బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. తగాదా తీర్చెదెలా.. అధిష్ఠానం మల్లగుల్లాలు!

తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది.  రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి  ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం క్యూ కట్టి మరీ రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కూడా ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో పార్టీ కోసం గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీ ఆ రెండు ఎన్నికలలోనూ చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించినా, రాష్ట్రంలో అధికారం అన్న కల మాత్రం నెరవేరలేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనైనా అత్యధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో పెచ్చరిల్లిన విభేదాల కారణంగా ఆ ఆశ నిరాశ కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలో అంతర్గత విబేధాలకు ప్రధాన కారణం.. అగ్రనాయకత్వం ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుని కీలక  పదవులు అప్పగించడమే కారణమని అంటున్నారు. ఆ కారణంగానే   పార్టీలో కొత్త, పాత నేతల మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. దీంతో కింకర్తవ్యం అని పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఉంది.  పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కూడా ముందువెనుకలాడాల్సిన పరిస్థితి నెలకొంది. పాతవారిని సముదాయించలేక, కొత్త వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులూ పడుతోంది.    కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ ఎప్పుడో అంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెంటనే ప్రకటించింది. అయినా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందుకు కారణంగా పార్టీలోని అంతర్గత విభేదాలే అనడానికి ఇసుమంతైనా సంకోచించాల్సిన అవసరం లేదు.  గత రెండు నెలల కిందటి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ముగ్గురు నుంచి నలుగురు ఉన్నప్పటికీ అనేక వడపోతల తరువాత రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్ నిలిచారు. అయితే పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ మంచి పట్టు ఉన్న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడూ బండి సంజయ్ అడ్డుగా నిలుస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల తప్ప మరెవరైనా అభ్యంతరం లేదని ఆయన పార్టీ హైకమాండ్ వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు  ఎట్టి పరిస్థితుల్లోనూ బయటనుంచి వచ్చి చేరిన వారికి అప్పగించడానికి తాము అంగీకరించబోమని పార్టీలోనిహిందూ హిందుత్వ వాదులతో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ వంటి సంస్థలూ పట్టుబడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వరకూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ మార్చేసింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ఆ మార్పు వెనుక ఉన్నది ఈటల రాజేందర్ అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ కు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ అడుగడుగునా అడ్డు పడ్డారనీ, ఆ కారణంగానే ఈటల పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలకు చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదనీ ఈటల వర్గీయులు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు.  అప్పటి నుంచీ ఇరువురి మధ్యా ఉప్పూ నిప్పు అన్న చందంగానే సంబంధాలు ఉన్నాయి.  ఆ కారణంగానే ఈటలకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ముందువెనుకలాడుతోందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ సమాజంలో గుడ్ విల్ ఉండటం, బీసీ నేత కావడంతో ఈటలకు పగ్గాలు అప్పగించడమే మేలని హైకమాండ్ భావిస్తోందనీ, అదే సమయంలో తొలి నుంచీ బీజేపీలో ఉన్న బండి సంజయ్ మాటను తోసి రాజనే ధైర్యం కూడా బీజేపీ హైకమాండ్ చేయడం లేదని అంటున్నారు. బండి సంజయ్, ఈటల మధ్య సయేధ్య కోసం పార్టీ పెద్ద తలకాయలు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడం లేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నియామకం విషయంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈటలకు పదవి ఇస్తే బండి ఇన్ యాక్టివ్ అవుతారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులూ కాడె వదిలేస్తారు. పోలీ ఈటలను పక్కన పెడదామంటే ఆయన పార్టీనే వదిలేస్తారు.  ఈ రెండూ కూడా  ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.     సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత అయిన ఈటలను వదులు కుంటే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని బీజేపీ హైకమాండ్ భయపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలన్న ఆ పార్టీ ఆశ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని ఈటలకు పెద్ద పీట వేస్తే తెలంగాణలో బీజేపీ కుదేలౌతుంది. ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో కొనసాగుతున్న బండి వంటి నేతలు పార్టీకి దూరమౌతారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. దీంతో ఎటూ తేల్చుకోలేక బీజేపీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఈ సమస్యను రానున్న రోజులలో ఎలా అధిగమిస్తుందో చూడాల్సిందే. 

రూ.500ల దొంగనోట్లు.. ఎలా గుర్తించగలమంటే?

దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు. సరిగ్గా ఆ ఆ రోజు నుంచి రెండు నెలల పాటు దేశంలోని ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలలో నిబబడి కొద్ది మొత్తం తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే రోజు వారీ కార్యక్రమంగా మారిపోయింది. రోజు వారీ అవసరాలకు కూడా సొమ్ములు లేక జనం నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా దేశంలో నల్లధనం లేకుండా పోతుంది, ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పడతా యన్న ఆశతో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు. అయితే నల్లధనం లేకుండా చేయాలన్న మోడీ ఉద్దేశం పెద్ద నోట్ల రద్దుతో ఎంత వరకూ నెరవేరిందో తెలియదు కానీ, పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా దేశంలో దొంగనోట్ల చెలామణి యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా ఇప్పుడు భారత కరెన్సీలో అత్యధికంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లలో అసలు నోటేదో, నకిలీ ఏదో గుర్తుపట్టడం దాదాపు అసాధ్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి.  పెద్ద మొత్తంలో రూ.500  నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లలో అసలేదీ, నకిలీ ఏదీ అని గుర్తుపట్టడం కష్ట సాధ్యంగా ఉందని బ్యాంకులే చెబుతున్నాయి. అంత పకడ్బందీగా నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని అంటున్నారు.  రూ.500ల నోట్లలో  అసలుకూ నకిలీకీ తేడా ఏమిటో సామాన్యలు గుర్తించడం చాలా చాలా కష్టమని అంటున్నారు. అయితే అసలులో రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో ఆ స్పెల్లింగ్ చిన్న తప్పు ఉందనీ, అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోవడానికి అదో మార్గమనీ చెబుతున్నారు. అసలు నోటులో రిజర్వ్ బ్యాంకు అన్న స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో రిజర్వ్ బ్యాంకు స్పెల్లింగ్ ఆర్ఇఎస్ఏఆర్ విఇ అని ఉంటుందని చెబుతున్నారు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న భారత్ లో ఈ తేడాను గుర్తించగలిగేది ఎందరు? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా దేశంలో నకిలీ నోట్లు ఏ మాత్రం తగ్గలేదనీ, నోట్ల రద్దుతో మోడీ సాధించిందేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బెంగళూరులో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్.. ఎనిమిది నెలల చిన్నారికి సోకిన మహమ్మారి

చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు. శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది. చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఏ దేశమూ కూడా ట్రావెల్ ఆంక్షలు విధించలేదు. దీంతో ప్రపంచం మరో సారి కరోనా నాటి పరిస్థితులు ఎదుర్కొన వలసి వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే ఆ ఆందోళన అభూత కల్పన కాదని తాజాగా ఇండియాలో ఓ చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించడంతో తేటతెల్లమైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ ను గుర్తించారు.  కరోనా కంటే కొన్ని రెట్లు అధిక వేగంతా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలని చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న వేగం చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వెలుగు చూడటంతో ప్రజలు వణికి పోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం అవసరం లేదనీ, దేశంలో ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్​లు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి  సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు ఇతరులత కాంటాక్ట్​లోకి రాకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. “జలుబు, జ్వరానికి అవసరమైన సాధారణ మందులు వాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని గోయల్ పేర్కొన్నారు. అయితే బేంగళూరులో హెచ్ఎంపీవీ వైరస్ వెలుగు చూడటంతో ఇక క్వారంటైన్ పరిస్థితులను దేశం మరోసారి చూడాల్సి వస్తుందా అన్న భయందోళనలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. 

 ఎసిబి విచారణ కు  హాజరై వెనుదిరిగిన కెటీఆర్ 

తెలంగాణ మాజీ మంత్రి కెటీఆర్ సోమవారం ఎసిబి ఆఫీసుకు హాజరయ్యారు. కెటీఆర్  రాక సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కెటీఆర్ ఎ వన్ ముద్దాయి. బంజారాహిల్స్ ఎసిబి కార్యాలయంలో  విచారణకు హాజరుకావావాలని ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులు శుక్రవారమే జారీ అయ్యాయి. కెటీఆర్ తో బాటు ఈ కేసులో నిందితులైన బిఎల్ ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ లకు నోటీసులు అందాయి.  కెటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారించాలని తొలుత నిర్ణయించారు. పది గంటలకు కెటీఆర్ విచారణకు హాజరైనప్పటికీ ఎసిబి అధికారులు కార్యాాలయంలోకి  అనుమతించలేదు. కెటీఆర్ తన వెంట అడ్వకేట్లను తెచ్చుకోవద్దని ఎసిబి కండిషన్ పెట్టింది. ఎసిబి కార్యాలయం గేటుముందే చాలా సేపు కెటీఆర్ ఎసిబి అధికారులతో గొడవపడి వెనుదిరిగారు.. 

ధరాభారానికి తోడు జీఎస్టీ బాదుడు.. సామాన్యుడు బతికేదెలా?

గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి.  ప్రభుత్వం దళారీ వ్యవస్థ ను  రూపుమాపలేకపోతోంది. దళారీల నుంచి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం మానేసి ఖజానా నింపుకోవడానికి  జీఎస్టీ పేరుతో  ప్రజల నడ్డి విరుస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేయలేక పోవడంతో  సామాన్యుడిపై రోజు రోజుకూ ధరల భారం పెరుగుతోంది. దాదాపు ఏడాది కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ప్రజల కొనుగొలుశక్తిని క్షీణింప చేసింది.  ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉంది. నిత్యావసరాలపై జీఎస్టీ భారం పెరగడంతో  మధ్యతరగతి, బడుగు జీవుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి మధ్యతరగతి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది.  కుటుంబరుణాలు జీడీపీలో 6.4 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారమే  భారతీయ కుటుంబాల ఆదాయాలు తగ్గి,రుణాలు పెరుగుతున్నాయి.  తాకట్టు రుణాలు 56 శాతం పెరిగాయి. వీటిలో 30శాతం డీఫాల్ట్ గా మారుతున్నాయి.  రూపాయి మారకపు విలువ కనిష్ట స్థాయికి చేరడంతో విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పుకునే కేంద్రంలోని మోడీ సర్కార్.. ప్రజల ఆర్థిక పతనాన్ని పట్టించుకోవడం లేదు. షేర్లు, కార్పొరేట్లు అంటూ సంపన్న వర్గాల ప్రయోజనాలే పరమావధి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధికంగా జీఎస్టీ విధించే దేశంగా భారత్ అగ్రభాగంలో నిలబడింది.   ఒకేదేశం,ఒకే పన్ను అంటూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ఈ విధానంలోని లోటుపాట్లను సరిదిద్దే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు.  పెట్రోల్,డిజిల్ లను జీఎస్టీ పరిధిలో తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను పెడచెవిన పెడుతోంది. సెస్సు,సుంకాలపేరుతో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా బాదేస్తూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయి.  ఇక తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సొంత భుజాలు చరిచేసుకుంటున్న కేంద్రంలోని మోడీ సర్కార్   ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు సరికదా డీఏపీ కి  సబ్సిడీ ఎత్తివేసే ఆలోచన చేస్తున్నది. ఇక బియ్యం అయితే పండిచిన రైతుకూ, కొనుగోలు చేసే వినియోగదారులకూ కూడా చుక్కలు చూపిస్తోంది. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసే వినియోగదారుడికి మాత్రం ధరా భారం నడ్డి విరిచేస్తున్నది.  బ్రాండ్ల పేరుతో 25కేజీలు రూ.1600 పైగా అమ్ముతున్నారు. అలాగే పప్పుల ధరలు రైతులకు మేలు చేయలేకపోయినా వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపుతున్నాయి. ఏ పప్పు అయినా కేజీ ధర 100 నుంచి 200వరకూ ఉన్నాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే ఏ కూరగాయ కొనాలన్నా  కిలో  రూ.60నుంచి 100 వరకూ వెచ్చించాల్సిందే.   గత 8 నెలలలో   నిత్యావసర సరుకుల ధరలు సగటున 50 శాతంపైగా పెరిగాయని ఒక అంచనా. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం తగ్గడానికి, నిత్యావసర ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నది.  జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి చేయక పోవడం వల్లనే దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారుడికీ, రైతుకీ కూడా నష్టం కలగడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే కేంద్రం జీఎస్టీ బాదుడుపై కాకుండా జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఒకే దేశం ఒకే పన్ను అని మాత్రమే కాకుండా ఒకే దేశం.. ఒకే ధర అన్న విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.  

మంచు తుపాను ధాటికి అమెరికా గజగజ

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడలాడిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రతతో విరుచుకుపడుతున్న మంచు తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోయింది. దాదాపుగా అమెరికాలోని పలు ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. ఈ మంచు తుపాను అమెరికాలోని కాన్సాస్, నెబ్రస్కా, ఇండియానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు కోట్ల మందికి పైగా మంచు తుపానులో చిక్కుకుపోయి నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఈ సవాల్ ను ఎదుర్కొనేందుక అమెరికా సమాయత్తమౌతోంది. పలు రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.   మంచులో చిక్కుకుపోయిన వాహనదారులను కాపాడేందుకు నేషనల్ గార్డ్ రంగంలోనికి దిగింది.  మంచు తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఎనిమిది అంగుళాల మేర సర్వం మంచుమయంగా మారిపోయింది. గంటకు80 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఇండియానాలోని పలు భాగాలు మంచుకిందకప్పబడిపోయాయి. ఈ ప్రాంతంలో వాహనదారులు రోడ్లపైకి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  మంచు తుపాను ప్రభావిత ప్రాంతాలలో రైలు, విమాన సర్వీసులను రద్దు చేశారు.  

ఏసీబీ విచారణకు ఓకే.. ఈడీ విచారణకు డుమ్మా.. కేటీఆర్ చేసేది ఇదేనా?

ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఏసీబీ విచారణకు హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కేసులో తాను దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఏసీబీ విచారణకు హాజరైనా అరెస్టయ్యే ప్రమాదం లేదని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న కేటీఆర్, ఏసీబీ విచారణకు గైర్హాజరైనా, డుమ్మా కొట్టినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే విషయంలో అన్ని కోణాలలోనూ ఆలోచించి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తారువాతే కేటీఆర్ ఈ విచారణకు హాజరు కావాలన్న నిర్ణయానికి వచ్చారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.    అన్నిటి కంటే కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం.. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా ఏసీబీ తనను ఇప్పటికిప్పుడు అరెరస్టు చేసే అవకాశం లేదు. ఎటువంటి తొందరపాటు చర్యా తీసుకోవద్దంటూ కోర్టు ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వెలువడే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశించడంతో ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎంత మాత్రం లేవు. అయితే విచారణ సందర్భంగా కేటీఆర్ కు ఏసీబీ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అలాగే విచారణ కూడా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది.   ఇక ఈ కేసు విషయంలో కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనీ, సోమవారం (జనవరి 6) ఏసీబీ, మంగళవారం (జనవరి 7) ఈడీ కేసీఆర్ ను విచారించనున్నాయి. ఇక్కకే కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే ఆయనపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఆ విమర్శలకు వెరచి ఈడీ విచారణకు హాజరైతే అరెస్టయ్యే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈడీ అరెస్టు చేయకుండా కేటీఆర్ కు కోర్టుల నుంచి ఎటువంటి రక్షణా లేదు. దీంతో ఈడీ ఆయనను విచారించిన తరువాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు హాజరై, మంగళవారం (జనవరి 7)న ఏవో కారణాలు చెప్పి ఆయన  ఈడీ  విచారణకు గైర్హాజర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాకుండా ఈ కేసులో ఏ3గా ఉన్న ఐఏఎస్ అర్వింద్  గ్రేటర్ మాజీ చీఫ్ ఇంజినీర్ లు  డుమ్మా కొట్టారు. కేటీఆర్ కూడా అదే చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

దూకుడు పెంచిన రేవంత్‌.. 26 నుంచి స‌రికొత్త పాల‌న!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఈనెల 26వ తేదీ నుంచి స‌రికొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చిన రేవంత్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల‌పై ఎదురు దాడినీ కొన‌సాగించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తూ   సాగుతున్నారు. అయితే  ఈ ఏడాది కాలంలో రేవంత్ స‌ర్కార్ పాల‌న‌కు అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ కొంత‌ మేర విఫ‌ల‌మైంద‌న్న వాద‌న తెలంగాణ సమాజంలో బలంగా  వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రైతుల‌కు మేలుచేసే విష‌యంలో ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో విజ‌యవంతం కాలేద‌న్న అభిప్రాయం ఉంది. రెండు ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేసిన‌ప్ప‌టి.. రైతులందరికీ రుణ‌మాపీ అంద‌లేదు. దీంతో రుణ‌మాఫీ కాని రైతులు రేవంత్ స‌ర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని చెబుతోంది.  అయితే, ఏడాది కాలంలో వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుకుంటూ స‌రికొత్త పాల‌నకు శ్రీ‌కారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జ‌న‌వ‌రి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.   జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ‌డిచిన ఏడాదిలో పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా జ‌రిగిన లోటుపాట్ల‌ను గ్ర‌హించి వాటిపై ప‌ట్టు సాధించేందుకు  రేవంత్‌ ఫోక‌స్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన త‌రువాత 26వ తేదీన రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రేవంత్ శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ప‌థ‌కంతో పాటు మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచే రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. అంత‌కు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ ప్రారంభించ‌బోయే ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌నున్నారు.  కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్వ‌యంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు బంధు ప‌థ‌కం కింద రెండు ద‌ఫాలుగా ఎక‌రానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి రైతు భ‌రోసాగా నామ‌క‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప‌రిమితి లేకుండా రైతు బంధు ప‌థ‌కం అమ‌లైంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయం యోగ్యం కాని భూములు, రాళ్లుర‌ప్ప‌లు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసిన భూముల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌కు సైతం రైతు బంధు నిధులు ప‌డ్డాయి. దీంతో ప్ర‌జాధ‌నం భారీగా వృథా అయ్యిందని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేవ‌లం వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూముల‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా సాయం అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో ఉంటూ భూమి లేని వ్య‌వ‌సాయ రైతు కుటుంబాల‌కు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాగా పేరును ఖ‌రారు చేశారు. రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌ వుతు న్నాయి. అస‌లైన రైతుల‌కు, భూమిలేని కుటుంబాల‌కు మేలు జ‌రిగేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉంద‌ని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్త‌కార్డులు రాలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్  హ‌యాంలో అర్హులైన వారంద‌రికీ కొత్త రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి 26వ తేదీనే శ్రీ‌కారం చుట్టాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాల‌న‌లో లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జానీకానికి అందించేందుకు రేవంత్ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతున్నది.

టాలీవుడ్ పై ఏపీ సర్కార్ గురి‌.. ప‌వ‌న్ మాట‌లతో క్లారిటీ!

టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీ ఏపీ వైపు చూస్తున్నదా? క్ర‌మంగా ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ ఏర్పాటుకు అడుగులు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే సినీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవ‌ల పుష్ప‌2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలంగాణ స‌ర్కార్  సీరియస్ కావడం, ఆ తరువాత తీసుకున్న నిర్ణయాలతో సినీ ప్ర‌ముఖులు కాస్త‌ ఇబ్బందిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్ర‌ముఖుల‌కు ద‌గ్గ‌రి వ్య‌క్తి. చాలా మంది సినీ హీరోలు, సినీ పెద్ద‌ల‌తో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, పుష్ప‌2 ఘ‌ట‌న విష‌యంలో మాత్రం రేవంత్ స‌ర్కార్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో కాస్త ఇబ్బందిగా ఫీలైన సినీ ప్ర‌ముఖులు తెలంగాణ‌తోపాటు ఏపీలోనూ సినీ ఇండ‌స్ట్రీని అభివృద్ధి  చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు, ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సినీ పెద్ద‌ల చూపు ఏపీ వైపు మ‌ళ్లింద‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినీ ఇండ‌స్ట్రీలోని కొంద‌రు ప్ర‌ముఖులు ఈ విష‌యంపై చర్చించారనీ,  ప్ర‌భుత్వం త‌ర‌పున కావాల్సిన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ప‌ష్ట‌మైన హామీఇచ్చిన‌ట్లు స‌మాచారం. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల ద్వారా ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది.  వైసీపీ హ‌యాంలో ఏపీలో తెలుగు సినీప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రెడ్డి కొన‌సాగిన ఐదేళ్లూ టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌మ సినిమాల రిలీజ్ విష‌యంలోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విష‌యంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ల పెంపు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ టాలీవుడ్ పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి వంటివారు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చేతులెత్తి దండంపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయినా, తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై జ‌గ‌న్ క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో సినిమాల‌కు సంబంధించిన అధిక‌శాతం ఈవెంట్లు హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వం మారింది. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చంద్ర‌బాబు అంటే సినీ ప‌రిశ్ర‌మ‌కు అభిమాన ముఖ్య‌మంత్రి. మ‌రోవైపు డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌టంతో సాధార‌ణంగానే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఏపీ వైపు చూస్తున్నది. దీనికితోడు ఏపీ స‌ర్కార్ సినీ ఇండ‌స్ట్రీకి అధిక‌ ప్రాధాన్య‌త ఇస్తున్నది. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్ర‌స్తావించారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సినీ ఇండ‌స్ట్రీ ప‌ట్ల క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలో అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. కానీ, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం అలా కాద‌ని.. సినీ ఇండ‌స్ట్రీని త‌గిన విధంగా గౌర‌విస్తుంద‌ని ప‌వ‌న్ చెప్పారు. టాలీవుడ్ హీరోలు వ‌చ్చి త‌మ‌వ‌ద్ద న‌మ‌స్కారాలు చేయాల్సిన ప‌ని లేదంటూ గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీరుపై ప‌వ‌న్ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న సినీ రంగానికి చెందిన వ్య‌క్తి అయినా, కొంద‌రు సినీ పెద్ద‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసినా వారి జోలికి వెళ్ల‌లేద‌ని, సినీ ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయ రంగు పూయ‌లేద‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. అదే బాట‌లో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇదే క్ర‌మంలో టికెట్ల పెంపుపై కొంద‌రు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్ చెక్ పెట్టారు. సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఊరికే పెంచ‌డం లేదు.. దాని వ‌ల్ల ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో కొంత ఆదాయం వ‌స్తోంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని ప‌వ‌న్ అన్నారు. అదే స‌మ‌యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బ‌ల‌మైన యువ‌త ఉంది. ఇక్క‌డ యువ‌త‌లో ఉన్న శ‌క్తిని వినియోగించుకోవాల‌ని సినీ పెద్ద‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కోరారు. ఏపీలోని ప‌లు చోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టండి. సినిమా స్టోరీలు ఎలా రాయాలి.. సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్లాలంటే ఎలాంటి శిక్ష‌ణ తీసుకోవాలో అందుకు సంబంధించిన ఇనిస్టిట్యూట్స్ ను ఏర్పాటు చేయండి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న నిపుణుల‌తో యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి పెంచండి. ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ లాంటి వ్య‌క్తుల‌ను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే త‌దిత‌ర విష‌యాల‌పై క్లాసులు తీసుకోమ‌ని చెప్పండి. కీర‌వాణి, త‌మ‌న్ లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లు ఇప్పించండి. రాష్ట్రంలోని ప్ర‌ముఖ ప్రాంతాల్లో స్టూడియోలు పెట్టండి. 24 క్రాప్ట్ ల‌కు సంబంధించిన విష‌యాల‌పై సినీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తి క‌లిగిన ఏపీలోని యువ‌త‌కు శిక్ష‌ణ ఇప్పించండ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరారు. అలా చేయడానికి ముందుకు వచ్చే వారికి  చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. మొత్తానికి గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా సినీ ఇండ‌స్ట్రీ ఏపీకి రావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ చెప్పారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

 నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. వ్యక్తిగత పూచీకత్తు సమర్పణ

సినీ నటుడు అల్లు అర్జున్  నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కండిషన్ బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.  ఇరు పక్షాల వాదనలు  విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరయ్యారు. పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. . చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు   జడ్జి ముందు సమర్పించారు.

 అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కాసేపట్లో...

సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.   పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని  కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యలను , కేసును ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45   నివాసం నుంచి బయలు దేరినట్టు సమాచారం. 

ఐదు పదుల వయసులో  నడి సంద్రంలో  గోలి శ్యామల  సాహసయాత్ర  

సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.  దాదాపు 150  కిలోమీటర్లు  ఐదురోజుల్లో ఈది అరుదైన రికార్డు సాధించారు.  రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ గా ఆమె ఈత కొట్టారు. సముద్ర కెరటాల మీద ఈత కొట్టడం అంత ఆషామాషీ కాదు. హైద్రాబాద్ లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు ఆమె పని చేశారు. దురదృష్ట వశాత్తు బాగా నష్టపోయారు. ఆర్థికంగా పూర్తిగా  చితికి పోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మైండ్ డైవెర్షన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకుని అదే స్విమ్మింగ్ మీద అరుదైన రికార్డు చేరుకోవడం గమనార్హం.  డిప్రెషన్ లో ఉన్నప్పుడు కోచ్ జాన్ సిద్దిఖీ ఆమెకు స్విమ్మింగ్ నేర్పించాడు. జీరో లెవెల్ నుంచి కెరీర్ ప్రారంభించి 150 కిలో మీటర్లు సముద్రంలో చేరుకోవడం ఆసియా స్థాయిలో సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 28 కి ముందు వాతావరణం అనుకూలించక ఈ  సాహస యాత్రను రెండు పర్యాయాలు వాయిదా వేసుకున్నారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రంలో దూకి కాకినాడ గడ్డపై తేలారు.  2021లో ఆమె  శ్రీలంక నుంచి ఇండియావరకు రామసేతు  దాటానని గోలి శ్యామల చెప్పారు. ఈ యేడు ఫిబ్రవరిలో లక్ష్య ద్వీప్ లో 18 గంటలపాటు 48 కిలో మీటర్లు ఆమె స్విమ్ చేసారు.  బంగాళా ఖాతంలో స్విమ్ చేయాలని ఆమె రెండేళ్ల క్రితమే కలలు కని సాకారం చేశారు. ఒక ఫిషింగ్ బోట్ లో ఇద్దరు స్కూపర్ డ్రైవర్లతో ఈ సాహస యాత్ర చేశారు.  మహిళలకు ఈత కంపల్సరీ అని గోలిశ్యామల చెబుతున్నారు. గైనిక్ సమస్యలను బాధపడుతున్న వారికి ఈత చక్కటి ఉపశమనం అని ఆమె చెబుతున్నారు. స్విమ్ ను స్పోర్ట్స్ గా కాకుండా సర్వైకల్ స్పోర్ట్స్ గా బలంగా నమ్మే గోలి శ్యామల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు.    గోలి శ్యామల ఈత నేర్చుకునే సమయంలో చాలామంది హేళన చేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అపజయం నుంచి విజయం అందుకున్న వీర వనిత గోలి శ్యామల. 

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు. సంక్రాంతి కంటే ముందుగానే ఆయన లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 11న లండన్ బయలుదేరి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే ఆయన అనుకున్నంత మాత్రాన విదేశీ పర్యటనకు వెళ్లగలిగే వెసులుబాటు ఆయనకు లేదు. ఆయన అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్నారు. అందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సీబీఐ కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో ఈ నెల 11 నుంచి 25 వరకూ యూకేలో ఉన్నత చదువులు చదువుతున్న తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన పిటిషన్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత జగన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి. ఆ తరువాతే జగన్ కు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చేదీ లేనిదీ కోర్టు నిర్ణయిస్తుంది.     గతంలో కూడా జగన్ తన విదేశీ పర్యటనలకు ముందుగా కోర్టు అనుమతి పొందిన సంగతి విదితమే. గత ఏడాది ఏపీలో ఎన్నికల తరువాత ఫలితాలు వెలువడక ముందేజగన్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు.  ఇప్పుడు మరోసారి ఆయన తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ సారి జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో లేకపోవడం, జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీం సీబీఐకి విస్పష్ట ఆదేశాలు జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనకు అనుమతి లభించడం అంత సులువుకాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పండుగ వేళ ఏపీని వదిలి విదేశాలకు వెళ్లాలనుకోవడం చూస్తుంటే ఆయన రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశానికి తిలోదకాలిచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఆటలో అరటిపండేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఇంకా సమాయత్తమైనట్లు కనిపించడం లేదు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటూ ఆప్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయన్న విషయాన్ని తేటతెల్లం చేసేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ పరిస్థితి ఆటలో అరటిపండులా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.  గత దశాబ్దంగా ఢిల్లీ పీఠం అప్ చేతిలోనే ఉంది. దీంతో బీజేపీ ఆప్ లక్ష్యంగా వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగా తన ప్రచార ప్రణాళికను రచించుకుంటోంది. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విషయంలో పూర్తిగా మోడీ కరిష్మాపైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు. హిందుత్వ అజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడం, అలాగే ఆప్ అవినీతి పార్టీ అంటూ చాటడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆప్ యమున ప్రక్షాళనకు వ్యతిరేకం అంటూ ఉద్ఘాటించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు అరెస్టైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే ప్రధాని మోడీ తన ప్రచార శంఖారావాన్ని పూరించారు.  ప్రధాని మోడీ శుక్రవారం (జనవరి 3)న ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన గృహాలను పేదలకు పంపిణీ చేయడం కోసం చేసిన ఈ పర్యటనను ఆయన ఎన్నికల ప్రచారం కోసం పూర్తిగా వాడుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందనీ, స్వయంగా ఆ పార్టీ అగ్రనేతలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనీ విమర్శలు గుప్పించారు.  గుజరాత్ వ్యాపారి ఇచ్చిన పది లక్షల రూపాయల విలువైన సూటు ధరించారనీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ప్రధాని తన నివాసాన్ని నిర్మించుకున్నారనీ ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలు, ప్రతి విమర్శలతో శీతాకాలంలో వణికించే చలిలో కూడా ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ రాజకీయ వేదికపై కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు.  దీంతో త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్ర, పోటీ నామమాత్రంగానే ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

మహాకుంభమేళాకు ఉగ్రముప్పు?!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్న ఈ కుంభమేళాపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదులు సాధువుల రూపంలో దాడులకు తెగబడే అవకాశం ఉందన్నహెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.  

ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది.   పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగానే కార్మికులు భయంతో ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.