ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.  ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెబుతున్నారు. సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.   ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ఇంకా హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.  2018 సంవత్సరంలో ఆర్బిఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం డిసెంబర్ 10తో ముగియనుండగా, మరో రెండేళ్లు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 

నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. వైసీపీ నేతల ప్రమేయాన్ని నిర్ధారించిన పోలీసులు

వైసీపీ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు పాల్పడిన వారంతా ఒక్కొక్కరుగా చట్టం చేతికి చిక్కుతున్నారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా నేరాలకు పాల్పడి ఆయన  అండతో చట్టానికి చిక్కకుండా దర్జాగా తిరిగిన వారంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత తప్పించుకోవడానికి అజ్ణాతాన్ని ఆశ్రయిస్తున్నారు.తాజాగా  చంద్రబాబుపై నందిగామలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం బయటపడింది. 2022 నవంబర్ 5 లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా నందిగామలో పర్యటిస్తున్న సమయంలో ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన రావు గాయపడ్డారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన అప్పటి పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్  కాంతి రాణా తాతా పూలు చల్లుతుండగా చిన్న చిన్న రాళ్లు పడ్డాయని పేర్కొంటూ తేలికపాటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తు కూడా ముందుకు సాగలేదు. అది వేరే సంగతి. అప్పటి దాడిలో గాయపడిన చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదన రావుకు రక్తగాయాలు అయ్యాయి. ఆ విషయాన్ని కూడా అప్పట్లో పరిగణనలోనికి తీసుకోకుండా అప్పటి సీపీ కాంతి రాణా తాతా కుట్రపూరితంగా వ్యవహరించారు.   అప్పట్లోనే తెలుగుదేశం నేతల చంద్రబాబుపై దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా నందిగామలో జగన్ హయాంలో గత ఏడాది నవంబర్ 5న జరిగిన రాళ్ల దాడి కేసు రీఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కన్నెగంటి సజ్జనరావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్, మార్తి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ దాడి వెనుక  వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.  

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతతో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహించారు. సారథిగా బుమ్రా ముందుండి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకండా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో  18 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆసీస్ ఓపెనర్లతో పాటు కీలకమైన స్మిత్ వికెట్ ను బుమ్రా తీసుకున్నాడు. ఆ తరువాత క్రీజ్ లో కుదురుకున్న ఎలెక్స్ కేరీ వికెట్ ను కూడా బుమ్రా పడగొట్టారు. ఆసీస్ కెప్పెట్ పాట్ కమ్మిన్స్ కూడా బుమ్రా ఖాతాలోనే పడ్డాడు.  ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా  తాను వెసిన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. అసలే భారీ ఛేదన చేయాల్సిన ఆస్ట్రేలియా త్వరత్వరగా రెండు వికెట్లు కొల్పోవడంతో ఇక ఏ దశలోనూ తేరుకోలేకపోయింది. మొత్తంగా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా 12 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి బుమ్రా 30 ఓవర్లు వేశాడు. 72 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ సెట్టింగ్ తో బుమ్రా  ఆకట్టుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యి  ఒత్తిడికి లోనైనప్పటికీ అద్భుతంగా పుంజుకున్నామని చెప్పారు. 

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్.. విజయ్ పాల్ కు సుప్రీంలో చుక్కెదురు

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఆయన ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా విజయ్ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్ పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు చుక్కెదురైంది.  సీఐడీ కస్టడీలో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు చేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.    ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ గత నెలలలో హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులలోనూ ఆయనకు చుక్కెదురవ్వడంతో ఆయన అరెస్టు అనివార్యం అని చెప్పవచ్చు.  

మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో షాక్!

మహారాష్ట్రలో  కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో కుంగిపోయి ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరో షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత అంటూ పీసీపీ చీఫ్  పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్) లతో కూడిన మహావికాస్ అఘాడీ ఎన్నికలలో ఘోర  పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఓటమితో అసలే షాక్ లో ఉన్న కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేయడం మరింత కుంగదీసింది.  ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న వేదుకులాటలో పార్టీ ఉంది.  

కోడి బలి... అఘోరీపై కేసు నమోదు 

వివాదాస్పద అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషణ్ లో కేసు నమోదైంది. నవంబర్ 19న వరంగల్  రంగసాయిపేట బెస్తం చెరువు స్మశానవాటికలో మండుతున్న చితి వద్ద కోడిని  అఘోరీ బలి ఇచ్చింది. జంతుబలి ఇవ్వడం నిషేధం  కాబట్టి  కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. అఘోరీ వింత పూజలు చేస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిందని  రోహన్ రెడ్డి ఆరోపించారు.  తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫై యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే స్మశాన వాటికలో వింత పూజలు చేస్తూ చితి మీదే పడుకోవడం ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడమేనని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరని ఇప్పటి వరకు అఘోరీ చెబుతూ వస్తోంది. కానీ రోహన్ రెడ్డి ఫిర్యాదుచేయడంతో   అఘోరీపై తెలుగు రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదైందని చెప్పొచ్చు

విచారణకు వర్చువల్ గా హాజరౌతా.. ఆర్జీవీ కొత్త ప్రతిపాదన

జగన్ అండ చూసుకుని అద్దూ ఆపూ లేకుండా  చెలరేగిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. తాను సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్య, అసహ్య వ్యాఖ్యల కారణంగా పోలీసులు తనను అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని భయపడి ఛస్తున్నారు. అందుకే పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అతి తెలివి ఉపయోగించి వర్చువల్ విచారణకు హాజరౌతానంటూ ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, కుయుక్తులు పన్నినా రామ్ గోపాల్ వర్మ ఫిజికల్ గా విచారణకు హాజరు కాకుంటే అరెస్టు ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  ఇక విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ వరుసగా రెండో సారి  కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారన్న వార్తలు సోమవారం (నవంబర్ 25) ఉదయం నుంచీ  గట్టిగా వినిపించాయి. అదుపులోనికి తీసుకుని ఒంగోలు తీసుకువెళ్లి విచారించే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. కట్ చేస్తే పోలీసులు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకునే సరికే ఆయన అక్కడ నుంచి జారుకున్నారు. కోయంబత్తూరులో ఏదో సీని ఫంక్షన్ కో దేనికో వెళ్లారని తెలసింది. అయితే రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగా తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు ఒక ప్రతిపాదన పంపారు. తాను  ప్రత్యక్ష విచారణకు హాజరు కాలేననీ, నాలుగు రోజుల తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ లైన్ లో వర్చువల్ గా విచారణకు హాజరౌతాను అన్నదే ఆ ప్రతిపాదన. అయితే రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదన హాస్యా స్పందంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవు తోంది.నెటిజనులు ఈ ప్రతిపాదన చేసిన రామ్ గోపాల్ వర్మను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  తాను ప్రత్యక్షంగా విచారణకు హాజరవ్వడం వల్ల తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు భారీ నష్టం కలుగుతుందంటూ సాకులు చెబుతున్న రామ్ గోపాల్ వర్మ చాలా డిస్పరేట్ గా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అరెస్టు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు   రెండు సార్ల నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కావలసిందేనని రామ్ గోపాల్ వర్మకు స్పష్టం చేసింది. అరెస్టు చేయవద్దంటూ ఓ సారి, ముందస్తు బెయిలు కోసం మరో సారి రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆ  రెండు సందర్భాలలోనూ కూడా  కోర్టు రామ్ గోపాల్ వర్మకు ఊరట కలిగించేలా ఉత్తర్వులు ఇవ్వలేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసింది. రెండు సందర్భాలలోనూ కూడా పోలీసుల విచారణకు హాజరు కావలసిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  ఆయన వర్చువల్ హాజరు ప్రతిపాదనను పోలీసులు అంగీకరించే, ఆమోదించే పరిస్థితి లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ పూర్తిగా చిక్కుల్లో పడ్డట్లేనని చెప్పవచ్చు.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే.. జగన్ కోసం సినిమాలు తీసీ, ఆయన కోసం సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టీ ఇబ్బందుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు. ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ కనీసం ప్రకటనలు కూడా చేయలేదు. వైసీపీ రామ్ గోపాల్ వర్మను కూరలో కరివేపాకు కంటే హీనంగా తీసి అవతల పడేసింది. పార్టీ దృష్టిలో రామ్ గోపాల్ వర్మకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదని తన వైఖరి ద్వారా స్పష్టం చేసింది.  ఇవన్నీ పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి పోలీసులు చేరుకుంటే.. వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడకు చేరుకోలేదు. ఆయన నివాసం వద్దకు రామ్ గోపాల్ వర్మ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కనీసం నినాదాలు చేయడానికి కూడా వైసీపీ క్యాడర్ అక్కడకు చేరుకోలేదు. దీనిని బట్టే వైసీపీలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న విలువ ఏమిటో ఇట్టే అవగతమౌతుంది. ఇలా ఉండగా ఒంగోలు పోలీసులు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఒంగోలుకు తరలించేందుకు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పుడో మరి కొద్ది సేపటిలోనో  రామ్ గోపాల్ వర్మను అదుపులోనికి తీసుకునేందుకు చెన్నై పోలీసు బృందాలు కొయంబత్తూరుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.  

కంగారూలను కంగారెత్తించిన టీమ్ ఇండియా

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను టీమ్ ఇండియా సజీవంగా నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో 295 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది.  ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఇంత దారుణంగా ఓడించిన జట్లు టీమ్ ఇండియా తప్ప మరొటి లేదేమో.  గవాస్కర్ -బోర్డర్ ట్రోపీలో భాగంగా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగు రోజులకే ముగిసింది. ఈ టెస్టులో అన్ని విభాగాల్లోనూ టీమ్ ఇండియా ఆసీస్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగుల స్వల్ప స్కోరుకే ఔటయ్యింది. అయితే కెప్టెన్ బుమ్రా అద్భుత బౌలింగ్, సిరాజ్, రాణాల మంచి స్పెల్ తో ఆస్ట్రేలియా కుప్పకూలింది. కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో తొలి రోజే 17 వికెట్లు పతనమయ్యాయి. తొలి రోజు పేస్ కు బ్రహ్మాండంగా సహకరించిన పిచ్ ఆ తరువాత బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యత సాధించిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు రాహుల్, యశశ్విజైస్వాల్ లు ఆసీస్ బౌలింగ్ అటాక్ ను ఓ ఆటాడుకున్నారు. 201 పరుగుల ఓపెనింగ్  పార్ట్ నగర్ షిప్ తో మ్యాచ్ ను ఆస్ట్రేలియా నుంచి లాగేసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ మాత్రం తన ఫామ్ ను కొనసాగిస్తూ 161 పరుగులు సాధించారు. ఇక చాలా కాలంగా సెంచరీ కోసం మొహం వాచి ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన విశ్వరూపం చూపాడు. అలవోకగా ఆడుతూ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 30వ సెంచరీ కాగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 81వది.  దీంతో టీమ్ ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆదిలోనే టీమ్ ఇండియా బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. మూడో రోజు టీ విరామ సమయం తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. నాలుగో రోజు ఆట ఆరంభమైన తరవాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. అయితు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో హెడ్ 89 పరుగులు, మార్ష్  47 పరుగులు చేశారు. ఆ తరువాత కేరీ కొద్ది సేపు క్రీజ్ లో నిలబడినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 239 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 295 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.  

అప్పుడూ.. ఇప్పుడూ అలీ జోకరేనా?

టాలీవుడ్ టాప్ కమేడియన్ లలో అలీ ఒకరు. కేవలం కమేడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగానూ అలీ రాణించి యమలీల వంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. ఎలాగైనా చట్ట సభలో కూర్చోవాలన్న ఆకాంక్షతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలలోకి దూకేశారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని అన్ని పార్టీలనూ చుట్టేసి చివరికి జగన్ నేతృత్వంలోని వైసీపీని ఎన్నుకున్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరే విషయాన్నీ పరిశీలంచారు. కానీ చివరికి ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు.  సినిమాల్లో ఏదో మేరకు హీరోగా రాణించిన అలీ.. రాజకీయాలలో మాత్రం కమేడియన్ గానే మిగిలిపోయారు.  2019 ఎన్నికలకు ముందు అలీ తన రాజకీయ అరంగేట్రం కోసం వేతుకులట ప్రారంభించారు. మూడు పార్టీల చుట్టూ చేరారు. ఏంటి మూడు పార్టీల్లోనూ చేరిపోతారా అనిపించేలా ఆయన వ్యవహరించారు.  అయితే చివరాఖరికి ఆయన జగన్ ను నమ్ముకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలలో ఆయన ఏపీలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే జగన్ ఆయనకు చెయ్యిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఏదో ఒక కీలక పదవి ఇస్తానని ఆశ చూపారు. దాంతో ఆ ఎన్నికలలో అలీ వైసీపీ తరఫున తన శక్తి మేరకు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఇక అలీ ఎదురుచూపుల పర్వం మొదలైంది. జగన్ హామీ ఇచ్చిన కీలక పదవి ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాచేలా అలి ఎదురు చూశారు. మధ్యలో ఓ సారి ఇంకేముంది రాజ్య సభ ఖాయం అని గట్టిగా వినిపించింది. అప్పట్లో రాజ్యసభ సభ్యత్వంపై అలీని మీడియా అడిగితే ఆయన చిరునవ్వులు సంధించి నిజమేనని చెప్పకనే చెప్పేశారు. అయితే అదీ రాలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తరువాత కంటితుడుపు చర్య అన్నట్లుగా జగన్ అలీకి ఓ సలహాదారు పదవి విదిల్చారు. అదే మహాభాగ్యం.. 2024లో పోటీకి అవకాశం ఇస్తారు అని అలీ తనకు తాను సర్ది చెప్పుకున్నారు. అయితే అదీ దక్కలేదు. సో అలీ ఇక తన వంటికి రాజకీయాలు పడవని నిర్థారణకు వచ్చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇక సినిమాలే తన లక్ష్యం అని డిసైడైపోయారు. అప్పటి నుంచీ ఆయన వార్తల్లో ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. కానీ హఠాత్తుగా అలీ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే ఇది రాజకీయ విషయంలో కాదు. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారంటూ అలీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కాదు. తెలంగాణలో.  అలీకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పంచయతీ ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో తన తండ్రి మహ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారంటూ వికారాబాద్ గ్రామ పంచయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నెల 5న ఇచ్చిన నోటీసులకు అలీ స్పందించకపోవడంతో తాజాగా సోమవారం (నవంబర్25) మరో నోటీసు ఇచ్చారు.  మరీ దీనికైనా అలీ స్పందిస్తారో లేదో చూడాలి. 

జగన్.. బీజేపీ రహస్య మైత్రి ఇంకా కొనసాగుతోందా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టునకు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇతంతా ఉత్తిదేననీ, జగన్, బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతోందనీ తాజాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశాన్ని చూపుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారని ఆ పార్టీ నేతలే చెప్పడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  సోమవారం (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 20 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ, షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిన్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే.. బీజేపీతో ఆయన రహస్య మైత్రీ ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని చెబుతున్నారు.   లోక్ సభలో వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు కానీ, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకింత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రంగా కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుని జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురౌతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే  బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించకుంటే.. తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో?

 మహబూబాబాద్ లో  నేడు బిఆర్ ఎస్ మహాధర్నా...ప్లెక్సీల రగడతో టెన్షన్ 

లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్   సోమవారం  మహబూబాబాద్ లో మహాధర్నాకు  పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.   ప్లెక్సీ రగడతో జిల్లాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. కెటీఆర్ ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.  లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్ దళితులు, గిరిజనుల హక్కుల కాపాడటానికి మహబూబాబాద్ లో మహాధర్నా కార్యక్రమానికి  పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్లెక్సీలను జిల్లా వ్యాప్తంగా అంటించారు. ఈ ప్లెక్సీలను నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఇది  కాంగ్రెస్ పనేనని బిఆర్ఎస్  ఆరోపిస్తుంది. బిఆర్ ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.

సైబర్ నేరాల నియంత్రణ... బ్యాంకుల పాత్రే క్రియాశీలం

దేశంలో  సైబర్ క్రైమ్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ నకరం. అయితే ఈ తరహా క్రైమ్ ల నిరోధంలో బ్యాంకులు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే  వీటిని చాలా వరకూ నిరోధించవచ్చని ఇటీవల  ఏపీలోని తిరువూరు, తెలంగాణ లోని మహబూబ్ నగర్ లలో జరిగిన ఉందంతాలు రుజువు చేశాయి.   ఇటువంటి సైబర్ క్రైమ్ లను దాదాపు 90 శాతం వరకూ బ్యాంకులలోనే నివారించే అవకాశాలు ఉన్నా యని సైబర్ పోలీసులు చెబుతున్నారు.   బ్యాంకులు ఖాతా దారులకు ఇచ్చిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే  బ్యాంకులకు ఖాతా దారులను రక్షించే నైతిక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.  తిరువూరు,మహబూబ్ నగర్ లలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో  60లక్షల రూపాయల సైబర్ క్రైమ్ మనీ ట్రాన్స్ఫర్ ఆపగలిగారు. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే ఖాతాదారులను సైబర్ మోసాల నుంచి కాపడటం సులువు అని ఈ ఉందంతం రుజువు చేసింది.  ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో  సైబర్ మోసాల గురించి ప్రస్తావించడమే ఇది ఎంత తీవ్ర ముప్పుగా పరిణమించిందో అర్ధం చేసుకోవచ్చు.   సైబర్ నేరాలను అరికట్టడంలో సౌదీ అరేబియా మొదటిస్థానంలో ఉంది.ఆ దేశం 2015లో 1.60 లక్షల సైబర్ నేరాలు జరిగినట్లు నమోదైనాయి.నేరాల నియంత్రణలో బహుముఖ వ్యూహం అనుసరించి 100 శాతం విజయం సాధించింది. 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ ని స్థాపించి సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. బడ్జెట్లో నిధులు పెంచడం, విద్యా విధానంలో కోర్సు ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాల సాంకేతికత సహకార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో  సౌదీ అరేబియా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. భారత్ లో కూడా ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సౌదీనీ ప్రమాణికంగా తీసుకుని చర్యలు చేపట్టాలి. అందుకు విశ్వవిద్యాలయాలలో కోర్సులు ప్రవేశపెట్టి, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి.  అలాగే  ఈ సైబర్ సెల్ లను బ్యాంకులతో అనుసంధానం చేయాల్సి. అదే సమయంలో బ్యాంకులూ  అప్రయత్తంగా ఉండి   నేరాలను అరికట్టేందుకు సహకారం అందించాలి.ఇలాంటి చర్యలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే తప్పక  సత్ఫలితాలు వస్తాయి. 

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రభుత్వ అజెండా ఎంటంటే..?

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకూ జరిగే ఈ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అత్యంత కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఈ పార్లమెంటు సమావేశాలలో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో అందరి అంచనాలనూ తల్లకిందులు చేసి మరీ అనూహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ ఆ ఊపులో ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాగా సభలో ఏయే విషయాలు చర్చకు రానున్నయి అన్న విషయాన్ని సభ్యులకు లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ ముందుగానే పరిశీలించి అనుమతి ఇస్తారు.   ఇక ఈ శీతాకాల సమావేశాలలో  భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు,  విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు,  ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు,  రైల్వేస్ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు,  వక్ఫ్ (సవరణ) బిల్లు,  చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు,  రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయాల బిల్లు,  పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఎజెండాలో లేకపోయినప్పటికీ ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లును కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తప్పు చేస్తే తప్పించుకోలేరు.. ఏ కలుగులో దాగినా వదిలేదేలే..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జ‌రుగుతోంది. ప్ర‌తీ విభాగంలోనూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ఫైళ్లు చ‌క‌చ‌కా ముందుకు క‌దులుతున్నాయి. దీంతో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్క‌డా రోడ్లు వేసినా దాఖ‌లాలు లేవు. క‌నీసం గుంత‌లు పూడ్చిన ఆనవాళ్లు కూడా లేవు.   కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న సాగింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్లకు పంపించ‌డం, వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కే వైసీపీ నేత‌లు, పోలీసులు ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుపైనా రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలోనూ, నందిగామ‌లో ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు నాయుడు టార్గెట్ గా వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. నందిగామ‌లో రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో వారు ప‌ట్టించుకోలేదు. ఆ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపేందుకు ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా.. పూలు చ‌ల్లుతున్న స‌మ‌యంలో రాళ్లు ప‌డ్డాయంటూ పోలీసులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాజాగా.. నందిగామ‌లో చంద్ర‌బాబుపై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. ఈ క్ర‌మంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ‌ల కేసులు పెట్టిన పోలీసుల‌పైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోని ప‌లువురి నేత‌ల‌పైనా, వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపైన‌ అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు. మార్ఫింగ్ ఫొటోలను పోస్టుచేసి రాక్ష‌సానందం పొందారు. అప్ప‌ట్లో అస‌భ్య పోస్టుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌దజాలంతో, మార్పింగ్ ఫొటోల‌తో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేయ‌గా.. మ‌రికొంద‌రికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇచ్చారు. తాజాగా, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన కేసులు రీ ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు.  ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను తాజాగా నందిగామ పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్​లో వీధిలైట్లు ఆర్పి చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలు చ‌ల్లే స‌మ‌యంలో పొర‌పాటున చిన్న‌చిన్న‌ రాళ్లు పడ్డాయని కవర్ చేశారు. కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు. అవే రాళ్లు చంద్రబాబుకు తగిలి ఉంటే ప్రాణపాయం జరిగేదని తెలిసిన‌ప్పటికీ సీపీ కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబుపై రాళ్ల దాడులు చాలా సంద‌ర్భాల్లో జరిగాయి. చంద్ర‌బాబును హ‌త‌మార్చాల‌న్న‌ ఉద్దేశంతో కుట్ర పూరితంగా పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్క అయ్యి దాడులు చేశారని ఇవి ఖచ్చితంగా హత్యా ప్రయత్నాలేనన్న అనుమానాల‌ను టీడీపీ శ్రేణులు గ‌తంలో ప‌లుసార్లు వ్య‌క్తం చేశారు. ఇదిలాఉంటే కుప్ప‌లోనూ చంద్ర‌బాబుపై ప‌లుసార్లు రాళ్ల‌దాడికి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కూడా కేసులు రీ ఓపెన్ చేసి విచార‌ణచేప‌ట్టాల‌ని తెలుగుదేశం నేత‌లు పోలీసుల‌ను కోరుతున్నారు. మొత్తానికి ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌ద‌జాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. ఇదే క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల‌పై న‌మోదైన కేసుల‌ను రీ ఓపెన్ చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

ఈ నెల 29న మోదీ విశాఖ పర్యటన ఖరారు

భారత ప్రధాని మోడీ  ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌ లకు శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం  అన్నిఏర్పాట్లు చేసింది.  అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో  అతిపెద్ద ఎన్టిపిసి  గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మద్దిలపాలెంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. 

రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం 

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 (సోమవారం)  నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ  నేపథ్యంలో  అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది.  కేంద్ర పార్లమెంటరీ  వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు  పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల  నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర  రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆదాని పై అమెరికాలో కేసు నమోదు కావడంపై చర్చించాల్సింది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ మహజన్ తెలిపారు.   పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబర్ 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవమైన  నవంబర్ 26న పార్లమెంటు సెషన్ జరగదు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై  ఏర్పాటైన  పార్లమెంట్ సంయుక్త  కమిటీ ఈ నెల 29న తన తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. 

 గడ్డం, మీసాలతో   కర్నూలులో ప్రత్యక్షమైన అఘోరీ 

వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో  ఆదివారం ప్రత్యక్షమైంది. తాజాగా నవంబర్ 24 కర్నూలు జిల్లాలో  పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచింది. వరంగల్ స్మశాన వాటికలో చితా భస్మం పూసుకుని గుమ్మడికాయ పగలగొట్టి క్షుద్ర పూజలు చేసింది.  అఘోరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితిని క్రియేట్ చేసింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో నాగసాధుగా పరిచయమైన ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకి తనకు తాను అఘోరీగా ప్రకటించుకుంది. తాను కేదార్ నాథ్ వెళ్లి గురువు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి తిరిగి తెలంగాణలో ఎంటరైంది, తన కారులో పెట్రోల్ క్యాన్ కనిపించడంతో అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటుందేమోనన్న భయంతో సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీ స్వస్థలమైన మంచిర్యాలలో వదిలేశారు. అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చి తెలంగాణ పోలీసులు మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేశారు. అక్కడ్నుంచి ఎపిలో ఎంటరైన అఘోరీ శ్రీకాళహస్తిలో పెట్రోలు పోసుకుని ఆత్మార్పణం చేసుకునే ప్రయత్నం చేసింది. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న అఘోరీ అక్కడ్నుంచి విజయవాడ కనకదుర్గను దర్శించుకుంది. ఇక్కడితో రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన పూర్తయ్యిందని అందరూ ఊహించారు.  అనూహ్యంగా మంగళగిరి రోడ్డులో కనిపించి నానా రచ్చచేసింది. ఎపి పోలీసుల మీద భౌతికదాడి చేసి అరెస్టు అయ్యింది. వ్యక్తిగత బెయిల్ మీద ఎపి పోలీసులు వదిలేయడంతో అఘోరీ మళ్లీ తెలంగాణలో ఎంటరైంది. ఈ సారి వరంగల్ స్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేయడంతో అందరి దృష్టినాకర్షించింది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో నిమ్మకాయలతో పూజలు చేయడంతో స్థానికులు అఘోరీని తరిమివేశారు. ఇన్ని రోజులు తాను అమ్మవారి అవతారం అని చెప్పి సడెన్ గా గడ్డం, మీసంతో కనిపించడంతో స్థానికుల అగ్రహానికి గురైంది. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ప్రత్యక్షమౌతుందోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు అఘెరీని ఇంత వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపకపోవడం చర్చనీయాంశమైంది.