బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై రౌడీషీట్  ?  

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులు సిద్దమౌతున్నట్లు  తెలుస్తోంది. హస్కో అంటే డిస్కో చేసే రకం కౌశిక్ రెడ్డి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఆయన.  ఇంత చేయమని చెబితే అంత చేస్తారాయన. హుజురాబాద్ లో దళితబంధు అమలు కావడం లేదని పెద్ద ఎత్తున  ధర్నా ఆర్గనైజ్ చేసి హైడ్రామా చేశారు.. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి. అయినప్పటికీ బిఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న బాల్క సుమన్, గువ్వల బాల్ రాజు, గాదెరికిషోర్ తదితరులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.వారు ఓడిపోవడంతో కౌశిక్ రెడ్డి కి ప్లస్ పాయింట్ అయ్యింది.     రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి  కల్వకుంట్ల  ఫ్యామిలీ తప్పితే   బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఫేస్ వ్యాల్యూ ఉన్నవారెవరూ లేకపోవడం కౌశిక్ రెడ్డికి కలిసొచ్చింది. .      కౌశిక్ రెడ్డికి రెడ్డి ట్యాగ్ లైన్ కలిసొచ్చింది.  బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజికవర్గం నుంచి  వచ్చిన వారు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే . వాళ్లంతా యాక్టివ్ గా లేరు. కౌశిక్ రెడ్డి దూకుడు స్వభావం కాదు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండేవారు. క్రికెట్ ప్లేయర్ నుంచి పొలిటికల్ లీడర్ గా టర్న్ అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీర విధేయుడిగా ఉండేవారు. బిఆర్ ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలలో హేమాహేమీలు ఓడిపోవడం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఒరిజినల్ స్వభావం మారిపోయింది. కెసీఆర్ , కెటీఆర్ , హరీష్ రావ్ తర్వాత ఆ స్థాయి వ్యక్తులెవరూ బిఆర్ఎస్ లో లేకపోవడంతో కౌశిక్ రెడ్డికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.  కొత్త క్రిమినల్ చట్టమైన బిఎన్ఎస్ క్రింద కేసు నమోదైన  మొదటి ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డి.   జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంగర్ పోలీసులు  సంక్రాంతి పండుగ రోజే అరెస్ట్ చేశారు.మెజిస్ట్రేట్  కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.  కాంట్రవర్సితో నిత్యం వార్తలలో కెక్కే   కౌశిక్ రెడ్డిని  అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం  గతంలో వెనకడుగు వేసింది.  బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని కౌశిక్ రెడ్డి గత సంవత్సరం చేసిన గొడవ  అంతా ఇంతా కాదు. ఈ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అరికెపూడికి బిఏసి చైర్మన్ పదవి రావడంతో కౌశిక్ రెడ్డి ఊగిపోయారు. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. ఒక ఎమ్మెల్యేను మరో ఎమ్మెల్యే కొట్టడం వార్తలలోకెక్కింది. ఇద్దరూ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. ఒకప్పుడు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన వారే. ఒకప్పటి మిత్రులు శత్రువులయ్యారు.  అరికెపూడి విషయంలో  అప్పట్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ తర్వాత ఉపసంహరించుకుంది.  తాజాగా బిఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఇటీవలె జరిగిన జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడి చేశారు.బూతు పురాణంతో కౌశిక్ రెడ్డి సంజయ్ పై చిందులేసారు.ఒక దశలో ఈ సమీక్షా సమావేశంలోనే ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టారు.   సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై దాడి జరిగిందని సంజయ్ పోలీసులతో బాటు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కూడా. ప్రస్తుతం ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టై విడుదలయ్యారు. . జూబ్లిహిల్స్ లోని ఓ టీవీ చానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమం  ముగించుకుని తిరుగు ప్రయాణంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి దూకుడుకు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన సంజయ్ అడ్డుకట్టవేసారని పరిశీలకులు చెబుతున్నారు.  ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి జూబ్లిహిల్స్ పిఎస్ ఇన్స్ పెక్టర్ ఫిర్యాదు మేరకు ఒక కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ దశలో ఉంది.ఈ విచారణలో కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.  కౌశిక్ రెడ్డిపై  మరో మారు ఈ తరహా ఫిర్యాదులు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

100 కోట్ల ఓటర్ల మార్క్ కు చేరువలో ఇండియా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. మోస్ట్ పాప్యులేటెడ్ కంట్రీగా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జనాభా విషయంలో భారత్ దేశాన్ని దాటేసింది. ఇక చైనాలో ఏటికేడు జనాభా తగ్గుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దానితో సరిపెట్టుకోకుడా ఇప్పుడు మరో రికార్డుకు కూడా చేరువైంది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగా ఇప్పటికే భారత్ నిలిచింది. ఇక ఇప్పుడు దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది.  ఈ సంఖ్య త్వరలోనే వంద కోట్లకు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే దేశంలోనే బిలియన్ అంటే కోటి మంది ఓటర్లు ఉన్న ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. శనివారం (జనవరి 25)  జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో   ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల వివరాలు వెల్లడించింది.   గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు.. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 99.1 మంది ఇప్పటి వరకూ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 27.1 కోట్లు.. 2024తో పోలిస్తే ఇది ఎక్కువ. ఇక జెండర్ తేడా కూడా చాలా వరకూ తగ్గిపోయింది.  గత ఏడాది ఓటర్ల జాబితా మేరకు  ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ఈ ఏడాది అది  954కు పెరిగింది. 

తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి.. దావోస్ వేదికగా ఒప్పందం

దావోస్ లో తెలంగాణ పెట్టుబడుల వేట విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఇంధన రంగ దిగ్గజ సంస్థ సన్ పెట్రో కెమికెల్స్ రాష్ట్రంలో 45 వేల 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చంది. ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందం కుదిరింది.  ఆ సంస్థ ప్రతినిథులతో  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో  పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.  ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను సన్ పెట్రో కెమికల్స్ సంస్థ నెలకొల్పనుంది.  ఈ ప్రాజెక్టుల సామర్ధ్యం 3 వేల 400 మెగావాట్లు కాగా వీటికి 5440 మెగావాట్ల సామర్ధ్యం ఉండే సోలార్ పవర్ ప్రాజెక్టులను అనుసంధానంొ చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ తెలిపింది.   ఈ ఒప్పందం కుదిరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిథులను అభినందించారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్య సాధనలో ఈ ఒప్పందాన్ని ఒక మైలు రాయిగా అభివర్ణించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాిలు ఏర్పడతాయన్నారు. అలాగే సన్ పెట్రో ప్రాజెక్టుల కారణంగా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా పురోగమిస్తాయన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటి సారి అన్నారు.  

బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదరింపు మెయిల్స్.. బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా?

ఖతం చేస్తామంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదరింపు మెయిల్స్ వచ్చాయి. అలా బెదరింపు మెయిల్స్ వచ్చిన వారిలో ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మ, నటుడు రాజ్ పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటుడు, గాయకుడు సుగంధమిశ్రా ఉన్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రెస్ ల ఆధారంగా  ఆ బెదరింపు మెయిల్స్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.  తమ బెదరింపులపై ఎనిమిది గంటలలోగా స్పందించకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందన్నది ఆ ఈ మోయిల్స్ సారాంశం. పోలీసులు బెదరింపు ఈమెయిల్స్ వచ్చిన సెలబ్రిటీలకు భద్రత కల్పించారు. ఈ బెదరింపు మెయిల్స్ గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ లో సింగిల్ డిజిట్ కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి పులి పంజా విసిరింది. భాగ్యనగర్ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడుతోంది. అదే సమయంలో తెలంగాణలో సీజనల్ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. చలికి ఎక్స్ పోజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరులో లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజేంద్రనగర్ లో 10.5, మెదక్ లో 10.6. రామగుండంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

చంద్రబాబు బ్రాండే దావోస్ లో రేవంత్ అజెండా..!

గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే విషయంలో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే మార్గదర్శి, దిక్సూచి అని తెలంగాణ ముఖ్యమంత్రి నారా రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదకగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఓ సమావేశానికి అధ్యక్షత వహించిన రేవంత్ రెడ్డి.. 90వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పునాదులు వేశారని అన్నారు. ఆ నాడు చంద్రబాబు నాయుడి విజన్, హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా చేసిన కృషి శ్రమే ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి కారణమని చెప్పారు. ఔను నిజమే ఎప్పుడో పాతికేళ్లకు ముందు ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాటిన ఐటీ విత్తనం ఇప్పుడు మహా వృక్షమైంది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చింది. ఎ కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు  సైబరాబాద్ మహానగరాన్ని సృష్టించాడు. హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలను తలదన్ని అది ప్రపంచ ఐటీ రాజధానిగా మారింది. ఈ విషయాన్ని రాజకీయంగా ఆయనను వ్యతిరేకించేవారు, విభేదించేవారూ కూడా అంగీకరిస్తారు.   ఇదే విషయాన్ని దావోస్ వేదికగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఉద్ఘాటించారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబు వేసిన బాటలో తాము దర్జాగా నడిచేశామనీ, ఆయన కారణంగానే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదాల్చిందనీ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్రను ఎవరూ కాదనలేరని మరోమారు రుజువైంది. అసలు దేశంలో ఐటీ ప్రస్తావన వస్తే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండటం సాధ్యం కాదు.  వాస్తవానికి హైటెక్ సిటీ అంటే, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు  మాత్రమే గుర్తు కొస్తారు. ఆ నిజాన్ని ఎవరూ కాదన లేరు.    రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది  అందుకు కారణం చంద్రబాబు తప్ప మరొకరు కాదు. హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి.  ఆయన విజన్ 2020 కారణంగానే నేడు  హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది. ఇదే విషయాన్ని  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా చాటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ చంద్రబాబు బ్రాండ్ ను ఉపయోగించుకుంటున్నారు. 

మంచుతుపాను ధాటికి గడ్డకట్టిన అమెరికా.. ఎనిమిది మంది మృత్యువాత

అమెరికాను మంచు తుపాను వణికించేస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో మంచుతుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ ఎనమండుగురు మరణించారు. టెక్సాస్, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలలో రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా పలు నగరాలు గడ్డకట్టుకుపోయాయా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కురుస్తున్న మంచుకు తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో దక్షిణ అమెరికా అతలాకుతలమైపోయింది. పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవలు ప్రకటించారు.  జాతీయ వాతావరణ శాఖ సమాచారం మేరకు న్యూ ఒర్లీన్ లో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది.  

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా?!

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ గడువు దగ్గరపడటంతో కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు చేసిన చంద్రబాబు.. చివరికి  1992 బ్యాచ్ కీ చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వ ిబాగంగా డీజీగా పని చేస్తున్నారు.  ఈ హరీష్ కుమార్ గుప్తానే  గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టిన అనంతరం ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా ద్వారకాతిరుమల రావును డీజీపీగా నియమించింది. ఇప్పుడు ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను చంద్రబాబు నియమించనున్నట్లు సమాచారం. సీనియారిటీ ప్రకారం తొలి స్థానంలో 1991 బ్యాచ్ కు చెందిన మాదిరెడ్డి మాదిరెడ్డి ప్రతాప్‌ తొలి స్థానంలో ఉన్నప్పటికీ ఆయన గతంలో వైసీపీ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేసిన సమయంలో వివాదాలకు కేంద్ర స్థానంగా నిలిచారు.   ఆయనపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. దీంతో ఆయనను పక్కన పెట్టి సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాను చంద్రబాబు నూతన డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

కాంగ్రెస్ కకావికలు.. అంతర్గత విభేదాలతో కుదేలు?

జాతీయ రాజకీయాలలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా మారిపోతోంది. ఈ పార్టీ పరిస్థితి ఉనికిని కాపాడుకోవడానికి తంటాలుపడే పరిస్థితికి చేరుకుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ అక్కడి లోకల్ పార్టీల కంటే తక్కువ స్థానాలలో పోటీకి పొత్తు కుదుర్చుకుని ఉనికి చాటుకుంటే చాలన్న పరిస్థితికి దిగజారిపోయింది.  ఇక జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి ముక్కులు చెక్కలు అయిపోతున్న పరిస్థితి. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇసుమంతైనా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అలాగే యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అగ్రనాయకుడు అఖిలేష్ యాదవ్.. ఇలా జాతీయ రాజకీయాలలో బలమైన నేతలుగా ఉన్న వారెవరూ కాంగ్రెస్ వెనుక ర్యాలీ కావడానికి సుముఖంగా లేరు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఇండియా కూటమి పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారిపోయింది.  ఈ పరిస్థితిలో గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్లుగా కాంగ్రెస్ హై కమాండ్ లో అంతర్గత విభేదాలు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్ అనగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది గాంధీ కుటుంబమే. ఆ పార్టీలో ఎటువంటి అధికారిక పదవులూ లేకపోయినా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే కీలక నేతలు. తమ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టరు అని ప్రకటించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో అనివార్యంగా అయిష్టంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియాగాందీ.. ఆ తరువాత పార్టీ అధ్యక్ష పీఠాన్ని తనకు అత్యంత విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. అంతకు ముందు అశోక్ గెహ్లాత్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పటికీ, చివరి నిముషంలో ఆయన ఝలక్ ఇవ్వడంతో అనివార్యంగా ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు.  సరే ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరైనా గాంధీ కుటుంబమే ఆ పార్టీకి సుప్రీం అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఆ కుటుంబ ఆధిపత్యానికి గండి పడుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మధ్య  వివాదాలు  తీవ్ర స్థాయికి చేరుకున్న‌ట్టు వార్తలు వినవస్తున్నాయి.వీరి మధ్య విభేదాలకు కారణం ఇండియా కూటమి ముక్కలు చెక్కలు అయ్యే పరిస్థితి రావడం, ఖర్గేను విశ్వాసంలోకి తీసుకోకుండా రాహుల్ కీలక అంశాలలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతో పాటు..ఖర్గే పార్టీని సమర్థంగా లీడ్ చేయడం లేదన్న భావన పార్టీలో వ్యక్తం అవుతుండంగా చెబుతున్నారు.  ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ ఏకపక్షంగా ముందుకు సాగడంతో ఖర్గే అవమానం, అసహనంతో రగిలిపోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆప్ తో పొత్తు ఉంటేనే బీజేపీని నిలువరించడం సాధ్యమౌతుందని ఖర్గే భావిస్తున్నారు. అయితే రాహుల్ మాత్రం ఒంటరి పోరుకే సై అంటున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలలో ఒంటరి పోరు వల్ల కూటమి విచ్ఛిన్నం అవుతుందన్నది ఖర్గే వాదన. ఒక దశలో ఖర్గే ఏఐసీపీ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి సైతం సిద్ధమయ్యారని వార్తలు వినవచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ లో లుకలుకలు మరింతగా పెచ్చరిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.  

ఈట‌ల దూకుడు వ్యూహం ఫ‌లిస్తుందా?!

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌ల్లో బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఈట‌ల‌.. తెలంగాణ‌ బీజేపీలో కీల‌క నేత‌గానూ కొన‌సాగుతున్నారు. సౌమ్యుడు, మృదు స్వ‌భావిగా ఆయ‌న‌కు  పేరుంది. అయితే, ప్ర‌స్తుతం ఈటల‌ త‌న రాజ‌కీయ పంథాను మార్చారు. గేరుమార్చి దూకుడు రాజ‌కీయాల‌కు పెద్ద‌ పీట వేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ లో వ‌చ్చిన ఈ అనూహ్య‌ మార్పును చూసి బీజేపీ నేత‌ల‌తోపాటు ఇత‌ర పార్టీల్లోని నేత‌లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత‌కీ ఈట‌లలో అనూహ్య మార్పున‌కు కార‌ణం ఏమిట‌ని ఆరాతీస్తే.. పెద్ద ప్లానే ఉంద‌ని తెలుగస్తోంది.  తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీ వేగంగా ఎదుగుతోంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ రోజురోజు బ‌ల‌ప‌డుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాక‌పోయినా.. ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  స‌త్తా చాటింది. ప‌దిహేడు పార్ల‌మెంట్ స్థానాలకు గాను ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆ పార్టీ కేంద్ర అధిష్టానం తెలంగాణకు నూత‌న అధ్య‌క్షుడ్ని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈట‌ల రాజేంద‌ర్ గేరుమార్చి త‌న‌లోని స‌రికొత్త రాజ‌కీయ కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఈట‌ల రాజేంద‌ర్ రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఎక్కువ కాలం ఆయ‌న రాజ‌కీయ జీవితం బీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ఈటల‌.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంలోనూ త‌న‌వంతు పాత్ర పోషించారు. ఆ త‌రువాత కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగానూ కొన‌సాగారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ త‌రువాత ఈట‌లనే అనే స్థాయికి ఆయ‌న చేరుకున్నారు. 2021లో పార్టీ అధినాయ‌క‌త్వంతో ఏర్ప‌డిన విబేధాల కార‌ణంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలోనూ ఈటల రాజేంద‌ర్ కీల‌క నేత‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఈట‌ల విజ‌యం సాధించారు.  బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈట‌లకు ఆ సామాజిక వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉంది. బీసీల‌లోనే కాకుండా జ‌నాభా ప‌రంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్‌కు.. రెడ్డి సామాజిక వ‌ర్గంతోకూడా సంబంధాలున్నాయి. ఎందుకంటే.. ఆయ‌న స‌తీమ‌ణి రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన‌వారు. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ‌ అధ్య‌క్ష బాధ్య‌త‌లను ఈటల‌కు అప్ప‌గిస్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని, అలా అయితే, పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం సాధ్యం కాద‌న్న భావ‌న‌లో కేంద్ర పార్టీ పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈటల ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లో త‌న గేరు మార్చిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.  పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలంటే దూకుడుగా ఉండాలనీ,  కార్య‌క‌ర్త‌ల‌కు, ప్రజలకు అండ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వంపైకి దూకుడుగా వెళ్లాలి. గ‌తంలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు  బండి సంజ‌య్ తన దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ పేరు మారుమోగిపోయేలా చేశారు.  ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించ‌డంలో అప్పట్లో బండి సంజ‌య్ చాలా దూకుడుగా వ్యవహరించారు. ప‌రుష ప‌ద‌జాలంతో ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తూ వెళ్లారు. ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సైతం గ‌తంలో దూకుడుగా రాజ‌కీయాలు చేసి స‌క్సెస్ అయ్యారు. ఏపీలో నారా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ అదే తీరుతో  ప్ర‌జానాయ‌కులుగా ఎదిగారు. తెలంగాణ అధ్య‌క్షుడిగా అలాంటి వ్య‌క్తినే ఎంపిక చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ు‌. ఈ క్ర‌మంలోనే ఈట‌ల త‌న రాజ‌కీయ పంథాను మార్చుకున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. రెండురోజుల క్రితం పేద ప్రజలు కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్‌ వ్యాపారి అనుచరుడిపై ఈట‌ల చేయి చేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈట‌ల పేరు మారుమోగిపోతుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న ఆయ‌న‌.. ఉన్న‌ట్లుండి త‌న రాజ‌కీయ పంథాను మార్చ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు రావ‌డానికి బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వే కార‌ణ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మ‌రి.. ఈట‌ల వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే   కొద్ది రోజులు ఆగాల్సిందే.

 నల్లగొండ బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు పచ్చజెండా 

నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది. బిఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కెటీఆర్ తో బాటు పలువురు ముఖ్య నాయకులు ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ హైకోర్టునాశ్రయించింది.  ఆఖరినిమిషంలో అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పడంతో బిఆర్ఎస్ కోర్టు తలుపులు తట్టింది.  పద్నాలుగు నెలల కాంగ్రెస్ హాయంలో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోవడంతో బిఆర్ ఎస్ పోరు బాట పట్టింది.   

తెలంగాణలో  కొనసాగుతున్నరెండో రోజు గ్రామసభలు... రెస్పాన్స్ ఇదే

తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి.  ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది.  బుధవారం రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. ఈ నెల 24 వతేదీ డెడ్ లైన్ గా నిర్ణయించారు.  అయితే గ్రేటర్ హైద్రాబాద్ లో ఇంకా వార్డు సభలు మొదలు కాలేదు. సర్వే పూర్తయిన తర్వాత  వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వార్డు సభలు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. 

అత్యుత్సాహంతో వైసీపీ బొక్క‌బోర్లా.. పాయె..ప‌రువు మొత్తం పాయే!

దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏడు నెల‌ల కాలంలో కూట‌మి పార్టీల మ‌ధ్య ఎక్క‌డా విబేధాలు పొడ‌ చూప‌లేదు. ఐక‌మ‌త్యంగా క‌లిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొర‌క‌డం లేదు. అయితే, గ‌త నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియ‌మించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. ప‌లువురు తెలుగుదేశం నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో కూట‌మి నేత‌ల మ‌ధ్య ఎలా అగ్గిరాజేయాలా అని  గోతికాడ  న‌క్క‌లా ఎదురుచూస్తున్న వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక రాబోతోంది.. ప్ర‌భుత్వం కూల‌బోతోంది అంటూ తెగ హ‌డావుడి చేశారు. అంతే కాదు.. కూట‌మి నేత‌లు మాట్లాడ‌ని మాట‌ల‌ను జోడించి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ పెట్టేలా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా తీవ్రంగా శ్ర‌మించింది. కానీ, చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డింది.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభివృద్ధిలో భాగ‌స్వామి అవుతున్నారు. దీంతో కూట‌మిలోని బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఒకే పార్టీ నేత‌ల త‌ర‌హాలో గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌లిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి టీడీపీ నేత‌లు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొన‌సాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయాన్ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేత‌ల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న డిమాండ్ తీవ్ర‌మైంది. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు తెలుగుదేశం వాద‌న‌ను స‌మ‌ర్ధించ‌గా.. మ‌రికొంద‌రు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక వ‌చ్చిందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోప‌క్క‌ లోకేశ్ ను తిట్టిన‌ట్లు జ‌న‌సేన పేరుతో పోస్టులు పెట్ట‌డం, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ తెలుగుదేశం నేత‌ల పేరుతో పోస్టులు పెట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోష‌ల్ మీడియా పాల్ప‌డింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండ‌టంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అధిష్టానం పార్టీ క్యాడ‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లోకేశ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీ బ‌లోపేతంలోనూ లోకేశ్ కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇటీవ‌లే టీడీపీ స‌భ్య‌త్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పార్టీ స‌భ్య‌త్వాలు  తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం లోకేశ్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  కార్య‌క‌ర్త‌ల‌కు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మ‌రో ప‌క్క‌ రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని తెలుగుదేశం నేత‌లు కోర‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే స‌మ‌యంలో తెలుగుదేశం బ‌లోపేతానికి మ‌రింత‌గా కృషిచేసే అవ‌కాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌టంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఎవ‌రూ ఈ అంశంపై మాట్లాడొద్ద‌ని సూచించింది. దీంతో గ‌త నాలుగు రోజులుగా కూట‌మిప్ర‌భుత్వంలో చీల‌క తేవాల‌ని ప్ర‌య‌త్నించిన వైసీపీ సోష‌ల్ మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.  గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి పార్టీల మ‌ధ్య చిన్న‌పాటి విబేధాలు రావ‌డం స‌హ‌జ‌మే. అవి టీ క‌ప్పులో తుఫాను లాంటివి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా వైసీపీ నేత‌లు లోకేశ్ డిప్యూటీ సీఎం విష‌యంపై తెగ హ‌డావుడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయాల్సిన వైసీపీ.. కేవ‌లం కూట‌మి పార్టీల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అస‌త్యాల‌తో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ పెట్టేందుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివ‌రికి వైసీపీ పెద్ద ఫూల్ అయింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై  ఫోక‌స్ చేస్తారా.. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య ఎప్పుడు విబేధాలు త‌లెత్తుతాయా అని గోతికాడ గుంట‌న‌క్క‌లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

అలిపిరి దాడి సూత్రధారి.. మావోయిస్టు అగ్రనేత చలపతి హతం

మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   ఇక ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత రామచంద్రారెడ్డిగారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మరణించారు.  చలపతి అనగానే ఎవరికైనా ఠక్కున 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన క్లెమోర్ మైన్ దాడి గుర్తుకు వస్తుంది. ఆ దాడి సూత్రధాని, కీలక పాత్రధారి ఈ చలపతే. అప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. అప్పటి నుంచీ ఎక్కడా కనిపించని చలపతి ఇప్పుడు ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిలో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ   సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. 

తెలంగాణ మహిళా  కమిషన్ కు క్షమాపణలు చెప్పిన వేణుస్వామి 

చట్టానికి అతీతులు ఎవరూ  కాదు అని  ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తనను విచారణ నుంచి మినహాయించాలని  వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. అయితే వేణుస్వామికి  హైకోర్టు ఎలాంటి     మినహాయింపు ఇవ్వలేదు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో వేణుస్వామికి మహిళా కమిషన్  మరో మారు  నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి ఇవ్వాళ విచారణకు హాజరై నాగచైతన్య దంపతులపై తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.  వ్యక్తి గత జీవితాల్లో    ఇకముందు జోక్యం చేసుకోనని  వేణుస్వామి మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు.   వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని చట్టాలు చెబుతున్నాయి. అంతకుముందు క్రింది కోర్టు ఇదే విషయం చెప్పినప్పటికీ వేణుస్వామి హైకోర్టునాశ్రయించి మరోమారు అభాసుపాలయ్యారు. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు అడిగి మరింత దిగజారిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ లో సిస్కో జిసిసి సెంటర్?!

ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా?  ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిస్సో జీసీసీ అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారనీ, అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో పాతికశాతం మందికి పైగా తెలుగువారేనని లోకేష్ వివరించారు.   ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనరంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్-టెక్ హబ్‌గా ఏపీ మారనుందని,  అతిపెద్ద టాలెంట్ పూల్‌ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఎపి అనువుగా ఉంటుందనీ లోకేష్ ఈ సందర్భంగా సస్కో వైస్ ప్రెసిడెంట్ కు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన  భారత్ లో త్వరలో 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామనీ,  సమర్థవంతమైన మానవవనరులు ఉన్న ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో  త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.