సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళన
posted on Jun 9, 2025 @ 2:32PM
అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. డిబేట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్లో అసభ్య పదాలు వాడినప్పటికీ క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి. ఆపై మహిళలు కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.