుకూల వైఖరితో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఇక తాజాగా ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. సిట్ పై తెలుగుదేశం కూటమి సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు. 13 మంది సిట్ బృందంలో అత్యధికులు ఏసీబీ నుంచే ఉన్నారనీ ఇటీవలే ఎన్నికల విధుల నుంచి ఉద్వాసనకు గురైన మాజీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఏసీబీ చీఫ్ గా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల విధుల్లో లేని నిజాయితీ పరులైన పలువురు   పోలీసు అధికారులు ఉండగా సిట్ లో ఏసీబీ అధికారులకే ప్రాథాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.  

Telugu child Uday Nagaraju in UK Parliament elections

యుకె పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజు 

యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు పోటీ చేయబోతున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ ఎంపీ అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది.  నాగరాజుది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగిన నాగరాజు ప్రఖ్యాత యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో పాలనాశాస్త్రంలో పీజీ చేశారు. భవిష్యత్ తరాలపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసికట్టిన నాగరాజు... ఏఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్ ట్యాంక్ ను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి వక్తగా, రచయితగా ఆయనకు మంచి పేరు ఉంది. దశాబ్దకాలంగా రాజకీయ ప్రచారకుడిగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. నాగరాజు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి జోరందుకుంది. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్ , అమెరికా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.   

రేవంత్ కేబినెట్ విస్తరణకు వేళాయె.. చాన్స్ దక్కేదెవరికి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా  రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తొలి నుంచీ కూడా లోక్ సభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ చేపడతానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే.  రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లలకు ప్రాతినిథ్యం లేదు.  ఈ నేపథ్యంలోనే  కేబినెట్ విస్తరణలో రేవంత్ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   కేబినెట్ విస్తరణపై కూడా  మంత్రవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.    బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలకు  ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో  నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు  మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు  ఉన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి అయితే  సీఎంతో పాటు మరొక మంత్రి ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు.  ఒక సామాజికవర్గాల వారీగా చూస్తే రేవంత్ కేబినెట్ లో   ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉన్నారు.   మొత్తంగా కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా  ఇరు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న  అంశాలపైనా,   ఆగస్టు 15 లోగా చేయాల్సిన రుణమాఫీకి నిధుల సమీకరణపైనా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  అలాగే అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంపైనా,   ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపైనా కూడా కేబినెట్ చర్చిస్తుందని అంటున్నారు.   

ఓటుకు 5 వందలు పంచారు.. డిస్‌క్వాలిఫై చేయాలి!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఆంధ్రాలో హడావిడి అదిరిపోయే లెవల్లో జరిగింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా గొడవలు లేవు. రిగ్గింగులు లేవు. ఆంధ్రావాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఆంధ్రాలో అయితే పోలింగ్‌ జరిగేటప్పుడు గొడవలు.. పోలింగ్ ముగిశాక గొడవలు.. చివరికి ఫలితాలు వచ్చాక కూడా గొడవలు జరిగే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. ఆంధ్రా పరిస్థితి అలా వుంటే, అదేంటో తెలంగాణలో ఎప్పుడూ తిట్టుకునే కేసీఆర్, రేవంత్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా చప్పుడు లేకుండా వున్నారు. ఇదిలా వుంటే, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు రఘునందనరావు పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఓటుకు 5 వందల రూపాయలు పంచారని, అయిదేసి వందల చొప్పున ఎన్వలప్ కవర్లలో పెట్టి గ్రామాలకు పంపిణీ చేశారని రఘునందనరావు ఆరోపించారు. ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.  అవును, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓటుకు 5 వందలు పంచిన నేరం మీద వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలి. అరెస్టు కూడా చేయాలి. వీలైతే, ఎన్ని సెక్షన్లు కుదిరితే అన్ని సెక్షన్లతో కేసులు పెట్టి, జీవితాంతం జైల్లో వుండేలా చేయాలి. లేకపోతే ఏమిటండీ? ఓటుకు ముష్టి ఐదు వందలు ఇస్తారా? ఎంత దారుణం? ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు ఒక్కో ఓటుకు మూడు వేల దగ్గర మొదలుపెట్టి ఐదు వేల వరకు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే, తమకు రావు అనుకున్న ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి ఓటుకు పదివేలు కూడా ఇచ్చారని సమాచారం. వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చారు. ఇంత పవిత్రమైన, ఘనమైన, విలువైన ఓటుకు ముష్టి 5 వందలు ఇచ్చారంటే, ఇంతకంటే పెద్ద నేరం వుంటుందా? అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన పవిత్రమైన భారతదేశంలో ఓటును ఇంత అవమానిస్తారా? ఇంత తక్కువ చేస్తారా? రఘునందనరావు గారు ఎలాగూ లాయర్ కాబట్టి, ఈ నేరానికి బహిరంగ ఉరి వేసే అవకాశం ఏమైనా వుందా అనే విషయాన్ని పరిశీలించాలి.

బాబు లేఖతో ఆగిన ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు.  వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు. కానీ ఇంత కాలం ఆయన మాటలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. అధికారంలో ఉన్న జగన్ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ప్రజా తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. అయితే అంత వరకూ ఆగక్కర్లేకుండానే ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసిపోవడానికి రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పోలీసులు, ఎన్నికల సంఘం  పై చేస్తున్న ఆరోపణలే కారణం. అది కాకుండా.. ఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న తీరుపై చంద్రబాబు రాసిన ఒక్క లేఖ ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కు బ్రేక్ వేయడం కూడా జగన్ అధికారానికి చెల్లుచీటీ పడిపోయిందనీ, ఎన్నికల ఫలితం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఖాయమని తేలిపోయిందనీ జనం అంటున్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పేరుతో తన అక్రమ జీవోలు, విధానాలకు సంబంధించి సాక్ష్యాలను చెరిపివేయడానికి సమాయత్తమైంది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ ఆఫీస్ ను మూసివేయాలని కూడా నిర్ణయించింది. అయితే చంద్రబాబు ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను నిలిపివేయాలని, కొద్ది వారాలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పడు అంత అర్జంట్ గా అప్ గ్రడేష్ అవసరం ఏముందంటూ గవర్నర్ కు లేఖ రాశారు. ఈసీ జోక్యం చేసుకుని ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను తక్షణం నిలిపివేయాలని కోరారు. కీలక ఉత్తర్వులను మాయం చేయడం కోసమే ఈ అప్ గ్రడేష్ తంతు అని ఆరోపించారు. చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ అప్ గ్రడేష్ పేర ఈ ఆఫీస్ ను క్లోజ్ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పద్ధతిలోనే ఈ ఆఫీస్ నడవాలని ఆదేశించింది..  ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఎవరూ ఈ అప్ గ్రడేష్ వంటి  నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీలో  గత ఐదేళ్లుగా రహస్య పాలన జరిగింది. ఏ జీవోల్లో ఏముందో ఎవరికీ తెలియదు. జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా పట్టించుకోలేదు.  జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి  ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీస్‌లో ఉంటాయి. ఇప్పుడు జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతో  ఈ ఆఫీస్ ను సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మూసేసి తమ తప్పులు, అక్రమాలను చెరిపేద్దామన్న ప్రయత్నానికి చంద్రబాబు ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది.