పల్నాడు జిల్లాలో బర్డ్ ప్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి

పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది.  మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో    గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం  కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అమ్మాయి చనిపోవడానికి బర్డ్ ప్లూ కారణమని వైద్యులు తేల్చారు. గత నెలలో ఎపిలో బర్డ్ ప్లూ విజృంభించింది. ఫిబ్రవరి 28వ తేదీన  బాధిత కుటుంబం వండటానికి కోడిమాంసం తెచ్చుకుంది. వండే ముందు పచ్చిమాంసం ముక్క ఒకటి చిన్నారికి ఇచ్చి తినిపించింది. సహజంగా చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చికెన్ ముక్క తిన్న వెంటనే చిన్నారి శరీరంలో బర్డ్ ప్లూ వైరస్ ప్రవేశించింది. వైరస్ సోకగానే చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది.  చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో  చేర్చినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. పక్షం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన చిన్నారి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కోడిమాంసం విక్రయాలను నిషేధించింది. 100 డిగ్రీల టెంపరేచర్ లో కోడిమాంసం ఉడికించి తింటే బర్డ్ ప్లూ వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.  

వల్లభనేని వంశీ ఆటకట్టేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ  పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి..  ఆ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో  పార్టీ మారిన వల్లభనేని వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా వ్యవహరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా  ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్ మెంట్లతో చెలరేగిపోయారు. అయితే తన అక్రమాలు, ఆక్రమణలన్నికీ  తెరముందు తన అనుంగు శిష్యుడిని పెట్టి తాను తెరవేనుక బాగోతం నడిపారన్న ఆరోపణలు  చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుంగు శిష్యుడు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగా ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు రంగాను మూడు రోజుల పోలీసుల కస్టడీని అనుమతిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఇక వంశీ గుట్టుమట్లన్నీ రట్టు అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేనిఅప్పట్లో తెలుగుదేశం ఆరోపించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో గన్నవరం తెలుగుదేశంపై దాడి విషయంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీ పేరు లేదు. ఆ కేసులో వల్లభనేని ప్రధాన అనుచరుడు రంగాను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. అయితే అప్పట్లో అధికారంలో వైసీపీ ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు.  గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు విచారణ ముందుకు సాగడం మొదలైంది. ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా చేర్చారు. అయితే తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా పరారీలో ఉన్నారు. ఇఖ కేసులో తనను చేర్చడంతో అసలు కేసే లేకుండా చేస్తే మంచిదని భావించిన వంశీ... ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ బెదరింపు వ్యవహారంలో వంశీ అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో  ప్రధాన నిందితుడైన రంగాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీకి ఇక ఈ కేసులో బయటపడటానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసు, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకి.. ఇక జగన్ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు సంబంధించి విషయాలన్నీ రంగా విచారణలొ  వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్మకంతో  ఉన్నారు. 

సిగరెట్ కాల్చి పొగ మీదకు వదిలాడంటూ కొట్టి చంపేశారు!

స్వల్ప విషయానికి ఘర్షణ పడి ఒక యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. ఓ యువకుడు సిగరెట్ కాలుస్తున్నాడు. అతడు పీల్చి వదిలిన పొగ తనపైకి వచ్చిందంటూ మరో యువకుడు అతడితో వాదనకు దిగాడు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి దారుణంగ కొట్టి చంపేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో ఈ దారుణం జరిగింది. పర్వతగిరి సీఐ రాజగోపాల్  కథనం ప్రకారం సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు.  అతడు వదిలిన సిగరెట్ పొగ పక్కనే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు వైపుకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే దీన్నే మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడికి దిగాడు. ఇదంతా గమనించిన స్థానికులు బన్నీని కాపాడేందుకు చాలానే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ బన్నీ అక్కడే కుప్పకూలిపోయాడు. సిద్దు తన ఫ్రెండ్స్ తో అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు బన్నీని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న ధని ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

రాజారెడ్డి రాజ్యాంగం... వైఎస్ ఫ్యామిలీ రాజకీయం

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు  రాజకీయంగా ఇప్పటి వరకూ ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే  ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. దాంతో షర్మిల వైఎస్ఆర్‌టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే సక్సెస్ మాత్రం కాలేకపోయారు. దాంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది జరిగిన వారంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవం బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టి పీసీసీ ప్రెసిడెంట్‌ని చేశారు. ఆ పదవి కట్టబెట్టక ముందు నుంచే షర్మిలకు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయవద్దని ముందు నుంచే అడ్డం పడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్. అయితే ఆ మాజీ ఎంపీ విన్నపాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. ఆ క్రమంలో హర్షకుమార్ కాంగ్రెస్‌కు రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.  మరెక్కడా ఓపెనింగ్స్ లేవేమో ఆ సీనియర్ నేత కాంగ్రెస్ చూరే పట్టుకుని వేలాడుతున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్‌ను కోరిన హర్హకుమార్, ఆమెకు కావాలంటే జాతీయ స్థాయి పదవి ఇవ్వండని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని తిరిగిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్, షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి షర్మిల తన అన్నతో అరగంటసేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏమోచ్చిందని కొత్తకొత్త డౌట్లు కూడా అప్పట్లో రెయిజ్ చేశారు. జగన్‌కు మోడీతో, షర్మిలకు సోనియాతో లింకు పెట్టేసి కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని మండిపడ్డారు హర్ష కుమార్.అలాంటి హర్షకుమార్ చాపక్రింద నీరులా తాడేపల్లి కోటరీతో చేతులు కలిపారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. తనను టార్గెట్ చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు కూటమి సర్కారును ఇబ్బందుల్లో పెట్టడానికి జగన్ టీమ్ హర్షకుమార్ దళిత కార్డుని వాడుకోవడానికి స్కెచ్ గీస్తోందంట.  కాంగ్రెస్ రక్తాన్ని వంటబట్టించుకున్న వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. తమ రాజకీయ  అవసరాల కోసం ఇంటాబయటా ఎవర్నైనా టార్గెట్ చేస్తారన్న టాక్ ఉంది. 1989లో వంగవీటి రంగా హత్య కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. సీఎంను మార్చడానికి 1990లో హైదరాబాద్ మత కలహాలూ ఆ పార్టీ సృష్టేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 1999లో వరుసగా రెండో సారి ఓడిపోగానే  చెన్నారెడ్డి తెలంగాణా అంటూ విభజన రాగం ఎత్తుకుని హడావుడి చేశారు. 2009లో వైఎస్ మరణం తర్వాత తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపారని జగన్ అల్లర్లు సృష్టించారు. అదే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్‌ అంబానీకి తన తాడేపల్లి ప్యాలెస్‌లో రాజమర్యాదలు చేశారు. వైసీపీ కోటాలో అంబానీ టీమ్ మెంబర్‌కి రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు. 2015లో అప్పటి కూటమి సర్కారుని బదనాం చేయడానికి తుని ట్రైన్ తగల బెట్టించడానికి ముద్రగడను ముందు పెట్టి పావులు కదిపింది వైసీపీనే అన్న విమర్శలున్నాయి. ఇక అధికారంలోకి రావడానికి  2018లో కోడి కత్తి  డ్రామా, 2019  ఎన్నికల ముందు సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల చిచ్చు,  మొన్న ఎన్నికల ముందు పేదలు వర్సెస్ పెత్తందార్లు అంటూ నాటకం.. తాజాగా  పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం జగన్ పొలిటికల్ డ్రామాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా కులం.. మతం.. ప్రాంతాలను అడ్డు పెట్టుకుని, శవ రాజకీయాలు చేస్తూ ఆ పునాదుల పైనే, వైఎస్  ఫ్యామిలీ ఎదిగిందంటారు. అప్పుడు అయ్యా.. ఇప్పుడు కొడుకు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఇన్ని ఘటనలు కళ్ళ ముందు జరుగుతూ, రాష్ట్రం నష్టపోతున్నా, తెలుగుదేశం మీద ద్వేషంతోనో, కులం, మతం, ప్రాంతం మీద ఉండే ఉన్మాద అభిమానంతోనో, వాళ్ళని ఇంకా నమ్మే వాళ్ళు ఉండటం ఈ తెలుగు జాతి దౌర్భాగ్యమనే చెప్పాలి. లేకపోతే  హైదరాబాద్ టూ బెజవాడ, రాజమండ్రి టూ వీలర్ ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా రాజకీయం చేయడం ఏంటి?

ఈ రోజే వక్ఫ్ వార్.. ఉత్కంఠకు తెర !

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వక్ఫ్ చట్ట  సవరణ బిల్లును ప్రభుత్వం  బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ  పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ  వ్యవహారాల శాఖ మంత్రి  కిరణ్ రిజిజు బిల్లును సభలో  ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి మంగళ వారం (ఏప్రిల్ 1) జరిగిన బీఎసీ సమావేశంలో స్పీకర్ ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు. అయితే  ముస్లిం హక్కులను కాలరాచే బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం సరి పోదు పది గంటలు కావాలని విపక్షాలు పట్టు పట్టాయి.   సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే, స్పీకర్ అనుమతిస్తే పది గంటల చర్చకు అయినా పభుత్వం సిద్డంగా ఉందని మంత్రి  కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో.. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అవసరం అయితే ఇంకా ఎక్కువ సమయం అయినా చర్చ జరగవచ్చును. అయితే  ఎన్ని గంటలు చర్చ జరుగుతుందిఅనేది కాదు, చివరకు ఏమి జరుగుతుంది? ఇదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. వక్ఫ్ చట్ట  సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అనుమానం లేదు. ఉభసభల్లో అధికార, విపక్షాల సంఖ్య, బలాలను బట్టి చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా, ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు.  వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. సో , సంఖ్యా పరంగా చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. అలాగే  ఒక సారి, సభ ఆమోదం పొందిన తర్వాత  రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్‌ సవరణ బిల్లు వక్ఫ్‌ సవరణ చట్టం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి రోడ్ బ్లాక్స్  లేకుండా కథ నడిచి పోతుంది.  కానీ, అక్కడితో కథ ముగిసి పోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిజానికి, రేపటి దృశ్యం ఎలా ఉండబోతోందో సూచించే సంకేతాలు ఇప్పటికే చాలా వరకు స్పష్ట మయ్యాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తర్వాత కలహాల కాపురంగా మారిన ఇండియా కూటమి  ని వక్ఫ్ బిల్లు మళ్ళీ ఏకం చేసింది. బుధవారం(ఏప్రిల్ 2) లోక్ సభలో జరిగే చర్చలో ఇండియా కూటమి పార్టీలు ఒక్కటిగా బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే  ఇప్పటికి కూడా అటు అధికార ఎన్డీఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీలలో ఎలాగైతే చిన్న పెద్ద  సందేహాలు, సందిగ్ధతలు ఉన్నాయో  అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలలోనూ శషబిషలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సభలో అటు ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ఇటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల వైఖరి ఎలా ఉంటుంది  అనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో   ఒకటే మాట, ఒకటే బాణం  అన్నట్లు వ్యవహరిస్తాయా.. సభలోనూ పాత గాయాలు బయట పడతాయా అన్నది చూడవలసి వుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ మేనేజిమెంట్,  ఫైనల్ కౌంటింగ్ రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనీ..  కీలకంగా మారుతుందని అంటున్నారు.    నిజానికి, వక్ఫ్ చట్టం సవరణలకు సంబంధించి సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలతా లేదు. అసలు సరైన అవగాహనే లేదు. అయితే  ముస్లిం సమాజంలో సహజంగా స్థిరపడిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్ల నాటుకు పోయిన వ్యతిరేకత (కల్పిత ‘భయం’ అనాలేమో) కారణంగా మెజారిటీ ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ  80 శాతం ఉన్న హిందువులపై ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. నిజానికి బిల్లుకు ముందు కాదు  తర్వాతనే అసలు రాజకీయం బయట పడుతుంది.అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై ఈరోజు దేశంలో ఒక విధమైన ఉత్కంఠ నెలకొందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వేధిస్తున్నాడని యువకుడికి నిప్పెట్టిన యువతి

యువతులపై ప్రేమోన్మాదంతో యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు, హత్యాయత్నాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఒక యువతి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో ఒక మహిళ తనను మానసికంగా వేధస్తున్నాడంటూ ఒక యువకుడిపై ప్రతీకారానికి దిగింది. చిరంజీవి అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఓ యువతి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో తమ్మిశెట్టి చిరంజీవి (35)పై దేవళ్ళ శ్రీలక్ష్మి (30) పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో యువకుడి వీపు కాలిపోవడంతో స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన యువతిపై బాధితుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  గ్రామానికి చెందిన చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తన వ్యక్తిత్వంపై నిందలు వేస్తున్నాడని శ్రీలక్ష్మీ వాపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి తన ధోరణిని మార్చుకోకపోవడంతో అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఆ మహిళ. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిరంజీవి కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పివేసి అతడిని హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన యువతిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. చిరంజీవి, శ్రీలక్ష్మీ మధ్య గొడవ ఏంటి.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టేంత వివాదం ఏంటి.. మహిళ గురించి చిరంజీవి ఏ విధమైన ప్రచారం చేశాడనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే చిరంజీవిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

వల్లభనేని వంశీకి మరో షాక్

రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం,  అదేనండి ఒరిజనల్ రూపం బయటపడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్ల జుట్టుతో, దీన వదనంతో విజయవాడ సబ్‌జైలు నుంచి కోర్టులకు తిరుగుతున్న వంశీకి వరుస కేసులు, కోర్టు ఉత్తర్వులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా ఆయనకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు మంగళవారం (మార్చి 1) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు, ఏ1 నిందితుడు  మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రంగాను ఇటీవల   పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట!

మంత్రుల పర్యటన వేళ అధికారులకు అష్టకష్టాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది.  ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరూ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోష పడుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు.  ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురూ జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యమంలో పాల్గొనకపోతే  ఎమవుతుందోనని హడలిపోతున్నారు. అంతే కాకుండా మంత్రులు వరుస పర్యటనలతో అధికారులకు వారి కార్యక్రమాలకు హాజరు కావడానికే సమయమంతా సరిపోతోంది. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండటంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనలకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే.  ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతున్నది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీసు, అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్ లోనే ఉంటున్నారు.. దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాన్వాయ్ లో భారీగా వాహనాలు ఉండటం వల్ల కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటపడి  సాగర్ కాలువలకు లింక్ చేశారు. భట్టి, పొంగులేటి గ్రామీణ రహదారులను బాగుచేసే పనిలో ఉన్నారు.

రంజాన్ ప్రార్థనలో పువ్వాడకు అవమానం!

రంజాన్ పర్వదినం రోజున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కు అవమానం జరిగింది. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పువ్వాడ అజయ్ అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలో పాల్గొనే ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఒక షామియానా వేశారు. ఈ షామియానా లో కేవలం ముస్లిం సోదరులే కూర్చోవాలని ఇతరులు వేరే షామియానాలో కూర్చోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియని అజయ్ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వేసిన షామియాలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ముస్లిం పెద్దలు అజయ్ ను అక్కడ నుంచి లేచి వెళ్లి మరో షామియానా కింద కూర్చోవాలని సూచించారు. దీంతో అజయ్ కాస్త ఇబ్బంది పడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు , ఆ కమ్యూనిటీ కి ఎంతో సేవచేశానని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కూర్చునే ముందు చెప్పకుండా కూర్చున్న తరువాత లేచిపోవాలని చెప్పడం అజయ్ అవమానంగా భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా?

అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.  ఈ కేసులో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసులకు భయపడనంటూ గంభీర ప్రకటనలు చేసిన కాకాణి తీరా పోలీసులు నోటీసులు అందజేయడానికి వస్తే అజ్ణాతంలోకి వెళ్లి పోవడం తెలిసిందే.   వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. వరుసగా రెండు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి, మంగళవారం (ఏప్రిల్ 1)న తాను బుధవారం తరువాత అంటే గురువారం అందుబాటులో ఉంటాను అంటూ సమాచారం పంపారు.  అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా, పోలీసులు కాకాణి విచారణకు గైర్హాజర్ అయిన విషయాన్నీ అలాగే రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  

నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి!

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో  కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది  పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు . ఉగాది ఉత్సవాల సందర్భంగా మచిలీపట్టణం సమీపంలోని  కూచిపూడి నాట్యకళకు జన్మ స్థలం  కూచిపూడిలో  రెండురోజులపాటు  నాట్యగురు,కేంద్ర సాహిత్య,నాటక అవార్డు గ్రహీత డా. వేదాంతం రాధే శ్యామ్ నేతృత్వం లో  జరుగుతున్న "కూచిపూడి నాట్య శిల్పారామం"  నృత్యోత్సవాలలో  మొదటిరోజు ముఖ్య అతిధిగా  పాల్గొన్న వేదాంతం రాధేశ్యామ్   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.  పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అపురూపమైన నృత్యం నేర్చుకున్నప్పటికీ పలువురు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన ఖరీదైన కాస్ట్యూమ్స్,ఇమిటేషన్ ఆభరణాలు కొనలేని స్థితిలో  వున్నారనీ, అటేవంటివవారికి ప్రభుత్వం, దాతలు నృత్య దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు  సమకూర్చాలని కోరారు.  నాట్య గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బాల కొండలరావు   విశాఖపట్నం లో తానూ స్థాపించిన కూచిపూడి నాట్య అకాడెమి ద్వారా వేలాది మంది నృత్య కళాకారిణులను తీర్చి దిద్దినట్లు ఆమె తెలిపారు.  విశాఖపట్నం, పార్వతీపురం,హైదరాబాద్,లతో పాటు పలు ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, నాట్య గురువు లతో కూచిపూడి లొ ఉగాది నాట్య ఉత్సవం వైభవంగా జరిగింది.  

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ పద్మావతికి సుప్రీంలో షాక్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్  రఘురామ కృష్ణంరాజు  కస్టోడియల్ టార్చర్  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి  డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి ఈ నెల  7, 8 తేదీల్లో సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ విచారణకు హాజరు కాకున్నా, విచారణకు సహకరించకున్నా  మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది.  ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో తప్పుడు  మెడికల్ రిపోర్టు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఆమె ముందస్తు బెయిలు పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు  ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, విచారణకు హాజరై సహకరించాలని సూచించింది.  అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 1) విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.  

నిత్యానంద స్వామి ఇక లేరు? 

తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామి నిత్యానందస్వామి మరణించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్ నుంచే  ఈ ప్రకటన వెలువడింది. సినీ నటి రంజితతో రాసలీలతో  ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. 2022లో కూడా నిత్యానంద స్వామి చనిపోయినట్టు వచ్చిన వార్తలను స్వయంగా ఖండించారు. ప్రస్తుతం వస్తున్న మరణ వార్తలను ఇంతవరకు నిత్యానంద స్వామి ఖండించలేదు. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి కైలాస పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు. కైలాస దేశానికి  ప్రత్యేక కరెన్సీ  కూడా ఉంది. ఇండియా నుంచి వెళ్లిపోయిన నిత్యానంద ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు వేల కోట్లకు అధిపతి అయిన నిత్యానందకు వారసులు ఎవరు అనేది ప్రశ్నార్ణకమైంది. కైలాస దేశానికి నిత్యానంద ప్రధాని పదవిలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకున్నారు. దక్షిణ అమెరికా ఈక్వెడార్ లో కైలాస దేశం ఉందని చెబుతుంటారు. . 

సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం పోటీసులు జారీ చేసింది. ఏపీలో  అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో  అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.   ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.  ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై  జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 1) విచారించింది. ఈ సందర్భంగా సంజయ్ బెయిలు రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కూంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది.  

విచారణకు మాజీ మంత్రి కాకాణి మళ్లీ డుమ్మా.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు.  మైనింగ్ కేసులో ఆయన మంగళవారం (ఏప్రిల్ 1) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన డుమ్మా కొట్టారు. వాస్తవానికి పోలీసులు ఆయనకు సోమవారం (మార్చి 31) విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఆ తరువాత తాను ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో ఉన్నానంటూ మాజీ మంత్రి కాకాణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సారి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మంగళవారం (ఏప్రిల్ 1) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే ఆయన హైదరాబాద్ లోని నివాసంలో కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కాకాణి సమీప బంధువుకు నోటీసులు అందజేశారు. మంగళవారం విచారణకు గైర్హాజరైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఇటు నెల్లూరులో కానీ, అటు హైదరాబాద్ లో కానీ ఆయన అందుబాటులో లేకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారని అంతా భావిస్తున్నారు. ఇలా ఉండగా అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకాణి బెయిలు పిటిషన్ నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం ఉంది.  ఇలా ఉండగా మాజీ మంత్రి కాకాణి తాను గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను బుధవారం (ఏప్రిల్ 2) సాయంత్రం తరువాత నెల్లూరు చేరుకుంటాననీ, గురువారం నుంచీ అందుబాటులో ఉంటాననీ, విచారణకు సహకరిస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. మరో సారి నోటీసులు ఇస్తారా? లేక రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టినందున పరారీలో ఉన్నట్లు పరిగణించి గాలింపు చర్యలు చేపడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు కాకాణి గిరిజనులను బెదిరించారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. 

పేర్నిజయసుధ బెయిల్ రద్దుచేయాలని కోరుతూ  హైకోర్టులో పిటిషన్ 

పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూటమిప్రభుత్వం ఎపి హైకోర్టులో పిటిషన్ వేసింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో  ప్రధాన నిందితురాలు. ఈ కేసులో పేర్ని నానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన భార్య జయసుధకు  కూడా  మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మచిలీ పట్నం కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం   మంగళవారం  పిటిషన్ దాఖలు చేసింది  కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని జయసుధ కోరడంతో విచారణ ఈ నెల 10వ తేదీకి  హైకోర్టు వాయిదా  వేసింది. 

అధ్యక్ష పదవి నుంచి అన్నామలై ఔట్?

తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు  మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే  కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు  సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే  చేరుతుంది.    అయితే  బీజేపే పెద్దలు దక్షిణాది రాష్ట్రాలలో పొత్తులు లేకుండా పప్పులు ఉండకవనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఎఐఎడిఎంకె తో పొత్తు కోసం, అన్నమలై ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అవును  బీజేపీ నాయకులు కథలు చాలానే చెప్పా వచ్చును కానీ  ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి అభీష్టం మేరకే  బీజేపీ పెద్దలు అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలానే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తును తెంచుకుని వెళ్ళిన ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి తిరిగి ఎన్డీఎ గూటికి చేరేందుకు  గత కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ అవసరాలతో పాటుగా ఆయనకు ఇంకేమి  రక్షణలు  అవసరం ఉన్నాయో ఏమో  కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన ఎన్డీఎ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనేపధ్యంలో  బీజేపీ అధిష్టానం  పాళని స్వామి కోసం  అన్నామలైపై వేటు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే  బీజేపీ పెద్దల నిర్ణయం అనూహ్యం అయితే కాదని అంటున్నారు. నిజానికి  గతంలో ఎఐఎడిఎంకె, బీజేపీతో పొత్తును తెంచుకోవడానికి,పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానూ అన్నామలై’ కారణం. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిన  బహిరంగ రహస్యమే. ప్రధాన ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె, రెండూ అవినీతి విషయంలో ఒకే తాను ముక్కలని అన్నామలై అనేక సందర్భాలలో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పళని స్వామి సహా ఇతర నాయకుల అవినీతి ఫైల్స్ బయట పెట్టారు. అయితే అవసరార్ధం కుదిరే పోత్తులకు అంటూ, సొంటూ ఉండదని  మహరాష్త్రలో అజిత్ పవార్  తో పొత్తు పెట్టుకున్నసందర్భంలోనే స్పష్టం చేసిన  బీజేపీ పెద్దలు తమిళ నాడులో అన్నా డిఎంకె తో  మళ్ళీ పొత్తుకు పచ్చజెండా ఊపారు.    కొత్త పొత్తు చర్చల్లో భాగంగా  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలోనే పళని స్వామి పొత్తుకు అన్నామలై అడ్డవుతారని అనుమానం వ్యక్త పరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉభయ పార్టీల మధ్య పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు తదితర ఉమ్మడి వ్యవహారాలను చర్చించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పళనిస్వామి అమిత్ షాను  కోరినట్లు వార్త లొచ్చాయి. ఈ నేపద్యంలో  అధ్యక్ష పదవి నుంచి అన్నామలై’ తప్పుకోవడం అనూహ్యం కాదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  అన్నా డిఎంకె తో పొత్తు కారణంగా  కుల సమీకరణలో వచ్చిన మార్పు(పళని స్వామి,అన్నామలై ఇద్దరిది ఒకే కులం) కారణంగా అన్నామలైని  అధ్యక్ష పదవి నుంచి తప్పించడం శిక్షగా భావించరాదని అంటున్నారు. మరో వంక అన్నామలై పొత్తు తనకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్పకుండా  పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనందంగా స్వీకరిస్తానన్నారు. అంతే కాదు సాధారణ కార్యకర్తగా పనిచేయడానికి అయినా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా, ఎఐఎడిఎంకెతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయంలో మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు తేడాతో ఓడించడం మొదలు 2023లో పళని స్వామి పొత్తును ఏక పక్షంగా తెంచుకోవడం వరకు  ఎఐఎడిఎంకె’తో  బీజేపీకి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అయినా పునరపి జననం పునరపి మరణం అన్నట్లు  రెండు పార్టీల ఎత్తు పొత్తులు  చస్తూ బతుకుతూ వస్తున్నాయి.ఇప్పడు ఉభయ పార్టీలు మరో మారు మరో మూడు ముళ్ళకు సిద్దమయ్యాయి. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో.. ఎప్పుడు పుటుక్కు మంటుండో ఏమో కానీ, ఒక మంచి నాయకుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.

ఖమ్మం కాంగ్రెస్ లో నైరాశ్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. తొలివిడతలో మాత్రం పాత కొత్త వారికి ఓ మూడు పదవులు ఇచ్చారు. తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న పొదెం వీరయ్య, రాయల నాగేశ్వర రావులకు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన మువ్వా విజయబాబు కు పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అయినా ముగ్గురు మంత్రుల మధ్యా సఖ్యతా లోపం కారణంగా అధిష్ఠానానికి జాబితాలు పంపడంలో  తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కార్యకర్తలు నష్టపోతున్నారు. భద్రాచలం దేవస్థానానికి చైర్మన్ ను నియమించలేదు.  గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఖాళీగానే ఉన్నాయి. పదేళ్లు అధికారం లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు పదవుల విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో తీవ్ర నిరాశకు గురౌతున్నారు.  బీఆర్ఎస్ పాలనలో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొంటున్న తమను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన చెందు తున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారి పెత్తనమే నడుస్తోందన్న విమర్శలు కూడా ఎక్కు వగా వినిపిస్తున్నాయి.  పొంగులేటి మాత్రం తన మద్దతుదారుడు విజయ్ బాబు కు పదవి ఇప్పించు కున్నారు. తుమ్మల నాగేశ్వరావు తొలివిడతలో పాత కాంగ్రెస్ వాళ్లకే పదవులని తనతో వచ్చిన అనుచరులకు స్పష్టం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి  భట్టి  బిజీగా ఉంటున్నారు. కార్యకర్తలలో  నైరాశ్యం పేరుకుపోతున్నది.