మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఇక లేరు

మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా జీర్ణకోశ సంబధింత ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజకీయాలలోకి రాకముందు ఆర్. సత్యనారాయణ జర్నలిస్టు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఉద్యమంలో చురుకుగా పని చేసిన సత్యనారాయణ  టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పలు పదవులను నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ మెదక్‌ ఎంపీగా పోటీచేసిన సమయంలో సత్యనారాయణ ఎలక్షన్‌ ఏజెంట్‌గా పనిచేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే జర్నలిస్టుగా ఆయన తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. వ్యక్తిగతంగా మంచితనం కలిగి ఉండడం,మంచి చేయడానికి నలుగురినీ కూడగట్టడం ఆర్.సత్యనారాయణ నైజం. జర్నలిస్టుగా ఆయన అదే ఒరవడి కొనసాగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్టులనందరినీ ఏకతాటిపై నడిపించారు.  ఆయన మృతి తీరని లోటని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పలు పార్టీల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆర్.సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపార బీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యనారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యన్నారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం..ప్రముఖుల హాజరు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం (జనవరి 26) సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఈ ఎట్ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖుల రాకతో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అలాగే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు కొద్ది సేపు చర్చించారు.   అంతకు ముందు అంటే ఆదివారం (జనవరి 26) ఉదయంవిజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రజల ఆకాంక్షలు నెరేవేర్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్న ఆయన,  గత ప్రభుత్వం ఇష్టారీతిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సమస్యలను అధిగమిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తోందని ప్రశంసించారు.      

భ్ర‌మ‌లు తొల‌గిపోయాయా?

విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ నేతలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేసింది. నోటికి తాళాలు వేసింది. తన రాజకీయ భవిష్యత్ పై బెంగపుట్టేలా చేసింది. ఇంత కాలం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రికొద్ది నెల‌ల్లో కూలిపోతుంది.. మ‌ళ్లీ మ‌న జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతారు.. మ‌రో రెండేళ్ల‌లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. సీఎం అయ్యేది మ‌న జ‌గ‌నే.. క‌ళ్లు మూసి తెరిచేలోపు రెండేళ్లు అయిపోతాయి.. మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడు అన్న భ్రమలను తొలగించేసింది. నిన్న మొన్నటి వరకూ త‌మ పార్టీలో ఏం జ‌రుగుతుందో గుర్తించలేని నేత‌లు సైతం మైకుల ముందుకొచ్చి పూన‌కం వ‌చ్చిన‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల నోట మాట రావ‌డం లేదు. వైసీపీలో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతుందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌న భ‌విష్య‌త్ ఏంట్రా బాబూ అంటూ ఆ పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌ నుంచి మండ‌ల స్థాయి నేతల వ‌ర‌కు డైల‌మాలో ప‌డిపోయారు. విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా వైసీపీని ఓ కుదుపు కుదిపేసింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ టూర్ లో ఉండ‌గానే విజ‌య‌సాయిరెడ్డి షాకివ్వ‌డంతో ఆ పార్టీ నేత‌లు తేరుకోలేక పోతున్నారు. కూట‌మి పార్టీలు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.  వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించాడు. భూ క‌బ్జాలు, ఇసుక, మ‌ట్టి, మ‌ద్యం దందా ఇలా ప్ర‌తీ దాంట్లోనూ కోట్లాది రూపాయ‌లు జేబుల్లో వేసుకున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గాలికొదిలేసి త‌మ జేబులు నింపుకోవ‌టానికే వైసీపీ నేత‌లు ప్రాధాన్య‌త‌నిచ్చారు. దీనికితోడు ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై నోటికొచ్చినట్లు దూషణలు చేశారు. బూతులతో రెచ్చిపోయారు. ఇక వైసీపీ సోష‌ల్ మీడియా అరాచ‌కం గురించి ఎంత చెప్పినా తక్కువే. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌ల ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలోకి వెళ్లిందంటే 175 సీట్ల‌లో క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ప్ర‌క‌టించేసుకున్నారు. చంద్ర‌బాబు సైతం ఓడిపోతాడ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేత‌ల పిచ్చిచేష్ట‌ల‌ను భ‌రించిన ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిపక్ష హోదాకూడా ఇవ్వ‌కుండా 11 సీట్ల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌కు పూర్తి స్థాయిలో అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల‌ రోజుల నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోడ్ల‌పైకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. రెడ్ బుక్ అంటూ ఢిల్లీ వెళ్లి నానా రాద్ధాంతం చేశాడు. మ‌రో రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోతుంది.. రాజ్య‌స‌భ‌లో మ‌న‌మే బ‌లంగా ఉన్నాం.. బీజేపీ మ‌న వెంటే ఉందంటూ వైసీపీ శ్రేణుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం జ‌గ‌న్ వ‌ద్ద అక్ర‌మ సంపాద‌న భారీగా ఉంది.. సొంత మీడియా ఉంది.. సోష‌ల్ మీడియా ఉంది.. ఏదైనా చేయ‌గ‌ల‌డు అని భ్ర‌మ‌ప‌డ్డారు. కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అక్ర‌మాల‌పై దృష్టిసా రించ‌డంతో ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌ల మెడ‌కు అవినీతి ఉచ్చుబిగిస్తూ వ‌స్తుండటంతో వారిలో భయం మొదలైంది.  దీంతో పార్టీ శ్రేణుల‌ను రోడ్ల‌పైకి వ‌చ్చి కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు చేయాల‌ని చెప్పిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఏదైనా ప‌ని ఉన్న‌ప్పుడు మాత్ర‌మే తాడేప‌ల్లి ప్యాలెస్ కు వ‌స్తున్నారు. అయినా, అక్ర‌మ సంపాద‌న‌తో ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్‌ సొంత మీడియా, సోష‌ల్ మీడియా నిత్యం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చింది. మ‌న‌మే అధికారంలోకి వ‌స్తున్నాం.. మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అవు తారు.. ఎవ‌రికీ భ‌య‌పడొద్దు అంటూ వారిని రెచ్చ‌గొడుతూ వచ్చింది.. దీంతో ప‌లువురు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ ప్ర‌భుత్వ‌మే అన్న‌ట్లుగా రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం వారి భ్ర‌మ‌లు తొల‌గిపోతున్నాయి. ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతుండ‌టంతో భ‌యం ప‌ట్టుకుంది.  వైసీపీ అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇన్నాళ్లు అవేమీ పెద్దగా ప‌ట్టించుకోని ఆ పార్టీ శ్రేణులు.. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో డీలా ప‌డిపోయాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా.. పార్టీలో కీల‌క నేత‌గా విజ‌య‌సాయిరెడ్డి కొన‌సాగుతూ వ‌చ్చారు. అయితే, జ‌గ‌న్ లండ‌న్ వెళ్లిన స‌మ‌యంలో చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాడు.   రాజ‌కీల‌కే గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లు మ‌ళ్లీ మ‌న‌మే అధికారంలోకి వ‌స్తాం అంటూ భ్ర‌మ‌ల్లో ఉన్న వైసీపీ నేత‌ల్లో   వణుకు మొదలైంది. రాబోయే రోజుల్లో భారీ సంఖ్య‌లో వైసీపీ నేత‌లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌ వుతున్నారు. మ‌రో ఏడాది నాటికి జ‌గ‌న్‌, మ‌రో ప‌దిమంది నేత‌లు మాత్ర‌మే వైసీపీలో మిగిలే ప‌రిస్థితి. దీంతో ఇన్నాళ్లూ జ‌గ‌న్ మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా మ‌న‌కు అండ‌గా ఉందంటూ రెచ్చిపోయిన వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మొత్తానికి మ‌ళ్లీ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడంటూ మైకు దొరికిన‌ప్పుడ‌ల్లా ఉప‌న్యాసాలు ఇచ్చిన నేత‌ల భ్ర‌మ‌లు తొల‌గిపోయాయి.

గుండ్రాంపల్లిలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు.. చిట్యాలలో 4వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి!

పరిరక్షించుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో క్రీ.పూ. 4000 సంవత్సరాల నాటి రాతి గొడ్డలి లభించిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ, డాక్టర్ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. పురాతన వారసత్వ సంపదను గుర్తించి, కాపాడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించే "ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం గుండ్రాంపల్లి, ఏపూరు గ్రామాల మధ్యలో నాగులకట్ట వద్ద చేపట్టిన అన్వేషణలో 15 సెం. మీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంగల నల్ల సానపు రాతిగొడ్డలి కనిపించిందని చెప్పారు. నాగులకట్ట పైన కాకతీయుల కాలానికి చెందిన క్రీ.శ. 13వ శతాబ్దం నాటి నాగదేవతల శిల్పాలు ఉన్నాయని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిర్లక్ష్యంగా పడిఉన్న ఈ చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యకర్త యడ్లపల్లి అమర్నాథ్ పాల్గొన్నారు అని ఆయన అన్నారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని చెప్పారు.

250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ.. అమరావతి ఒక అద్భుతం!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మూడేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శుక్రవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన ఆయన పనులకు ఈ నెలాఖరులోగా టెండల్లు పిలుస్తామనీ, ఫిబ్రవరి రెండో వారానికల్లా పనులు ప్రారంభమౌతాయనీ చెప్పరు.  అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని పునరు ద్ఘాటించిన మంత్రి నారాయణ.. న్యాయపరమైన అంశాల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. మీడియాతో మాట్లాడడానికి ముందు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలో  అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఇప్పటికే 40 పనులకు టెండర్లు పిలవడం జరిగిందని వెల్లడించారు.  జగన్ ప్రభుత్వం  అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక అమరావతి పనులు చకచకా జరుగుతాయనీ, అందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనీ చెప్పిన ఆయన అమరావతి ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.   2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 4053 అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిందన్న నారాయణ.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటి పనులనూ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని విమర్శించారు. 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ నిర్మాణం చేపడతామనీ, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో  ఆ ప్రదేశాన్ని పర్యటక ప్రాంతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.  రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే ప్రాంతంలో నివాసం ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు. 

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రెడీ!

12 ఏళ్లకు ఒక సారి వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ సారి 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకూ గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు షురూ చేసింది. ప్రాథమిక అంచనా మేరకు ఈ సారి గోదావరి పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారు. ఘాట్ల నిర్వహణ, తొక్కిసలాటలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఫలానా ఘాట్ లోనే స్నానం చేయాలన్న నియమం ఏదీ లేదనీ, ఏ ఘాట్ లోనైనా స్థానం చేయవచ్చునన్న ప్రచారానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఘాట్ల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే ఘట్ల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేసింది.  గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ విస్తరణ, ఆధునీకరణ కోసం 271.43 కోట్ల రూపాయలు కేటాయించింది.   దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. వాటి వివరాలను ముందుగానే వెల్లడించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది .యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్లకు అదనంగా మరో నాలుగు కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.   కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు,  బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేశారు.  ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయడానికి అధికారులు సమాయత్తమౌతున్నారు. 

ఏపీకి క్యూ కట్టనున్న దిగ్గజ సంస్థలు.. గెట్ రెడీ.. అధికారులతో చంద్రబాబు

దావోస్ పర్యటనకు ఆర్భాటంగా వెళ్లి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దావోస్ వేదికగా జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ఏకైక అజెండాగా వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సదస్సు జరిగినన్ని రోజులూ క్షణం తీరక లేకుండా దిగ్గజ సంస్థల అధిపతులతో చర్చోపచర్చలు జరిపింది. సదస్సు ముగిసిన తరువాత విజయ హాసంతో చంద్రబాబు, ఆయన బృందం తిరిగి వచ్చింది.  అయితే వైసీపీ నేతలు మాత్రం దావోస్ పర్యటనలో చంద్రబాబు విఫలం, ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తేలేకపోయారంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఏడు నెలలో దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కన్వీనియెంట్ గా మరిచిపోయారు. దావోస్ సదస్సులో ఒక్కటంటే ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారంటూ చంద్రబాబు, లోకేష్ మీద ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం (జనవరి 24) సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు.  అదే రోజు తన అధికారిక నివాసంలో   ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ సందర్బంగా చంద్రబాబు   ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాననీ చెప్పారు.   ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావధానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

మాయలఫకీరు విజయసాయి.. ఆ వ్యూహంతోనే రాజీనామాస్త్రం!

విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయసారిరెడ్డి ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నదానిపైనే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అంటున్నారన్న వాదన బలం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పలువురు తెలుగుదేశం నేతలు విజయసాయిరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసుల నుంచి తప్పించుకోజాలరని అంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీనామా చేసి, రాజకీయాలనుంచి వైదొలగినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనీ, విజయసాయి చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. విజయసాయి హయాంలో  విశాఖ వాసులు పడిన ఇక్కట్లు, విశాఖలో జరిగిన విధ్వంసం, దాడులు అందరికీ తెలుసునన్న గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే విజయసాయి రాజీనామాతో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అనేది మునిగిపోయే నావ అన్నది తేటతెల్లమైందని గంటా అన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అన్న విషయం తాను ఎప్పుడో చెప్పాననీ, ఇప్పుడది నిజం కాబోతోందని పేర్కొన్నారు.  ఇక అమరావతి బహుజన సమాఖ్య అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అయితే విజయసాయిని ఒక మాయల ఫకీరుగా అభివర్ణించారు. ఆయన ఏదైనా చేయగలరు, ఎవరినైనా నమ్మించగలరని పేర్కొన్నారు. విజయసాయి రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన నేపథ్యంలో శనివారం (జనవరి 25) మీడియాతో మాట్లాడిన బాలకోటయ్య.. ఏదో బోధి వృక్షం కింద జ్ణానోదయం అయ్యింది అనుకోవడానికి విజయసాయి బుద్ధుడు కాదన్నారు. ఇక తన భవిష్యత్ వ్యవసాయమే అని విజయసాయి చెప్పడాన్ని కూడా బాలకోటయ్య ఎద్దేవా చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విదేయుడైన ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయికి వ్యవసాయం అంటే ఏం తెలుసునని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పార్టీలోనూ, ఆయన కేసుల్లోనూ కూడా ఏ2గా ఉన్న విజయసాయి వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.  అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడని విర్రవీగి, అధికారం పోగానే పలాయనం చిత్తగించటం విజయసాయి నైజమని విమర్శించారు.  ఆయన రాజకీయ సన్యాసం అనడం వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాని చట్టం నుంచి తప్పించుకోగలననుకోవడం విజయసాయి భ్రమ మాత్రమేనని బాలకోటయ్య అన్నారు.   

ముగిసిన గ్రామ సభలు... రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీ దరఖాస్తులు

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు  నిన్నటితో ముగిసాయి. 16, 348 గ్రామసభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. శనివారం నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేటీంలు ఇంటింటికి వెళ్లనున్నాయి. గతంలో ప్రజాపాలనలో లబ్ది చేకూరని వారికి గ్రామసభలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్దిదారులకు అర్హత ఉందా లేదా అనేది ఈ రీ సర్వేలో చేయనున్నారు  ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామసభల్లో పలువురు రాష్ట్రమంత్రులు , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు  సంబంధించి  ప్రజలు దరఖాస్తులు అందజేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్దిదారులను కన్ఫర్మ్ చేయడానికి గ్రామసభలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జరిగింది. అన్నీ చోట్ల భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే లబ్దిదారుల ఎంపిక కాకపోవడం ప్రతికూలాశం. అనర్హులకు అవకాశాలు రావడంపై ప్రజల నుంచి  పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.   రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితాలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేరు ఉండటం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం,  పచ్చల నడికుడి గ్రామ సభలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.  జాబితా నుంచి నా పేరు తొలగించాలని స్వయంగా అన్వేష్ రెడ్డి అధికారులను కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామకృష్ణాపురంలో అనర్హులుకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. తుంగతుర్తిలో కూడా అనర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు లభించింది.  మెజారిటీ గ్రామసభలో  స్థానికుల నుంచి తీవ్ర వ్యతరేకత వచ్చింది.  ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.  హన్మంకొండ జిల్లా కమలాపూర్ లో జరిగిన గ్రామసభలో హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ  ఆయన వాకౌట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కోడి గుడ్లు, టమాటోలు, చెప్పులు విసిరారు.  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లో ఆత్మీయ సభకు తమను సెలెక్ట్ చేయాలన్న డిమాండ్ స్థానిక కూలీల నుంచి వచ్చింది.  బోథ్ మండలం సోనాలి గ్రామ సభలో బిజెపి, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చిన్నపాటియుద్దమే జరిగింది. రెబ్బన మండలంలో అనర్హులకు అవకాశం వచ్చిందని స్థానికులు ఉక్రోశం వెలిబుచ్చారు. రోడ్డుపై బైఠాయించారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులు కొట్టుకున్నాయి. గద్వాలజిల్లా థరూర్ మండలంలో  ప్రజలు గ్రామసభలను బహిష్కరించారు. నాగార్ కర్నూలు జిల్లా తెలకపల్లి గ్రామంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులమధ్య పెద్ద గొడవ జరిగింది. ఉమ్మడి ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయని చెప్పొచ్చు. 

అయోధ్యరామిరెడ్డి ఖండించినా.. అగని రాజీనామా ప్రచారం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు శుక్రవారం (జనవరి 24) సాయంత్రం నుంచీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కూడా విజయసాయి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా  ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్త ప్రచారంలోకి రావడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ వార్త బయటకు పొక్కిన క్షణాల్లో పలువురు వైసీపీ మాజీ నేతలు అయోధ్యరామిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారంటూ విశ్లేషణలు చేశారు. వైసీపీ వర్గాలు కూడా గత కొంత కాలంగా అయోధ్యరామిరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, ఆయన ఎప్పుడో అప్పుడు పార్టీ మారుతారని అనుకుంటూనే ఉన్నామని చెప్పుకొచ్చారు.  వైసీపీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నలుగురైదుగురు నేతలలో కచ్చితంగా అయోధ్యరామిరెడ్డి ఒకరు. రాంకీ అధినేత అయిన అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అటువంటి అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్తలు వైసీపీలో కలవరం రేపాయి. అయితే ఒకింత ఆలస్యంగానైనా అయోధ్యరామిరడ్డి తన రాజీనామా వార్తలను ఖండించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. తాను ప్రస్తుతం విదేశాల్లో  ఉన్నాననీ, వారం రోజుల్లో తిరిగి వస్తాననీ, అప్పుడు మీడియాతో వివరంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.   అయోధ్యరామిరెడ్డి తాను వైసీపీలోనే ఉన్నానని కరాఖండీగా చెప్పినప్పటికీ ఆయన మాటలను సొంత పార్టీ శ్రేణులే విశ్వసించడం లేదు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత నుంచీ అయోధ్యరామిరెడ్డి పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించింది లేదు. ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారనీ గత కొంత కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. బీజేపీ కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కమలం వర్గాలు చెబుతున్నాయి.  

జగన్ కు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం.. విజయసాయి భయమేంటి?

విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన.. ఇక తన భవిష్యత్ వ్యాపకం వ్యవసాయమే అంటూ చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ పై పార్టీలో విశ్వాసరాహిత్యం పెచ్చరిల్లిందనడానికి విజయసారి రాజీనామాయే ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. తన రాజీనామా విషయంలో విజయసాయి ఎంత చెప్పినా, ఎంతగా తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నా, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని ఎంతగా నమ్మబలికినా ఎవరూ నమ్మడం లేదు. ఎవరిదాకానో ఎందుకు వైసీపీ వర్గాలే ఆయన మాటలను విశ్వసించడం లేదు. జగన్ కు పట్ల అంత విధేయత ఉంటే.. కనీసం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకైనా రాజీనామా ప్రకటన చేయకుండా ఉండాలి కదా అంటున్నారు.  వాస్తవానికి విజయసాయి రాజీనామా ప్రకటన కంటే.. ఆ ప్రకటన ఆయన చేయడానికి ఎంచుకున్న సమయం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీ శ్రేణులకు పార్టీకి ఇక భవిష్యత్ లేదన్న సంకేతాన్ని పంపించిందనడంలో సందేహం లేదు. అన్నీ జగన్ కు చెప్పాను, ఆ తరువాతే రాజీనామా నిర్ణయం ప్రకటించాను అని విజయసాయిరెడ్డి చెప్పుకున్నా.. పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో విజయసాయి తన రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేయడం పార్టీ నేతలు, కేడర్ ను షాక్ కు గురి చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని విజయసాయి జగన్ ఆబ్సెన్స్ లో ఆయనతో చర్చించకుండా తీసుకోవడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసింది. అదును చూసి దెబ్బకొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది.  ఒక వేళ విజయసాయి తాను చెబుతున్నట్లుగా జగన్ తో తన రాజీనామా విషయం చర్చించి ఉంటే కచ్చితంగా ఆయన వద్దని వారించేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తాను విదేశీ పర్యటన నుంచి వచ్చే వరకైనా రాజీనామా నిర్ణయం ప్రకటనను ఆపేవారని చెబుతున్నారు. అది జరగలేదంటే విజయసాయి తన నిర్ణయాన్ని జగన్ కు సూచన ప్రాయంగానైనా తెలియజేయలేదనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలా జగన్ కు కూడా చెప్పాపెట్టకుండా విజయసాయి రాజీనామా చేశారంటే..విజయసాయి ఏ స్థాయి ఒత్తిడిలో ఉన్నారో అవగతమౌతుంది.  కేసులు, అరెస్టు నుంచి తనను తాను కాపాడుకోవడానికే విజయసాయి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విజయసాయి రాజీనామా ఆమోదం

విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని విజయసాయి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు. అన్ని విషయాలూ వైసీపీ అధినేత జగన్ తో మాట్లాడాననీ, ఆ తరువాతే రాజీనామా చేశానని చెప్పారు. భవిష్యత్ లో ఇక రాజకీయాల గురించి మాట్లాడనని విస్పష్టంగా చెప్పిన విజయసాయి, కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు.  

బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్.. చంద్రబాబుకు గిఫ్ట్

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, చంద్రబాబు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దార్శనికతకు తాను ఫిదా అయ్యానని బిల్ గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి బిల్ గేట్స్ తో నారా చంద్రబాబు ఇటీవలి దావోస్ పర్యటన సందర్భంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా బిల్ గేట్స్ చంద్రబాబుకు ఒక అపురూప బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంతకీ బిల్ గేట్స్ ఇచ్చిన బహుమతి ఏమిటంటే... తాను కాలేజీ వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఎలా ఫ్లోట్ చేశారు, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్. ఔను బిల్ గేట్స్ తన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. దీనికి చంద్రబాబు బిల్ గేట్స్ కు థ్యాంక్స్ చెప్పారు. బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్ చాలా స్ఫూర్తిదాయకమని చెప్పిన చంద్రబాబు.. ఆ సోర్స్ కోడ్ బుక్ నవ్యాంధ్ర పురోగమనం విషయంలో తనకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 

పిల్లి, గురుస్వామి బుజ్జగింపులు విఫలం.. ఎంపీగా రాజీనామా చేసిన విజయసాయి

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చెప్పిన విధంగా శనివారం (జనవరి 25)న ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో  రాజ్యసభ చైర్మన్  జగదీప్ ధన్కడ్ కు అందజేశారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాననీ శుక్రవారం (జనవరి 24) విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రకటనతో వైసీపీ హై కమాండ్ ఉలిక్కిపడింది. ఆయన ఏదో ఒత్తిడితో రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారనీ, ఆయనతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయాలన్న పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుస్తామిలను హుటాహుటిన ఢిల్లీకి పంపింది. వారిరువురూ వేరువేరుగా విజయసాయి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అయితే విజయసాయి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. ముందుగా ప్రకటించిన విధంగా తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో జగదీశ్ ధన్కడ్ కు అందజేశారు. విజయసాయి నిర్ణయం తనను షాక్ కు గురి చేసిందని ఎంపీ గురుస్తామి అన్నారు. పిల్లి కూడా విజయసాయి రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

విజయసాయి రాజీనామా.. బీజేపీకి జగన్ ప్రేమసందేశమా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో పెను సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఉరుములేని పిడుగులా విజయసాయి ఇంత హఠాత్తుగా అదీ వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటి? ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ ఆయనకు వెన్నంటి ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరువాత ఏ2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఇంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులైతే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగనే అని అంటున్నారు. ఒక విధంగా విజయసాయి రాజీనామా బీజేపీకి జగన్ పంపిన ప్రేమ సందేశం అని కూడా చెబుతున్నారు.  వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వైసీపీ మెరేల్ ను బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. విజయసాయి కూడా వైసీపీని వదిలేస్తే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేవారెవరుంటారన్న సందేహం పార్టీ క్యాడర్ లో బలంగా వ్యక్తం అవుతోంది. తన రాజీనామా నిర్ణయం ప్రకటనకు ముందే ఈ విషయం విజయసాయికి తెలుసు అనడంలో సందేహం లేదు. అయినా విజయసాయి ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. జగన్ తో ఆయనకు ఇక పూడ్చలేని అగాధమైనా ఏర్పడి ఉండాలి. కానీ జగన్ పట్ల విజయసాయి విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని ఆయన తన రాజకీయ సన్యాసం ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అవతగమౌతోంది. మరి విజయసాయి నిర్ణయానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. జగన్ ఆదేశం మేరకే విజయసాయి ఈ నిర్ణయం ప్రకటించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ రాజకీయాలలో వైసీపీకి ఇంక స్పేస్ లేదు. జగన్ ను జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలను నమ్మించి వారి విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు జగన్ ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. తాను కూసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ అనివార్యం అని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే విజయసాయి చేత రాజీనామా చేయించి జగన్ బీజేపీకి ప్రేమ సందేశం పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి బీజేపీలో వెంటనే చేరకపోవచ్చు.. కానీ విజయసాయి రెడ్డి బాటలో ఇతర ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారనీ, వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారనీ అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయోధ్యరామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించి ఉండొచ్చు.. కానీ ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందనీ, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని ఫణంగా పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నిర్మలాసీతారామన్ కు చంద్రబాబు థ్యాంక్స్.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కు థ్యాంక్స్  చెప్పారు. తన దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలలో భాగంగా ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిర్మలా సీతారామన్ కు థ్యాంక్స్ చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11 వేల 440 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ణతలు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఉన్నారు. మరి కొద్ది రోజులలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వికసిత ఆంధ్రప్రదేశ్ – 2047 కలని సాకారం చేసేలా, అమరావతి, పోలవరం సహా  రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు, అలాగే నూతన ప్రాజెక్టులకు బడ్జెట్ లో  సముచిత రీతిలో నిధులు కేటాయించాలని చంద్రబాబు ఈ సందర్భంగా విత్తమంత్రిని కోరారు.