ఈడీ కార్యాలయంలో కెటీఆర్ విచారణ 

ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ మంత్రి  కెటీఆర్ గురువారం బషీర్ బాగ్ లోని ఈ డీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని  తన నివాసం నుంచి కెటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కెటీఆర్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సమయంలోనే  కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్,  చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలను  విచారించిన ఈడీ కెటీఆర్ ను విచారిస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో భారీ అవినీతి జరిగిందని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విచారణకు హాజరయ్యే ముందు కెటీఆర్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. 

గుండె పోటుతో షూటింగ్ స్పాట్ లోనే కన్నుమూసిన నటుడు

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. భోజ్ పురి యువ నటుడు, యాక్షన్ హీరో సుదీప్ పాండే బుధవారం (జనవరి 15) గుండెపోటుతో కన్నుమూశారు. తన సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఒక్కసారిగా కుప్పకూలి సుదీప్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 5నే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సుదీప్ పాండ పది రోజుల వ్యవధిలోనే గుండెపోటుతో మరణించడం బాధాకరం.  సుదీప్ పాండే బహుముఖ ప్రజ్ణాశాలి. కేవలం నటుడిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. అంతే కాకుండా  రాజకీయాలలో కూడా క్రియాశీలంగా ఉన్నారు. ఎన్సీపా పార్టీ తరఫున ఆయన చురుకుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుదీప్ పాండే తొలి చిత్రం భోజ్‌పురి భయ్యా.  అనతి కాలంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ పాండే  ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బానీ’ వంటి సినిమాల్లో  నటించాడు.  సినిమాల్లోకి రాకముందు సుదీప్ పాండే కొంత కాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా  పనిచేశాడు.

రెడ్ బుక్ మరిచిపోలేదు.. అక్రమార్కులకు శిక్ష తప్పదు!

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది.   ఆ పార్టీ నేత‌లు యధేచ్ఛగా అందినకాడికి ప్ర‌భుత్వ భూములు, అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జా  చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అదికారంలోకి వచ్చిన జగన్ తన హయంలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని నానా  రకాలుగా వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేశారు. సరే జనం జగన్ అరాచక పాలనకు ఛీ కొట్టి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గత ఐదేళ్ల పాలనలో తాము ఎదుర్కొన్న వేధింపులు, మానసిక వేదనకు  న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కార్ జగన్ హయాంలో  జరిగిన అరాచకత్వం, అన్యాయం, దౌర్జన్యం, దోపిడీలపై చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం నేతలు, క్యాడర్ తో పాటు జగన్ హయాంలో వేధింపులకు గురైన జనసైనికులు కూడా ఆశించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురి చేసింది.  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో  అవమానాలు, వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొన్న తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ కు జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు అన్న ఆశ ఈ ఆరు నెలలుగా అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది.  యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ నిబంధనలను తుంగలోకి తొక్కి అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి పేర్లూ ఈ రెడ్ బుక్ లో నోట్ చేశాననీ, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనీ చెప్పిన లోకేష్ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్న పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో నారా లోకేష్ తాను రెడ్ బుక్ ను మరిచి పోలేదని ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా కుప్పంలో సంబరాలు చేసుకున్న ఆయన ఆ సందర్భంగా  కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ రెడ్ బుక్ లో  పేరున్న ప్రతి  ఒక్కరూ వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సిందేననీ, అలా చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. తాను రెడ్ బుక్ ను మరిచిపోలేదనీ, అన్యాయాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదనీ, ఇప్పటికే రెడ్ బుక్ తన పని తానూ చేసుకుంటూ పోతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపిన వారు  త్వరలో  కటకటాలు లెక్కించడం తధ్యమన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనలలో ఉత్సాహం నెలకొంది. రెడ్ బుక్ ను లోకేష్ మరిచి పోలేదనీ, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.10వేల కోట్లతో ఏపీలో సోలార్ విద్యుత్ ప్లాంట్

కొత్త పరిశ్రమల ఏర్పాటు మాట అటుంచి రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి గత ఐదేళ్లలో జగన్ హయాంలో చూసిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పరిశ్రమలు క్యూకడు తున్నా యి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుం టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. అదే విధంగా కేంద్రం నుంచి రావలసిన ప్రాజెక్టులు కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో  రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్నది. తాజాగా  ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో ఆసియాలోనే అతి పెద్ద  సౌర విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌  ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న రిలయన్స్ ఎన్ యూ సన్ టెక్ ఇందు కోసం భూముల పరిశీలన చేస్తున్నది.  ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్‌తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వేయి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   సెకితో కలిసి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా పాతికేళ్ల  కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకి ఒప్పందం చేసుకోనుంది.  రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నారు. బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ -బీఓటీ విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.  

కోటి దాటిన తెలుగుదేశం సభ్యత్వాలు

తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సంక్రాంతి పండుగ వేళ పార్టీ సభ్యత్వాలు కోటి దాటాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. కనుమ పండుగ రోజు నాటికి తెలుగుదేశం సభ్యత్వాల సంఖ్య కోటీ 20 వేల 65కు చేరుకుందని పార్టీ ప్రకటించింది. కాగా లక్షా 49 వేల సభ్యత్వాలతో మంత్రి పొంగూరు నారాయణ నియోజకవర్గం నెల్లూరు సిటీ నిలిచింది. ఆ తరువాత వరుసగా రెండు మూడు స్థానాలలో మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడుల నియోజకవర్గాలు ఆత్మకూరు, పాలకొల్లు నిలిచాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబడు సొంత నియోజకవర్గం కుప్పం 1.38లక్షల సభ్యత్వాలతో ఐదో స్థానంలో నిలవగా, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి తొమ్మిదో స్థానంలో నిలిచింది.  

బుగ్గల మెరుపు.. జింక పరుగు.. ప్రియాంక, అతిశిలపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు

అధికారంతో వచ్చిన అహంకారమో, లేక మహిళల పట్ల నిజంగానే చిన్న చూపో కానీ బీజేపీ నేతలు మహిళల విషయంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ నాయకుడు రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వధేరా గాంధీపై చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే..  ఢిల్లీ సీఎం  ఆతీశిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో  సప్పోజ్ ఫర్ సప్పోజ్ బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ  పార్టీ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న బిధూరీ.. తన వ్యాఖ్యలతో పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిధూరీ ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే హస్తిన రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా మారుస్తామని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. బీజేపీ డిఫెన్స్ లో పడింది. అయినా ఇసుమంతైనా మారని రమేష్ బిధూరీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశిని జింకతో పోల్చి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.  గత ఐదేళ్లుగా డిల్లీని పట్టించుకోని అతిశి ఎన్నికలు వచ్చే సరికి ఢిల్లీ రోడ్లపై జింకలా పరుగులు పెడుతున్నారంటూ నోరు పారేసుకున్నారు. దీనిపై ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిధూరీ క్షమాపణకు డిమాండ్ చేయడమే కాకుండా.. ఎన్నికల సంఘానికి, మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేసింది. 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. మొత్తం ఆరు కత్తిపోట్లు ఉండగా, వాటిలో రెండు చాలా లోతుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆయన వెన్నుముక వద్ద లోతైన గాయం అయ్యిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందనీ పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం (జనవరి 16) తెల్లవారు జామున జరిగింది.  సైఫ్ అలీఖాన్ నివాసంలోకి జొరబడిన అగంగకుడు చోరీ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. అతడిని గమనించి అలీఖాన్ ఇంటి నౌకర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుండగుడు నౌకరుతో గొడవకు దిగాడు. ఈ అలికిడికి నిద్ర నుంచి లేచిన అలీఖాన్ ఆ అగంతకుడిని అడ్డుకోబోగా అతడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్నపోలీసులు సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన దుండగుడిని పట్లుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.   దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సైఫ్ అలీఖాన్ పై దాడి సంఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు.  

ఏపీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో  ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ప్రజల ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా జరిగిన సంక్రాంతి సంబరాలు ఈ సారి  మిన్నంటాయి.  సంక్రాంతి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల రంగవల్లులతో కళకళలాడే లోగిళ్లు, గొబ్బెమ్మలు. ఇవన్నీ ఈ ఏడాది మరింత కళకళలాడాయి.  పండుగ మూడు రోజులూ  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో  కోడిపందేలు జోరుగా సాగాయి.   వీటిని తిలకించడానికి లక్షల సంఖ్యలో అతిధులు వచ్చారు. ఏటా తెలుగు లోగిళ్లలోని సంక్రాంతి సంబురాలు, కోడి పందేలను తిలకించడానికి వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలి వచ్చే వారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈ సారి వారి స్వగ్రామాలకు కుటుంబ సమేతంగా తరలిరావడమే కాకుండా వారితో పాటు వారి స్నేహితులను కూడా తీసుకువచ్చారు.  ఇలా వచ్చే అతిథుల విడిది కోసం స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థతి ఇదే తొలిసారని చెబుతున్నారు.    సంక్రాంతి అనగానే కోడి పందేలు వేయడం, పోలీసులు రావడం, పందేలు వేసే వారిని, పై పందేలు కాసే వారిని తరిమి పట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము.   ఈ సారి పోలీసులు కోడి పందేల బరుల వద్ద   కనిపించలేదు. పండుగ ముందు కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒకింత హడావుడి చేసినా పండుగ రోజుల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ సారి గతానికి భిన్నంగా కోడి పందేలను తిలకించేందుకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం విశేషం. కొన్ని చోట్ల వారు కూడా పందేలలో పాల్గొన్నారు.      ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు  కోడి పందేల బరుల నిర్వాహకులుగా మారారు. వీరు బరులు ఏర్పాటు చేస్తే మగవారు నిర్వహణ బాధ్యతలు చూశారు.   కోడి పందేల బరులతో పాటు చాలా గ్రామాల్లో  రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు చేసేందుకు వెళ్లారు. ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో వెళ్లారు.  

కేటీఆర్ అరెస్టేనా?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం (జనవరి 16) ఈడీ విచారణకు హాజరు కానున్నారు.  ఫార్ములా ఈ  రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టులో, ఆ తరువాత బుధవారం (జనవరి 15) సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేపు  ఈడీ విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.   గురువారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాల‌యానికి బయలుదేరుతారు. ఉద‌యం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే నంది నగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా ఈ సీన్ కనిపించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  ఈ సారి ఈడీ విచారణకు కూడా  అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బలప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్టు చేస్తే బెటరని భావిస్తున్నారు. ఈడీ అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టమనీ, అదే ఏసీబీ అరెస్టు చేస్తే బెయిలు ఒకింత తొందరగా వస్తుందనీ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే   గురువారం ఈడీ విచారణ తరువాత కేటీఆర్ అరెస్టు అవుతారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.  ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్టపీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు. 

మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ ను అడ్డుకున్న పోలీసులు

మంచు కుటుంబ వివాదం మరో సారి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బుధవారం (జనవరి 15) కనుమ పండుగ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వచ్చిన మంచు మనోజ్ దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. తాను తన తాత, నానమ్మలకు నివాళులర్పించడానికి వచ్చాననీ, గొడవపడేందుకు కాదనీ మంచు మనోజ్ చెప్పినప్పటికీ పోలీసులు కోర్టు అనుమతి లేదంటూ ఆయనను యూనివర్సిటీలోనికి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అక్కడ నుంచి నేరుగా నారా వారి పల్లెకు చేరుకుని మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. అనంతరం అనంతరం ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో  పాల్గొన్నమంచు మనోజ్ దంపతులు  మరోసారి మోహన్​బాబు వర్సిటీకి వచ్చారు. వర్సిటీ ఆవరణలోని శ్రీవిద్యానికేతన్‌ వద్దకు వచ్చిన మనోజ్‌ దంపతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ వద్ద మర సారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తాతా నానమ్మలకు నివాళులు కూడా అర్పించనీయరా అంటే మంచు మనోజ్ గట్టిగా కేకలు వేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

నారా వారి ప్రాపకం కోసం మంచు వారి వెంపర్లాట.. వద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు!

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదం కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయే వరకూ దారి దీసింది. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్ ఒక వైపు అన్నట్లుగా కుటుంబం చీలిపోయింది. పలు మార్లు దాడులు, ప్రతి దాడుల వరకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంజు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ప్రదర్శించిన ప్లెక్సీల్లో మోహన్ బాబు ఫొటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా ఉంది.  వాస్తవానికి మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవు. జగన్ హయాంలో మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబుపైనా, తెలుగుదేశంపైనా ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.  సరే జగన్ కోసం ఎంతగా పని చేసినా, 2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో అప్పటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలూ నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంసా రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతే. జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు.  దీంతో విసిగి వేసారిన మోహన్ బాబు జగన్ కు దూరం జరిగారు. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు సరికదా.. ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అదీ జరగలేదు. ఇక గత కొంత కాలంగా మోహన్ బాబు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. అయితే అదేమీ ఆయన నటనావైదుష్యం కారణంగానో, విద్యాసంస్థల అధినేతగా వచ్చిన పేరు ప్రతిష్ఠల కారణంగానో కాదు, కుటుంబ గొడవలలొ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు.   అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో  ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యా సంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఊసరవిల్లి సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తున్నారనీ, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న చందంగా మోహన్ బాబు వ్యవహార శైలి ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   మరో వైపు తండ్రితో, సోదరుడు విష్ణుతో విభేదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారా వారి పల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.   మోహన్ బాబు కుటుంబం ఇలా చంద్రబాబు, లోకేష్ మద్దతు కోసం పాకులాడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం వీరి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచు కుటుంబాన్ని చంద్రబాబు, లోకేష్ దూరం పెట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   

న్యూఢిల్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆప్ అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం (జనవరి 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన  ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. ప్రజలు ఆలోచించి, పని చేసే వారికే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.  కష్టపడి పని చేసే వారికే ప్రజలు ఓటు వేస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.  70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు  నోటిఫికేషన్ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 17 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఈ ఎన్నికలలో బీజేపీ, ఆప్ ను హోరాహోరీ తలబడుతుండగా, కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. 

అమరావతి రైతుల ఖాతాల్లో ఆ సొమ్ములు జమ.. చంద్రబాబు సంక్రాంతి కానుక

అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని కోరుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను అందించిన రైతులకు సీఆర్డీయే పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలలో పాటు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.  అయితే జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు కౌలు కూడా నిలిపివేసింది జగన్ సర్కార్.అయితే రైతులు న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగి వచ్చి విడతల వారీగా కౌలు సొమ్ములను అమరాతి రైతుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ఏడాదది ముందు నుంచి రైతులకు కౌలు సొమ్ముల జమను నిలిపివేసింది. ఎన్నికలలో జగన్ సర్కార్ ఘోర పరాజయం పాలు కావడం, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాదిన్న కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి రైతుల కౌలు సొమ్ములను సరిగ్గా పండుగ వేళ వారి ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.  అంతే కాకుండా జగన్ హయాం అప్పట్లో అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి చేసిన భూ కేటాయింపులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను తిరిగి సీఆర్డేయేకు అప్పగించింది. అమరావతి రైతులకు ప్రయోజనం కలిగేలా తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్లా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్

స్కిల్ కేసులో చంద్రబాబునాయుడికి సుప్రీంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.   ఈ కేసులో ఇప్పటికే  చార్జిషీట్ దాఖలు చేసినందున  బెయిలు రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ఈ కేసు విచారించిన జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు.  ఈ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు 2023 నవంబర్ లో బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు బెయిలు పిటిషన్ రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వ్యులలో సుప్రీం కోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.  ఇలా ఉండగా చంద్రబాబు బెయిలు రద్దు కోరుతూ సీనియర్ జర్నలిస్టు తిలక్ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎవరు, ఈ కేసుతో మీకేం అంబంధం, పిటిషన్ దాఖలుకు మీకున్న అర్హత ఏమిటి అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.  సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ అభ్యంతరం తెలిపిన సుప్రీం కోర్టు, మరో సారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తిలక్ దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది.  

ఖమ్మంజిల్లాలో  యువకుడి అదృశ్యం... సంచలనం సృష్టించిన  వాయిస్ మెసేజ్ 

ఖమ్మం జిల్లాలో  ఓ యువకుడి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ వార్త కలకలం రేపింది. సంక్రాంతి సందర్బంగా ఖమ్మం పోలేపల్లికి చెందిన సాయి హైద్రాబాద్ నుంచి   ఖమ్మం బస్టాండ్ కు చేరుకున్నాడు     ఈ  క్రమంలో సాయి తమ్ముడు  సంజయ్ ఖమ్మం బస్టాండ్  వద్ద  అదృశ్యమయ్యాడు.  అన్నను రిసీవ్ చేసుకోవాలని ఖమ్మం బస్టాండ్ కు వచ్చిన సంజయ్  నాటకీయ పరిణామాలతో అదృశ్యమయ్యాడు. అన్న బస్టాండ్ లో ఉండగానే తమ్ముడు సంజయ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అన్నయ్య నాకు ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక అమ్మాయిని హత్య చేశారు. నన్ను కూడా హత్య చేస్తారు అని ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ను అన్న సాయి కుటుంబసభ్యులకు ఫార్వర్డ్ చేశాడు. నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సంజయ్ బైక్ అక్కడే కనిపించింది కానీ సంజయ్ మాత్రం కనిపించలేదు. సంజయ్ మెసేజ్ లో చెప్పిన అమ్మాయి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీలో సంజయ్ కనిపించాడు కానీ సంజయ్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం.. ఒకరి సజీవ దహనం

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి సజీవదహనమయ్యారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం తెలంగాణ నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఒక బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన మధుర వద్ద  మంగళవారం (జనవరి 13) చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంల బయటపడిన వారిని వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాల కు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. 

మంచు కుటుంబంలో మళ్లీ మంటలు?

మంచు కుటుంబంలో విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. ఇటీవల మంచుకుటుంబంలో విభేదాలు రచ్చకెక్కి పోలీసు కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిదే. కుటుంబం  మోహన్ బాబు, విష్ణు ఒక వైపు, మనోజ్ మరో వైపు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది.  ఈ విభేదాలపై మీడియా కవరేజ్ సందర్భంగా మోహన్ బాబు ఒక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనపై ఆయనపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన కొన్ని రోజులు అజ్ణాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందారు. సుప్రీంలో అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట వచ్చిన తరువాతే ఆయన బయటకు వచ్చారు. గత కొద్ది రోజులుగా ఆయన తిరుపతిలో  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలలో ఆయన పెద్ద కుమారుడు   విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంజు మనోజ్ మాత్రం ఇప్పటి వరకూ ఈ సంబరాలకు దూరంగా ఉన్నారు. భోగి, సంక్రాంతి వేడుకల్లో ఎక్కడా కనిపించని మనోజ్ కనుమ రోజున జరిగే సంబరాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రంగంపేటలో బుధవారం (జనవరి 15)న జరిగే జల్లి కట్టు వేడుకల్లో పాల్గొనేందుకు నమోజ్ రానున్నారు. అనంతరం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెల్లారని సమాచారం.  ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, విష్ణు ఉండటంతో.. మనోజ్ రాకతో అక్కడ మళ్లీ  గొడవలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మనోజ్ రాక సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

సుప్రీం లో కేటీఆర్ కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ ఉపసంహరణ

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో  ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్  బుధవారం (జనవరి 15) విచారణకు వచ్చింది.   ఈ సందర్భంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులలో జోక్యం చేసుకోబోని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన ను డిస్మిస్ చేసే పరిస్థితి ఉండటంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది. పేర్కొంది.   ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో తమ వాదన కూడా వినాలని కోరుతూ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీం కోర్టులో తన క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో మళ్లీ ఆయన అరెస్టుపై చర్చ మొదలైంది.