రగులుతున్న జమ్మూ కశ్మీర్.. మళ్ళీ ఉగ్రవాదుల దాడి

  ఆర్టికల్ 370 రద్దు విషయంలో జమ్మూ కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్న సమయంలో 144 సెక్షన్ కూడా విధించారు. కశ్మీర్ మొత్తం పోలీసులు ఆద్వర్యంలోనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలో ఒక ట్రక్ డ్రైవర్ ని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. పండ్ల వ్యాపారిపై దాడి చేశారు. షోపియాన్ ఘటనలో ఒక పాకిస్థానీ యువకుడు కూడా పాల్గొన్నట్టు జమ్ము కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు మాటువేసిన ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్నారు.  ఆర్టికల్ 370 రద్దు తరవాత రెండున్నర నెలలుగా కశ్మీరు మొత్తం నిఘా నీడలోనే ఉంది. పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. సెల్ ఫోన్ సర్వీసులను పునురుద్ధరించిన రోజే ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. పండ్ల వ్యాపారులను ఎగుమతి దారులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. షోపియాన్ జిల్లాలో షరీఫ్ ఖాన్ అనే ట్రక్ డ్రైవర్ ను దారుణంగా ఉగ్రవాదులు హత్య చేశారు. జమ్ము కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు పాకిస్తానీ మిలిటెంట్ లు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజస్థాన్ కు చెందిన షరీఫ్ ఖాన్ జమ్ము కశ్మీర్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పండ్లు ఎగుమతి పుంజుకోవడంతో చాలా మందికి ఉపాధి దొరికింది. దీన్నే అదునుగా తీసుకొని మిలిటెంట్ లు రెచ్చిపోతున్నారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భద్రతను కట్టు దిట్టం చేశాయి. ఉగ్రవాదులతో పాటు చొరబాటుదారుల కదలికలపై నిఘా పెంచాయి. దాడికి పాల్పడిన మిలిటెంట్ లలో పాకిస్థాన్ జాతీయుడు కూడా ఉండటంతో పాక్ కు వ్యతిరేకంగా బలగాలు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నాయి.

జగన్-చిరు భేటీలో సైరాను మించిన డిస్కషన్స్... మెగా ఫ్యామిలీ కేంద్రంగా టాలీవుడ్ పై వైసీపీ వ్యూహం

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్-చిరు భేటీలో కేవలం సైరా గురించే మాట్లాడుకోలేదని, తాజా రాజకీయ పరిణామాలు, టాలీవుడ్ లో పరిస్థితులపై చర్చ జరిగిందని అంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఉందని, అందుకే తాను ముఖ్యమంత్రి అయినా అభినందించడానికి టాలీవుడ్ ప్రముఖులు అభినందించడానికి రాలేదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా, సినీ పరిశ్రమ నుంచి తనను కలిసిన మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ పరిస్థితుల గురించి జగన్ క్షుణ్ణంగా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్ గా, టాలీవుడ్ లో ఆ సామాజికవర్గ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనకు జగన్ వచ్చారని చెబుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న చంద్రబాబు సామాజికవర్గం ప్రముఖులకు చెక్ పెట్టడమే కాకుండా, ఆ వర్గం డామినేషన్ లేకుండా, వాళ్లను నిమిత్తమాత్రులుగా చేయాలనే వ్యూహాన్ని మెగాస్టార్ చిరంజీవి కేంద్రంగా చేయాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని, సినీ పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవాలనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే, ఇకపై టాలీవుడ్ కి సంబంధించిన ఏ పనైనా చిరంజీవి సిఫార్సుతోనే చేసేలా ప్రభుత్వ వర్గాలకు సంకేతాలు పంపారట. ఓవరాల్ గా తెలుగు ఇండస్ట్రీని జగన్ తరపున మెగా కుటుంబం లీడ్ చేసేలా వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి-మెగాస్టార్ చిరంజీవి సమావేశంలో... సైరాను మించిన డిస్కషన్స్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు సంచలన నిర్ణయం...

  తెలంగాణ సచివాలయం కూల్చివేత నిన్న మొన్నటి దాకా పెద్ద చర్చనీయంశంగా మారిన సంగతి అందరికి తెలిసిందే .తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వ నిర్ణయం పై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.కొత్త భవనాల కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించింది. ఫైర్ సేప్టీ అధికారుల చేసిన సూచనలు పాటించకుండా మొత్తం భవనాలనే కూల్చివేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవాళ కూడా సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది.   తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. అన్ని హంగులతో రెండు వేల పదమూడులో నిర్మించిన సచివాలయ బ్లాకును కూల్చివేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హై కోర్టు ప్రశ్నించింది. రెండు వేల పదహారులో ఫైర్ సేఫ్టీ అధికారులు కొన్ని సూచనలు మాత్రమే చేశారని వాటిని కూల్చివేయమని చెప్పలేదని గుర్తు చేసింది. సి, డి ,ఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవని నివేదిక స్పష్టం చేస్తోందని, అలాంటి వాటిని కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపడతాం అంటే ఎలా అని ప్రశ్నించింది. పలు జిల్లా కోర్టుల్లో సరైన సౌకర్యాలు లేవని ఫైర్ సేప్టీ ఊసే లేదని న్యాయాధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. జిల్లాలోని అన్ని కోట్లు కూల్చివేసి అన్ని సౌకర్యాలతో కొత్తవి కట్టాలని అడిగామా అని కోర్టు ప్రశ్నించింది. భవనాలకు తగిన మరమ్మతులు చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తేవచ్చని సూచించింది.  ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది కోట్ల మంది ప్రజల అవసరాలకు సరిపడా ఉన్న సచివాలయ భవనాలు ఏపీ ఖాళీ చేసిన తరవాత నాలుగు కోట్ల మంది అవసరాలకు సరిపడేలా లేవా అని ప్రశ్నించింది. కావాలంటే నూట ముప్పై ఏళ్ల క్రితం పధ్ధెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించిన జి బ్లాక్ శిథిలావస్థలో ఉండి వినియోగానికి పనికి రాకుండా ఉన్నందున దానిని కూల్చి అక్కడ మరో భవంతి కట్టుకోవచ్చని సూచించింది. కొత్తగా నిర్మించ తల పెట్టిన సచివాలయ టవర్లకు ఎలాంటి డిజైన్లు సిద్ధం చేశారని అదనపు ఏజీని ప్రశ్నించింది. డిజైన్ల రూపకల్పన పనిని రెండు సంస్థలకు అప్పగించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను కోర్టు పరిశీలనకు ఇస్తామని చెప్పారు. దీంతో విచారణను హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.   తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు మరి కొన్ని వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనాలను మరో యాభై డెబ్బై సంవత్సరాల పాటు వినియోగించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. సచివాలయ భవనాలను కూల్చివేసి నాలుగు వందల కోట్లతో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని అవి పూర్తి అయ్యేసరికి ఖర్చు వెయ్యి కోట్లకు చేరుకునే అవకాశముందని ఆయన వివరించారు.  మరోవైపు ఇంజనీరింగ్ చీఫ్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కొత్త భవనాల నిర్మాణానికి సిఫార్సు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం భవనాలను కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందా, నివేదిక ఆధారంగా కూల్చి వేయాలని మంత్రి మండలి నిర్ణయించిందా అని హై కోర్టు ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అంతకు ముందు ఫైర్ సేప్టీ అధికారులు భవనాలను తనిఖీలు చేసి స్వల్ప మార్పులు సూచించారని ఆ మేరకు మరమ్మత్తులు చేసి అవసరమైన అగ్ని మాపక యంత్రాలు ఏర్పాటు చేసింది.చిన్న చిన్న మార్పులతో సరిపోయే దానికి ఏకంగా భవనం కూల్చివేయడం తగదు అని ప్రభుత్వ అధాయాన్ని వృధా చేయవద్దని హైకోర్ట్ వెల్లడించింది.

జగన్ సర్కార్ కు మళ్ళీ కరెంట్ షాక్...

  జగన్ సర్కార్ మొదలైన ఇన్ని రోజుల్లో ఏపీకి ప్రభుత్వానికి మళ్ళీ కరెంట్ షాక్ తగిలింది. సౌర పవన కంపెనీలకు కూడా ఎల్వోసీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రెండురోజుల్లో జారీ చేయకపోతే జాతీయ ఎక్సేంజ్ ల్లో కరెంటు కొనుగోలును నిషేధిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే నిధులు లేక అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కేంద్రం తాజా ఆదేశం కొత్త తలనొప్పి గా మారింది.  ఏపీ విద్యుత్ సంస్థలపై మరో పిడుగు పడింది. సౌర, పవన విద్యుత్ కంపెనీల కూడా ముందస్తు చెల్లింపు లకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ వోసీలు ఇవ్వాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. రెండ్రోజుల్లో వీటిని జారీ చేసి తమకు సమాచారం అందజేయాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. లేని పక్షంలో జాతీయ విద్యుత్ ఎక్సేంజ్ నుంచి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని అందులో హెచ్చరించింది. ఇటీవలే ఒకసారి ఎక్సేంజ్ లో కొనుగోలుపై నిషేధం విధించింది దీంతో వారం పాటు రాష్ట్రాన్ని కరెంటు కోతలు అల్లాడించాయి. దీంతో కేంద్రం తాజా ఆదేశాలు విద్యుత్ శాఖ వర్గాలను మళ్లీ గడగడలాడిస్తున్నాయి.  విద్యుత్ సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒక వారం లేదా నెలకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలి. నలభై ఐదు రోజుల్లో వీటిని ఆ కంపెనీలు నగదుగా మార్చు కుంటాయి. ఈ ఆదేశాలు తప్పని సరి కావడంతో ముందుగా కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి సంబంధించిన విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోసీల ఇవ్వడం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా ఐదు వందల యాభై కోట్ల వ్యయమవుతుంది. అయితే ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఎల్వోసీల ఇవ్వకపోవడంతో వాటిలో ఒక ప్రైవేటు ధర్మల్ విద్యుత్ కంపెనీ రాష్ట్రంపై కేంద్రాని కి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో విద్యుత్తు ఎక్సేంజ్ లో రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. దానితో ఆ కంపెనీ కూడా ఎల్వోసీ జారీ మొదలు పెట్టారు. సౌర, పవన కంపెనీ లకు మాత్రం ఇంత వరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వలేదు. దీని పైనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పవర్ సిస్టం కార్పొరేషన్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రానికి పంపింది.  సౌర, పవన విద్యుత్ కంపెనీలకు ముందస్తు ఎల్వోసీల ఇవ్వాలంటే సరాసరిన నెలకు ఐదు వందల యాభై కోట్లు కావాలని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎన్టీపీసీ సంస్థలకు జారీచేయటానికే ప్రస్తుతం నెలకు ఐదు వందల యాభై కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్ సంస్థల వద్ద దీనికి నిధుల లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇంత పెద్దమొత్తం ఇవ్వాల్సి రావడం అధికార వర్గాలను బెంబేలెత్తిస్తోంది.  తాజా పరిస్థితిని విద్యుత్ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆర్ధికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ఏం చేయాలో నిర్ణయించాలని ఆయన సూచించినట్టు సమాచారం. సౌర, పవన విద్యుత్ పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన వివాదమే దేశవ్యాప్తంగా ఈ ఆదేశాల జారీకి కారణమైందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాలూ ఇటువంటి ప్రయత్నాల మొదలుపెట్టవచ్చు అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయటానికి కేంద్రం ఇటువంటి కఠిన వైఖరి అవలంబిస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఈ వివాదం తలెత్తకపోతే కేంద్రం కఠినంగా ఉండేది కాదనిపిస్తోంది అని నిపుణుల అభిప్రాయం. ఇక జగన్ సర్కార్ ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఒకవైపు బీజేపీ... మరోవైపు ఆత్మహత్యలు... తీవ్ర ఒత్తిడిలో కేసీఆర్...

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతుండటం... మరోవైపు కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగడం... ఇంకోవైపు విపక్షాల విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక, తెలంగాణలో పాగా వేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుండటంతో... టీఆర్‌ఎస్‌ సర్కారు అప్రమత్తమైంది. బీజేపీకి, కేంద్రానికి ఏ చిన్న అవకాశం ‎ఇవ్వకూడదని భావిస్తోన్న కేసీఆర్‌... ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం తప్పదని గుర్తించిన సీఎం కేసీఆర్... ఎట్టకేలకు ఒక మెట్టుదిగి... మరో అడుగు ముందుకేశారు. ఆర్టీసీ కార్మికులతో అసలు చర్చలే లేవని, వాళ్లసలు ఉద్యోగులే కాదంటూ ప్రకటించిన కేసీఆరే... చివరికి పరిస్థితి చేయి దాటుతుండటంతో రాజ్యసభ ఎంపీ కేకేను రంగంలోకి దింపారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం కేకేను హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రప్పించారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కేకే.... చర్చలకు సిద్ధంకావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైరైన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... ఎవరు పిలిచినా చర్చలు వస్తామని తెలిపారు. కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే చర్చలు వస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ బెదిరింపులు, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే... ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల దమనకాండపై గవర్నర్‌కు చేశామని తెలిపారు. అయితే, ఒకవైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక... మరోవైపు ఛాన్స్ కోసం కాచుకుని కూర్చున్న బీజేపీ... ఇంకోవైపు కార్మికుల ఆత్మహత్యలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న కేసీఆర్... ఏదిఏమైనాసరే రెండు రోజుల్లో సమ్మెను విరమింపజేయాలన్న లక్ష్యంతో సానుకూల ధోరణితో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేకే మధ్యవర్తిత్వం విజయవంతమవుతుందో లేదో చూడాలి.

కేసీఆర్ తీరుపై ఆ ఇద్దరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే నోరు విప్పడం లేదా?

  ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతోపాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దాంతో కేసీఆర్ సర్కారుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వ్యవహరిస్తోంది. అయితే, కార్మికుల ఆవేదనతోపాటు విపక్షాల ఆరోపణలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వం కూడా కౌంటర్ మొదలుపెట్టింది. మంత్రులు సైతం ఆర్టీసీ నేతలు, విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఎదురుదాడి చేస్తున్నారు. కార్మికుల జోలికి పోకుండా... సంఘాల నేతలు, విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, మంత్రులందరూ నోరు విప్పుతున్నా... ఇద్దరు ముగ్గురు మాత్రం మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ కార్మిక నేతలు, విపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో... కౌంటర్ ఇవ్వాలంటూ ఇద్దరు ముగ్గురు మంత్రులు మిగిలిన మంత్రులందరికీ ప్రగతిభవన్ నుంచి ఫోన్లు వెళ్లాయట. ఏం మాట్లాడాలో డైరెక్షన్ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారట. అయితే, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటం... పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కావడంతో... ఆయన్ను నోరు విప్పొద్దని పార్టీ పెద్దలు వారించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి... కాంగ్రెస్‌ నుంచి రావడంతో సమ్మెపై మాట్లాడితే విమర్శలు వస్తాయని వద్దన్నట్లు తెలిసింది. దాదాపు ఇలాంటి కారణంతోనే మంత్రి మల్లారెడ్డిని కూడా వద్దని చెప్పారట. వీళ్లు కాకుండా, మిగతా మంత్రుల్లో పలువురు మీడియా ముందుకొచ్చి రెండ్రోజులుగా ఆర్టీసీ సమ్మెపై, విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, మంత్రులందరూ స్పందిస్తున్నా, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు, ఈటల రాజేందర్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. హరీష్‌... యూనియన్ ఆవిర్భావం నుంచి గౌరవ అధ్యక్షులుగా ఉండటంతో... ఆయన స్పందించాలని ఆర్టీసీ కార్మికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే, హరీష్‌, ఈటల... ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ఈ ఇద్దరు మంత్రులూ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

రైతు భరోసా పథకం పేరు మార్పు... బీజేపీ హెచ్చరికలతో జగన్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా పథకం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించగా... మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా చెక్కులను సీఎం జగన్ స్వయంగా అన్నదాతలకు అందజేశారు. అయితే, రైతు భరోసా పథకం ప్రారంభానికి ముందే, రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి... ప్రతి ఏటా రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని 12వేల 500 నుంచి 13వేల 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రైతు సంఘాల కోరిక మేరకు, రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని... ఏడాదిలో మూడు విడతులుగా అందజేయనున్నారు. మేలో 7వేల 500... రబీలో 4వేలు... సంక్రాంతికి 2వేలు... అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును మార్చారు. రైతు భరోసా కింద ఇస్తోన్న పెట్టుబడి సాయంలో 6వేల రూపాయలను కేంద్రమే ఇస్తుండటంతో... ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా నామకరణం చేశారు. బీజేపీ నుంచి విమర్శలు రాకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేకే లేఖపై అనుమానాలు... కార్మికులు ఒప్పుకుంటారా? లేక ప్రభుత్వం దిగొస్తుందా?

  కె.కేశవరావు... ఉరఫ్‌ కేకే... టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కి వ్యూహకర్తగా పేరు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చెప్పుకుంటారు. పాలకులకు, నాయకులకు సమన్వయకర్తగా అనుకుంటారు. అంతేకాదు పార్టీ సమావేశాలైనా... ప్రభుత్వ మీటింగులైనా... కేసీఆర్‌ పక్కన కేకే ఉండాల్సిందే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేకేకు అంతటి విలువ ఇస్తారు కేసీఆర్. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ ఎంపీగా కేకే మాటను సీఎం కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తారు. కేకేను అంతే అభిమానిస్తారు కూడా. అంతేకాదు కేకే మాటను అంత తేలిగ్గా తీసేసే పరిస్థితే లేదు. అలాంటి కేకే... అటు కార్మికులను, ఇటు పాలకులను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే, కార్మికుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా బాధించాయన్న కేకే... పరిస్థితి మరింత చేయి దాటకముందే సమ్మె విరమించాలని, అలాగే చర్చలకు సిద్ధంగా కావాలని కోరారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన తమ అజెండాలో ఎక్కడా లేదన్న కేకే... ప్రభుత్వరంగ సంస్థల విలీనమంటే విధివిధానాలు మార్చుకోవాలని కోరడమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రే తేల్చిచెప్పిన తర్వాత సమ్మె కొనసాగింపు ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. అదే సమయంలో ఆర్టీసీ విలీనం మినహా మిగత డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు కేకే. ఆర్టీసీ కార్మికుల సమస్యలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ...గతంలో గొప్పగా పరిష్కరించిందన్నారు. ఎక్కడా లేనివిధంగా 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌... కార్మికులకు ఇచ్చిన వరాలంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, కేకే మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తున్నామంటూనే... కేకే లేఖ, మంత్రుల కామెంట్లపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. పెద్ద మనిషి తరహాలో కేకే చర్చలకు ఆహ్వానించడం మంచి పరిణామమే అయినా... విలీనంపై పక్కా హామీ ఇస్తేనే ముందుకొస్తామని కుండబద్దలు కొట్టారు. మరి, కేకే మధ్యవర్తిత్వంతో సమ్మె విరమించేందుకు కార్మికులు ఒప్పుకుంటారో లేక ప్రభుత్వమే మరో మెట్టుదిగి విలీనానికి ఒప్పుకుంటుందో చూడాలి.  

అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం... అంతలోనే భారత్ పై సంచలన వ్యాఖ్యలు

  అత్యున్నత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యారు. ప్రవాస భారతీయ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీకి ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. అభిజిత్‌తోపాటు అతని భార్య ఎస్తర్ డఫ్లో కూడా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం కృషిచేసినందుకు అభిజిత్‌ బెనర్జీకి, అతని భార్య ఎస్తర్ డఫ్లోకి నోబెల్ పురస్కారం దక్కింది. అయితే, ఆర్ధికశాస్త్రంలో మొత్తం ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించడంతో... మరో ఆర్ధికవేత్త మైఖేల్ క్రెఫర్‌తో కలిసి నోబెల్ పురస్కారాన్ని పంచుకోనున్నారు. ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న అభిజిత్‌ బెనర్జీ... పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జన్మించారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో ఎకనమిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, పేదరిక నిర్మూలన కోసం కృషిచేస్తున్నారు. అయితే, నోబెల్ పురస్కారం దక్కించుకున్న అభిజిత్ బెనర్జీ భారత ఆర్ధిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ అస్ధిరంగా ఉందని, ప్రస్తుత వృద్ధిరేటును చూసిన తర్వాత, దాని పునరుజ్జీవనం గురించి కచ్చితంగా చెప్పలేమంటూ కీలక కామెంట్స్ చేశారు.

ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే: అశ్వద్ధామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది, జీతాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దీంతో జిల్లాలో పదో రోజు నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని టీ.ఆర్.ఎస్ నేత కేశవరావు కోరారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించారని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని కేశవరావు అన్నారు. కార్మికుల సమ్మె ఉధృతమైన సమయంలో కేకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావటం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమవడం, తాత్కాలిక సిబ్బంది కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో సమ్మె పరిష్కారంపై కేకే ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పంతొమ్మిదిన బంద్ కు పిలుపునిచ్చాయి. అందుకే కేకే రంగంలోకి దిగి ప్రకటన చేశారా, ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.  మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందనే వార్తలు గుప్పుమనడం కూడా కలకలం రేపాయి. ఇప్పటికే ఓ టీఆర్ ఎస్ ఎంపీ ఆర్టీసీ కి చెందిన నాలుగెకరాల భూమిని టెండర్ దక్కించుకున్నారంటూ వార్తలు ప్రకంపనలు రేపాయి. మొత్తంగా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తోనే కేకే ప్రకటన చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. పంతొమ్మిదిన బంద్ జరిగే లోపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. కేసీఆర్ ఆహ్వానిస్తే చర్చలకు రావటానికి సిద్ధమన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు గవర్నర్ తమిళ సాయిని కలిశారు. ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మద్దతు ప్రకటించాయి, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశాయి. మంత్రులు పువ్వాడ, గంగుల ఎర్రబెల్లి కి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. హన్మకొండ డిపో నుంచి ఏకశిల పార్కు వరకు నిరసన ర్యాలీ చేశారు.  

ఆర్టీసీ సమ్మె పరిష్కారం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారనుందా?

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి సమ్మె తీవ్రరూపం దాల్చటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. అది సకల జనుల సమ్మె వైపు నిజంగానే వెళితే మొత్తం సమాజాన్ని కుదిపివేసే విషయం అవుతుంది. కేసీఆర్ బహుశా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టీసీని యాభై శాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు కార్మికులను ఉద్దేశించి యాభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యంలో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది. అంతకన్నా సెప్టెంబర్ నెలలో పని చేసిన కాలానికి ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయమని చెప్పక తప్పదు. అంతేకాదు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు తార్నాక ఆసుపత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషమని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కేసిఆర్ కేవలం పండుగ అడ్వాన్స్ కోసం గతంలో ఆర్టీసీ కార్మికుల తరపున ధర్నాలు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులతో తగాదా పెట్టుకోవడం అసలు సంఘాలే ఉండరాదు అనే పరిస్థితికి వెళ్ళడం చారిత్రక విషాదమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ కు పార్టీ ముఖ్య నేతలకు సన్నిహితుడే, అప్పట్లో హరీశ్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ కు అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది వాస్తవం కాదా ఇక్కడ సమస్య ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమా కాదా అన్నది కాదు. ఇక్కడ  ఆర్టీసీ కార్మికులు తప్పు చేశారా లేదా పండుగ ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టీసీకి, ప్రయాణికులకు కష్టనష్టాలూ తెచ్చిపెట్టార లేదా అన్నది కాదు కేవలం కేసీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మట వాస్తవమే అయిన దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. కానీ వారిని సరైన తీరులో వ్యవహరించడంలో విఫలం అవ్వడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది. పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షా డెబ్బై వేల మందిని ఒక్క కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కేసీఆర్ కూడా యాభైవేలమంది ఉద్యోగులు తీసేశాననే ఒకసారి సెల్ఫ్ డిఫెన్స్ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎంజిఆర్ వారసురాలిగా సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రయ్యారు. కానీ కేసీఆర్ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధనలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని ఆయననే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాధ్యత వహించారు. సకల జనుల సమ్మె వాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచేవారు. మరి ఇప్పుడు ఈ సమ్మే పై ఆయన వైఖరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అక్రమ కట్టడాలు అంటూ బాబుపై కక్ష సాధింపు చర్యలతో జగన్....

జగన్ తన పాలన మొదలుపెట్టినప్పటి నుంచే చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే.దీని నేపధ్యంలోనే  అక్రమ కట్టడాల కూల్చివేత పై  తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డ జగన్ చంద్రబాబు కట్టడాలు అన్నింటిని కూల్చి వేశారు. ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జాతీయ రహదారి వెంబడి భారీ ఎత్తున నిర్మిస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడ పార్టీ ఆఫీసు కోసం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వ భూములను కేటాయించారు. నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీఎం హోదాలో రెండు సార్లు ఆయన ఇక్కడ నిర్మాణాలని కూడా పరిశీలించారు. అయితే వీటిపై లోతైన విచారణ చేపట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంబడి టిడిపి కార్యాలయం భవనం నిర్మిస్తారని వైకాపా ఆరోపిస్తోంది. అనుమతులు లేని ఈ భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో పాటు మూడు వందల తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి నిర్మాణాలకు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజుల లోపు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో తామే తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

మరోసారి 'ఆపరేషన్ వశిష్టాను' కొనసాగించటానికి రంగంలోకి దిగనున్న ధర్మాడి సత్యం బృందం...

  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆపరేషన్ వశిష్టా ఇక ఆగిపోయినట్లేనా అనే అనుమాలు అందరిలో నెలకొన్నాయి. అయితే  మొదటి ప్రయత్నంలో విఫలమైన ధర్మాణి సత్యం బృందం రెండో ప్రయత్నం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బోటును వెలికితీయటం ఎంతవరకు సాధ్యం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.  బోటు మునిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలియనేలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఆరు మంది తప్ప గల్లంతైనవారు ఎంతమంది అన్న లెక్క ఇప్పటికీ తేలని లేదని చెప్పాలి. అధికారులు మాత్రం ఇంకో పధ్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు.సెప్టెంబర్ 15 వ తేదీ న కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా గోదావరిలో మునిగి పోయింది రాయల్ వశిష్ట బోటు. ఇప్పుడది మూడు వందల అడుగులకుపైగా లోతులో ఉంది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది.  బోటును బయటకు తీయడం కోసం సాంకేతిక పద్ధతులు అన్నీ అనుసరించారు.బోటు పడనున్న లోతులను కనిపెట్టడం తప్ప దాన్ని బయటకు లాగే మార్గాలేవి దొరక లేదు. దీంతో సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే బోటును బయటకు లాగగలనని ఆలోచన కు వచ్చారు. ఈ విధానంలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు .కాంట్రాక్ట్ తీసుకున్న మరుసటి రోజునే ధర్మాడి సత్యం టీమ్ కచ్చులూరుకు వెళ్ళింది. ఐరన్ రోపులతో, ప్రొక్లెయినర్ లు తీసుకొని లంగర్ లు వేసి బోటు మునిగి ఉన్న ప్లేస్ ను గుర్తించింది. కానీ బయటకు లాగేందుకు చేసిన వారి తొలి ప్రయత్నం విఫలమైంది. ఐరన్ రోప్ తెగి పోవడంతో సత్యం ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఇప్పటికీ సత్యం బృందం బోటును వెలికితీస్తామని నమ్మకం తోనే ఉంది.అయితే ఇటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆపరేషన్ వశిష్టకు పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి ల వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ధర్మాణి సత్యం టీమ్ కచ్చులూరుకు చేరుకోబోతోంది. బోటు తమ లంగర్లలకు చిక్కి బయటకు లాగేందుకు పట్టు దొరికితే రెండురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తోంది ధర్మడి సత్యం టీమ్. సాయంత్రం కచ్చులూరు చేరుకోబోతున్న ధర్మడి సత్యం టీమ్ మళ్లీ  ఆపరేషన్ మొదటి నుంచి మొదలు పెట్టబోతోంది మొదటి ప్రయత్నం కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని మళ్లీ ఇప్పుడు కచ్చులూరుకు తరలించాల్సి ఉంది. గోదావరి సహకరించి వర్షం తగ్గితే ధర్మం సత్యం రెండో ప్రయత్నం మొదలుకానుంది.ఈ సారి ఐనా ఏ అవంతరాలు లేకుండా జరగుతుందో లేదో వేచిచూడాలి.  

రైతు భరోసా ఇకపై రూ.13,500... రేపటి నుంచి అమలు

  రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతు భరోసా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారని తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమవుతుంది అని నవంబరు పదిహేను వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్ లో అదే విధంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఎండీఓ ఆఫీసు లో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సీఎం గారు ఆదేశించారని అన్నారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్ లో గత రెండు రోజులు నుంచి జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలున్నాయన్నారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందటానికి నిబంధల ప్రకారం అనర్హులుగా తేలుతోందని వివరించారు. అర్హత ఉండి ఆరు లక్షల మంది ఈ పథకాల్లో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలిందన్నారు. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడటం మీ బాధ్యత అని సీఎం గారు ఆదేశించారని తెలిపారు. గతంలో ఇచ్చిన దానికన్న మిన్నగా ఈ పథకం అమలు చేయమని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కౌలు రైతులు ఈ పథకాల్లో లబ్ధి పొందబోతున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రైతు భరోసా అక్టోబర్ లో ప్రారంభమౌతుంది కనుక కౌలురైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవటం, సీ.సీ.ఆర్.సి కార్డ్సు పొందలేకపోవడం వంటి ఇబ్బందులుంటే వాటిని నవంబర్ పదిహేను వరకు మరల దరఖాస్తు చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న లాయర్లు

  ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని విషయాలు తేల్చడంలో మాత్రం జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.రాయలసీమలో హైకోర్టు ఉద్యమం మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏకంగా జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.విధులకు వెళ్లకుండా కోర్టు గేటుకు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాయర్ లను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెల రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదంటూ భగ్గుమన్నారు న్యాయవాదులు.  కర్నూలులో హైకోర్టును  ఏర్పాటు చేయాలంటూ గత ముప్పై మూడు రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కోర్టులు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజూ కూడా లాయర్ లందరూ కూడా విధులకు హాజరు కానీ సంధర్బాలు లేవు. ఈ రోజునుంచి ఏకంగా స్టాఫ్ కానీ జిల్లా జడ్జిలు కానీ ఎవ్వరూ కూడా కోర్టుకు హాజరు కాకుండా ఏకంగా కోర్టులకు తాళాలు వేశారు. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న సంధర్బంలో కచ్చితంగా హై కోర్టుని ఏర్పాటు చేయలనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలసిందేనని డిమాండ్ ఉధృతం అవుతుంది.దీనిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తులు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచి చూడాలి. 

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం.. పాల్గొనబోతున్న మోడీ, మన్మోహన్!!

  కర్తార్ పూర్ కారిడార్ సిద్ధమైంది. సిక్కుల మత గురువు ఐదు వందల యాభైవ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించబోతున్నారు. నవంబరు ఎనిమిదిన భారత భూభాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తే మరుసటి రోజు పాకిస్థాన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.ప్రధాని నరేంద్ర మోడీ కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ ఎనిమిదిన ప్రారంభించబోతున్నారు. డేరా బాబా నానక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించి 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది.గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మోడీని కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు .రాష్ట్రపతి రామనాథ్ గోవింద్, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్ పూర్ కారిడార్ గుడ్డ పాకిస్తాన్ లోని గురునానక్ గురుద్వారాకు చేరుకుంటారు,కాగా పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ తొమ్మిదిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించబోతున్నారు. సిక్కు గురువు డేరా బాబా గురునానక్ దేవ్ 1469 నవంబర్ ఇరవై తొమ్మిదిన పంజాబ్ లో జన్మించి 1539 సెప్టెంబరు ఇరవై రెండున మరణించారు.ఆయన పుట్టిన, మరణించిన స్థలాలూ రెండు ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉన్నాయి. ఆయన చివరి రోజుల్ని కర్తార్ పూర్ లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు పధ్ధెనిమిది ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని అత్యంత పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు. అటువంటి ఆ రెండు ప్రదేశాలైన డేరా బాబా నాన్నక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన రహదారి గురునానక్ దేవ్ జయంతి రోజు ప్రారంభం కానుంది.తర్వాతి రోజే పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించబోతున్నారు మన్మోహన్,ఈ కారిడార్ గుడ్డ భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్ళి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైనా గురుద్వారా సాహిబ్ ను దర్శించుకోనున్నారు.ఇందు కోసం ఎలాంటి వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది.మరోవైపు భారతదేశం నుంచి కర్తార్ పూర్ వెళ్లే తొలి భక్తబృందాల్లో పాల్గొనాలనీ కెప్టెన్ అమరిందర్ సింగ్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పంపించారు.దీంతో పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ల నున్న తొలి సిక్కుల వృద్ధుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండబోతున్నారని సమాచారం. 

రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న ఆర్టీసీ సమ్మె.. మినిస్టర్ క్వార్టర్స్ కు ముప్పు!

  ఆర్టీసీ సమ్మే మొదలై ఇప్పటికి పది రోజులు కావొస్తున్నా రోజురోజుకు ఉత్కంఠంగా కొనసాగుతున్న అంశంగా మారింది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించేందుకు వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పించారు విద్యార్ధులు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన వ్యక్తం చేయగా తరవాత మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ర్యాలీగా బయలుదేరారు. ఉస్మానియా గేట్ దాటక ముందే వారిని పోలీసులు అడ్డుకొని  అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని వ్యాన్ లలో ఎక్కించారు పోలీసు అధికారులు.  తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం అనేది వీలైనంత త్వరగా జరిగితేనే అందరికి మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యనిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి లాంటి వ్యక్తులు సురేందర్ గౌడ్ లాంటి వ్యక్తులు చనిపోవడంతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ  వాళ్ల ఆత్మశాంతి చేకూర్చే విధంగా  నివాళులర్పించారు. ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విద్యార్థిలు ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉంటున్న నేపధ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించారు, కావున  విద్యాసంస్థలను తక్షణమే కేసీఆర్ గారు సెలవులనూ విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పదోవ  రోజుకు చేరింది. దాదాపు ఆరుగురు ఏడుగురు పేద కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు పిట్టల్లా రాలిపోతున్నారు. పొడిగించిన వారంరోజులు విద్యాసంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలని, కాలేజీలు స్కూళ్లను వెంటనే తెరిపించి పిల్లల చదువును కూడా ముందుకు తీసుకుపోవాలని ఆర్టీసీ సమ్మేలోని నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పరిష్కారం చూడాలని లేదంటే పరిస్థితులు ఇంకా ఉధృక్తం అవుతాయని వెల్లడించారు. 

అయోధ్యలో 144 సెక్షన్ అమలు...

  అయోధ్యలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి, అయోధ్య పట్టణంతో పాటు మొత్తం జిల్లాలో 144 సెక్షన్ విధించారు. త్వరలో రామ మందిరం బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సెక్షన్ 144 విధిస్తున్నట్టు సమాచారం. ఆ ఆదేశాలు డిసెంబర్ పది వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. అయోధ్య కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆగస్టు ఆరు నుంచి జరుగుతున్న విచారణ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూడా అయోధ్యపై సుప్రీం లో వాడీవేడిగా వాదనలు జరిపాయి. వివాదాస్పద స్థలంలో ఆలయం లేదని ముస్లిం సంఘాల తరపున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ మరోసారి వెల్లడించారు. కూలగొట్టిన స్థలం లోనే మసీదును నిర్మించాలని కోరారు, హిందూ సంస్థలు బలవంతంగా ఆ స్థలాన్ని ఆక్రమించాయని ఆరోపించాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి ఇరవై ఏడు ఏళ్లు గడుస్తోంది, రామజన్మభూమి రామ మందిరం బాబ్రీ మసీదు చుట్టే వివాదం తిరుగుతోంది. బాబ్రీ మసీద్ రామమందిర భూ వివాదంపై ఇరువర్గాలూ ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి. గతేడాది సుప్రీం కూడా కేసును పక్కన పెట్టి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది. రెండు వర్గాలతో కోర్టు వెలుపల చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు లోనే దీనిని తేల్చాలని నిర్ణయించింది. ప్రతి రోజూ ఈ కేసులో వాదనలు విని ఈ నెల పదిహేడులో పునః విచారణ ముగిస్తామని తెలిపింది. విచారణ పూర్తయిన నాలుగు వారాల్లో తీర్పును వెల్లడిస్తామని కూడా చెప్పడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు అయోధ్య కమిషనర్ ను విశ్వ హిందూ పరిషత్ నేతలు కలిశారు. దీపావళి నాడు అయోధ్యలో రామ మందిరం దగ్గర దివ్వెలను వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.  

భక్తులపై దౌర్జన్యం చేసిన పోలీసులు...

  శ్రీకాకుళం జిల్లాకు దైవ దర్శనం కోసం వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంత మంది భక్తులు ఆరోపిస్తున్నారు. హోటల్లో బస చేసిన తమపై దౌర్జన్యం చేశారంటున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు, తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి అరసవెల్లి సూర్య నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను దర్శించుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని నాగావళి హోటల్ లో దిగారు. రాత్రి పది గంటల తర్వాత భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న తమ కారు దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జనరల్ చెకింగ్ లో భాగంగా సీఐ శంకర్ తో పాటు ఆరుగురు పోలీసులు హోటల్ దగ్గరకొచ్చారు. రిసెప్షన్ లో హోటల్ లో బస చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే సీఐ శంకర్ బయటకొచ్చిన తమపై దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ తప్పు చేయక పోయినా సిఐ తమపై అనవసరంగా దౌర్జన్యం చేశారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తమ దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, ఐడీ కార్డులు కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని పోలీసులు తీసుకెళ్తున్నారని అడ్డుకుంటే మహిళలు అని కూడా చూడకుండా పరుగులు పెట్టించారని భాస్కర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఉంటే ప్రశ్నించామే తప్ప వారిపై దౌర్జన్యం చేయలేదని పోలీసులంటున్నారు.