సజ్జల సంకరజాతి వ్యాఖ్యలపై డీజీపీకి ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు

  సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.  దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ  సొంత ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిని దేవతల రాజధాని అనడాన్ని ఖండిస్తూ,  అది వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. టీవీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజుకు వంత పాడుతూ ఔను అమరావతిలో సెక్స్ వర్కర్లు అన్న వార్తను తాను కూడా చూశానంటూ పేర్కొన్నారు.  కాగా ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళాలోకం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజకీయ విశ్లేషకుడు కృష్ణం రాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యం.. ఆ అభిప్రాయాలు కృష్ణం రాజు వ్యక్తిగతం.. తమకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది.   అయితే కొమ్మినేని అరెస్టు పై వైసీపీ  తీవ్ర అభ్యంతరం  వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షి టీవీకి సంబంధం లేదని పేర్కొంటూనే.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని గుండెలు బాదేసుకుంటోంది. కృష్ణం రాజు చేసినవి అనుచిత వ్యాఖ్యలే అని అంగీకరిస్తూనే..వాటికి వంతపాడిన కొమ్మినేని అరెస్టు అన్యాయమనడంలోని లాజిక్కేమిటో వైసీపీయులే చెప్పాలి. అదలా ఉంచితే... కొమ్మినేని అరెస్టుపై  వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఆ సందర్భంగా  సజ్జల చేసిన సంకరజాతి వ్యాఖ్య కాంట్రవర్సినీ కాస్తా కాంప్లికేట్ స్థాయికి తీసుకు వెళ్లింది.  కొమ్మినేని అరెస్టు అక్రమంటూ పెట్టిన ప్రెస్ మీట్లో ఆ ఆరెస్టు అక్రమం ఎలా అయ్యిందో చెప్పడం మాని,  అమరావతి మహిళలపై ఆయన మరో సారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  జగన్ కు మహిళల పట్ల అపార గౌరవం.. అటువంటి జగన్ అమరావతి మహిళలను అవమానిస్తారా, ఆయన  చానెల్ ఆ పని చేయదుగాక చేయదు అంటూ గట్టిగా చెప్పకోవడానికి శతధా ప్రయత్నించిన సజ్జల.. జగన్‌కు, ఆయన చానెల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన, చేస్తున్న వారిపై దూషణల పర్వానికి దిగారు.  పిశాచాలు, రాక్షసులు,  సంకర జాతి అంటూ  అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సజ్జల వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ గట్టిగా ఖండించారు. ఇక డిప్యూటీ స్పీకర్ అయితే.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో సజ్జల చిక్కుల్లో పడ్డారు.  

సర్వీస్ సెక్టార్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంపు.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలను మరింత చేరువ అవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే  డిజిటల్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 300 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రభుత్వం.. గ్రామీణ పేదలకు మరింత చేరువ అయ్యే లక్ష్యంతోనే స్వర్ణాంధ్ర కార్యాలయాలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.   స‌ర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం పెంచడం ద్వారా ఆ పెంచిన ఆదాయాన్ని పేదలకు మరిన్ని పథకాలను అమలు చేయడం ద్వారా అందిస్తామన్న చంద్రబాబు.. ప్రస్తుతం సేవా రంగం ద్వారా నూటికి ఆరు రూపాయల ఆదాయం వస్తున్నదని, దీనిని మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు.  ఈ స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకు వెడతామన్న చంద్రబాబు.. జగన్ ప్రభఉత్వ  విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తా మ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

పీడీఎస్ ప్రక్షాళనే లక్ష్యం.. నాదెండ్ల మనోహర్

జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమిస్తున్నారు.  రేషన్ సరుకుల పంపిణీ ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో బాగంగా సోమవారం (జూన్ 9) ఏలూరులో  పర్యటించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతా రేషన్ సరుకుల పంపిణీ ఆగడానికి వీల్లేదని ఆయనీ సందర్భంగా డీలర్లకు చెప్పారు. సర్వర్లు పని చేయడం లేదనో, మరో కారణం చేతనో రేషన్  షాపులకు వస్తున్న వారిని డీలర్లు వెనక్కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన.. సర్వర్ పని చేయని సందర్భంలో లబ్ధిదారుని ఫొటో తీసుకుని సంతకం చేయించుకుని రేషన్ ఇవ్వాలనీ, అంతే తప్ప పంపిణీని వాయిదా వేయడానికి వీల్లేదని కచ్చతమైన ఆదేశాలు జారీ చేశారు.   జగన్ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ అంటూ దొడ్డిదారిన రేషన్ సరుకులను అక్రమ మార్గాల ద్వారా అమ్ముకున్నారని, దానిని నిర్మూలించేందుకే పాత పద్దతికే తాము మద్దతుగా నిలిచామని నాదెండ్ల చెప్పుకొచ్చారు.  లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ వారికి అంది తీరాలపీ, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు.

జగన్, భారతి క్షమాపణలకు షర్మిల డిమాండ్

అమ‌రావ‌తిపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై   ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. అస‌లు రాజ‌ధానిపై మాట్లాడే అర్హ‌త జగన్ కు కానీ, భారతికి కానీ, వారి సొంత మీడియాకు కానీ లేదని షర్మిల అన్నారు.   గ‌తంలో అనేక సార్లు అమరావతిపైనా, అక్కడి ప్రజలపైనా, రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వారిని అవమానించేలా మాట్లాడారన్న షర్మిల.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ లో మార్పురాలేదని దుయ్యబట్టారు.  అ తాజాగా  జగన్ మీడియాలో చేప‌ట్టిన చ‌ర్చ‌లో మ‌హిళ‌ల‌ను తీసుకురావ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిల సోమవారం (జూన్ 9) మీడియాతో మాట్లాడారు.  మ‌హిళ‌ల‌ను అవ‌మానించే సంస్కృతి వైసీపీతోనే ప్రారంభ‌మైంద‌ని విమర్శించారు ఈ విషయంలో జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతోపాటు భారతితోనూ చెప్పించి ఉంటే బాగుండేద‌ని వ్యాఖ్యానించారు.   జగన్ హయాంలో రాష్ట్రానికి కేరాఫ్ లేని ప‌రిస్థితి ఉండేదని,  ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని నిర్మించుకుంటున్నామనీ పేర్కొన్నన షర్మిల.. ఇలాంటి సమయంలో రాజధాని అమరావతికి, అక్కడి మహిళలకు వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని విషయమన్నారు.   

హైకోర్టులో పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన బెయిలు పిటిషన్ సోమవారం హైకోర్టు విచారించింది. వాదోపవాదాలు విన్న అనంతరం ఆయనకు బెయిలు నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీపీఎస్సీ ఆక్రమాల కేసులో పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. 

ముగిసిన ప్రభాకర్‌ రావు విచారణ.. మళ్లీ ఎప్పుడంటే?

  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు. అయితే   మళ్లీ ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని అధికారులు ప్రభాకర్ రావుకు తెలియజేశారు. దీంతో మరోమారు ఆయన సిట్ ముందుకు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. డీసీపీ విజయ్‌, ఏసీపీ వెంకటగిరి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. అలాగే, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది

కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు .ఐ ఎం ఎం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తల తో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. షర్మిల జిందాబాద్ పద్మశ్రీ డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. కడప జిల్లా పర్యటనలో షర్మిలపై సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేశారు . సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల వర్గం ఆమెను ప్రశ్నించడం జరిగింది. దీంతో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పడ్డారు. సుంకర పద్మశ్రీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీరాములు, నజీర్ అహ్మద్ పాల్గొనగా షర్మిలకు మద్దతుగా జిల్లా డిసిసి అధ్యక్షురాలు విజయ జ్యోతి, పులివెందుల, పొద్దుటూరు, నియోజకవర్గాల అధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాషాలు పాల్గొన్నారు

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

  జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తెలంగా ణ ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. అంగీకరించారు. 

మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్

  రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని  మండిపడ్డారు. "ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?" అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడటం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేశ్ పంచుకున్నారు. ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు

తెలుగుదేశం నాయకురాలు,  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో  జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెకు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించిన అనంతరం కోలుకున్నారు.  రెండు రోజులుగా అఖిలప్రియ జాతరకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక సోమవారం (జూన్ 10)  పూజల సందర్భంగా ఉపవాస దీక్ష పాటించారు. అసలే ఎండలు, ఉక్కపోత ఉండటం, ఉపవాసదీక్షలో ఉండటంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 

కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌

  ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు. చర్చలో ఆ సందర్బానికి జోడించారో వివరణ ఇవ్వాలని కోరారు. రాజకీయ నేతలు నడిపించే మీడియా వద్దు అనే చర్చ ప్రారంభం కావాలన్నారు.  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరినీ క్షమాపణ కోరలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో కొందరికి బాధ కలిగి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఛానల్‌ను నడుపుతున్న యాజమాన్యం ఎవరో అందరికీ తెలుసు. ఇంత చౌకబారు జర్నలిజం ఎందుకు వచ్చిందో అలోచించాలని ఆయన ప్రశ్నించారు.  వారి పార్టీ అజెండా కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. ఆంగ్లపత్రిక కథనంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. చర్చలో ఆ సందర్భాన్ని ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. రాజకీయాలు జోడించాల్సిన అవసరం ఎవరికీ లేదు.’’ అని ఆలపాటి పేర్కొన్నారు.

కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ .. ఎందుకంటే?

  బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు  భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీశ్ రావు కమిషన్‌కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్‌ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు.  

బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

  తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల  ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రూ. 1150 ఉన్న ఆర్డిన‌రీ పాస్ ధ‌ర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీల‌క్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.  ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ప్రజలు వాపోతున్నారు.  గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. సాధార‌ణ ఛార్జీల‌తో పాటు బ‌స్ పాస్ ఛార్జీలను పెంచ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పురుష ప్ర‌యాణికులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ సౌక‌ర్యం క‌ల్పించి, మ‌గాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు!

వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల ప‌ట్ల ఉండాల్సిన  నిబద్ధ‌త మ‌రచి మ‌రీ జ‌గ‌న్ అనుంగు మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం చేటు తెస్తుందా? అంటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. బేసిగ్గా పొలిటీషియ‌న్లు నోటి మాట అదుపు త‌ప్పిన‌పుడు దాన్నొక రాజ‌కీయ ఆరోప‌ణ కింద లైట్ తీస్కునే వెస‌లుబాటు ఉంటుంది. వెన‌కుండి ఎవ‌రో న‌డిపించి ఉంటార్లెమ్మ‌ని జ‌నం అర్ధం చేసుకుంటారు. ఈ మ‌ధ్య అలాక్కూడా ఎవ్వ‌రూ అర్ధం చేసుకోవ‌డం లేదు. చంద్రబాబు సతీమణి భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్న మాట‌లు.. వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపించాయి. ఈ విష‌యంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ చేసిన కామెంట్లే ఉదాహ‌ర‌ణ‌. త‌మ ఘోర ఓట‌మికి ఇలాంటి కామెంట్లే కార‌ణ‌మ‌ని  ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా అంగీకరించారు.   తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా అంగీక‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. మాములుగా రాజ‌కీయ‌నాయ‌కులు ప్రేలాప‌ల‌న‌ల‌కు పాల్ప‌డితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త స‌గ‌టు జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుంది. బేసిగ్గా జ‌ర్న‌లిజంలో పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, ప్రాంతీయ క‌ల‌హాలు, కుల,మ‌త, వ‌ర్గ, వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొట్టేలాంటి వ్య‌వ‌హార శైలి క‌న‌బ‌ర‌చ‌కూడ‌దు.  డూస్ అండ్ డోంట్స్ లో ఇవ‌న్నీ ఒక పాఠంగా చెబుతారు. కానీ  కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఓ చానెల్ లో  నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు  అటువంటి కనీస ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు.  అమ‌రావ‌తిపై వేశ్య‌ల రాజ‌ధాని అన్న ముద్ర వేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. వారి వ్యాఖ్యలపై అమరావతి  ప్రాంత మ‌హిళ‌లు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. వారిపై ఫిర్యాదులు చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టారు.   ఇంత‌కీ ఇదెలా వెలుగులోకి వ‌చ్చిందోన‌ని చూస్తే.. ప్ర‌పంచ అత్య‌ధిక జ‌నాభా గ‌లిగిన దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న భార‌త్.. హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సంఖ్య త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు పాటు ప‌డుతున్నాయి.  ఏయే రాష్ట్రాల్లో సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య ఎలా ఉందో  పీఎంపీఎస్ఈ సంస్థ ఒక స‌ర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేష‌న్ సైజ్ ఎస్టిమేష‌న్ అనే ఈ సంస్థ  నిర్వ‌హించిన స‌ర్వేలో దేశం మొత్తం మీద  9, 95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భార‌త్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్‌లో ఉన్నట్టు తేల్చింది.  దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4 శాతం మంది కర్ణాటకలో ఉండ‌గా.. ఏపీలో 12 శాతం మంది ఉన్నార‌నీ.. ఇక‌ తెలంగాణలో 7.6 శాతం ఉన్నట్టు లెక్క‌లు రాసుకొచ్చిందీ సంస్థ‌. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అన్న‌ది ఈ స‌ర్వే రిపోర్ట్ సారాంశం.  దీన్ని ఒక అప్ర‌ధాన్య‌త‌కు సంబంధించిన వార్త‌గా ప్ర‌చురించాలి స‌హ‌జంగా అయితే.  కానీ దాన్ని అమ‌రావ‌తి అనే రాజ‌ధానికి లింకు పెట్టి.. ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఆ వేశ్య‌లంతా ఉన్నార‌ని చెప్ప‌డం అర్ధ‌ర‌హితం, అమానుషం, అనైతికం.  ఇది జ‌ర్న‌లిస్టిక్ విలువ‌ల‌ను స‌మూలంగా తుంగ‌లో తొక్క‌డంతో స‌మానం.  పొట్టకూటి కోసంఆ వృత్తిలో ఉన్న‌వారి రీహాబిలిటేష‌న్ జరగాలి. జర్నలిజం, జర్నలిస్టులు అందుకోసం వార్తలు రాయాలి. విశ్లేషణలు చేయాలి. గతంలో తెలంగాణలోని యాద‌గిరి గుట్టలో కూడా అదే జరిగింది. అప్పట్లో మీడియా యాదాద్రికి వేశ్య ముద్ర వేసి అప‌ఖ్యాతి పాలు చేయ‌లేదు. బాధ్యతగా వ్యవహరించింది. అది క‌నీస సంస్కారం, విజ్ఞ‌త‌తో కూడిన జర్న‌లిజం.   కానీ ఇప్పుడు కొమ్మినేని, కృష్ణంరాజు  జ‌ర్న‌లిజం ముసుగులో అసహ్యమైన, అమానుషమైన, అనైతిక ప్రచారానికి ఒడిగట్టారు.  కొద్ది కాలం కిందట  వైఎస్ సతీమణి భార‌తీరెడ్డిపై తెలుగుదేశం మద్దతుదారు అయిన కిర‌ణ్ చేబ్రోలు అనే వ్య‌క్తి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుగానూ వెంట‌నే అలెర్ట్ అయిన కూట‌మి ప్ర‌భుత్వం అతనిని అరెస్టు చేసి  జైల్లో పెట్టింది.  ప‌రిణితి ప్ర‌ద‌ర్శించింది. కానీ వైసీపీలో మాత్రం అటువంటి పరిణితి ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఇదే వైఖరిని వైసీపీ కొనసాగిస్తే ముందుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆ చానెల్ లైసెన్స్ రద్దు చేయాలి.. ఏపీ మహిళా కమిషన్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ   ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై  వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి  శైలజ  తీవ్రస్థాయిలో స్పందించారు.  సోమవారం(జూన్ 9)   విజయవాడలో మీడియాతో  మాట్లాడిన ఆమె  రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా ఆ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై   పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు.  జర్నలిస్టు, ఎనలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా?  అని ధ్వజమొత్తారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో  నోటికొచ్చినట్ల మాట్లాడితే కుదరదన్నారు. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని నిలదీశారు. ఆ చానెల్ లో ప్రసారం చేసిన డిబేట్ కు సంబంధించి మహిళా కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న రాయపాటి శైలజ.. రాజకీయ కారణాలతో ఒక ప్రాంతంపై నీచమైన ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారన్నారు.  ప్రభుత్వం మారిన తరువాత అమ రావతి అభివృద్ధి చెందుతోందనీ,  ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  అటువంటి వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులేనన్నారు.  రాజకీయ ముసుగులో నడిపే అటువంటి చానల్స్ ను రద్దు చేయాలన్నారు.  జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాసి ఆ ఛానల్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మహిళా కమిషన్‌కు ఉన్న అధికార పరిధిలో తమ‌వంతు చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ స్పష్టం చేశారు  

జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా..మహిళా కమిషన్ సీరియస్

  అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాల‌పై దాడి చేయడం గత వైసీపీ ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని‌ మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఆమె ప్రశ్నించారు.  జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయ కోణంలో, అనుకూల ఛానెల్ ఉందని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా కూడా ప్రాంతం పేరు లేదు, అలాంటిది జర్నలిస్టు అయ్యుండి ఒక ప్రాంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం సరికాదని ఆమె హెచ్చరించారు. చదువుకున్న జర్నలిస్టుగా మహిళలను అవమానించడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు

ఇక అంతా ఢిల్లీ నుంచే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.   ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.   అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.

సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళన

  అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.  గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు  నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో  దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. డిబేట్‌లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్‌లో అసభ్య పదాలు వాడినప్పటికీ  క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్‌ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి. ఆపై మహిళలు కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

క‌న్న‌ప్పా.. పిల‌క- గిల‌క వివాద‌మేంటి!?

మోహ‌న్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయ‌న శ్రీ విద్యానికేత‌న్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌తో పాటు వాటి ఉప ఆల‌యాలు వెర‌సీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం కానీ ఈ సామాజిక వ‌ర్గం ప‌ట్ల గౌర‌వాభిమానాలు గానీ ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే ఒకింత‌ ఎక్కువ‌గానే ఉంటాయ్. తిరుమ‌లలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంత‌టి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైందంటే అందుకు కార‌ణం ఈ బ్రాహ్మ‌ణుల నిష్టాగ‌రిష్ట‌త‌లే కార‌ణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.  కానీ..  ఈ ప్రాంతంలో తాను పుట్ట‌డం మాత్ర‌మే కాకుండా, ఇక్క‌డే త‌న విద్యా వ్య‌వ‌స్థ‌ను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో త‌న అనుబంధం పెంచుకుంటూ వ‌స్తున్నారు మోహ‌న్ బాబు. అంటే ఈ ప్రాంత న‌మ్మ‌కాలపై ఆయ‌న‌కుగానీ ఆయ‌న కుటుంబానికి గానీ ఈ సామాజిక వ‌ర్గంపై ఒక మ‌ర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివ‌ర్స్ లో వెళ్తోంది మోహ‌న్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విష‌యంలోనూ స‌రిగ్గా ఇలాంటి వ్య‌వ‌హార‌మే న‌డిచింది. అప్ప‌ట్లో అదో పెద్ద గొడ‌వ‌.  ఫిలింన‌గ‌ర్ లో ఆయ‌న నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.   తాజాగా క‌న్న‌ప్ప లో పిల‌క‌- గిల‌క వ్య‌వ‌హారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిల‌క- గిల‌క అంటూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసింది టీమ్ క‌న్న‌ప్ప‌. మొన్న‌టికి మొన్న శివ‌రాత్రి స‌మ‌యంలో సాక్షాత్ ఆ శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుడి ముందు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీజ‌ర్ రిలీజ్ చేశారన్న‌ది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్న‌ది మ‌రో వివాదం. తాజాగా ఈ పిల‌క- గిల‌క పోస్ట‌ర్ క‌ల‌క‌లం.  ఈ పిల‌క- గిల‌క పాత్ర‌ల‌ ద్వారా  బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   క‌న్న‌ప్ప సినిమాలో ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ పాత్ర‌ల‌ను పెట్టార‌ని బ్రాహ్మణ సంఘాలు  విరుచుకుప‌డుతున్నాయి. ఇది బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డంతో స‌మాన‌మన్న‌ది అంటున్నాయి. దీంతో క‌న్న‌ప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామ‌ని హెచ్చరిస్తున్నాయి.  నిజానికి క‌న్న‌ప్ప అనే పాత  సినిమాని బ‌ట్టి చూస్తే కాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌య పూజారి (రావుగోపాల‌రావు పోషించిన పాత్ర‌)   క‌న్న‌ప్ప‌ను నిజంగానే ఇబ్బందుల పాలు చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.  మ‌రి అప్పుడిదే బ్రాహ్మ‌ణ  సంఘాలు ఎందుకింత‌గా వ్య‌తిరేకించ‌లేద‌న్న‌ది ఒక వాద‌న కాగా.. రెండోది ఏంటంటే మోహ‌న్ బాబు కుటుంబానికి బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటే బాగా క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది మ‌రో కామెంట్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌న్న‌ప్ప బ‌డ్జెట్ 100 కోట్ల రూపాయ‌లుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బ‌ట్టే రిక‌వ‌రీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవ‌స‌రం. అలా జ‌ర‌గాలంటే సినిమా ఏదో ఒక ర‌కంగా   వార్త‌ల్లో ఉండాలి. ఇప్ప‌టికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం..  తాజాగా బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన వివాదాల తుట్టె కూడా క‌దిపిన‌ట్లు కనిపిస్తోంది. దీంతో త‌మ సినిమా డెఫినెట్ గా వార్త‌ల్లో ఉండ‌ట‌మే కాక‌.. ప్రేక్ష‌క జ‌నం దృష్టిని సైతం ఆక‌ర్షించ‌డం ఖాయ‌ మ‌న్న‌ట్టుగా.. భావిస్తున్నారు. మ‌రి చూడాలి ఏమౌతుందో?