తిరుమలపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

తిరుమల తిరుపతి దేవస్థానం సోషల్ మీడియాలో తిరుమలపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన టీటీడీ ఇప్పుడు ఇక యాక్షన్ లోకి దిగింది. టీటీడీ ఫిర్యాదు మేరకు తిరుమలపై విష ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయమర్యాదల మేరకు టీటీడీ శ్రీవారిదర్శనం చేయించింది. అయితే ఆయనకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అలా అవాస్తవాలు ప్రచారం చేసి టీటీడీ ప్రతిష్ఠ మసకబార్చేందుకు ప్రయత్నించిన మూడు యూట్యూబ్ చానెళ్లపై టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషన్ ఎస్వీయూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

యమునా నదిని విషతుల్యం చేశారు.. హర్యానా సర్కార్ పై కేజ్రీవాల్ ఆరోపణ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చావో రేవోగా తీసుకున్న భీజేపీ, ఆప్ ల మధ్య ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాటల యుద్ధం మంటలు రేపుతోంది. బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై హర్యానా బీజేపీ నేతల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేజ్రీవాల్ హర్యానాలోని తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.    హర్యానా నుంచి పరిశ్రమల వ్యర్థాలను యమునానదిలోకి వదులుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ ఆరోపణలు వాస్తవ మేనంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మంగళవారం (జనవరి 28) మరో బాంబు పేల్చారు.  అమోనియా శాతం అధికంగా ఉన్న యమునా నది నీటిని శుద్ధి చేయడం కష్టమని, ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆమె అన్నారు. ఢిల్లీ జల్ బోర్డు అమోనియా స్థాయిని 1 పిపిఎమ్ వరకు శుద్ధి చేయగలదని, అయితే హర్యానా నుంచి యమునా నది నీటిలో అమోనియా స్థాయి 700 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.  ఇక కేజ్రీవాల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హర్యానాలో బీజేపీ నాయకులు కావాలని నీటిలో విషం కలుపుతున్నారు. ఈ నీరు త్రాగితే ఢిల్లీలో చాలా మంది చనిపోతారు. నీటిని శుద్ధి చేయడం కష్టమయ్యే స్థాయిలో యుమునను విషపూరితం చేశారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో హర్యానా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించారు. తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పరిశ్రమల వ్యర్థాలను యమునలోకి వదులుతోందన్న ఆప్ ప్రచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు. అసత్య ఆరోపణలు కేజ్రీవాల్ నైజమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ హర్యానా ప్రజలకు, ఢిల్లీ ప్రజలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.  

వసంత పంచమి నాడు పుణ్యస్నానాలు.. భక్తులకు అఖాడా పరిషత్ విజ్ణప్తి

కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాల కోసం వచ్చి భక్తులు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. త్రివేణి సంగమం వైపు వెళ్ల వద్దని ఆయన భక్తులకు విజ్ణప్తి చేశారు. భక్తులు పుణ్యస్నానం కోసం గంగాఘట్ వద్దకు రావాలని పిలుపు నిచ్చారు. మహా విషాదం సంభవించిందని పేర్కొన్న యోగి.. ఈ సమయంలో భక్తులు సంయమనంతో వ్యవహరించాలని, అధికారుల సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలని కోరారు. బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ కారణఏంగా మొత్తం 13 అఖాడాల్లో పవిత్ర అమృత స్నాన్ రద్దు చేస్తూ అఖిల భారతీయ అఖాడా  పరిషత్ నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య పురస్కరించుకుని భక్తులు అంచనాలకు మించి పుణ్యస్నానాల కోసం వచ్చారని పేర్కొన్న అఖిల భారత అఖాడా  పరిషత్  అధ్యక్షుడు రవీంద్ర పురి.. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధాకరమన్నారు.  అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు ఈ రోజుకు బదులు వసంత పంచమికి రావాలని ఆయన  భక్తులను కోరారు.  ఫిబ్రవరి 2వ తేదీని వసంత పంచమి సందర్భంగా పుణ్యస్నానమాచరించేందుకు రావాలని ఆయన కోరారు. ఇలా ఉండగా కుంభమేళాలో తొక్కిసలాట, అనంతర పరిస్థితిని ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. సమీక్షిస్తున్నారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.  సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పలుమార్లు ఫోన్ లో మాట్లాడారు. అవసరమైన ఆదేశాలు ఇస్తూ పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు.  

మహాకుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి

మహాకుంభమేళాలో విషాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన తొక్కిసలాటలో కనీసం 15 మంది మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరుగుతున్న మహా కుంభమేళాకు మౌని అవామాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమృతస్నానాల కోసం తరలి వచ్చారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. 70 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మౌని అమావాస్య సందర్భంగా పది కోట్ల మందికి పైగా పవిత్ర స్నానమాచరించే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని వలంటీర్లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.   కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది మరణించడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పోన్ చేసి  తెలుసుకున్నారు.  ఇలా ఉండగా తొక్కిసలాట నేపథ్యంలో  13 అఖాడాలు మౌని అమావాస్య అమృత స్నానాలను రద్దు చేశాయి. సంగమం వద్ద జన సమూహం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖాడ పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి తెలిపారు.

ఆ కాలమంతా ఆన్ డ్యూటీయే.. ఏబీవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్   ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో  ఏబీ వెంకటేశ్వరరావు రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. మొదటి సారి 2020 ఫిబ్రవరి నుంచి రెండేళ్ల పాటు అంటే 2022 ఫిబ్రవరి వరకూ, ఆ తరువాత మళ్లీ జూన్ 22 నుంచి 2024 మే వరకూ ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఆయన తన సర్వీసు చివరి రోజున మళ్లీ డ్యూటీలో చేరారు.  సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత ఏబీవీకి న్యాయం జరిగింది. జగన్ హయాంలో అన్యాయంగా సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయన సస్పెండైన కాలాన్ని ఆన్ డ్యూటీగా అంటే విధులు నిర్వర్తించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. అలాగే ఆ సస్పెన్షన్ కాలానికి వేతనం అలవెన్సుల చెల్పింపునకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం మొత్తాన్ని విధులు నిర్వర్తించినట్లుగానే పరిగణించి ఆయనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. 

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీ గండం ?  

గ్రేటర్ హైద్రాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీగండం పొంచి ఉంది. సీనియర్ రాజకీయనాయకుడు కెకె కూతురు అయిన విజయలక్ష్మి పదవీకాలం  ఇంకా ఉంది. అయితే జీహెచ్ ఎంసి చట్టాల ప్రకారం నాలుగేళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలి. వచ్చే నెల (ఫిబ్రవరి 10)  నాలుగేళ్లు పూర్తి కానుంది.  కాబట్టి బిఆర్ ఎస్  అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాస తీర్మానం  నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బిఆర్ఎస్ కు బిజెపి సపోర్ట్ చేయనుందని చెబుతోంది. బిఆర్ఎస్ కేవలం బిజెపి బలం మీదే ఆధారపడింది. ఒకరకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కు  బిజెపి మిత్ర పక్షమైనప్పటికీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జిహెచ్ ఎంసిలో 150 కార్పోరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలు కావడం, మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా  ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్ సీలు  ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పోరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే.  ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతా శోభన్ రెడ్డిలు మేయర్ డిప్యూటి మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి  మాజీ బిఆర్ఎస్ పొలిట్ బ్యురో సభ్యులైన కె. కేశవరావు ముఖ్యభూమిక వహించారు. తనకు పదవీగండం ఉందని వస్తున్న వార్తలను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఖండించారు.  ఆమెకు కాంగ్రెస్ కార్పోరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడటంతో గద్వాల విజయ లక్మి పదవికి ఎటువంటి ఢోకా లేదని సమాచారం. అవిశ్వాసతీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బిఆర్ఎస్ కు 42 కార్పోరేటర్లు, 29 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.  అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిఆర్ఎస్ కుమరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో  బిఆర్ ఎస్ బిజెపి బలం మీద ఆధారపడింది. బిజెపి అధిష్టానం  ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

చంద్రబాబుపై సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ కోరుతూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీం

చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి మరొక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని, అసలీ పిటిషన్ పై వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషన్ తరఫున్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.   ఇంతకీ విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ   హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో  జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది   మణీందర్ సింగ్  అటెండ్ అయ్యారు. ఆయన తన వాదనలు ప్రారంభించకముందే సుప్రీం కోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇటువంటి పిటిషన్లను వాదించడానికి ఎలా వచ్చారు అంటూ జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని పేర్కొన్న జస్టిస్ ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తాం అంటే హెచ్చరించారు.   జగన్  హయాంలో చంద్రబాబుపై సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్‌, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్‌ భూములు, ఉచిత ఇసుక విధానం, మద్యం విధానం వంటి అంశాలపై సీఐడీ   కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో.. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో సీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరగదని అందుకే చంద్రబాబుపై సీఐడీ కేసులన్నిటినీ సీబీఐకి బదలీ చేయాలని కోరుతూ బాలయ్య సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది.  

విజయసాయి కొత్త అవతారం!

విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే నంటూ విశ్లేషణలు.. ఇందంతా జగన్ ప్లానే అన్న అనుమానాలూ ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ లోగానే విజయసాయి రెడ్డి తన కొత్త ఉద్యోగం మొదలెట్టేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పినట్లు వ్యవసాయం చేయడం ఆరంభించేశారు. అలా మొదలెట్టేసి ఊరుకోలేదు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశారు.  రాజకీయాలను దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాననీ, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా, సంతోషంగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్వీకర్ క్షణం జాగు చేయకుండా ఆమోదించేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇక దానికి మించి విజయసాయిరెడ్డి చిప్పినట్లుగానే  వ్యవసాయ వ్యాపకంలోకి దిగిపోవడం ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది.  విజయసాయి రెడ్డి తాజాగా రైతుగా తన పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన హార్టికల్చర్ సాగు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి విజయసాయి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని తేటతెల్లమైపోతోంది. రాజకీయాలు వదిలేశాను ఇదిగో రుజువు.. ఇక నన్ను వదిలేయండి మహప్రభో అని కూటమి నేతలను అభ్యర్థిస్తున్నట్లుగా విజయసాయి ట్వీట్ ఉందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

ఆ నాలుగు పథకాలూ గట్టెక్కిస్తాయా?

తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ విజయాలూ, ఫెయిల్యూర్స్ సమానంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఆనవాలు కూడా కనిపించకుండా చేసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయితే.. వాగ్దానాల అమలు విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పథకాల అమలుపై దృష్టి సారించారని చెబుతున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు రాజనున్నాయి. ఆ ఎన్నికలలో గట్టెక్కాలంటే ఏదో విధంగా పథకాలు సక్రమంగా అమలు చేయగలుగుతున్నారన్న భావన ప్రజలలో కలగాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు. పంచాయతీ ఎన్నికలలో విఫలమైతే.. రేవంత్ కు కష్టాలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ గట్టిగా మద్దతు ఇస్తూ వచ్చిన హైకమాండ్  పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొంచం అటూ ఇటూ అయితే.. అసమ్మతి, అసంతృత్తి ఉధృతిని అణిచివేసి రేవంత్ కు సపోర్ట్ గా నిలబడటంపై పెద్ద ఆసక్తి చూపే అవకాశలు పెద్దగా ఉండవు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా అంటే రిపబ్లిక్ డే  రోజుల ప్రారంభించిన పథకాల అమలుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నాలుగు  పథకాలను పక్కాగా అమలు చేస్తేనే ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది.   రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు చాలా వరకూ రసాబాసగా మారిన సంగతి తెలిసిందే. దానిని బట్టే పథకాల అములు విషయంలో లబ్ధిదారుల్లో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.  దీనిని గ్రహించే రేవంత్ రెడ్డి విడతల వారీగా వీటి అమలుకు నిర్ణయించారు. తొలి దశలో  563 మండలాల్లోని 563 గ్రామాల్లో ఈ పథకాల అమలుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.    4,41,911 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద సోమవారం (జనవరి 27) రైతుభరోసా రూ 6 వేలు  రైతుల ఖాతాలో జమ చేసింది.  అలాగే ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో  భాగంగా 18,180 మంది రైతుకూలీలకు రు.6 వేలుచొప్పున రు. 10.91 కోట్లు జమచేసింది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసా యకూలీలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న సంగతి విదితమే. ఇక మూడోపథకంగా కొత్తగా 15,414 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొత్తకార్డుల వల్ల 51,912 కుటుంబాలు లబ్దిజరిగింది. అలాగే కుటుంబాల్లో కొత్తసభ్యులను చేర్చాలని వచ్చిన దరఖాస్తుల్లో 1.03 లక్షల కార్డుల్లో కొత్తసభ్యుల పేర్లను మార్చింది. చివరగా గూడులేని అర్హులైన నిరుపేదలు 72 వేలమందికి ఇందిరమ్మ ఇళ్ళపథకంలో యాజమాన్య పత్రాలను అందించింది.   స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయం లక్ష్యంగానే  రేవంత్ ప్రభుత్వం ఈ  నాలుగు పథకాల అమలుకు గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో పరిమితంగానే అమలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికలలోపు ఈ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడందాని తర్వాతే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన 563 గ్రామాల్లో పథకాల అమలుకు శ్రీకారంచుట్టింది. పైలెట్ ప్రాజెక్టు అమలుసరే పైనాలుగుపథకాలు యావత్ రాష్ట్రంలో వివాదాలకు తావులేకుండా ఎప్పుడు అమలవుతుందో చూడాలి.

ఫిబ్రవరి మొదటి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్

హైడ్రా పోలీసు స్టేషన్ ఫిబ్రవరి మొదటి వారానికల్లా అందుబాటులోకి రానుంది.  సికింద్రాబాద్ లోని బుద్ధభవన్ పక్కన ఈ పోలీసు స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశాలున్నాయి. తాజాగా ఈ పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూ కజ్జాలు, ఆక్రమణలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఆస్తుల పరిరక్షణ సహా హైడ్రా కార్యకలాపాలకోసం ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ఈ నెల 7న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు. ఈ హైడ్రా పోలీసు స్టేషన్ కు సిబ్బంది కేటాయింపు.   ప్రక్రియ జరుగుతోంది.  గతంలో భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ స్థానిక పోలీసు స్టేషన్లలో నమోదు చేసేవారు. ఇప్పుడు అటువంటి కేసులను హైడ్రా పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ వోకు కమిషనర్ బదలాయించనున్నారు.  భూ సంబంధిత కేసులను ఇక నుంచి హైడ్రా పోలీసు స్టేషన్  చూస్తుంది. ఫిర్యాదుల సంఖ్య, అవసరాలను బట్టి మరిన్ని హైడ్రా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.  

వైట్ ఫ్లాగ్ తో విజయ్ సాయి.. రెడ్ బుక్ తో లోకేష్...

నిన్నటి దాకా ఏ ఎక్స్ వేదికగానైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారో..ఇప్పుడు అదే ఎక్స్ వేదికగా వారిపై పొగడ్తల వర్షం కురిపించి దగ్గరకావలని ప్రయత్నిస్తున్నారు విజయసాయి రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇక ఇప్పుడు తన లాయలిటీని జగన్ నుంచి పూర్తిగా కూటమి పార్టీలవైపు మార్చేసుకున్నట్లు కనిపిస్తున్నది. తన రాజీనామా ప్రకటన సందర్భంగా   తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ల పట్ల తనకు మంచి అభిప్రాయముందనీ, రాజకీయంగా విభేదించానే తప్ప ఇరువురితోనూ తనకు మంచి సంబంధాలున్నాయనీ పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఆ తరువాత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంపై ప్రశంసల వర్షం కురిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్  ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని ప్రశంసలు గుప్పించారు. ఇంకా పురాతన కళానైపుణ్యం, సంప్రదాయం,  స్థిరత్వాల పరిపూర్ణ సమ్మేళనంగా శకటాన్ని తీర్చి దిద్దారని పేర్కొన్నారు.   కేసులు, అరెస్టు భయం, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు, మద్యం కుభకోణం విషయాలలో పీకల్లోతు మునిగి ఉన్న విజయసాయి.. ఎలాగైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గుడ్ లుక్స్ లో పడాలన్నప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అవకాశం దొరికినా దొరక్కపోయినా, సందర్భం ఉన్నా లేకున్నా పొగడ్తల వర్షంలో ముంచెత్తి ఆకాశానికెత్తేసి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారంటున్నారు.   అయితే విజయసాయి గిమ్మిక్కులు తెలుగుదేశం, జనసేనలను ఇసుమంతైనా ప్రభావితం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  నుంచి కూటమి నేతలందరూ కూడా విజయసాయి తన అక్రమాలు, అరాచకాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలనీ, దోషులకు శిక్ష పడాలని అంటున్నారు.  మొత్తం మీద విజయసాయి తన సమయాన్నంతా వైసీపీ వ్యతిరేక పార్టీల నేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకే వెచ్చిస్తున్నారనీ, ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చౌకబారు ట్రిక్స్ లా కనిపిస్తున్నాయనీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

కమలం గూటికి మాజీ క్రికెటర్ అంబటి?.. ఈ సారైనా నిలకడగా ఉంటాడా?

అంబటి రాయుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మొదలై.. ఇప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. క్రికెటర్ గా అసమాన ప్రతిభ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం, దూకుడు, తొందరపాటు నిర్ణయాల కారణంగా అంబటి రాయుడు క్రికెట్  కెరీర్ తొందరగా ముగిసిపోయింది.   మాంచి ప్రతిభ గలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాయుడు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్లలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో నిలకడ లేని తనం కారణంగా  అతడి క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తరువాత ఆయన  రాజకీయాలలో ప్రవేశించారు. అక్కడా అంతే నిలకడ లేకపోవడం, స్థిరత్వం కొరవడటంతో తొలి అడుగులోనే తడబడ్డాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జారి పడ్డాడు.   క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, ఒకింత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు.   గుంటూరు లోక్ సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను , విదేశాలలో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున  రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటిరాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారంటూ వార్తలు వినిపించాయి.  ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన మళ్లీ వైసీపీకి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సిద్ధం అంటూ చేసిన ట్వీట్ ద్వారా అప్పట్లో జగన్ సిద్ధం సభలకు సై అన్న సంకేతాలను ఇచ్చారు. ఇటువంటి నిలకడలేని తనంతో ఆయన తొలి అడుగులోనే రాజకీయాలలో ఒక జోకర్ గా ముద్ర పడ్డారు. దీంతో గత ఎన్నికల ముందు అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.  సరే అది వదిలేస్తే ఇప్పుడు అంబటి రాయుడు కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేడో రేపో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అంబటి రాయుడు నుంచి ఎటువంటి ప్రకటనా లేకపోయినప్పటికీ విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. ఆ సందర్భంగా అంబటి రాయుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అంతే కాదు దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా మరో సారి అంబటి రాయుడు పోలిటికల్ ఎరీనాలో కనిపించడంతో గతంలో ఆయన పిల్లిమొగ్గలు, కుప్పింగంతులపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

రాజౌరి మిస్టరీ మరణాలు.. న్యూరో ట్యాక్సినే కారణమా?.. కుట్ర కోణం ఉందా?

జమ్మూ కాశ్మీర్ లో వరుసగా సంభవిస్తున్న మరణాల మిస్టరీ వీడలేదు. వైద్య నిపుణులు మరణాలకు కారణం న్యూరోట్యాక్సిన్ అని చెబుతున్నారు. కుట్ర కోణం కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజౌరీలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో ఒకే విధమైన ఆరోగ్య సమస్యలతో ఏకంగా 17 మంది మరణించారు. ఈ మృతులంతా మూడు కుటుంబాలకు చెందిన వారే. మృతులలో 14 మంది పిల్లలే. ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించడానికి 11 మందితో కూడిన బృందం దర్యాప్తు చేస్తున్నది. వైద్య నిపుణులు న్యూరో  ట్యాక్సిన్ వల్ల ఈ మరణాలు సంభవించాయని చెబుతున్నప్పటికీ కుట్ర కోణంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులందరూ కూడా ఒకే రకమైన అనారోగ్య లక్షణాలతో మరణించారు. మెదడు వాపు కారణమై ఉండొచ్చని కూడా అంటున్నారు.  బాధితుల శాంపిల్స్ లో ఎటువంటి వైరస్, బ్యాక్టీరియాను గుర్తించలేదు. వీరి శాంపిల్స్ పరీక్షించిన పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో మృతులందరిలో మెదడు దెబ్బతినడానికి దోహదం చేసే న్యూరోట్యాక్సిన్ ల ఉనికిని గుర్తించారు.   తాజాగా ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఈ ఆరుగురినీ ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  అలాగే దాదాపు 300 మందిని క్వారంటైన్ కు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు, మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. మొత్తంగా బుధాల్ గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.   

యార్కర్ సంధించాడంటే వికెట్ విరిగిపోవాల్సిందే.. ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బుమ్రా

దిగ్గజ క్రికెటర్లను వెనక్కు నెట్టి మరీ 2024 సంవత్సరానికి ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా నిలిచారు. గత ఏడాది టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రానే ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 27) విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐసీపీఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్, శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని అందుకున్నాడని పేర్కొంది. కాగా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆరో ఇండయన్ క్రికెటర్ గా బుమ్రా నిలిచారు. బుమ్రాకు ముందు ఈ  అవార్డును 2004లో రాహుల్ ద్రావిడ్, 2009లో  గౌతమ్ గంభీర్, 2010లో వీరేంద్ర సెహ్వాగ్, 2016లో అశ్విన్ , 2018లో విరాట్ కోహ్లీ  అందుకున్నారు.  అయితే ఈ అవార్డును అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లోనూ బుమ్రాకు చోటుదక్కిన సంగతి తెలిసిందే. 2024 ఏడాది మొత్తం బుమ్రా అసమాన్య ప్రతిభ కనబరిచారు. ఏడాది మొత్తంలో 13 టెస్టులు ఆడిన బుమ్రా మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డులకు ఎక్కడా. ఇక గత ఏడాది చివరిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టారు. సొంత గడ్డపైనా, విదేశీ గడ్డపైనా కూడా అత్యద్భుతంగా ఆడిన బుమ్రా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఘనత సాధించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలా ఉండగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయంతో వైదొలగిన బుమ్రా ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటే టీమ్ ఇండియాకు తిరుగుండదు. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. ఇక మ్యాచ్ లలో ఆడటం అన్నది అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.  

భవిష్యత్ లో ఇంటికో ఐటీ ప్రొఫెషనల్.. చంద్రబాబు

భవిష్యత్ ను ముందే దర్శించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో ఐటీ ప్రభంజనాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ ప్రొఫెషనల్స్ తయారు కావడానికి అవసరమైన విద్యా విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు తెలుగువారు ఐటీ రంగంలో అగ్రగాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే భవిష్యత్ అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంట్లోనూ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్జీజీఎస్)పై సచివాలయంలో సోమవారం (జనవరి 27) సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి ఇంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను విరివిగా వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్ధంగా వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల పని తీరు మెరుగౌతుందన్న చంద్రబాబు పాలనలో సాంకేతికత వినియోగంద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలమన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖలూ టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకుని పని తీరును మెరుగుపరుచుకోవాలన్నారు.   15 నుంచి 20 శాతం   వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పని చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్‌తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయ‌ద‌గ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా చంద్ర బాబు పేర్కొన్నారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపా యం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగంగా జరుగుతోందని  ఆర్టీజీఎస్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి కె. దినేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ ను రూపొంది స్తున్నామనీ, అలాగే ప్రభుత్వ డేటాలో లేకుండా ఉన్న పౌరుల డేటాను కూడా కొత్తగా సేకరించామని వివరించారు. 

రంగనాయకులగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

మహిషాసుర మర్దని, భైరవ శిల్పాలు రంగనాయకులగుట్ట కాకతీయ శిల్పాలపై రంగులు తొలగించాలి పురావస్తు పరిశోధకుడు డాక్టర్ఈమని‌ శివనాగిరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా లో ప్రముఖ వర్తక కేంద్రమైన జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టపై గల కాకతీయుల కాలుపు శిల్పాలపై రంగులు తొలగించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక శిల్పాలు, శాసనాలు, స్థలాలు, కట్టడాలను గుర్తించి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించే "ప్రిసర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నాడు రంగనాయక గుట్టపై విస్తృతంగా అధ్యయనం చేశారు. కోటగోడ ఆనవాళ్లు ప్రధాన ఆలయమైన రంగనాయక స్వామి రాతి శిల్పం, దాని వెనక 100 అడుగుల దూరంలో గల మహిషాసుర మర్దిని, భైరవ శిల్పాలు క్రీ.శ. 13 వ శతాబ్ది నాటి కాకతీయ కాలానికి చెందినవి, అలాగే గుట్టపై విశాలమైన కోట గోడ ఆనవాళ్లు ఉన్నాయని, పునాది కోసం కొండపైన ఏడడుగుల విశాలంగా రాతిని మలిచారని, అనేక చోట్ల బండలపై ఆనాటి రాతిని చీల్చిన క్వారీ గుర్తులు ఉన్నాయని, రాతిని చీల్చిన క్వారీ గుర్తులు మరో బండపై  ఉలితో చెక్కిన విజయనగర కాలపు ఆంజనేయుని రేఖా చిత్రం ఉందని, ఇంకా ఆదిమానవుడు నివసించిన కొండచరియ ఆవాసాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆదిమానవుని ఆవాసాలు ఇన్ని ఆకర్షణలు గల రంగనాయక స్వామి గుట్టపై పార్కింగ్ సౌకర్యం, టాయిలెట్స్, విశ్రాంతి, మందిరాలు, నడవలు, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి సాహస క్రీడలు, పిల్లలు ఆడుకునే ఆహ్లాదకర ప్రదేశాలను, భద్రత కోసం ఇనుప రైలింగ్ ఏర్పాటు చేసి జిల్లాల్లోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ పాలకమండలి, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.