jagan praises pinnell

అన్న చాలా మంచోడు.. పిన్నెల్లికి జగన్ కితాబు.. వైరల్ అవుతున్న పాత వీడియో

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆయన పోలీసులను తప్పించుకుని పరారైపోయారు. అజ్ణాతంగా ఉన్నారు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ సంఘటనలన్నీ ఆయన ఎంతటి నేరస్తుడో ఎవరికైనా అర్ధం అయిపోతుంది. పిన్నెళ్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని సాక్షాత్తూ  డీజీపీయే చెప్పారు. అటువంటి నేరస్థుడికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన కితాబుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  తెగ వైరల్ అవుతోంది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఎందుకంటూ ఏకి పారేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో జగన్ ఏమన్నారంటే.. పిన్నెల్లి అన్న తనకు సోదర సమానుడు. చాలా మంచి వ్యక్తి. ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆయనకు ఉన్నత స్థానం హోదా కల్పిస్తాను. అంటే మంత్రిని చేస్తాను. మీరంతా ఆయన వెనుకే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ జగన్ స్వయంగా అన్నవి. వాస్తవానికి పిన్నెల్లి మంచి తనం ఏమిటో ఈవీఎం ధ్వంసం ఘటనతో, అదేమని ప్రశ్నించిన ఒక మహిళపై దుర్భాషలాడిన వీడియోతోనే తేలిపోయింది.  దీంతో ఇప్పుడు వైసీపీ నోరు మూతపడిపోయింది. పిన్నెల్లిని సమర్ధించుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. ఇటువంటి పిన్నెల్లిని చాలా మంచి వ్యక్తి అంటూ పొగిడిన జగన్ కు జనం ముందు దోషిగా, రౌడీలకూ, గూండాలకూ కొమ్ముకాసే వ్యక్తిగా ముద్రపడిపోయింది. 

Shattered Chinese Conspiracy... Visakha residents are trained to commit cyber crimes

భగ్నమైన చైనా కుట్ర... సైబర్ నేరాలకు పాల్పడేందుకే  విశాఖ వాసులకు శిక్షణ 

చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా  కుట్ర భగ్నమైంది.  విదేశాల్లో ఉద్యోగం, భారీ మొత్తంలో వేతనం అంటూ ప్రకటనలు గుప్పించి ఆకర్షించడం.. నమ్మిన వాళ్లను దేశంకాని దేశంలో మోసం చేయడం వంటి ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 300 మంది భారతీయులు కాంబోడియాలో ఆందోళనకు దిగడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. మోసపోయిన వారిలో 60 మందిని కాపాడింది. ఇందులో సగం మంది విశాఖపట్నం వాసులేనని సమాచారం. బాధితులు, ఎంబసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కాంబోడియాలో డాటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, పెద్దమొత్తంలో వేతనం పొందొచ్చని ఏజెంట్లు చెప్పడంతో నమ్మి మోసపోయామన్నారు. ఏజెంట్లకు భారీ మొత్తం చెల్లించి కాంబోడియాకు వచ్చామని వివరించారు. తీరా ఇక్కడికి వచ్చాక చైనా కంపెనీల ఫేక్ కాల్ సెంటర్ లో కూర్చోబెట్టి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడాలని నిర్భందిస్తున్నారని చెప్పారు.  ఇండియాతో పాటు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ తదితర దేశాల్లో ఈ మోసపూరిత కంపెనీలకు ఏజెంట్లు ఉన్నారని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. స్థానికంగా ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను నియమించుకుని కాంబోడియా, లావోస్ దేశాలకు పంపిస్తున్నారని తెలిపింది. టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపికైన వారికి చైనా కంపెనీలు ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేస్తున్నాయని చెప్పింది. దీంతో పాటు హాస్టల్ లో అకాడమేషన్, తిరుగు ప్రయాణానికి టికెట్ కూడా కంపెనీ ఇస్తుందని చెప్పడంతో చాలామంది జాయిన్ అవుతున్నారని తెలిపింది. వీసా ప్రాసెస్ లో కూడా ఈ ఏజెంట్లు సాయం చేస్తున్నారని, ఫ్లైట్ ఎక్కించి కాంబోడియా పంపిస్తున్నారని వివరించింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత లోకల్ క్రిమినల్ గ్యాంగ్స్ సాయంతో భారతీయులను నిర్భందించి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తున్నారని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఇలా వారి చెరలో చిక్కుకున్న వారిలో దాదాపు 100 నుంచి 150 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారని వివరించారు. ఇందులో 60 మందిని స్థానిక పోలీసుల సాయంతో కాపాడామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆన్ లైన్ లో కనిపించే ప్రకటనలు, ఏజెంట్లు చెప్పే ఆకర్షణీయమైన మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలు తెలుసుకున్నాకే ఫ్లైట్ ఎక్కాలని సూచించారు.

crores of rupees betting on rrr majority in undi

ఆర్ఆర్ఆర్ విజయంపై కాదు.. మెజారిటీపైనే భారీగా బెట్టింగులు.. ఉండి సీన్ అర్ధమైపోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే  కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది. మరీ ముఖ్యంగా పలు నియోజకవర్గాలలో గెలుపు ఎవరిది అని కాకుండా అక్కడ కూటమి అభ్యర్థికి వచ్చే మెజారిటీ ఎంత అన్న విషయంపైనే భారీగా బెట్టింగులు జరుగుతుండటం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయమే వైసీపీలో రోజురోజుకూ ఆందోళన పెరిగిపోయేలా చేస్తున్నది.  ఇప్పుడు ఉండి నియోజకవర్గమే తీసుకుంటే ఈ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు మెజారిటీ పై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజు గత ఎన్నికలలో  వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జగన్ విధానాలతో, తీరుతో విభేదించి రెబల్ గా మారారు. ఆ క్రమంలో జగన్ సర్కార్ ఆయనపై కక్ష కట్టింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ను కోరింది. అయితే లోక్ సభ స్వీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. పాలనా పరమైన లోపాలను ఎత్తి చూపిన కారణంగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. దీంతో రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టిన  జగన్ సర్కార్ ఆయనను అరెస్టు చేయించి, కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసింది. ఆ తరువాత కూడా ఆయనకు థ్రెట్ కంటిన్యూ అయ్యింది. దీంతో నాలుగు సంవత్సరాల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. దరిమిలా ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.  ఆ పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండి నుంచి రఘురామకృష్ణం రాజు విజయంపై ధీమా వ్యక్తం అవుతోంది. విజయం కాదు భారీ మెజారిటీ సాధిస్తారంటూ బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ఉండిలో రఘురామకృష్ణం రాజుకు 15 వేలకు పైగా మెజారిటీ వస్తుందని చాలా మంది బెట్టింగులు కడుతున్నారు. కొందరు విజయం తథ్యం కానీ మెజారిటీ  అంత ఉండే అవకాశం లేదని బెట్టింగులకు దిగుతున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారంపై రఘురామ రాజు విజయం ఖాయమంటూ 35 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు జరిగాయి.  కొన్ని ప్రాంతాలలో అయితే భూములను కూడా  బెట్టింగుకు పెట్టారని చెబుతున్నారు.   

tdp only big party in nda after bjp

ఎన్డీయే సర్కార్ వస్తే..చంద్రబాబు మాటే చెల్లుబాటు!

జాతీయ ప్రజాస్వామ్య కూటమి  అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.  ఇంత వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో చేరడంతో..  అది పూర్తిగా ఆయన రాజకీయ స్వార్ధం కోసమే, అధికారాన్ని, ముఖ్యమంత్రి పదవినీ కాపాడుకోవడం కోసమే అయినా ఎన్డీయే ఉనికిని చాటుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి. నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచి  చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుకుంది.   అయినా 2014లో, 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి.   2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. 2024 ఎన్నికలు వచ్చే సరికి  ఎన్డీయే కూటమిలో ఆ చిన్నా చితకా పార్టీలలోని కొన్ని మాత్రమే మిగిలాయి.  బీజేపీ సహజ మిత్ర పక్షాలుగా చెప్పుకునే  శివసేన, అకాలీ దళ్ వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవీ ఎన్డీఎలో లేవు.  పేరుకే ఎన్డీయే.. కానీ ఎన్డీయేలో  ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా   ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.  ఈ నేపథ్యంలోనే పదేళ్ల మోడీ పాలన సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు మోడీ సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన బీజేపీ మళ్లీ ఎన్డీయేలో ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను గుర్తించింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఎన్డీయే గూటికి చేర్చుకుంది. ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న ప్రధాన పార్టీ అనేది  ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.  ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఐదు విడతల పోలింగ్ పూర్తియిన తరువాత చూసుకుంటే.. బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే జరిగితే కేంద్రంలో మళ్లీ  తెలుగుదేశం పార్టీయే ఎన్డీయేలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే విభజన సమస్యల పరిష్కారం, ఏపీకి సహకారం విషయంలో చంద్రబాబు కేంద్రంపై ప్రభావమంతంగా ఒత్తిడి తీసుకురాగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉంటుందని అంటున్నారు. 

ycp fuss on cbn foriegn tour

చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ రా ద్ధాంతం అందుకేనా?

ఏపీలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును అడ్డుపెట్టుకోవ‌టం వారికి అల‌వాటుగా మారింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గ‌త ఐదేళ్లుగా ఇదే ప‌ని చేశారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబును పేద‌ల వ్య‌తిరేకిగా చూపే ప్ర‌య‌త్నం చేశారు. గ‌త ఐదేళ్ల‌లో పేద వ‌ర్గాల ప్ర‌జ‌లపై వైసీపీ నేత‌ల దాడులను క‌ప్పిపుచ్చుకునేందుకు ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబును పేద‌ల వ్య‌తిరేకి అంటూ బూచిగా చూపెట్టే ప్ర‌య‌త్నం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు చేశారు. ఏపీలో ఏ చెడ్డ‌ప‌ని జ‌రిగినా దానికి కారకుడు చంద్ర‌బాబు అన్న‌ట్లుగా వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది. తాజాగా చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్లినా వైసీపీ నేత‌లు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. చంద్ర‌బాబు ఎటుపోయారు.. ఎక్క‌డికి పోయారో చెప్పాలంటూ ప్రెస్ మీట్‌లు పెట్టి మ‌రీ ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు విదేశాల‌కు వెళితే వైసీపీ నేత‌ల‌కు అంత టెన్ష‌న్ ఎందుకు? జ‌గ‌న్ సైతం విదేశాల‌కు వెళ్లారు క‌దా.. మ‌రి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నేత‌లు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు?  ఉన్న‌ట్లుండి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నేత‌లు గ‌గ్గోలు పెట్ట‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణ‌మే ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  తెలుగు అధినేత చంద్ర‌బాబు నాయుడు గ‌త శ‌నివారం రాత్రి త‌న స‌తీమ‌ణి భువనేశ్వరితో క‌లిసి అమెరికాకు వెళ్లారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆయ‌న వైద్య ప‌రీక్ష‌ల‌కోసం వెళ్లార‌ని తెలుగుదేశం నేత‌లు చెప్పారు.  వైసీపీ అనుకూల మీడియాలోనూ చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని వార్త‌లు వ‌చ్చాయి.   అయితే ఆ మీడియా చంద్ర‌బాబు విదేశాల‌కు పారిపోతుంటే ఎయిర్ పోర్టులో ఇమిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారంటూ   పైత్యాన్ని ప్ర‌ద‌ర్శిచింది. ఇదంతా రెండు రోజుల కిందట జ‌రిగిన విష‌యం. రెండు రోజులు నోరు మెద‌ప‌ని వైసీపీ బ్యాచ్.. ఉన్న‌ట్లుండి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకెళ్లారు?  ఏ దేశం వెళ్లారు? ఏ ప్రాంతంలో ఉన్నారు అంటూ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎప్ప‌టిలాగే వారికి మాత్రమే సొంతమైన భాషలో  ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో మాకిప్పుడే తెలియాలి అంటూ పెద్ద రాద్దాంత‌మే చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ కనిపించకపోయేసరికి వారేమీ చేస్తున్నారో ? తమను బుక్ చేసే పనులేమైనా చేస్తున్నారా అని వైసీపీ నేత‌లు తెగ‌ టెన్షన్ పడిపోతున్న‌ట్లు క‌నిపించింది. బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి సీనియ‌ర్ నేత‌లు సైతం చంద్ర‌బాబు ఎక్కడికి వెళ్లారో చెప్పండి అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్ట‌డం చూస్తుంటే.. చంద్ర‌బాబు అంటే వైసీపీ నేత‌లు ఎంత‌లా వ‌ణికిపోతున్నారో అర్థ‌మ‌వుతుంది.  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చే జ‌రిగింది. కోర్టుల్లో అనేక కేసులున్న జ‌గ‌న్.. హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అదికూడా లండ‌న్ లో  ఏఏ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారో జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తుండాలి. ఫోన్ నెంబ‌ర్ ను కూడా ఇచ్చివెళ్లాల‌ని  కోర్టు ష‌ర‌తులు పెట్టింది. ఎందుకంటే, జ‌గ‌న్‌పై అనేక కేసులు ఉండ‌టంతో ఆయ‌న విదేశాల‌కు పారిపోతున్న‌ట్లు దేశ‌వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పరాజయం పాలు కాకతప్పదన్న స్పష్టత రావడంతో   ఇక మ‌ళ్లీ జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీతో లండ‌న్ వెళ్తున్నార‌ని, ఇక ఆయ‌న తిరిగిరార‌ని విస్తృతం ప్ర‌చారం జ‌రిగింది. తెలుగుదేశం నేత‌లు సైతం ఈ విష‌యాన్ని ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. చివరాఖరికి సీబీఐ కూడా ఆయన విదేశీ పర్యటనను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న అంటే వైసీపీ శ్రేణులుసైతం ఒకింత‌ ఆందోళ‌న చెందారు. జ‌గ‌న్ పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని డ్రైవ‌ర్ట్ చేస్తేందుకు వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓట‌మి భ‌యంతో ఆందోళ‌న‌లోఉన్న వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై అర్ధంప‌ర్దంలేని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతూ త‌మ‌ అనుకూల మీడియాలో వైసీపీ నేత‌లు విష‌ప్ర‌చారం చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి.. చెప్పిందేచెప్పి ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న టాపిక్ ను డైవ‌ర్ట్ చేసేందుకు వైసీపీ నేత‌లు ఆడుతున్న డ్రామాగా రాజ‌కీయ విశ్లేష‌కులు దీనినిపేర్కొంటున్నారు.  మ‌రోవైపు.. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌యింది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అయితే..  వైసీపీ ఘోర ఓట‌మిని చ‌విచూడ‌బోతుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏపీలో సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నార‌ని దేశ‌వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో వైసీపీ అభ్య‌ర్ధుల‌తోపాటు, పార్టీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు. ఓటింగ్ స‌ర‌ళిని చూసి వైసీపీలోని ముఖ్య‌నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. నిత్యం చంద్ర‌బాబు, లోకేశ్ పై విరుచుకుప‌డే విజ‌య‌సాయిరెడ్డి, రోజా, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అనిల్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌లు ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ప‌లువురు వైసీపీ అభ్య‌ర్థులు, జిల్లాల్లోని వైసీపీ ముఖ్య‌నేత‌లు, పార్టీలోని ద్వితీయ స్థాయి నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే వైసీపీ ప్ర‌భుత్వంలో తాముచేసిన త‌ప్పుల‌ను బ‌య‌ట‌కుతీసి చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షిస్తుంద‌ని వారు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ముంద‌స్తుగానే  తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోతే సేఫ్ సైడ్‌లో ఉండొచ్చ‌నే ఆలోచ‌న‌సైతం చేస్తున్నారు. ఇప్ప‌టికే పలువురు వైసీపీ నేత‌లు బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే వైసీపీ పెద్ద‌న‌ష్టం వాటిల్లుతుంద‌ని భావించిన ఆ పార్టీ అధిష్టానం పెద్ద‌లు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది.  అందులో భాగంగానే చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఏదో కుట్ర దాగిఉంద‌ని చెప్ప‌డం.. వైసీపీ అనుకూల మీడియాలో చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్ల‌డం పెద్ద‌పాపం చేసిన‌ట్లు చూప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ అధిష్టానం శ్రీ‌కారం చుట్టింద‌ని, త‌ద్వారా కొద్దిరోజులు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై ఏపీ రాజ‌కీయాలు చ‌క్క‌ర్లు కొట్టేలా చేయ‌డమే వైసీపీ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు పోలింగ్ స‌మ‌యంలో, పోలింగ్ అనంత‌రం వైసీపీ నేత‌లు అనేక దాడుల‌కు పాల్ప‌డ్డారు. సిట్ ద‌ర్యాప్తులోనూ ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌నుసైతం వైసీపీ నేత‌లు ప‌గ‌ల‌గొట్టారు. ఇన్నాళ్లూ తెలుగుదేశం నేత‌లు త‌మ‌పై దాడులు చేశారంటూ ప్ర‌జ‌ల‌కు అబ‌ద్దాలు చెబుతూ వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌కు సిట్ ద‌ర్యాప్తు పెద్ద ఎదురుదెబ్బ‌గా మారింది. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో పోలింగ్ స‌మ‌యంలో, ఆ త‌రువాత వైసీపీ నేత‌ల త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న అంశాన్ని జ‌గ‌న్ బ్యాచ్ తెర‌పైకి తెచ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

devotees rush in tirumala

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో వారంతంలోనే కాకుండా సాధారణ రోజులలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. గురువారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కాంప్లెక్స్ దాటి ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని మొత్తం 80 వేల048 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35 వేల 403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది. 

pinnelly atrocities into light

ఒక్కటొక్కటిగా వెలుగులోకి పిన్నెల్లి అరాచ‌కాలు

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోక‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీలో  పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌కర్త‌ల‌పై దాడులకు తెగ‌బ‌డి భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఇందుకు అద్దంప‌డుతూ పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసంచేసి, అధికారుల‌ను, టీడీపీ పోలింగ్ ఏజెంట్‌ను బెదిరించిన వీడియో వైర‌ల్ అయింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయ్యింది. పిన్నెల్లిపై చ‌ర్య‌లుకు ఈసీని ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. ఆయ‌న త‌ప్పించుకొని పారిపోవ‌టం అంతా కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. అయితే, పోలింగ్ రోజు ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై పోలీసులు, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇన్నాళ్లు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈవీఎం ధ్వంసం వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు పోలీసులు ఈ వ్య‌వ‌హారంపై త‌మ‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.  మాచ‌ర్ల నియోక‌వ‌ర్గంలో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న త‌మ్ముడు వెంక‌ట్రామిరెడ్డి చెప్పిందే వేదం. వారు గీసిన గీత‌దాటితే అవ‌త‌లివ్య‌క్తులు ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్న‌ట్లే.  2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పిన్నెల్లి సోద‌రుల అరాచ‌కాలు పెచ్చిమీరిపోయాయి. వారి అనుచ‌రులు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. వారికి వ్య‌తిరేకంగా ఓటేసిన వారిపై దాడులు, వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. తెలుగుదేశం పార్టీకి ప‌ట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ నేత‌ల‌ను గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేసి త‌రిమికొట్టారు.  దుర్గి మండ‌లంలోని ఆత్మ‌కూరు, జంగ‌మేశ్వ‌ర‌పాడు గ్రామాల్లో తెలుగుదేశం నేత‌ల కుటుంబాల‌ను క‌ట్టుబ‌ట్ట‌ల‌తో గ్రామం నుంచి త‌రిమేశారు. పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రుల ఇబ్బందులు త‌ట్టుకోలేక ప‌లు గ్రామాల నుంచి అనేక మంది తెలుగుదేశం మ‌ద్ద‌తు దారులు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు.  పెందుర్తి మండ‌లం గుండ్ల‌పాడుకు చెందిన తెలుగుదేశం నేత చంద్ర‌య్య‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు 2022లో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లే గొంతుకోసి చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న వెనుక పిన్నెల్లి సోద‌రులు ఉన్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. అదే ఏడాది దుర్గి మండ‌లం జంగ‌మేశ్వ‌ర‌పాడులో తెలుగుదేశంకు చెందిన  జంగ‌య్య‌ను అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత హ‌త్య చేశాడు. గ‌త ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం దాడులు, హ‌త్య‌ల‌కు పిన్నెల్లి అనుచ‌రులు తెగ‌బ‌డ్డారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏ వ్యాపారం నిర్వ‌హించుకోవాల‌న్నా పిన్నెల్లి సోద‌రుల‌కు క‌ప్పం క‌ట్టాల్సిందే. లేదంటే వారిపై దాడులు జ‌ర‌గ‌డంతో పాటు, వారి వ్యాపారాలు మూసివేస్తారు. దీంతో గ‌త ఐదేళ్లుగా పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రుల పేరు చెబితేనే వ్యాపారులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి  ఏర్ప‌డింది.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రుల వికృత కాండ తారాస్థాయికి చేరిపోయింది. మ‌రో వైపు బెట్టింగ్ బుకీల‌తోనూ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి సంబంధాలు ఉన్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పిన్నెల్లి సోద‌రులు బీభ‌త్సం సృష్టించారు. ప‌లు గ్రామాల్లో టీడీపీ నుంచి నామినేష‌న్ వేయ‌కుండా చేశారు. మాట‌విన‌ని వారిపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. తెలుగుదేశం సానుభూతి ప‌రుల వ్యాపారాల‌పై దాడులు చేయ‌డం, ఆ పార్టీ నేత‌లను బెదిరింపుల‌కు గురిచేయ‌డం గ‌త ఐదేళ్ల కాలంలో మాచెర్ల‌లో నిత్య‌కృత్యంగా మారింది. అధికారులు, పోలీసులు సైతం పిన్నెల్లి సోద‌రులు ఏం చెబితే అది చేస్తూ వ‌చ్చార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ త‌మ అనుకూల పోలీసులు, అధికారుల స‌హ‌కారంతో ఏక‌ప‌క్షంగా పోలింగ్ జ‌రిపించుకునేందుకు పిన్నెల్లి సోద‌రులు ప్ర‌య‌త్నాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంకు ప‌ట్టున్న గ్రామాల‌ను టార్గెట్ గా చేసుకొని దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ప‌లు గ్రామాల్లో పోలింగ్ బూత్ ల‌లో తెలుగుదేశం ఏజెంట్లు లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో తానేం చేసినా అడ్డుకునేవారు లేర‌న్న రీతిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. ఈ క్ర‌మంలోనే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి స్వ‌యంగా ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసి అధికారుల‌ను, టీడీపీ పోలింగ్ ఏజెంట్ ను  బెదిరించాడు.  అక్క‌డున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. త‌మ‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా ఉండిపోయారు. తాజాగా, పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను ద్వంసం చేసిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది.  వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీఈవోపై సీరియ‌స్ అయింది. ఎందుకు అరెస్ట్ చేయ‌లేదంటూ ప్ర‌శ్నించింది. దీంతో రంగంలోకి దిగిన‌ ఈసీ పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక‌.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై ప‌లు సెక్ష‌న్లతో కేసులు సైతం న‌మోద‌య్యాయి. పోలీసులు అల‌ర్ట్ అయ్యేలోపే పిన్నెల్లి ప‌రార‌య్యాడు. పిన్నెల్లి వాహ‌నాల‌ను సంగారెడ్డి జిల్లాలో సీజ్ చేశారు. పిన్నెల్లి డ్రైవ‌ర్ ను అరెస్టు చేశారు. కారులో పిన్నెల్లి ఫోన్ ఉండటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.  అయితే, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసుల కంట‌ప‌డ‌కుండా వైసీపీ అనుకూల మీడియా వాహ‌నంలో త‌ర‌లించార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఒక దశలో పిన్నెల్లి కూడా అరెస్టయ్యారని వార్తలు వచ్చాయి. స్వయంగా పోలీసులే అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అంతలోనే పోలీసుల కళ్లు కప్పి పిన్నెల్లి పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే   కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ కావడంతో గ‌త ఐదేళ్లుగా పిన్నెల్లి సోద‌రులు నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. పిన్నెల్లి సోద‌రుల అకృత్యాల‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు మీడియా, పోలీసుల ముందుకొచ్చి త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కుతున్నారు. ఈవీఎం ధ్వంసం ఘ‌ట‌న‌పై సీఈసీ సీరియ‌స్ గా ఉండ‌టంలో  పిన్నెల్లిని ఇవాళ లేదా రేపు అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అరెస్టు త‌రువాత ఆయనపై ఎలాంటి చ‌ర్య‌లు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త ఐదేళ్ల కాలంలో పిన్నెల్లి సోద‌రుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు పిన్నెల్లిని అరెస్టు చేసి జైలు పంపించాల‌ని, అత‌న్ని ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

important report on pinnelli

పిన్నెల్లి పాపాలపై డీజీపీ కీలక నివేదిక

మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు. సీఈఓ ఎంకే మీనా ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈ నివేదిక అందజేశారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ పేర్కొన్నారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ గుప్తా వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేసిన కేసులో ఏ 1గా చేర్చామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.   

Chandrababu congratulated the activist who deposed Pinnelli

శేషగిరిరావును అభినందించిన చంద్రబాబు

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు. పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ ఏజెంట్‌గా ఉన్న శేషగిరిరావు నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అతనిపై ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో దాడి చేసినట్టు వార్తలొచ్చాయి.తనపై దాడి తర్వాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు అతనిని ఫోన్లో పరామర్శించారు. పిన్నెల్లి ఎమ్మెల్యేగా కాకుండా వీధిరౌడీలా ప్రవర్తించారని, ఆయన అనుచరులు ఈవీఎంను పగులగొట్టారని మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చర్యలకు ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు.

jaya badiga shorn in as judge

తెలుగు వెలుగును చాటిన జస్టిస్ జయ బాడిగ!

శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన అచ్చ తెలుగు మహిళ జయ బాడిగ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ సందర్భంగా తెలుగు వెలుగును చాటారు. ప్రమాణ స్వీకారం  చేస్తున్న సమయంలో ఆమె తెలుగులో మాట్లాడారు. తన మాతృభాష తెలుగు మీద వున్న తన అభిమానాన్ని చాటారు. ప్రమాణ స్వీకార ప్రసంగాన్నిప్రారంభిస్తూ ఆమె ‘‘గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవరీవన్... మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం’’ అన్నారు. ఈ  గొప్ప సందర్భంలో తన మాతృభాషలో మాట్లాడ్డం తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని ఆమె చెప్పారు. ఇలాంటి సందర్భాలలో తెలుగును మాట్లాడ్డం మొదటిసారి ఆమె అన్నారు. ఈ సందర్భంగా ‘‘మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి శాంతి శాంతిః’’ అనే సంస్కృత శ్లోకాన్ని కూడా జయ బాడిగ ఉటంకించారు. అమెరికాలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా అక్కడ తెలుగు వెలుగును ప్రసరింపజేసిన జయ బాడిగకు అభినందనలు. జయ బాడిగ మరెవరో కాదు.. మచిలీపట్నం  పార్లమెంట్ మాజీసభ్యుడు బాడిగ రామకృష్ణ కుమార్తె. జయ బాడిగ తల్లి పేరు బాడిగ ప్రేమలత. బాడిగ రామకృష్ణ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. వారిలో ఒకరు జయ బాడిగ. ఆమధ్య న్యూజిలాండ్ పార్లమెంట్‌కి ఎంపీగా ఎంపికైన ఒక గిరిజన జాతికి చెందిన మహిళ పార్లమెంటులో తన జాతికి సంబంధించిన భాషను, వారి నినాదాన్ని చెప్పడం ప్రపంచమంతా వైరల్ అయింది. ఇప్పుడు జయ శాంటాక్లారా కోర్టులో తెలుగులో చేసిన ప్రసంగం ఆ పార్లమెంట్ సభ్యురాలు చేసిన ప్రసంగంలా వైరల్ అవుతుందో లేదోగానీ, ప్రతి తెలుగు హృదయంలో వైరల్ అవుతుంది.

pinnelli brothers escape to hyderabad

పిన్నెల్లి బ్రదర్స్ దొరికారు.. కానీ తప్పించుకున్నట్టు పుకార్లు!

మాచర్లలో పోలింగ్ సందర్భంగా విధ్వంసాన్ని సృష్టించి, గృహ నిర్బంధం నుంచి హైదరాబాద్‌కి పారిపోయిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడిని పోలీసులు తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర వున్న ఇస్నాపూర్ వద్ద అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తమను అరెస్టు చేసిన పోలీసుల కళ్ళుగప్పి పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకుని పారిపోయారని తెలుస్తోంది. వీళ్ళ అరెస్టు గురించి గానీ, మళ్ళీ తప్పించుకుని పోయిన  విషయంలో గానీ, పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు. పిన్నెల్లి సోదరులు ఆల్రెడీ మాచర్లలో పోలీసుల గృహ నిర్బంధం నుంచి గోడదూకి పారిపోయారు. అలా పారిపోవడమే ఒక పెద్ద నేరం.. ఇప్పుడు సంగారెడ్డి దగ్గర నుంచి కూడా పోలీసుల కళ్ళుగప్పి పారిపోయినట్టయితే, అది నిజంగా వారి పతనాన్ని వారే కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. తాజా సమాచారం ప్రకారం పిన్నెల్లి బ్రదర్స్.ని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మరి తమ నుంచి తప్పించుకుంటే మళ్ళీ పట్టుకున్నారా, అసలు తప్పించుకోనే లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

Data safe in EVM : CEO Mukesh Kumar Meena

ఈవీఎంలో డేటా సేఫ్ : సీఈవో ముఖేష్ కుమార్ మీనా 

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు.. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌ల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు.   ధ్వంసం ఘ‌ట‌నల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు. 20వ తేదీన రెంట‌చింత‌ల కోర్టులో ఎస్ఐ మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

కింగ్ విరాట్ కోహ్లీకి లైఫ్ థ్రెట్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు?!

కిక్రెట్ రారాజు, రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? అంటే ఔననే అంటున్నారు గుజరాత్ పోలీసులు. కచ్చితమైన సమాచారం మేరకు కింగ్ కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిన నలుగురు టెర్రరిస్టులను అదుపులోనికి తీసుకున్నామని చెబుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పతనం అంచునుంచి పుంజుకుని నాకౌట్ స్టేజ్ కు చేరింది. ఈ ప్రయాణంలో ఆ జట్టు అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించింది. వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకి  బుధవారం ( మే 22) రాజస్థాన్ రాయల్స్ లో ఎలిమినేటర్ లో తలపడడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ స్ఫూర్తిదాయక ప్రదర్శన వెనుక ఉన్న చోదక శక్తి కోహ్లీయే అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కూడా కోహ్లీయే.  ఈ తరుణలో ఆర్సీబీ జట్టు మంగళవారం (మే 21) అత్యంత కీలకమైన ప్రాక్టీస్ సెషన్ కు దూరమైంది. అంతే కాకుండా ప్రెస్ మీట్ కు కూడా ఆర్సీబీ ఆటగాళ్లు బయటకు రాలేదు. గుజరాత్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయకుండా హోటల్ కే జట్లు పరిమితమవ్వడానికి గల కారణాలను గుజరాత్ పోలీసులు వెల్లడించారు. కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారం మేరకు ఆర్సీబీ జట్టును ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకోమని తామే సూచించినట్లు చెప్పారు. అలాగే మీడియా మీట్ కు కూడా దూరంగా ఉండాల్సిందిగా కోరామన్నారు. ఈ ఉగ్రకుట్రకు సంబంధించి నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.  

అంబేడ్కర్‌ విగ్రహానికి ఘోర అవమానం! దళిత సంఘాల రాస్తారోకో...

పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. పట్టణంలోని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌క, విగ్ర‌హం ముఖంపై క‌సిగా గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు అక్క డకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకోకి దిగారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల నుంచి, ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే విగ్రహ ధ్వంసాలకు పాల్ప‌డుతున్నారా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌రిమితులంటూ ఏమీ ఉండ‌వు. ఏ విష‌యాన్ని అయినా త‌మ‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నుకుంటే ఎంత‌టికైనా తెగిస్తారు. త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల పేరుతో ప్ర‌తి విష‌యానికి రాజ‌కీయ రంగు పులుముతుంటారు. అందుకు నాయ‌కుల విగ్ర‌హాలు  కూడా మిన‌హాయింపేమీ కాదు.  రాజ‌కీయ నేత‌లు విగ్ర‌హాల విధ్వంసానికి ఎందుకు పాల్ప‌డ‌తారంటే....? ఎందుకంటే వారి దృష్టిలో ఇదే సులువైన మార్గం. ఖర్చులేనిది, శ్రమ లేనిది, జన సమీకరణకు రాజకీయ పార్టీలు కష్ట పడాల్సిన‌ పని లేదు.  దేవతా విగ్రహాలు, లేదా రాజ‌కీయ ప్ర‌ముఖుల విగ్ర‌హాలు. ఎవ‌రి అవ‌స‌రం వారిది. ఎప్పుడు ఏలాంటి రాజ‌కీయాల‌కు పాల్ప‌డాలో మ‌న నేత‌ల‌కు బాగా తెలుసు.  పైసా ఖర్చులేకుండా  భారీ ఎత్తున ప్ర‌చారం ల‌భిస్తుంది. జ‌నాల్ని రెచ్చ‌గొట్ట‌వ‌చ్చు. లా అండ్‌ ఆర్డర్ రాష్ట్రంలో విఫలమైందని చూపించడం తేలిక. ఇప్పుడు ఏపీలో మ‌ళ్ళీ 'విగ్రహ ధ్వంస' రాజకీయానికి తెర లేచింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌

జోగి రమేష్ నోట ప్రతిపక్షం మాట.. ఓటమి ఒప్పేసుకున్నట్లేనా?

విజయంపై విశ్వాసం వ్యక్తం చేయడంలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయినప్పటికీ కొందరు మాత్రం ఇంకా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ లు ముందు వరుసలో ఉంటారు. వారి ప్రకటనలను నమ్ముతున్నదెవరు? నవ్వి పోతున్నదెవరు అన్నది పక్కన పెడితే.. వారి ప్రకటనల్లోని డొల్లతనం వారి మాటల్లోనే కనిపించేస్తోంది. తాజాగా జోగి రమేష్ జూన్ 4న సంబరాలకు సిద్ధం కండి అంటూ పార్టీ శ్రేణులకు ఓ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఆయన సందర్భమో అసందర్భమో కానీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటన గురించి ప్రస్తావించారు. కోర్టుల అనుమతి తీసుకోవలసిన అవసరం చంద్రబాబుకు లేకపోవడం చేత ఆయన విదేశీ పర్యటనకు పెద్దగా ప్రచారం లేదు. ప్రచారం అవసరం కూడా లేదు. వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్లడం ఆయనకు ఇదే మొదటి సారీ కాదు. కాకపోతే వైసీపీ అధినేత దేశం విడిచి వెళ్లాలంటే ఆయనకు కోర్టు అనుమతి కావాలి. బెయిలుపై ఉన్నందున, అందునా షరతులతో కూడిన బెయిలుపై ఉన్నందున ఆయన పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. కోర్టు అనుమతి తీసుకుని ఆ పాస్ పోర్టు తీసుకుని ఆయన విదేశీయానం చేయాల్సి ఉంటుంది. ఈ సారి కూడా ఆయన కోర్టు అనుమతి తీసుకునే విదేశాలకు వెళ్లారు. అయితే ఈ సారి ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం తెలిపింది. ఆ మేరకు సీబీఐ  కోర్టులో కౌంటర్ కూడా వేసింది. సరే అయినా ఆయన విదేశీపర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అది కూడా షరతులతో.. ఆయన ఫోన్ నంబర్, ఈమెయిల్ సంబంధిత అధికారులకు ఇచ్చి మరీ వెళ్లాలని షరతు విధించింది. అది పక్కన పెడితే.. జోగి రమేష్ తాను తాజాగా సంబరాలకు సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిస్తూ పనిలో పనిగా చంద్రబాబు విదేశీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేస్తూ పొరపాటునో, గ్రహపాటునో వాస్తవం చెప్పేశారు. నిజమే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ కనీసం ప్రతిపక్షానికి చెప్పను కూడా చెప్పలేదని గింజు కున్నారు. అంటే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వాలన్నారు. అంటే ఏపీలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేననీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయేది చంద్రబాబేననీ అంగీకరించేశారు. అలాగే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమౌతుందని చెప్పేశారు.  దీంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇంతకీ జోగి రమేష్ సంబరాలకు రెడీ కావాలంటూ ఇచ్చిన పిలుపు విపక్షం కాబోతున్నందుకా అని గందరగోళంలో పడ్డారు. 

ప్రాణం తీసిన చెట్టు!

ప్రాణవాయువు ఇచ్చే చెట్టు నిండు ప్రాణం తీసింది. చెట్టు విరిగి మీద పడటంతో రవీంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.  సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. భార్య సరళాదేవితో కలసి రవీంద్ర ద్విచక్ర వాహనం మీద ఆస్పత్రి ఆవరణలో ప్రవేశించగానే చెట్టు విరిగి వారి మీద పడింది. చెట్టు మోడు  రవీంద్ర ఛాతీ మీద పడటంతో ఆయన అక్కడకక్కడే మరణించారు. సరళాదేవి తలకు గాయం తగిలింది. సరళాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు కాలికి నొప్పిగా వుండటంతో చికిత్స కోసం భర్తతో కలసి కంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఈ ఘోరం జరిగింది. ఈ దంపతుల మీద కూలిన చెట్టు ఎన్నాళ్ళక్రితమో వేళ్ళు పెకల్చుకుని బయటకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది చెట్టును తొలగించకపోవడం వల్ల ఒప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. భర్త చనిపోయిన విషయం ఇంకా సరళాదేవికి తెలియదు..