చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ రా ద్ధాంతం అందుకేనా?
ఏపీలో వైసీపీ నేతల రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అడ్డుపెట్టుకోవటం వారికి అలవాటుగా మారింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా ఇదే పని చేశారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును పేదల వ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లలో పేద వర్గాల ప్రజలపై వైసీపీ నేతల దాడులను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సమయంలో చంద్రబాబును పేదల వ్యతిరేకి అంటూ బూచిగా చూపెట్టే ప్రయత్నం జగన్, వైసీపీ నేతలు చేశారు. ఏపీలో ఏ చెడ్డపని జరిగినా దానికి కారకుడు చంద్రబాబు అన్నట్లుగా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాగా చంద్రబాబు విదేశాలకు వెళ్లినా వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. చంద్రబాబు ఎటుపోయారు.. ఎక్కడికి పోయారో చెప్పాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు విదేశాలకు వెళితే వైసీపీ నేతలకు అంత టెన్షన్ ఎందుకు? జగన్ సైతం విదేశాలకు వెళ్లారు కదా.. మరి చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు? ఉన్నట్లుండి చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం వెనుక ప్రధాన కారణమే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
తెలుగు అధినేత చంద్రబాబు నాయుడు గత శనివారం రాత్రి తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికాకు వెళ్లారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన వైద్య పరీక్షలకోసం వెళ్లారని తెలుగుదేశం నేతలు చెప్పారు. వైసీపీ అనుకూల మీడియాలోనూ చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే ఆ మీడియా చంద్రబాబు విదేశాలకు పారిపోతుంటే ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శిచింది. ఇదంతా రెండు రోజుల కిందట జరిగిన విషయం. రెండు రోజులు నోరు మెదపని వైసీపీ బ్యాచ్.. ఉన్నట్లుండి చంద్రబాబు విదేశీ పర్యటనకు ఎందుకెళ్లారు? ఏ దేశం వెళ్లారు? ఏ ప్రాంతంలో ఉన్నారు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటిలాగే వారికి మాత్రమే సొంతమైన భాషలో ఇష్టమొచ్చినట్లు మాట్లారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో మాకిప్పుడే తెలియాలి అంటూ పెద్ద రాద్దాంతమే చేశారు. చంద్రబాబు, లోకేశ్ కనిపించకపోయేసరికి వారేమీ చేస్తున్నారో ? తమను బుక్ చేసే పనులేమైనా చేస్తున్నారా అని వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నట్లు కనిపించింది. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు సైతం చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో చెప్పండి అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టడం చూస్తుంటే.. చంద్రబాబు అంటే వైసీపీ నేతలు ఎంతలా వణికిపోతున్నారో అర్థమవుతుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. కోర్టుల్లో అనేక కేసులున్న జగన్.. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో లండన్ పర్యటనకు వెళ్లారు. అదికూడా లండన్ లో ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారో జగన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలి. ఫోన్ నెంబర్ ను కూడా ఇచ్చివెళ్లాలని కోర్టు షరతులు పెట్టింది. ఎందుకంటే, జగన్పై అనేక కేసులు ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోతున్నట్లు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలు కాకతప్పదన్న స్పష్టత రావడంతో ఇక మళ్లీ జైలు జీవితం గడపాల్సి వస్తుందనే భయంతో జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీతో లండన్ వెళ్తున్నారని, ఇక ఆయన తిరిగిరారని విస్తృతం ప్రచారం జరిగింది. తెలుగుదేశం నేతలు సైతం ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. చివరాఖరికి సీబీఐ కూడా ఆయన విదేశీ పర్యటనను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికలు అయిపోయిన తరువాత జగన్ విదేశీ పర్యటన అంటే వైసీపీ శ్రేణులుసైతం ఒకింత ఆందోళన చెందారు. జగన్ పై జరుగుతున్న ప్రచారాన్ని డ్రైవర్ట్ చేస్తేందుకు వైసీపీ నేతలు చంద్రబాబు విదేశీ పర్యటనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భయంతో ఆందోళనలోఉన్న వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనపై అర్ధంపర్దంలేని ప్రశ్నలు లేవనెత్తుతూ తమ అనుకూల మీడియాలో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి.. చెప్పిందేచెప్పి ప్రజల్లో జగన్ లండన్ పర్యటన టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాగా రాజకీయ విశ్లేషకులు దీనినిపేర్కొంటున్నారు.
మరోవైపు.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టమయింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అయితే.. వైసీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుందని కుండబద్దలు కొట్టేశారు. ఏపీలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతుంది. దీంతో వైసీపీ అభ్యర్ధులతోపాటు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ సరళిని చూసి వైసీపీలోని ముఖ్యనేతలు మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. నిత్యం చంద్రబాబు, లోకేశ్ పై విరుచుకుపడే విజయసాయిరెడ్డి, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీంతో పలువురు వైసీపీ అభ్యర్థులు, జిల్లాల్లోని వైసీపీ ముఖ్యనేతలు, పార్టీలోని ద్వితీయ స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వంలో తాముచేసిన తప్పులను బయటకుతీసి చట్టప్రకారం శిక్షిస్తుందని వారు భయపడిపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగానే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల్లో చేరిపోతే సేఫ్ సైడ్లో ఉండొచ్చనే ఆలోచనసైతం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు బీజేపీ, జనసేన, టీడీపీ నేతల టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వైసీపీ పెద్దనష్టం వాటిల్లుతుందని భావించిన ఆ పార్టీ అధిష్టానం పెద్దలు నష్టనివారణ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఏదో కుట్ర దాగిఉందని చెప్పడం.. వైసీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు విదేశాలకు వెళ్లడం పెద్దపాపం చేసినట్లు చూపడం వంటి కార్యక్రమాలకు వైసీపీ అధిష్టానం శ్రీకారం చుట్టిందని, తద్వారా కొద్దిరోజులు చంద్రబాబు విదేశీ పర్యటనపై ఏపీ రాజకీయాలు చక్కర్లు కొట్టేలా చేయడమే వైసీపీ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పోలింగ్ సమయంలో, పోలింగ్ అనంతరం వైసీపీ నేతలు అనేక దాడులకు పాల్పడ్డారు. సిట్ దర్యాప్తులోనూ ఆ విషయం స్పష్టమైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలనుసైతం వైసీపీ నేతలు పగలగొట్టారు. ఇన్నాళ్లూ తెలుగుదేశం నేతలు తమపై దాడులు చేశారంటూ ప్రజలకు అబద్దాలు చెబుతూ వచ్చిన వైసీపీ నేతలకు సిట్ దర్యాప్తు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలింగ్ సమయంలో, ఆ తరువాత వైసీపీ నేతల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు విదేశీ పర్యటన అంశాన్ని జగన్ బ్యాచ్ తెరపైకి తెచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.